ఐదేళ్లలో రైతుల కోసం అమలు చేసిన పథకాలు, లబ్ధి ఇలా..
పథకం రైతులు చేకూరిన లబ్ధి (రూ.)
వైఎస్సార్ రైతు భరోసా 1,45,890 482,58,00,000
(ఏడాదికి సగటున)
వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ 1,07,272 15,63,00,000
పెట్టుబడి రాయితీ 1,08,176 93,37,19,127
ఉచిత పంటల బీమా 2,89,745 1,105,40,49,036
(ఏడాదికి సగటున)
వైఎస్సార్ పంటల బీమా 72,267 1,30,95,00,708
వైఎస్సార్ పశు నష్ట బీమా 482 1,27,51,751
ఫ పండగలా మారిన సాగు
ఫ అండగా నిలిచిన జగనన్న సర్కారు
ఫ ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి పెద్దపీట
ఫ జిల్లాలో 499 రైతు భరోసా కేంద్రాలతో చేరువైన సేవలు
ఫ పాడి రైతులకూ అనేక పథకాలు
సాక్షి, అమలాపురం/కొత్తపేట: దేశానికే అన్నం పెట్టే రైతన్నకు రాజసం వచ్చింది.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో సాగు పండగలా మారింది.. గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగలా మార్చింది.. గత ఎన్నికల ముందు పుడమి పుత్రుల కష్టాలు చూసిన సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి ఊపిరినిచ్చింది. విత్తు నుంచి పంట విక్రయం వరకూ బాధ్యత తీసుకుంది. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, ఆక్వా సర్వీసులకు రూ.1.50కు యూనిట్ విద్యుత్, పశుక్రాంతి, ఉచిత పశువుల బీమా, ఉద్యాన పంటలకు కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌస్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతులకు సాగు పెట్టుబడి తగ్గించింది. రైతు భరోసా కేంద్రాలతో క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక దన్ను, సాగు మెలకువలు అందించింది. ఈ ఆర్కేబీల్లో ఆయా ప్రాంతాల్లో ఏ పంట సాగు ఎక్కువగా జరుగుతుందో గుర్తించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ), విలేజ్ ఫిషరీష్ అసిస్టెంట్ (వీఎఫ్వో), విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ (వీవీఏ)లను నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో రైతులకు అండదండగా నిలిచి సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోతే.. తడిచి, దెబ్బతిన్న పంటను కొనుగోలు చేయడం, నష్టపోయిన తరువాత పంట కాలంలోనే ఇన్ఫుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), పంటల బీమా పరిహారం అందించడం వంటి వాటితో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
పగలూ వ్యవసాయ విద్యుత్
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. జిల్లాలో 20,452 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 11,900లకు పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే జిల్లాలో 4,200లకు పైగా ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రూ.1.50 చొప్పున రాయితీపై విద్యుత్ అందుతోంది. ఏడాదికి రూ.70 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.
పాడి రైతులకు
పాల వెల్లువ
ప్రభుత్వం అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో పాడి రైతుల నుంచి నేరుగా పాల సేకరణ చేస్తున్నారు. తొలి దశలో 19 మండలాల్లో మొత్తం 195 ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఏఎంసీయూ)లు, ఐదు బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)ల ద్వారా పాల సేకరణకు అధికారులు సన్నాహాలు చేశారు. రోజుకు 25 వేల లీటర్ల పాల సేకరణకు సిద్ధమవుతున్నారు. మిగిలిన ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే అమూల్ కొనుగోలు చేసే పాల ధర అధికంగా ఉంది. ఇది పాడి రైతులకు లాభసాటిగా మారింది.
