భక్తులకూ తప్పని నరకం..
భట్టుపల్లి నుంచి కొండపర్తికి వెళ్లే మార్గ మధ్యలో కొత్తపల్లి శివారున ఉన్న ఫణిగల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి(రామప్ప) దర్శనం కోసం వచ్చే భక్తులు నిత్యం నరకం చూస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేక దేవాల యం చుట్టూ నాలుగు ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే దుమ్ము, పొగతో భక్తులు నరకం చూస్తున్నారు. ఈ విషయంపై చాలా మంది గతంలో పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
వరంగల్ క్రైం: చెరువులు.. గుట్టలు పబ్లిక్ ప్రాపర్టీ. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులపై ఉంది. అయితే ఇక్కడ కంచె చేను మేసినట్లు అక్రమార్కులకు సర్కారు అధికారులే వంత పాడడం విడ్డూరంగా ఉంది. మడికొండ పోలీస్స్టేషన్ పరిధి భట్టుపల్లి గ్రామ కోట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వారం రోజులుగా కోటచెరువులో జేసీబీల శబ్దం మార్మోగుతోంది. అర్ధరాత్రి తర్వాత చెరువులోని మట్టిని జేసీబీలతో తీసి ట్రాక్టర్ల ద్వారా కొత్తపల్లి శివారులోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. వ్యాపారులు చేస్తున్న అక్రమ దందాతో ఇబ్బంది పడుతున్న స్థానిక రైతులు, ప్రజలు లిఖిత పూర్వకంగా మడికొండ పోలీసులకు, కాజీపేట తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరువు నుంచి నల్ల మట్టిని తీసుకొచ్చి ఇటుక బట్టీల దగ్గర పోసిన రాశులే అక్రమాలకు సజీవ సాక్ష్యం.
ఫిర్యాదుదారులపై ఖాకీల కస్సు.. బుస్సు
రాత్రి పూట మట్టిని తరలిస్తున్న క్రమంలో డయల్ 100కు ఫోన్ చేస్తే స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. వంద సార్లు ఫోన్ చేసినా ఒక్క కానిస్టేబుల్ కూడా రాలేదని స్థానిక రైతులు చెబుతున్నా రు. మట్టి వ్యాపారుల నుంచి మామూళ్లకు అలవాటు పడిన రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించకపోవడమే కాకుండా ఫోన్ చేసిన వారిపై కస్సు.. బుస్సు మంటూ కన్నెర్ర చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి డయల్ 100 కు వచ్చిన కాల్ ఫోన్ నంబర్లను అక్రమ వ్యాపారులకు చేరవేస్తుండడంతో వ్యాపారులు ఫిర్యాదు దారులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఆపడం మా పనికాదు..
మట్టి తరలింపును అడ్డుకోవడానికి ఒక శాఖ ఉంటుంది. సంబంధిత అధికారులు చూసుకోవాలి. వారు మా దగ్గరకు వచ్చి ఫోర్స్ కావాలని అడిగితే ఇస్తాం. అంతే తప్ప మట్టిని తరలిస్తుంటే ఆపడం మా పని కాదు. రైతులు ఫిర్యాదు చేసినా ప్రస్తుతం మేం ఏమీ చేయలేం. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి. పోలీసులు ఆ విధుల్లో బిజీగా ఉన్నారు. ఎవరైనా సంబంధిత శాఖ అధికారులకే ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎవరైనా మట్టి తరలింపునకు సహకరిస్తామని డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటాం.
– పి.తిరుమల్, కాజీపేట ఏసీపీ
చెరువు నుంచి అక్రమ తరలింపు
డయల్ 100 ఫిర్యాదులకు
స్పందన కరువు
చోద్యం చూస్తున్న రెవెన్యూ,
పోలీస్ శాఖలు
మడికొండ పీఎస్ పరిధిలో ఇష్టారాజ్యం
రైతులు, ప్రజల గోడు
పట్టించుకునేదెవరు?