
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 1,620 మినీ అంగన్వాడీ కేం
● పనిచేయని బాల సంజీవని 2.0
● పూర్వప్రాథమిక విద్య బలోపేతం
పేరుతో అంగన్వాడీలపై పని ఒత్తిడి
● సాంకేతిక సమస్యలు
పరిష్కరించకుండా కొత్త యాప్లు
● పనిచేయని ఫోన్లను వెనక్కు
ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వైనం
● సెల్ఫోన్ల స్థానంలో ట్యాబ్లు
ఇవ్వాలని డిమాండ్
● జిల్లాలో 1,663 అంగన్వాడీ కేంద్రాలు
పాత ఫోన్లలో కొత్త యాప్లు అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎన్నికల ముందు అంగన్వాడీలకు యాప్లతో పని లేకుండా చేస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. గతంలో ఉన్న యాప్లకు తోడు బాలసంజీవని 2.0 వర్షన్తో పని భారం మోపారు. యాప్ కష్టాలతో అటు అంగన్వాడీ కార్యకర్తలు, ఇటు చిన్నారులు సతమతమవుతున్నారు. ఈ అవస్థలు ‘మాకొద్దు బాబోయ్’ అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ఆలకించే వారు కరువయ్యారు.
కోవెలకుంట్ల: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం యాప్లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటి నుంచి అంగన్వాడీలకు యాప్ కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1,663 అంగన్వాడీ, మినీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 1,663 మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తుండగా వీటి పర్యవేక్షణకు 16 మంది సీడీపీఓలు, 41 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, కార్యకర్తలు, ఆయాల న్యాయమైన డిమాండ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అంతేకాకుండా యాప్ల పేరుతో తమపై పనిభారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్లు మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ కాక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. యాప్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వెర్షన్తో కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో వర్కర్లు, హెల్పర్లు, ఫొటో క్యాప్చర్ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండంతో అంగన్వాడీలు పోషకాహార పంపిణీలో నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనిని మూడు యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉండటం, యాప్లు సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
ఫేస్ యాప్.. వేతనాల్లో కోత..
అంగన్వాడీ కార్యకర్తల వేతనానికి ఫేస్యాప్తో ముడిపెట్టారు. ఫేస్యాప్ వేసిన రోజులకు మాత్రమే వేతనం వస్తుంది. సాంకేతిక సమస్య తలెత్తి ఆ రోజు యాప్లో నమోదు కాకపోతే వేతనం కట్ అవుతుంది. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని యాప్ల ద్వారా ఇవ్వడం, రికార్డులు రాయడం, టేక్హోమ్ రేషన్ పంపిణీ, ప్రతినెలా 1వ తేదీ నుంచి ఐదో తేదీ వరకు పిల్లల బరువు పరిశీలించడం వంటి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని తమపై పనిభారం మోపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా రూ. 11,500 గౌరవ వేతనంతో నెలంతా తమతో చాకిరి చేయిస్తున్నారని మండి పడుతున్నారు. కేంద్రాలను శుభ్రం చేయడం, ప్రీస్కూల్ విద్యార్థులకు పోషకాహారం వండిపెట్టడం, వంటపాత్రలు కడగటం, పిల్లల వాష్రూం శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నా వారికి నెలకు కేవలం రూ. 7 వేలు మాత్రమే ఇస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో
పకడ్బందీగా సేవలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగంతో పకడ్బందీగా సేవలు అందాయి. ఆరు యాప్లు అమలు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పోషణ ట్రాకర్ యాప్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్, హాట్కుక్ యాప్ తదితర యాప్లతో ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి వినియోగించుకునేందుకు నీరు అందుబాటులో ఉంచాలి. లేని పక్షంలో యాప్లో వివరాలు నమోదు చేసి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేసింది. గుడ్ల సరఫరాకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చి అమలు చేసింది.