వ్యవసాయం.. సేవలు సమస్తం
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఆర్బీకే ఏర్పాటైంది. దీని పరిధిలో 2019–20లో 429 మంది రైతులకు రూ.81.90 లక్షలు, 2020–21లో 449 మందికి రూ.87.55 లక్షలు, 2021–22లో 511 మందికి రూ.99.64 లక్షలు, 2022–23లో 438 మందికి రూ.85.41 లక్షలు, 2023–24లో రైతులకు రూ.52.32 లక్షల చొప్పున రైతు భరోసా వచ్చింది. మొత్తం ఈ ఆర్బీకే పరిధిలో రూ.4.68 కోట్లు రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిగా అందించారు. పంట నష్టపోయిన ఐదుగురు రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.34,530 వరకూ వచ్చింది. ఇప్పటి వరకూ 80.75 మెట్రిక్ టన్నుల ఎరువులను ఈ కేంద్రం ద్వారా రైతులు కొనుగోలు చేశారు. ఇలా జిల్లాలో ఏర్పాటైన 499 ఆర్బీకేల ద్వారా రైతన్నలకు సేవలు అందుతున్నాయి.
బీమా సొమ్ము వస్తుంది..
నేను 2.50 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాను. 2022లో గోదావరి వరదలకు నష్ట పరిహారంగా ప్రభుత్వం రూ. 25 వేలు అందించింది. ఇది కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం బీమా పథకం అమలు చేసింది. దీంతో మరో రూ.25 వేలు అందింది. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన అరటి పంటకు జిల్లా యూనిట్గా పంటల బీమా అమలు చేయడంతో పరిహారం వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం మండల యూనిట్గా వైఎస్సార్ ఉచిత బీమా చేయడంతో రైతులందరికీ పంట బీమా వర్తిస్తోంది.
–బండారు శ్రీనివాసరావు (దొరబాబు),
రైతు, వానపల్లి, కొత్తపేట మండలం
క్రమం తప్పకుండా రైతు భరోసా
నా సొంత భూమి మూడెకరాలతో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని అరటి, కంద, పసుపు పంట పండిస్తున్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రమం తప్పకుండా రైతు భరోసా, ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం అందుతుంది. ఏటా ఆర్బీ కింద రూ.13,500, మూడేళ్లు ఇన్పుట్ రాయితీ ద్వారా రూ.53 వేలు, సున్నా వడ్డీ రాయితీ కింద రూ.27 వేలు అందింది. గతంలో రుణమాఫీ పేరుతో సున్నా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇప్పుడు క్రమం తప్పకుండా వస్తోంది.
–ఇందుకూరు కృష్ణంరాజు, ఉద్యాన రైతు, ఉచ్చిలి, ఆత్రేయపురం మండలం
అరటికి బీమా.. పంటకు ధీమా
వివిధ సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన అరటి పంటకు జిల్లా యూనిట్గా పంటల బీమా అమలుతో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల పంట నష్టం జరిగినా క్రాఫ్ ఇన్సూరెన్స్ వర్తించేది కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లా యూనిట్ను మండల యూనిట్గా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతో నష్టపోయిన రైతులందరికీ బీమా వర్తిస్తుంది. గతంలో అరటి పంటను బీమా పథకంలో జిల్లా యూనిట్గా పరిగణించేవారు. అరటి పంటల బీమా రుసుం ఎకరానికి రూ.2 వేలు ఉండేది. ఆ మొత్తాన్ని చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చెల్లించలేకపోయేవారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సంభవిస్తాయి. కానీ గతంలో బీమా పథకం డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టేవారు. ఈ పథకం ఆరు నెలలు అంటే డిసెంబర్ నుంచి జూన్ వరకూ వర్తిస్తుంది. ఆ సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పెద్దగా నష్టం ఉండేది కాదు. ఇలా ఆ కాలానికి క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులు ఆ మొత్తాన్ని నష్టపోయేవారు. అత్యధిక విస్తీర్ణంలో పండిస్తున్న అరటికి బీమా వర్తింపజేయడంతో పాటు గ్రామం యూనిట్గా లేదా కనీసం మండలం యూనిట్గా అయినా పరిగణించాలని, అధికారుల నివేదికను 2020 అక్టోబర్ 28న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రత్యేకంగా కలసి సమర్పించారు. ఫలితంగా గత విధానాలను సడలించి ఉద్యాన పంటలను ముఖ్యంగా అరటిని వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో చేర్చారు. మండలం యూనిట్గా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఖరీఫ్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.