Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Elkathurthy Public Meeting: Kcr Warning To Telangana Congress Govt1
కాంగ్రెస్‌ సర్కార్‌కు కేసీఆర్‌ వార్నింగ్‌

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని.. ఏడాదిన్నర పాలనలో ఏం చేశారంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్‌ పాస్‌ అయ్యిందంటూ మండిపడ్డారు. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని.. 25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించామని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే‘‘తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లు.. పెదవులు మూశారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదవులను త్యాగం చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే. ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం. బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్‌ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది’’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు..‘‘పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం. తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం. మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం. పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం. పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. గోల్‌మాల్‌ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు. మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు..‘‘కల్యాణ లక్ష్మికి కేసీఆర్‌ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్‌ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. తెలంగాణను నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేవారు.ఇక నుంచి నేను కూడా ఊరుకోను..యూనివర్శిటీ భూములను ఎవరైనా అమ్ముతారా?. కేసీఆర్‌ కిట్స్‌ను ఎందుకు బంద్‌ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా?. ఇవాళ హైదరాబాద్‌ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారు. వైఎస్సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాలని చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం మంచిది.. కొనసాగించాలని నేను సీఎం అయ్యాక చెప్పాను. ఇప్పుడున్న సీఎం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఇక నుంచి నేను కూడా ఊరుకోను. ఎక్కడ ఎవరు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడదాం. కమీషన్లు అడుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా?’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి..ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధైర్యంగా ఉండాలి. తెలంగాణను మళ్లీ అద్భుతంగా చేసుకుందాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్‌ సంగతేంటో ప్రజలే తేలుస్తారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తున్నారు. పోలీసులు డైరీల్లో రాసుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. బీఆర్‌ఎస్‌ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. మీ డ్యూటీ మీరు చేయండి’’ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

Sakshi Guest Column On What is appropriate punishment for Pakistan2
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?

పహల్‌గామ్‌లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్‌ లో పాకిస్తాన్‌ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్‌ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్‌ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్‌ హైకమిషన్‌ లోని ఛార్జ్‌ డి’అఫైర్‌ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్‌ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్‌ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్‌ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్‌ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్‌ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్‌ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్‌ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్‌ (జమ్ము–కశ్మీర్‌) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్‌లెట్‌లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్‌ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్‌) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్‌ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్‌ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్‌ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్‌ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్‌ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్‌ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్‌ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్‌ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్‌ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్‌–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్‌ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్‌ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్‌ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్‌ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్‌ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్‌ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్‌ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్‌ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్‌ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్‌ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్‌ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్‌ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్‌ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్‌ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్‌లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్‌ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్‌ (పరిశోధన), సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Sakshi Guest Column On Hindi cinema On Jyotirao Phule, Savitribai Phule3
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?

మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్‌ అనంత్‌ మహాదేవన్‌ తీశారు. ప్రతీక్‌ గాంధీ, పత్రలేఖా పాల్‌ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్‌11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిమ్‌ సర్టిఫికేషన్‌’ (సీబీఎఫ్‌సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్‌సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్‌ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్‌సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్‌ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్‌ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్‌ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్‌ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్‌సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్‌సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్‌సీ కశ్మీర్‌ మీద, గుజరాత్‌ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్‌ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్‌సీ అధ్యక్షుడు ప్రసూన్‌ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్‌ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్‌లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ 1865లో ‘అవర్‌ అమెరికన్‌ కజిన్‌’ డ్రామాను థియేటర్‌లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

Pakistan Ratna BJP After Siddaramaiah Remark4
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’

బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్‌ శాంతిప్రియ దేశం. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్‌ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప.

Royal Challengers Bengaluru beat Delhi Capitals by 6 wickets5
కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ

ఐపీఎల్‌-2025లో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌రో అద్బుత విజ‌యాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.26 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖ‌రిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. ఈ విజ‌యంతో చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఎదురైన ప‌రాభావానికి ఆర్సీబీ బ‌దులు తీర్చుకుంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా ఓ వికెట్ సాధించాడు. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స్ట‌బ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్‌(22), అభిషేక్ పోరెల్‌(28) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హాజిల్‌వుడ్ రెండు, ద‌యాల్‌, పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానికి చేరుకుంది.

