
టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ను మరింత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అతను క్రికెట్ ఆడడం కష్టమనిపిస్తోంది.
దీంతో జనవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్తో పాటు ఐపీఎల్ 2023 సీజన్లో పంత్ ఆడకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. లిగమెంట్ గాయం నుంచి పంత్ కోలుకోవాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే అప్పుడు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో పంత్ రాణించిన విషయం తెలిసిందే. ఒకవేళ పంత్ ఆడలేని పక్షంలో.. కేఎస్ భరత్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ సంగతి పక్కనబెడితే ఐపీఎల్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంత్ అందుబాటులోకి రాకపోతే జట్టు యాజమాన్యం మరో ప్లేయర్ కోసం ఎదురుచూడాల్సిందే.
చదవండి: Rishabh Pant: ఫ్యామిలీ కోసం పంత్ కొన్న విలువైన వస్తువులు చోరీ? పోలీసుల క్లారిటీ