
PC: BCCI/IPL.com
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. 300 టీ20 మ్యాచ్లు ఆడిన తొలి భారత్ పేసర్గా భువనేశ్వర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్బంగా భువీ ఈ ఫీట్ను అందుకున్నాడు.
భువనేశ్వర్ 2009 ఛాంపియన్స్ లీగ్లో ఆర్సీబీ తరపునే టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011లో పూణే వారియర్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత ఈ యూపీ ఫాస్ట్ బౌలర్ 2014లో సన్రైజర్స్ హైదరాబాద్లో చేరాడు. పదేళ్లపాటు ఎస్ఆర్హెచ్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు.
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సన్రైజర్స్ భువనేశ్వర్ను విడిచిపెట్టడంతో ఆర్సీబీలో చేరాడు. రూ. 10.75 కోట్ల భారీ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో భువనేశ్వర్ ఫర్వాలేదన్పిస్తున్నాడు. ఇప్పటివరకు 300 టీ20లు ఆడిన భువనేశ్వర్.. తన ఖాతాలో 316 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భువనేశ్వర్ తర్వాత హార్దిక్ పాండ్యా(291) ఉన్నాడు.
అత్యధిక టీ20లు ఆడిన భారత పేసర్లు వీరే..
భువనేశ్వర్ కుమార్- 300
హార్దిక్ పాండ్యా- 291
జస్ప్రీత్ బుమ్రా- 234
హర్షల్ పటేల్- 204
సందీప్ శర్మ- 201