Aurangzeb
-
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ: డిప్యూటీ సీఎం వ్యాఖ్యల దుమారం
Aurangzeb Controversy మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం ఈ అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు రైట్వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేమిటి? ‘ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనను కీర్తించడాన్ని మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో అతను ఒక మాయని మచ్చ‘ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాలనను ఔరంగజేబు పాలనతో పోల్చడాన్ని శిందే తీవ్రంగా తప్పుపట్టారు. ఫడ్నవీస్ పాలన, ఔరంగజేబు పాలనా ఒకటేనా? ‘ఔరంగజేబు తన శత్రువులను హింసించిన విధంగా ఫడ్నవీస్ ఎప్పుడైనా ఎవరినైనా హింసించారా?‘ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.చదవండి: Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?దీనికి పరబ్ కోపంగా తనకు ఈ విషయంపై స్పందించే అవకాశమివ్వాల్సిందిగా చైర్మన్ను కోరారు. కానీ చైర్మన్ రామ్శిందే పరబ్ను అనుమతించలేదు. ఆయన మైక్రోఫోన్ను మ్యూట్ చేశారు. అయినప్పటికీ పరబ్, ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే, సచిన్ పరబ్ ఇతర సభ్యులతో కలిసి తమను మాట్లాడనివ్వవలసిందిగా నిరసన తెలియజేశారు. ఇంత జరుగుతున్నా శిందే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘నేనేంచేసినా బహిరంగంగా చేశా. ఔరంగజేబ్ (కాంగ్రెస్) పట్ల సానుభూతి చూపే వారి నుంచి శివసేనను కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నానని అనిల్ పరబ్ మర్చిపోకూడదు. ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించింది కాంగ్రెస్సే.‘ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?
నాగ్పూర్: మొఘల్ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్పూర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లకద్గంజ్, పచ్పావోలి, శాంతి నగర్, సక్కర్దార, నందన్వన్, ఇమామ్బాడ, యశోధర నగర్. కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్పూర్లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ నాగ్పూర్లోని చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.నాగ్పూర్ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే ఛత్రపతి సంభాజీనగర్: నాగ్పూర్లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు -
నాగ్పూర్ దారుణం
ఉన్నత విద్యలో చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం వగైరా మానవ విజ్ఞాన శాస్త్రాల ప్రాధాన్యత అడుగంటి రెండున్నర దశాబ్దాలు దాటుతుండగా చరిత్రను ఆధారం చేసుకుని నిర్మించినట్టు చెబుతున్న సినిమాలు వివాదాస్పదం కావటం, ఉద్రిక్తతలు ఏర్పడటం ఇటీవలి ధోరణి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాజుకున్న హింసాకాండ మూలాలు కూడా అక్కడే ఉండటం యాదృచ్ఛికం కాదు. సోమవారమంతా నాగ్పూర్లో చెలరేగిన హింసలో 33మంది పోలీసులు, అయిదుగురు పౌరులు గాయపడగా రెండు బుల్డోజర్లతోసహా అనేక వాహనాలకు దుండగులు నిప్పంటించారు. ఆరో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పవిత్ర గ్రంథంలోని వాక్యాలున్న చద్దర్ను దగ్ధం చేశారన్న వదంతి ఈ హింసకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల మొదటివారం నుంచే మహారాష్ట్రలో ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత ఘట్టాలతో రాసిన ఒక చరిత్రాత్మక నవల ఆధారంగా నిర్మించిన ‘ఛావా’ సినిమా చుట్టూ తొలుత వివాదం రాజుకుంది. అందులోని ఉదంతాలకు చారిత్రక ఆధారాలు లేవని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ అనడంతోపాటు ఔరంగజేబు క్రూరుడు కాడన్నారు. ఆపై మరిన్ని మలుపులు తిరిగింది. మరాఠా వారసత్వాన్ని అవమానించిన ‘ద్రోహి’ అజ్మీని వెంటనే అసెంబ్లీనుంచి బహిష్కరించాలని అధికార మహాయుతి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనక ముందస్తు పథకం ఉన్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అంటున్న మాటలు వాస్తవం. కానీ ఈనెల మొదటివారంలో సమస్య రాజుకున్నప్పటి నుంచి ఇంటె లిజెన్స్ వర్గాలు, పోలీసులు ఏం చేశారు? దుండగుల కదలికలను అంచనా వేయటంలో ఎందుకు విఫలమయ్యారు? పెట్టుబడుల కోసం, అభివృద్ధి సాధించామని చూపటం కోసం ప్రభుత్వాలన్నీ పోటీపడుతున్న కాలంలో శాంతిభద్రతలను దెబ్బతీసే ఇలాంటి ఘటనల వల్ల అప్రదిష్టపాలవుతా మన్న స్పృహ కూడా లేదా? హింసకు ఆద్యులెవరన్నది తేలడం తర్వాత సంగతి. ముందు పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన స్థితి. నాగ్పూర్ ఆ రాష్ట్రానికి రెండో రాజధాని. జనాభారీత్యా ముంబై, పుణేల తర్వాత మూడో స్థానంలో ఉంటుంది. 300 ఏళ్ల చరిత్రగల ఈ నగరంలో దేశంలోనే తొలి బట్టలమిల్లును టాటాలు స్థాపించారు. 1920 నాటి నాగ్పూర్ కాంగ్రెస్ జాతీయ సదస్సులోనే సహాయ నిరాకరణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఇక్కడే హెడ్గేవార్ ఆరెస్సెస్ను స్థాపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న బౌద్ధమతాన్ని స్వీకరించి దళిత బుద్ధిస్ట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింది ఇక్కడే. ఇది చదువుల తల్లి నిలయం. 1923లో మొదలైన నాగ్పూర్ యూనివర్సిటీ సహా ఇక్కడ అయిదు విశ్వ విద్యాలయాలున్నాయి. అయిదు వైద్య కళాశాలలున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమతోపాటు ఇక్కడ ఎన్నో తయారీరంగ పరిశ్రమలున్నాయి. పుణే తర్వాత ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఎక్కువ.