డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు! | Family budgets being turned upside down by digital payments | Sakshi
Sakshi News home page

డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!

Published Sat, Mar 29 2025 5:56 AM | Last Updated on Sat, Mar 29 2025 5:56 AM

Family budgets being turned upside down by digital payments

పెరిగిన అనవసర ఖర్చు 

ధర తెలుసుకోవడం దాదాపుగా మానేశారు 

రూ.5 మొదలు వేల రూపాయల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే.. 

తలకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్‌ 

ఎంత సంపాదిస్తున్నా ఇట్టే అయిపోతుందనే భావన 

కోవిడ్‌ తర్వాత అన్నీ డిజిటల్‌ చెల్లింపులే.. 

చిల్లర కొరత నేపథ్యంలోనూ మారిన తీరు

డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్‌ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్‌ పేమెంట్స్, ఆన్‌లైన్‌ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్‌  పేమెంట్స్‌ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్‌ పేమెంట్‌ తప్పనిసరి అవుతోంది.

అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నా యి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. 

కోవిడ్‌ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్‌ 
డిజిటల్‌ పేమెంట్స్‌ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్‌కార్డులు, గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్‌ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్‌ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. 

అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు.  ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ ఊపందుకున్నాయి.

» కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్‌లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.

» ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్‌ అకౌంట్‌లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్‌లైన్‌లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.

లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు 
ఆన్‌లైన్‌ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. 

కానీ డిజిటల్‌ పేమెంట్స్‌ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం 
ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్‌ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్‌లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికైనా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్‌ పేమెంట్స్‌ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

రుణాలను సైతం బ్యాంకు యాప్‌ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్‌ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. 

ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు 
గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్‌ పేమెంట్స్‌ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement