కాపు నిధులపై చర్చకు సిద్ధమా?.. పవన్‌కు అడపా శేషు సవాల్‌ | Sakshi
Sakshi News home page

కాపు నిధులపై చర్చకు సిద్ధమా?.. పవన్‌కు అడపా శేషు సవాల్‌

Published Thu, Apr 25 2024 3:56 PM

Ysrcp Leader Adapa Seshu Comments On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయంటూ పవన్‌ కల్యాణ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్‌కు ఎన్నికల అఫిడవిట్ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు ఎంతో వివరంగా అధికారికంగా ప్రకటించారన్నారు.

‘‘ఒక్కసారి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్తే తెలిసిపోతుంది. సీఎం జగన్‌ ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు ప్రకటన ఉంటుంది చూసుకో.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి ఎన్నికల ప్రసంగాలు చదివే పవన్‌కు ఈ విషయంలో స్క్రిఫ్ట్‌ సరిగా రాసిచ్చినట్లు లేరు. అందుకే వివరం తెలియకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ శేషు దుయ్యబట్టారు.

2014లో చంద్రబాబుని పొగిడి 2019లో చంద్రబాబు, లోకేష్ ని తిట్టిన మాట నిజం కాదా?. మళ్లీ నేడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపు కులాన్ని గంపగుత్తగా తాకట్టుపెట్టిన ఘనత పవన్‌దే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం నమ్ముకున్న కులాన్ని, జనసేన కోసం శ్రమిస్తున్న జన సైనికులని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్. పార్టీ పెట్టి 14 ఏళ్లలో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి జగన్ సీఎం అయ్యాడు. రెండేళ్లు అటు ఇటుగా జనసేనను స్దాపించిన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో కలసి వచ్చినా ప్రజలు పవన్ కల్యాణ్‌ను నమ్మే పరిస్దితి లేదు’’ అని అడపా శేషు పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌కు ఆదరణ తగ్గడంతో సజ్జల రామకృష్ణారెడ్డి.. చిరంజీవిని ఏమీ అనకపోయినా చిరంజీవిని అంటే ఊరుకోనంటూ చిరంజీవిని సైతం ఇందులోకి లాగారు. చంద్రబాబు మెప్పుకోసం చిరంజీవిని సైతం రాజకీయంగా వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురంలో ఎదురుగాలి వీస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌లో ఆందోళన ప్రారంభమైంది’’ అని శేషు చెప్పారు.

రాష్టంలో దమ్మున్న నాయకుడు జగన్. ఏపీలో సచివాలయాలు, వాలంటీర్లు వంటి కొత్త సంస్కరణలు తెచ్చి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసారు. పార్టీ పెట్టి 14 ఏళ్లలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి  కష్టపడి జగన్ సీఎం అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్‌ని ఏమని ప్రశ్నిస్తావ్ పవన్. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతొ అవినీతి చేస్తుంటే చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు. కాపు రిజర్వేషన్ అంశంపై ముద్రగడ, చంద్రబాబుకి లేఖ రాస్తే అప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు. సిగ్గు, శరం లేని పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. సిద్ధం సభలు చూస్తే పవన్‌కి సీఎం జగన్‌కు ఉన్న ఆదరణ ఏంటో అర్ధం అవుతుంది. అన్ని పార్టీలు జత కట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సీఎం జగన్‌పై దాడి చేసేదాక మీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాపు సంఘాలు, నాయకులు అర్ధం చేసుకోండి.. జగన్ వల్లనే కాపులు అభివృద్ధి చెందుతారు.అసెంబ్లీ టిక్కెట్ల పరంగా చూసినా, మంత్రివర్గంలో కేటాయించినా స్దానాలు చూసినా జగన్ చిత్తశుద్ది అర్థమవుతుంది’’ అని శేషు పేర్కొన్నారు.

2014, 2019, 2024 మూడో సారి పవన్‌కి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సిగ్గులేకుండా చిరంజీవిని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకువస్తున్నాడు. చిరంజీవి అంటే జగన్‌కి చాలా గౌరవం ఉంది. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్‌ జగన్ హయాంలో కాపులకు నిధులు అధికంగా విడుదల  చేశారు. కాపు నిధుల అంశంలో చర్చకి పవన్ కళ్యాణ్ సిద్ధమా?. సంక్షేమ పథకాలతో కాపు మహిళలు సైతం అభివృద్ధి చెందారు. వంగవీటి రంగా మరణానికి కారణం చంద్రబాబు.. అలాంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. కాపులకు చంద్రబాబు, పవన్ అన్యాయం చేస్తున్నారు.. గమనించాలి’’ అని అడపా శేషు తెలిపారు.

Advertisement
Advertisement