చరిత్రను మలుపుతిప్పిన అనేకులు ఆనాటి అవగాహన, పరిమితుల మేరకు తమ పాత్ర నిర్వహించి నిష్క్రమించారు. వారి చర్యల వెనకున్న ఆంతర్యమేమిటో, అందువల్ల వివిధ వర్గాలకు కలి గిన ఖేదం లేదా మోదం ఏమిటో...వాటి పర్యవసానాలేమిటో విశ్లేషించి చెప్పటం చరిత్రకారులు చేసే పని. అయితే అలా వెలువడే చరిత్రలు నూరు శాతం వాస్తవమని భావించటానికి వీలుండదు. ఎందుకంటే చరిత్రను వక్రీకరించటం మొదలెట్టి చాన్నాళ్లయింది. ఇక సృజనాత్మకత జోడించి రాసే కాల్పనిక రచనల గురించి చెప్పేదేముంది? శంభాజీ తీరుతెన్నులను నిశితంగా విమర్శించేవీ ఉన్నాయి. ఆయన్ను ఆకాశానికెత్తేవీ ఉన్నాయి. అయితే నేరుగా శంభాజీని కలిసి, సంభాషించిన నికొ లాయ్ మానుచ్చి అనే ఇటాలియన్ తన యాత్రా రచన ‘స్టోరియా దొ మొగర్’లో అనేక అంశాలు రాశాడు. అవి కల్పితం అయ్యే చాన్సు తక్కువ. ఔరంగజేబు 49 ఏళ్లపాటు పాలించి తన 88వ యేట 1707లో మరణించాడు. అతని హయాంలో దాదాపు 25 యేళ్లపాటు యుద్ధాలే సాగాయి. ముఖ్యంగా మరాఠాలకూ, మొగల్ సైన్యానికీ మధ్య తీవ్ర వైరం ఉండేది. ఆ క్రమంలో శంభాజీని హత మార్చి, అతని ఏడేళ్ల కుమారుడు సాహూను ఖైదు చేయటం చరిత్రలో చోటుచేసుకున్న వాస్తవిక అంశాలు. పద్దెనిమిదేళ్ల కారాగారవాసం తర్వాత ఔరంగజేబు మరణానంతరం సాహూ విడుదల కావటం, ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టడం, మరాఠాల ప్రాభవం మరింత పెరిగి, ఉపఖండంలో వారు తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకోవటం చరిత్ర. క్రూరత్వమే వీరత్వంగా చలామణి అయిన మధ్యయుగాల్లో ఔరంగజేబు వంటి పాలకుల్లో మంచిని వెదకటంవల్ల కలిగే ప్రయోజనమేమిటో అజ్మీ వంటివారు చెప్పాలి. మహారాష్ట్ర ప్రజలకూ, ముఖ్యంగా మరాఠాలకూ శివాజీతో, ఆయన వారసత్వంతో భావోద్వేగాలతో ముడిపడిన అనుబంధం ఉంటుంది. దాన్ని గాయపరిచి, వివాదాన్ని సృష్టించి ఆయన సాధించదల్చుకున్నదేమిటో అర్థంకాని విషయం. రాజకీయంగా అజ్మీ ఏ పార్టీతో ఉన్నా, ఎంతగా వివాదాస్పదుడైనా బీజేపీ, శివసేనలతోసహా అన్ని పార్టీలతోనూ ఆయనకు సాన్నిహిత్యం వుంది. హత్య కేసు వివాదంలో ఇరుక్కుని మంత్రి పదవి కోల్పోయిన ధనంజయ్ ముండా ఉదంతం నుంచి అధికార కూటమిని కాపాడటానికే ఉద్దేశపూర్వకంగా అజ్మీ ఈ వివాదం రెచ్చగొట్టారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ. ఆ మాటెలావున్నా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు నోరు అదుపులో ఉంచుకోవటం అవసరం. నాగ్పూర్ హింస ఈ సంగతినే తెలియజెబుతోంది. -
అంతా ఛావా వల్లే.. అసెంబ్లీలో సీఎం ఫడ్నవిస్ ప్రకటన
ముంబై: నాగపూర్లో గత రాత్రి నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు ఒక రకంగా ‘ఛావా’ సినిమానే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Aurangzeb Tomb)ని తొలగించాలనే డిమాండ్తో మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడం.. ఆపై నెలకొన్న కర్ఫ్యూ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు.ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహరాజ్ చరిత్రను ఛావా చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత అంశం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే..ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్తో సోమవారం సాయంత్రం వీహెచ్పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధి ఒకదానిని ఏర్పాటు చేసి తగలపెట్టారు. కాసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అని అన్నారాయన.#NagpurViolence: Maharashtra Chief Minister DevendraFadnavis says #Chhaava brought the history of Chhatrapati Sambhaji Maharaj to the fore and ignited public anger against Mughal ruler Aurangzeb. Read: https://t.co/hLrV0crgkG pic.twitter.com/RrUt0qPfJ2— NDTV Profit (@NDTVProfitIndia) March 18, 2025VIDEO Credits: NDTV Profit X Accountఅయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని.. కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారాయన. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే.. గత రాత్రి నాగ్పూర్(Nagpur)లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో.. కేవలం పోలీసులకే 33 మందికి గాయాలైనట్లు సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదిపై అక్కడి మీడియా ఛానెల్స్ తలా ఓ ఫిగర్ చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్(Vicky Kaushal), శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా(Akshay Khanna As Aurangzeb) తమ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ టైంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా ఓ అద్భుతమంటూ కొనియాడారు. -
నాగ్పూర్లో చెలరేగిన అల్లర్లు
