చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఈవీఎంల ర్యాండమైజేషన్ను పక్కాగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అబ్జర్వర్లు,అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిఘా నీడలో 2,318 బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించా రు. కార్యక్రమంలో డీఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు.
ఇంట్లో చోరీ
వి.కోట: పట్టణంలోని సిద్ధార్థనగర్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన విషయం శనివారం వెలుగుచూసింది. కాలనీలో నివసిస్తున్న నవనీతమ్మ తమ కుటుంబీకులతో కలిసి ఈ నెల 2వ తేదీన బెంగళూరు వెళ్లింది. తిరిగి శనివారం ఇంటికి వచ్చింది. తలుపులు, బీరువా పగులగొట్టి ఉండడంతో దిగ్భ్రాంతి చెందింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి, కొంత నగదు అపహరించినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగప్ప తెలిపారు.
గడ్డివాము దగ్ధం
వెదురుకుప్పం : మండలంలోని ఆళ్లమడుగు ఎస్సీ కాలనీలో శనివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో గోవిందస్వామి అనే రైతుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డి పూర్తిగా కాలిపోవడంతో రూ.25 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.