
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓఆర్ఆర్పై వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్. హైదరాబాద్ ఔటర్ రింగ్(ORR) రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ సదరు నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరలను నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది.
అయితే, హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.
కొత్త ఛార్జీలు ఇలా..
- కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి.
- మినీబస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది.
- రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది.
- భారీ వాహనాలకు కిలోమీటర్కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.