నాగ్పూర్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామనే విశ్వహిందూ పరిషత్ చేసిన డిమాండ్లతో మొదలైన ఉద్రిక్తతలు చివరకు అల్లర్లకు దారితీశాయి. ఇందుకు సెంట్రల్ నాగ్పూర్ ప్రాంతం వేదికైంది. సోమవారం ఒక మతగ్రంథానికి నిప్పుపెట్టారన్న పుకార్లు షికార్లు చేయడంతో ఒక వర్గం ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేయంతో వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. నాగ్పూర్లో రా్ ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ఉండే మహల్ ప్రాంతంలో ఘర్షణలకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీచేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. 15 మందిని అరెస్ట్చేశారు. ఘర్షణలు సాయంత్రంకల్లా కోత్వాలీ, గణేష్పేట్ ప్రాంతాలకూ పాకాయి. కూబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీసీపీ నికేతన్ కదమ్కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారీ తలావ్రోడ్లోని ఛిత్నిశ్ పార్క్ వద్ద ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఇక్కడ పలువాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు నివాస గృహాలపై రాళ్లు రువ్వారు. హింసను విడనాడాలని, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ విజ్ఞప్తిచేశారు. మహల్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద బజరంగ్దళ్ సభ్యులు ఆందోళన చేపట్టిన తర్వాతే ఉద్రిక్త పరిస్తితి తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ ఒక మతగ్రంథాన్ని తగలబెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది నిజమని నమ్మిన మరో వర్గం సభ్యులు మహల్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగాక పరిస్థితి అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ బలగాలను భారీ ఎత్తున మొహరించారు. పలుచోట్ల నిషేధాజ్ఞలు జారీచేశారు. ఛిత్నిశ్ పార్క్ వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దగ్ధం చేశామని బజరంగ్దళ్ వర్గాలు స్పష్టంచేశాయి. -
ఔరంగజేబ్ను పొగిడిన ఎస్పీ ఎమ్మెల్యే సస్పెన్షన్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవరి ఔరంగజేబ్పై పొగడ్తలు కురిపించిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అబూ ఆసిమ్ అజ్మీపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం స్పీకర్ ప్రకటించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన అజ్మీ మంగళవారం..‘ఔరంగజేబ్ హయాంలో భారతదేశ సరిహద్దులు అఫ్గానిస్తాన్, మయన్మార్ వరకు విస్తరించాయి. అప్పట్లో ప్రపంచ జీడీపీలో మన జీడీపీ వాటా 24 శాతం వరకు ఉంది. అది భారత్కు స్వర్ణయుగమైంది’అని పేర్కొన్నారు. ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆయన రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఉభయసభలు దద్దరిల్లాయి. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. ‘అజ్మీ ఉద్దేశ పూర్వకంగానే శివాజీని, సంభాజీని అవమానించారు. ఔరంగజేబ్ను పొగిడారు. అటువంటి అజ్మీ ద్రోహి, అసెంబ్లీలో కూర్చునే అర్హత ఆయనకు లేదు’అని నిప్పులు చెరిగారు. ‘ఔరంగజేబ్ క్రూరమైన చర్యలను ఎదుర్కొంటూ సంభాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మతం మార్చుకోవాలంటూ సంభాజీని ఔరంగజేబ్ 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అతడు హిందువులను మాత్రమే కాదు, ఇతర మతస్తులను సైతం చంపించాడు’అని చెప్పారు. ఔరంగజేబ్ను పొగడటం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు సంభాజీని అవమానించడమేనని సభ్యులు ఆరోపించారు. అజ్మీని సస్పెండ్ చేసి, దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అజ్మీని మిగతా కాలం సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలంటూ బుధవారం మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అజ్మీ‘ఔరంగజేబ్ను గురించి నేను చెప్పిన విషయాలన్నీ చరిత్రకారులు, వివిధ రచయితలు పేర్కొన్నవే. శివాజీ, సంభాజీకి ఇతర మహనీయులకు వ్యతిరేకంగా నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినప్ప టికీ, నా వ్యాఖ్యలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాను’అని పేర్కొంటూ అజ్మీ ఓ వీడియో విడుదల చేశారు. తను పేర్కొన్న విషయాల్లో ఎలాంటి తప్పు లేకున్నా వాటిని వక్రీకరించారని ఆరోపించారు. ‘సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనే ఉద్దే శంతో అసెంబ్లీ వెలుపల మాట్లాడానని, అయినప్ప టికీ తనను సస్పెండ్ చేశారు’అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అజ్మీని మా దగ్గరికి పంపించండి: యూపీ సీఎం యోగి‘ఔరంగజేబ్ను ప్రశంసించిన ఎస్పీ ఎమ్మె ల్యే అజ్మీని ఉత్తరప్రదేశ్కు పంపించండి. ఇటు వంటి వాళ్లని ఏం చేయాలో మా రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొ న్నారు. ఔరంగజేబ్ని హీరో అంటూ పొగిడిన అజ్మీకి దేశంలో ఉండే అర్హతుందా అని ప్రశ్నించారు. అజ్మీ వ్యాఖ్య లపై వైఖరిని వెల్లడించాలని ఎస్పీని డిమాండ్ చేశారు. అజ్మీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. -
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజస్తాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడమే కాక.. కాంగ్రెస్ సామ్రాజ్యం అతి త్వరలో అంతం కానుందని జోస్యం చెప్పారు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలానే రాహుల్ గాంధీ కాంగ్రెస్కు చివరి అధ్యక్షుడన్నారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ తనును తాను హిందువుగా చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా’ అంటూ అహుజా ప్రశ్నించారు. త్వరలో రాజస్తాన్లో జరగబోయే రామ్గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆవులను దొంగతనం చేసే వారిని ఉగ్రవాదులంటూ గతంలో విమర్శించారు. -
సహచరుడి హత్యకు ప్రతీకారం కోసం...
జమ్ము: శ్రీనగర్కు 250 కిలోమీటర్ల దూరంలోని మెహందర్ పరిధిలోని సలానీ గ్రామం. సుమారు 50 మంది యువకులు సౌదీలో తమ ఉద్యోగాలను వదిలేసుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అందుకు కారణం తమ గ్రామంలోని ఓ యువకుడి హత్యతో వారంతా రగిలిపోతుండటమే. రెండు నెలల క్రితం జమ్ము కశ్మీర్లో దారుణ హత్యకు గురైన రైఫిల్ మన్ జౌరంగజేబు ఉదంతం వారందరినీ కదిలించింది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ యువకులంతా పోలీస్, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. (ఇంకెంతకాలం ఇలా...?) ‘జౌరంగజేబు మరణ వార్త వినగానే నేను ఇండియాకు బయలుదేరా. నాతోపాటు మరో 50 మంది యువకులు స్వచ్ఛందంగా తమ సహచరుడి కోసం ఇక్కడికి వచ్చారు. వారంతా అక్కడ మంచి ఆదాయం సంపాదించేవారే. కానీ, తమ గ్రామస్థుడి క్రూర హత్యపై వాళ్లు రగిలిపోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఇక్కడికి వచ్చారు. ఎలాగైనా ఉగ్రవాదులపై పగ తీర్చుకుంటామని వారంతా శపథం పూనారు. ఆర్మీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు’ అని ఔరంగజేబు బంధువు మహ్మద్ కిరామత్ చెబుతున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత మరో ఇద్దరు అధికారులను.. అదే రీతిలో ఉగ్రవాదులు అపహరించి పొట్టనబెట్టుకున్నారు. అంతేకాదు అధికారులను రాజీనామాలు చేయాలంటూ బెదరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెలలో దక్షిణ కశ్మీర్లో ఓ అధికారిని కిడ్నాప్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా చేయించారు. అయితే బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఓ అధికారి తెలిపారు. ‘దేశం కోసం మా సోదరులు అమరులౌతున్నారు. అలాంటిది మేం ఎందుకు వెనక్కి తగ్గుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి ఉదంతాలకు తొణికేది లేదని, తమ పిల్లలను సైన్యంలోకి పంపి తీరతామని ప్రతిన బూనుతున్నారు. (ఎంత దారుణంగా చంపారంటే...) -
ఘాతుకం: బుల్లెట్లతో తూట్లు పొడిచారు
శరీరం నిండా బుల్లెట్లతో జల్లెడగా మారిన దేహం. రంజాన్కు కొద్ది గంటల ముందు అపహరణకు గురైన సైనికుడు.. కొన్ని గంటల సస్పెన్స్ తర్వాత మృత దేహంగా కనిపించాడు. కశ్మీర్లో సంచలనం సృష్టించిన జవాన్ ఔరంగజేబ్ అదృశ్యం.. చివరకు విషాదాంతంగా మారింది. శ్రీనగర్: ఫూంచ్కు చెందిన ఔరంగజేబ్.. సోఫియాన్లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44వ దళంలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని అడ్డగించిన కొందరు తమ వెంట తీసుకెళ్లారు. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరకు శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో అతని మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. బుల్లెట్లు దింపారు... అతని తల, మెడ భాగంలో మొత్తం బుల్లెట్లతో దింపారు. శరీరం మొత్తం జల్లెడగా మారిపోయింది. ముఖం మొత్తం చిధ్రమైపోయింది’ అని అధికారి ఒకరు. ఇక ఘటనపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సందించారు.‘ఇంతటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. ఔరంగజేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యం ఆగ్రహం.. ఔరంగజేబ్ మృతి పట్ల భారత సైన్యం రగిలిపోతోంది. రంజాన్ నేపథ్యంలో గత నెలరోజులుగా సరిహద్దులో భారత సైన్యం సంయమనం పాటిస్తూ వస్తోంది. అయితే పాక్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత్ అల్టిమేటం ప్రకటించింది. సహనం నశిస్తేనే ఎదరు దాడులు తప్పవని హెచ్చరించింది. గత నెల రోజుల్లో ఇద్దరు ఉగ్రవాద నాయకులను సైన్యం ఎన్కౌంటర్లలో మట్టుబెట్టింది. వారిలో ఏ++ కేటగిరీ ఉగ్రవాది సమీర్ అహ్మద్ భట్ అలియాస్ సమీర్ టైగర్ కూడా ఉన్నాడు. ఔరంగజేబ్ ఆ ఆపరేషన్లో పాలుపంచుకోవటం గమనార్హం. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ఔరంగజేబును కిరాతకంగా పొట్టనబెట్టుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరొకరి మృతి... బందిపొర జిల్లాలో ఈ ఉదయం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతిగా సైన్యం చేపట్టిన ఆపరేషన్లో ఓ సైనికాధికారి గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. -
ఈ పావలా చాలు
గురువు ముల్లా అహ్మద్ జీవన్ తన శిష్యుడైన మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో.. ‘మీరు ఇచ్చిన పావలా బిళ్ల ఎంతో శుభప్రదమయినదిగా రూపుదాల్చింది. నేను దానితో పత్తిగింజలు కొని పత్తి పండించాను. దైవం ఎంతో బర్కత్ (శుభాన్ని) ఇచ్చాడు. కొన్నేళ్లలో వందలు, లక్షలుగా మారాయి’’ అని చెప్పాడు. ఔరంగజేబు అది విని చాలా సంతోషించాడు.‘‘మీరు అనుమతిస్తే ఆ పావలా బిళ్ల గాథ వినిపిస్తాను’’ అని అన్నారు ఔరంగజేబు. ‘‘తప్పక వినిపించండి’’ అన్నారు ముల్లా జీవన్. అప్పుడు ఔరంగజేబు తన నౌకరుకు, ‘చాందినీచౌక్లోని సేఠ్ ఉత్తమ్చంద్ ని ఫలానా తారీఖు ఖాతాతో సహా ప్రవేశపెట్టమని’ పురమాయించాడు. సేఠ్ ఉత్తమ్చంద్ వచ్చి ఖాతా తెరచి వివరించసాగాడు. ముల్లా జీవన్, చక్రవర్తి ఇద్దరూ చెవులొగ్గి వింటున్నారు. ఓ చోట సేఠ్ ఆగిపోయాడు. అక్కడ పావలా అని రాసి ఉంది కాని, దాని వివరాలేమీ లేవు. ఔరంగజేబు మృదువుగా అడిగాడు, ఆ పావలా ఏమయింది? అని. ‘అనుమతిస్తే దాని బాధాకరమయిన గాథ వినిపిస్తా’’నన్నాడు సేఠ్. అనుమతించారు. ‘‘ఓ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. నా ఇల్లు కూడా కురవడం మొదలయింది. నా పద్దు పుస్తకాలన్నీ అందులోనే ఉన్నాయి. నేనెంత ప్రయత్నించినా ఇల్లు కురవడాన్ని ఆపలేకపోయాను. బయటకు తొంగిచూశాను. ఓ వ్యక్తి వీధి లాంతరు కింద నిలబడి కనిపించాడు. నేనతన్ని ‘సాయం చేస్తావా?’ అని అడిగాను. అతను చేస్తానని అన్నాడు. నాలుగయిదు గంటలపాటు కష్టపడి ఇంటి మీది పెంకులను సర్ది, అతి కష్టం మీద వాన నీరు లోపల కురవకుండా ఆపడంతోపాటు లోనికి వచ్చి సామానంతా సర్దాడు కూడా. అంతలో తెల్లవారు అజాన్ అయింది. అతను సెలవు తీసుకున్నాడు. నేను అతనికి కూలీ ఇవ్వాలనుకున్నాను. జేబులో పావలా తప్ప ఏమీ లేదు. అతనితో ‘బాబూ! ప్రస్తుతం ఈ పావలా తీసుకుని పొద్దున నా షాపుకు వస్తే పూర్తి కూలీ ఇస్తా’నని అన్నాను. అతను, ‘నాకు ఈ పావలా చాలు, నేను మళ్లీ రాలేను’ అని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు నేనూ, నా భార్య ఎంతో ప్రాధేయపడ్డాము పొద్దున రమ్మని. కాని అతను రాలేదు.. అని ఇదంతా వివరించి ఉత్తమ్చంద్ వెళ్లిపోయాడు. చక్రవర్తి ముల్లా గారితో చెప్పాడు, ‘ఆ చవన్నీ’ (పావలా బిళ్ల) అదే!’ అని!!‘ నేను ప్రతిరోజు మాదిరిగానే మారువేషంలో ప్రజల బాగోగులు విచారించడానికి వెళ్లగా ఇది సంభవించింది అని చెప్పాడు ఔరంగజేబు చక్రవర్తి. (ఆ పావలానే ఔరంగజేబుకు తన గురువుకు ఇచ్చారు). -
ఔరంగజేబు పాలన వద్దు!
ధర్మపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికను మొఘల్ పాలకుల వారసత్వ పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. మాకు ఔరంగజేబు పాలన వద్దంటూ పరోక్షంగా రాహుల్ను విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అవినీతి కేసులో బెయిల్పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తోందని తప్పుపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి బురదలో కూరుకుపోయాయని.. అయితే తన నేతృత్వంలో గుజరాత్లో, కేంద్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ‘బెయిల్పై ఉన్న వ్యక్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడానికి రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగ్గు వదిలేసింది. అవినీతి కేసులో బెయిల్పై ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ.. దివాలాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది’ అని వల్సాద్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలు, వారి భవిష్యత్తు నాయకుల శక్తి సామర్థ్యాలు ఈ నిర్ణయంతోనే మనకు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవాచేశారు. ‘మొఘలుల పాలనలో ఎన్నికలు జరిగాయా? జహంగీర్ తర్వాత షాజహాన్ వచ్చాడు. అప్పుడు ఎన్నికలు జరిగాయా? షాజహాన్ తర్వాత ఔరంగజేబు అనేది అందరికీ తెలుసు’ అని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు చేశారు. ‘ఏక కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా..? మాకు ఈ ఔరంగజేబు పాలన వద్దు.. మాకు దేశమే ముఖ్యం. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే మా హైకమాండ్’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘గుజరాత్లో బీజేపీని ఓడించగలిగితే.. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తమ మాట వింటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది.అయితే అందుకు మీరు అనుమతిస్తారా? గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని మీరు అడ్డుకుంటారా?’ అని మోదీ ప్రశ్నించగా.. లేదు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ప్రచారంలో రాహుల్ తరచూ దేవాలయాల సందర్శనపై మోదీ విమర్శలు కురిపించారు. ‘ఇంతకుముందు.. లౌకిక వాదులుగా చెప్పుకునేందుకు వారు పోటీ పడేవారు. తాను లౌకిక వాదినని ఒకరు చెబితే, మరొకరు తాను నాలుగు కిలోలు ఎక్కువ లౌకిక వాదినని, మూడో వ్యక్తి ఆరు కిలోల ఎక్కువ లౌకికవాదినని చెప్పుకునేవారు. గుజరాత్ ఎన్నికలకు ముందు ఆ పోటీ ఏమైంది. హిందూ ఓట్ల కోసమే వారు ఆలయాల్ని సందర్శిస్తున్నారని ప్రజలు గ్రహించగలరు’ అని ప్రధాని చెప్పారు. -
రామ మందిరాన్ని కూల్చింది.. ఔరంగజేబు!!
‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో మాజీ ఐఏఎస్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో ‘రామ మందిరం’ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. మందిరాన్ని కూల్చివేసింది బాబర్ హయాంలో కాదని, ఔరంగజేబు హయాంలో నేలమట్టం చేశారని ఓ మాజీ ఐపీఎస్ అధికారి తన పుస్తకంలో పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత ఫైళ్లు, కొన్ని పురాతన సంస్కృత గ్రంథాలు, పురావస్తు తవ్వకాలకు సంబంధించిన సమీక్షలను ఉటంకిస్తూ.. ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకంలో 1972 బ్యాచ్, గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘1528 సంవత్సరంలో బాబర్ హయాంలో రామమందిరాన్ని కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో, ఆయనకు ఫిడాయ్ ఖాన్ గవర్నర్గా ఉండగా కూల్చివేత జరిగింది. రామ మందిరాన్ని కూల్చివేయాలని బాబర్ ఆదేశించారనడంలో నిజం లేదు. మందిరాన్ని బాబర్ చూడనేలేదు. 1528లో బాబ్రీ మసీదు నిర్మించారన్న చరిత్రకారుల వాదన కూడా కల్పితమే’ అని పేర్కొన్నారు. ‘అయోధ్య చరిత్రకు సంబంధించిన కొత్త కోణాన్ని రచయిత తెలియజేశారు. సాధారణ విశ్వాసాలకు, పలువురు చరిత్రకారుల అభిప్రాయాలకు విరుద్ధమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు’ అని పుస్తకానికి ముందుమాట రాసిన మాజీ సీజేఐ జస్టిస్ జీబీ పట్నాయక్ పేర్కొన్నారు. -
ఔరంగజేబు హయాంలో నిషేధం
ఔరంగజేబు పాలనకు ముందు భారత్లో కేవలం దీపావళికి మాత్రమే కాదు, పెళ్లిళ్లు, పండగలు, ఇతర వేడుకల్లో సైతం బాణసంచా కాల్చే అలవాటు ఉండేది. కులమతాలకు అతీతంగా సంపన్నులు, సామాన్యులు యథాశక్తి బాణసంచా కాల్చి ఆనందించేవారు. బీజపూర్ పాలకుడు అదిల్ షా 1609లో తన కూతురి పెళ్లివేడుకల సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్పించాడు. అప్పట్లోనే ఆ బాణసంచా విలువ రూ.80 వేలు అంటే, ఏ రీతిలో బాణసంచా కాల్పులు జరిగాయో ఊహించుకోవాల్సిందే! ఔరంగజేబు సోదరుడు దారా షికో పెళ్లి వేడుకల్లోనూ ఇలాగే భారీస్థాయిలో బాణసంచా కాల్పులు జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన పెయింటింగ్ ఇప్పటికీ సజీవంగా ఉంది. సోదరుడిని అడ్డుతొలగించుకున్న ఔరంగజేబు 1658లో అధికారానికి వచ్చాడు. కొంతకాలం దీపావళి వేడుకలను అతగాడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ వేడుకల్లో బాణసంచా కాల్చడం ఎందుకో అతడికి హిందూమతానికి మాత్రమే సంబంధించిన కార్యక్రమంగా అనిపించింది. ఇక అంతే... దీపావళి రోజున బాణసంచా కాల్చనే కాల్చరాదంటూ 1667లో హుకుం జారీ చేశాడు. అప్పటి నుంచి అతడి పాలన ముగిసేంత వరకు... అంటే, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జనాలు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకున్నారు. - కూర్పు: పన్యాల జగన్నాథ దాసు -
కుస్తీమే సవాల్
అదో విశాలమైన మైదానం... కొదమ సింహాల్లా కొందరు యోధులు పరస్పరం కలబడుతున్నారు. అలా అందర్నీ ఓడించిన ఓ వస్తాదు.. దూరంగా సింహాసనంపై కూర్చుని ఆ పోరును రెప్ప వాల్చకుండా వీక్షిస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సలామ్ చేశాడు... ఆయన లేచి అతని మెడలో ఓ పతకం వేసి కోటకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ యోధుడు ఔరంగజేబు సైన్యంలో కీలక పదవి పొందాడు. ►నేటి రెజ్లింగ్కు ప్రాణం పోసిన క్రీడ ►ఔరంగజేబు ప్రోత్సాహంతో హైదరాబాద్లో పోటీలు ►నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం షహర్కీ షాన్ గౌరీభట్ల నరసింహమూర్తి ఆ పోరు సాగిన మైదానం ప్రస్తుత ధూల్పేట ప్రాంతంలో ఉంది. పోటీలను వీక్షించిన వ్యక్తి ఖ్వాజా అబిద్ సిద్దిఖీ. నాటి మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబుకు చీఫ్ కమాండర్. గోల్కొండ కోటను మొఘల్ పరం చేయటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. ఆ రోజు అక్కడ జరిగిన కుస్తీ పోటీలు సాధారణంగానో, సరదాగానో జరిగినవి కావు. యుద్ధ విన్యాసాల్లో ఆరితేరిన మెరికల్లాంటి యోధులను సైన్యంలో చేర్చుకునే క్రమంలో ఔరంగజేబు నిర్వహించిన పోటీలవి. ఇది చరిత్ర ! రెజ్లింగ్లో రైజింగ్.