
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.
విరాట్ నిన్ననే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.
ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)
20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)
19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)
18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)
16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)
16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)
ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)
25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్లు)
22- క్రిస్ గేల్ (142 మ్యాచ్లు)
20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)
19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)
18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)
నిన్నటి మ్యాచ్లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)
8326 - విరాట్ కోహ్లీ
6786 - రోహిత్ శర్మ*
6769 - శిఖర్ ధావన్
6565 - డేవిడ్ వార్నర్
5528 - సురేష్ రైనా
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.