
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రయాణాలకు కామన్గా ఒకే మొబిలిటీ కార్డు అందించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. దీనికి అవసరమైన ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వివిధ మార్గాల ద్వారా ప్రయాణించే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మొబిలిటీ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్, స్వైపిం గ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ప్రత్యేకతలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్శ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సీజీఎం కేవీ రావు, తదితరులు పాల్గొన్నారు.