సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Sat, Feb 17 2024 1:14 AM | Last Updated on Sat, Feb 17 2024 9:49 AM

- - Sakshi

రాప్తాడు: సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ కై వసం చేసుకునే దిశగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ నెల 18న జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభకు రాప్తాడులో సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు 110 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్‌, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్‌, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు. వీరందరికీ అవసరమైన తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఫ్యాన్‌ ఆకారంలో వాక్‌ వే
‘సిద్ధం’ బహిరంగ సభా వేదిక నిర్మాణం తుది దశకు చేరుకుంది. వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ ఆకారంలో భారీ వాక్‌ వే రూపుదిద్దుకుంది. సభలో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన అనంతరం ‘వాక్‌ వే’ ద్వారా పార్టీ కేడర్‌ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్‌ ప్రాంతాలు గుర్తించారు.

ఏర్పాట్ల పరిశీలన
రాప్తాడు ఆటోనగర్‌ సమీపంలో ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. రాప్తాడు, అనంతపురం, ధర్మవరం ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహమ్మద్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ లిఖిత, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కూడా వీరి వెంట ఉన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పూర్తిస్థాయిలో హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయిస్తున్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ బీసీ రమేష్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే యామినీ బాల, ఉమ్మడి జిల్లా గొర్రెలు, మేకల సహకార సొసైటీ చైర్మన్‌ పసుపుల నరసింహగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ బెడదూరి గోపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ మండల కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్‌ నాయకులు పసుపుల ఆది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement