పటాన్చెరు: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే పటాన్చెరుకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గంలో పదేళ్ల కిందట రెండు లక్షల ఓటర్లు ఉండేవారని, ఇప్పుడు నాలుగు లక్షలకు చేరిందన్నారు. తమ ఇండస్ట్రియల్ పాలసీ కారణంగా పటాన్చెరులో అనేక పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు నిరంతరం విద్యుత్తును సరఫరా చేశామని గుర్తు చేశారు. దీంతో దేశంలోని నలు మూలల నుంచి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడంతో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని కేసీఆర్ వివరించారు. కాలుష్య ప్రాంతంగా ఉన్న పటాన్చెరులో స్వచ్ఛమైన మంచినీటి మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీరు సరఫరా చేశామని తెలిపారు.