రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు తదితర ఆన్లైన్ పనులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై తలెత్తిన వివాదం పరిష్కారమైంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశమై చర్చించారు. టెండర్లలో తక్కువ రేటు కోట్ చేసిన సర్వీసు ప్రొవైడర్కే పనులను అప్పగించాలని కడియం సూచించారు. దీంతో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణపైనా సెట్స్ కన్వీనర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసే అవకాశముంది. ప్రవేశ పరీక్షల తేదీల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు.