
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.
కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.
రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.
‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు.