
విశాఖపట్నం (లావేరు) : మండలంలోని అదపాక జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా అల్లిపురం ప్రాంతానికి చెందిన కె.వేణు(28), తిలోత్తమ డ్యాన్సర్లు. గత ఏడాది నవంబర్లో ప్రేమ వివాహం చేసుకొని రణస్థలం మండలం జేఆర్పురంలో నివాసముంటున్నారు.
సోమవారం రాత్రి నరసన్నపేటలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంకు వెళ్లేందుకు రణస్థలం నుంచి స్కూటీపై దంపతులు బయలుదేరారు. లావేరు మండలం అదపాక జంక్షన్కు వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టారు. వేణు రహదారిపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన తిలోత్తమను 108లో రిమ్స్కు తరలించారు. లావేరు పోలీస్ స్టేషన్ హెచ్సీ జి.రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.