
నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోందని బ్రిజేంద్రారెడ్డి మండిపడ్డారు.
ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైఎస్సార్ సీపీ మండిపడింది చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని, ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.
