
సాక్షి, అమరావతి: చంద్రబాబు దగ్గర తీసుకున్న రెమ్యునరేషన్కు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పి ఉంటారని, అందుకే అమిత్ షా కరెక్ట్ అని పవన్ అంటున్నాడని నాని ఎద్దేవా చేశారు. అమిత్ షా ను, మోదీని పొగిడితే ఎవరు జైలుకు వెళ్లరన్నారు. సినిమాల్లో నిర్మాతకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తే.. రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకి ఇస్తారని మండిపడ్డారు. నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి, కాల్ షీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని మాత్రమే పొగుడుతావని నాని దుయ్యబట్టారు. పూటకో మాట మాట్లాడటం పవన్కి అలవాటగా మారింది. ‘చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ మతానికి దగ్గరగా పెరిగానని, అందుకే ప్రజాసేవ చేయడానికి వచ్చానని, ఇప్పుడు హిందూ మతంపై విషం చిమ్ముతున్నాడు’ అని నాని తీవ్రంగా మంత్రి నాని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ మధ్య తరగతికి చెందినవాడు ఎలా అవుతారు.. చిరంజీవి దయవల్ల సినిమాల్లోకి వచ్చి కనీసం అన్న చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని పవన్ వ్యక్తిత్వం ఏంటని ప్రశ్నించారు. మంత్రుల మాటల వల్లే ‘దిశ’ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పవన్ చెప్పటంతో ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్ధం కావటం లేదని నాని విమర్శించారు. ‘నాకు కుదరకే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది’ అని చెబుతున్న పవన్కు మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని నాని ప్రశ్నించారు. ‘అవసరమైతే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి’ అని చెప్పడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని.. స్త్రీ జాతిని పవన్ కల్యాణ్ అవమానపరుస్తున్నారని మంత్రి నాని విరుచుపడ్డారు. పవన్ను తాము అసలు రాజకీయ నాయకుడిగానే గుర్తించటం లేదని నాని పేర్కొన్నారు.