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ పోటీల్లో మన దేశం పరువు నిలిపిన క్రీడ రెజ్లింగ్. ఆ పోటీల్లో మనం 64 పతకాలు సాధిస్తే.. రెజ్లింగ్కు వచ్చినవి 14. వాటిల్లోనూ బంగారు పతకాలు ఐదు. మిగతా క్రీడల్లో తడబడే మన దేశం రెజ్లింగ్లో మాత్రం గట్టిపోటీ ఇస్తూ వస్తోంది. అందుకు మన చారిత్రక నేపథ్యమే కారణం. ఇప్పుడు రెజ్లింగ్గా పిలుచుకుంటున్న క్రీడే నాడు కుస్తీగా విలసి ల్లింది. మన దేశంలో కుస్తీ అనగానే గుర్తొచ్చే నగరం హైదరాబాద్. రాఖీపౌర్ణమి, నాగ పంచమి రోజుల్లో పాతబస్తీలోని ధూల్పేట, మంగళ్హాట్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతుంటాయి. మల్లయోధులు ఉగ్ర సింహాల్లా తలపడుతూ కనిపిస్తారు. అదే కుస్తీ.. పోటీపడేవారే మల్లయోధులు. చందమామ, బాలమిత్రల్లోని చారిత్రక గాథలు చదువుతున్నప్పుడు.. దేశాటనకు వచ్చే యోధులు తమను ఓడించే మొనగాళ్లున్నారా అంటూ సవాల్ విసరటం, వారిని ఓడించలేక ఒక్కొక్కరుగా చతికిలపడుతుంటే అవమానంతో రాజు తల దించుకోవటం, ఇంతలో ఓ వీరుడొచ్చి మల్లయోధుడిని ఓడించి రాజ్యం పరువు నిలపటం.. లాంటి కథలు సహజమే. కానీ ఆ కుస్తీ పోటీల్లోని పౌరుషం కొన్ని ఇలాకాల్లో నేటికీ కన్పిస్తుంది. అలాంటిదే ధూల్పేట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఔరంగజేబు దక్కన్ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దఎత్తున సైనిక పటాలం వచ్చి చేరింది. అందులోని సైనికులు అసాధారణ ప్రతిభాపాటవాలను సొంతం చేసుకున్న వారే. తన సైన్యం ఏ దశలోనూ వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతో మెరికల్లాంటి యువకులను ఔరంగజేబు సిద్ధం చేసుకున్నారు. అలాంటి వారిలో నేటి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన లోధీ సామాజిక వర్గానికి చెందినవారూ ఉన్నారు. వీరు యుద్ధవిద్యలో ఆరితేరిన వారు. ఇక మల్లయుద్ధమంటే ప్రాణం. నేటి ధూల్పేట ప్రాంతంలో వీరి ఆవాసం ఉండేది. తరచూ మల్లయుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సాధారణ రోజుల్లోనూ అలరించేవారు. ఔరంగజేబు పతనమయ్యాక ఈ ప్రాంతం అసఫ్జాహీల పరిధిలోకి చేరింది. క్రీడలు, కళలకు పెద్దపీట వేసి ప్రోత్సహించిన అసఫ్జాహీలు లోధీల మల్లయుద్ధ విన్యాసాలకు ముగ్దులయ్యారు. క్రమంగా వారి నైపుణ్యం ఓ క్రీడగా మారిపోయింది. అసఫ్జాహీ రాజ కుటుంబీకులు, ఆస్థాన ప్రతినిధుల కుటుంబసభ్యులు క్రమంగా మల్లయుద్ధ విన్యాసాలను చూసేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ప్రత్యేక సందర్భాల్లో కుస్తీ పోటీలు నిర్వహించే పద్ధతి నగరంలో ఆరంభం అయింది. ఇందుకోసం దంగల్(కుస్తీ ప్రాంగణం)లు వెలిశాయి. పోటీల్లో పాల్గొనేవారికి నజరానాలు ఇస్తుండటంతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా ప్రారంభమైన పోటీలు క్రమంగా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించటం ఆనవాయితీగా మారింది. లోధీలు ఉత్సాహంగా జరుపుకొనే నాగపంచమి, రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా కుస్తీ పోటీలు మారాయి. వందల సంవత్సరాల క్రితం మొగ్గ తొడిగిన ఈ విధానం క్రమంగా వికసించింది. హైదరాబాద్ కుస్తీ పోటీల ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది. పోటీలకు వివిధ ప్రాంతాల యోధులు హాజరవటం విజేతలకు బహుమతులు అందజేయడం ఆనవాయితీ అయింది. దీంతో మల్లయోధులను తయారు చేసే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు మొదలయ్యాయి. నాటి యోధుల పేరుతో దంగల్ కమిటీలూ రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికీ ఏటా రెండు సార్లు ఈ పోటీలు కొనసాగుతూనే ఉన్నాయి. కులమతాలకతీతంగా... హిందూ పర్వదినాలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నా అందులో పాల్గొనేవారిపై ఎలాంటి ఆంక్షలు కనిపించవు. ఈ పోటీల్లో ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే దీనికి నిదర్శనం. విజేతలకు గదను, ప్రశంసాపత్రాలను, నగదు పురస్కారాలు అందజేస్తారు -
సత్వం: ఛత్రపతి
మరాఠా వీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. హనం ఏనాడూ కనబరచని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహనం అంతకంతకు నశిస్తోంది. తమ దగ్గర ఒక మామూలు జాగీర్దారుగా పనిచేసినవాడి కొడుకు రోజురోజుకూ విస్తరిస్తున్నాడు. తననే సవాల్ చేస్తున్నాడు! శివాజీ ఎంత శక్తిమంతుడో అంత యుక్తిగలవాడు. ‘వేడివేడి అంబలి మధ్యలో ఆత్రంగా చేయిపెట్టి వేళ్లు కాల్చుకోవడం కాదు; అంచుల వెంబడి చుట్టూతా చల్లబడిన భాగాన్ని తింటూ క్రమంగా మధ్యలోకి రావా’లనే తత్వాన్ని బాగా ఒంటబట్టించుకున్నవాడు. పదహారేళ్ల ప్రాయంలో తండ్రినుంచి వారసత్వంగా చిన్న జాగీరు పొందాడు శివాజీ. అబ్బురపరిచే గెరిల్లా రణనీతిని అనుసరిస్తూ చిన్న చిన్న కోటల్ని జయించుకుంటూ వచ్చాడు. కొద్దిమంది నిప్పుకణికల్లాంటి యోధుల్ని వెంటబెట్టుకెళ్లడం, కోటను వశం చేసుకోవడం! అలా పూణె ప్రాంతం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు. అందుకే, ముందుముందు చరిత్రకారులు ఇలాంటి అభిప్రాయానికి రానున్నారు: మరాఠావీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. 1659లో బీజాపూర్ సుల్తాన్ తరఫున ఇరవై వేల సేనతో వచ్చిన అఫ్జల్ ఖాన్ను తెలివిగా తప్పుదోవ పట్టించాడు శివాజీ. బలహీనపడ్డట్టుగా నమ్మించి, ఏమరుపాటుగా ఉన్న శత్రువును అంతమొందించాడు. గుర్రాలనూ, ఆయుధ సంపత్తినీ స్వాధీనం చేసుకున్నాడు. దీంతో తన ఇరవై తొమ్మిదవ ఏట తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు శివాజీ. ఇదే ఔరంగజేబు అసహనానికి కారణం. అందుకే శివాజీని అణచడానికి 1665లో లెక్కకు మిక్కిలి సైన్యాన్ని పంపాడు. జైసింగ్ సారథ్యంలోని సుమారు లక్ష మంది ఔరంగజేబు సేన శివాజీని ఓడించగలిగింది; ఆగ్రాలోని రాజాస్థానానికి తీసుకెళ్లింది; మొఘల్ పాదుషా ముందు జీ హుజూర్ అనిపించడానికి. మనకంటే చిన్నవాణ్నయినా గౌరవించవచ్చుగానీ, మనకంటే మించిపోతాడని భయం ఉన్నప్పుడు గౌరవించడం కష్టం. అదే ఇక్కడ జరిగింది. అందుకే శివాజీకి దర్బారులో సముచిత స్థానం ఇవ్వకుండా మిగిలిన సేనానాయకులతో కలిపి నిలబెట్టించాడు ఔరంగజేబు. కోపంతో బుసకొట్టిన శివాజీని గృహనిర్బంధంలో ఉంచాడు. అయితే, శివాజీ మళ్లీ వ్యూహం పన్నాడు. జబ్బు పడ్డట్టుగా అందరినీ నమ్మింపజేశాడు. జబ్బు తగ్గడానికి అప్పటి సంప్రదాయాల ప్రకారం సాధువులకు పూలూ, పళ్లూ, ఫలహారాలూ పంచిపెట్టే మిషమీద కాపలదారుల కళ్లుగప్పాడు. పెద్ద పెద్ద బుట్టల్ని ఇద్దరు మనుషులు కావడిలాగా మోసుకుంటూ వెళ్లేవారు. వాటిల్లో కూర్చుని తప్పించుకున్నాడు. బయటికి వచ్చాక క్షవరం చేయించుకుని, తన పెద్ద మీసాలు, పొడవు వెంట్రుకలను తొలగించుకుని, బూడిద పూసుకున్న ఒక సాధువులాగా వందల కిలోమీటర్లు ప్రయాణించి తన రాజధాని రాయగడ్ చేరుకున్నాడు. ఇది కాదు విశేషం! బలం పుంజుకుని, మొఘలులకు కోల్పోయిన ప్రతి స్థావరాన్నీ తిరిగి గెలుచుకున్నాడు. వందల కోటలు నిర్మించాడు. శివాజీ దగ్గర నలభై వేల అశ్వికదళం ఉద్యోగులుగా ఉండేవారు. మరో డెబ్బై వేల అశ్వికులు యుద్ధాలప్పుడు కిరాయిదార్లుగా పనిచేసేవారు. పదాతిదళం రెండు లక్షలు! అంతేకాదు, రేవుల్ని అభివృద్ధి పరిచి, సైనిక శక్తికి వినియోగించుకున్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ’ అనిపించుకున్నాడు. 1674లో ‘ఛత్రపతి’ రాచమర్యాదతో తనను తాను సింహాసనం మీద అధికారికంగా ప్రతిష్టించుకుని, ఛత్రపతి శివాజీ మహరాజ్ అయ్యాడు. మహా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. పరమత సహనం చూపాడు. 1680లో 53 ఏళ్ల వయసులో శివాజీ అనారోగ్యంతో మరణించినా ఆయన వారసులు అదే స్ఫూర్తితో పాలించారు. దక్షిణాన హైదరాబాద్, మైసూర్, తూర్పున బెంగాల్ రాజ్యాలు మినహా ‘దాదాపుగా’ భారతదేశం మొత్తం మరాఠాల పాలనలోకి వచ్చింది. అందుకే శివాజీ కేంద్రబిందువుగా నడిచే మరాఠాల చరిత్ర లేనిదే భారతదేశ చరిత్ర సంపూర్ణం కాదు. (19 ఫిబ్రవరిని శివాజీ జయంతిగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది.)