భువనగిరి : జిల్లా వ్యాప్తంగా అన్ని పీఏసీఎస్లలో సబ్సిడీపై ఇచ్చేందుకు జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగ విత్తనాలు వేసే రైతులు పూత దశలో పొలంలో కలియదున్నాలని, ఇది ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువుతో సమానం అన్నారు. జీలుగ ద్వారా అనే ప్రయోజనాలు ఉంటాయని, వరి సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలాలకు
పాఠ్య పుస్తకాల తరలింపు
భువనగిరి : పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం భువనగిరిలోని గోదాం నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు తరలించే వాహనాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాకు 1,53,655 పుస్తకాలు, 70 టైటిల్స్ వచ్చాయన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి 100 శాతం పుస్తకాలు వస్తాయని చెప్పారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ రంగరాజన్, ఉపాధ్యాయులు బుస్సా రమేష్, ఆనందరావు, అంజన్కుమార్,అంబిదాస్, రామకృష్ణ పాల్గొన్నారు.
యాదాద్రిలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. అలాగే ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వేళ స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు.
ఐటీఐలలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ, శివసాయి ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కట్టా మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మొదటి విడత అడ్మిషన్ల కోసం జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ 9848571409ను సంప్రదించాలని కోరారు.
పచ్చడి మామిడి పిరం
భువనగిరి : మామిడి కాయల పచ్చడికి సీజన్ వచ్చింది. దీంతో భువనగిరి పట్టణంలో రెండుమూడు రోజుల నుంచి పచ్చడి కాయలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. పచ్చడి కోసం జనం మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈసారి మామిడి ధర వింటేనే హడలెత్తిపోతున్నారు. సైజును బట్టి ఒక్కో కాయ రూ.10నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల వల్ల 50, 100 కాయలకు బదులు 15 నుంచి 20 కాయలు మాత్రమే కొనుగోలు చేసి పచ్చళ్లు పెడుతున్నారు. ఈసారి మామిడి తోటలు పూత బాగానే వచ్చినప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల నిలబడలేదు. దీంతో దిగుబడిపై తక్కువగా రావడంతో పచ్చడి కాయల ధరలు పెరిగాయి.