Director SS Rajamouli Chief Guest For Nani Hit-3 Pre Release Event6
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి

‘‘నాని ఏ సినిమా చేసినా హిట్‌ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్‌లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌ 3: థర్డ్‌ కేస్‌’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్‌ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్‌ 2’లో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్‌ 1, హిట్‌ 2, కోర్ట్‌’... ఆల్‌ సక్సెస్‌. వంద శాతం సక్సెస్‌ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్‌ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్‌ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్‌ ఫస్ట్‌ కేస్, సెకండ్‌ కేస్‌... చాలా కేస్‌లు ఉండొచ్చు. శైలేష్‌ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్‌ 3’ ప్రమోషనల్‌ కంటెంట్‌ చూశాను. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అనే వైబ్‌ని క్రియేట్‌ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్‌ కీ బార్‌ అర్జున్ సర్కార్‌. హిట్‌ ది థర్డ్‌ కేస్‌’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్‌ ఫిక్స్‌ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్‌ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్‌’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని. ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్‌ వచ్చింది.ఈసారి ‘హిట్‌ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్‌ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ కలిస్తే అది ‘హిట్‌ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను నానిప్రామిస్‌ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్‌ సేన్‌ వ్యక్తం చేశారు. శైలేష్‌ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

Ramakrishna Rao Is The New Cs Of Telangana7
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్‌ కానున్నారు. ప్రస్తుత సీఎస్‌ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఫైనాన్స్‌ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌గుడ్‌ గవర్నెన్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా శశాంక్‌ గోయల్‌మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవిజీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్‌వి కర్ణన్‌యాదగిరిగుట్ట ఈవోగా ఎస్‌.వెంకట్రావుపరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌ సీఈవోగా జయష్‌ రంజన్‌ప్యూచర్‌ సిటీ కమిషనర్‌గా శశాంకకార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిషోర్‌జెన్‌కో సీఎండీగా హరీష్‌హెల్త్‌ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణపరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తిరాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిలసెర్ప్‌ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్‌ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డిజీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా హేమంత్‌సహదేవ్‌ రావుటీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డిపంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌గా కధిరవన్‌హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్‌హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్‌ రెడ్డి

Baisaran Reels Videographer Who Recorded Entire Pahalgam Attack8
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..

శ్రీనగర్‌: అందాల కశ్మీరంలోని పహల్గాం బైసారన్‌ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.. ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. అయితే, బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడికి సంబంధించి అత్యంత కీలక సాక్షిగా నిలిచాడు. ఈ దాడి మొత్తాన్ని అతడు కెమెరాలో బంధించగా, కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్‌ఐఏ చేతికి చిక్కింది.ఈ స్థానిక వీడియో గ్రాఫర్‌ కాల్పులు ప్రారంభమైనప్పుడు తన ప్రాణ రక్షణ కోసం పరిగెత్తి, బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టుపైకి ఎక్కాడు. దాడి జరిగిన సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని ఘటన మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు చేస్తోంది.వీడియో గ్రాఫర్‌ విచారించిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆయన వద్ద నుంచి ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ముందగా ఇద్దరు ఉగ్రవాదులు.. పర్యాటకులను ముస్లిం మతాచారాన్ని పాటించమంటూ బెదిరించారు. అనంతరం నలుగురిని కర్కశంగా కాల్చి చంపారు.ఘటనా స్థలంలో ఏకే-47, ఎం4 రైఫిల్‌ ఖాళీ తూటాలను గుర్తించారు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు సెల్‌ఫోన్లు కూడా లాక్కునట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వాటిని ట్రాక్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉంది. అయితే, దాడి తర్వాత నుంచి స్విచ్ఛాఫ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు.

Titanic Survivor Letter Sold For Over Rs 3 Crore At Auction In UK9
టైటానిక్‌ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ప్రయాణికుడు (కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ) రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో.. సుమారు రూ. 3.4 కోట్లకు అమ్ముడైంది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు 'కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ' రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి రాసినట్లు తెలుస్తోంది. ఇందులో "ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి" అని ఉంది.1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయిన తరువాత సుమారు 1500 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. 1913లో ఈయన మరణించిన తరువాత.. ప్రచురించబడిన తన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆ పుస్తకంలో.. ఓడ మునిగిపోయిన తర్వాత, మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్‌ను ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. మొదట లైఫ్ బోట్ చేరుకున్న వారిలో సగానికి పైగా అలసట లేదా చలి కారణంగా మరణించారని ఆయన రాశారు.కల్నల్ గ్రేసీ ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ, అతితక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గాయాల వల్ల ఆరోగ్యం పాడైంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్యలతో.. డిసెంబర్ 1912లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఈ లేఖ భారీ మొత్తానికి అమ్ముడైంది.

Merugu Nagarjuna Says Chandrababu Govt Neglecting Students Welfare10
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’

సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్‌ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్‌ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్‌ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్‌కిన్‌ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్‌ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement