
వనామీ.. కష్టాల సునామీ
సాక్షి, అమలాపురం: అంతర్జాతీయ మార్కెట్లో నిలకడ లేని ధరల వల్లనే కాదు.. అనధికార హేచరీల నుంచి వస్తున్న నాసిరకం రొయ్య పిల్లలు.. సిండికేటుగా మారిన మేత కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేయడం.. వెరసి వనామీ రైతులు నిలువునా మునుగుతున్నారు. ఆక్వా రైతులు ఎదురు దెబ్బలు తినడానికి ఈ సీడ్, ఫీడ్ కారణమవుతున్నాయి. వీటి వల్ల నష్టాలను మూటగట్టుకుంటున్న వనామీ రైతులు మరోసారి సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వరి, కొబ్బరి, అరటి, కూరగాయల పంటల తరువాత ఆక్వా సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. వనామీ రొయ్యల సాగుకు పెట్టుబడులు, లావాదేవీలు అధికం. ఈ రంగం దేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం తెచ్చిపెడుతోంది. అటువంటి వనామీ సాగు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ధరలు పెరగడంతో ఆక్వా సాగు ఆశాజనకంగా కనిపించింది. అంతలోనే ఎగుమతిదారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడం.. అమెరికా సుంకాల ప్రభావం.. ఎడాపెడా విద్యుత్ కోతలతో పెరిగిన పెట్టుబడులు.. ఇలా చెప్పుకొంటూపోతే వనామీ రైతుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. వీటన్నింటికన్నా రొయ్యల మేత (ఫీడ్) ధరలు, నాసిరకం రొయ్య పిల్లల (సీడ్) వల్ల వీరు అధికంగా నష్టపోతున్నారు.
వారిది దురాశ.. వీరికి నిరాశ
దేశంలోని 12 తీర ప్రాంతాల్లో 302 హేచరీరు, 21 బ్రూడ్ స్టాక్ హేచరీలు మాత్రమే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) రిజిస్ట్రేషన్ పొందాయని సమాచారం. చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, తుని, తొండంగి, తాళ్లరేవు మండలాల్లో 100కు పైగా హేచరీలను సీఏఏ అనుమతి లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం మండలాల్లో మరో 50కి పైగా ఉన్నాయి. వనామీ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన రొయ్య పిల్లలు కావాలి. కానీ, చాలా వరకూ నాసిరకం కావడంతో నెల రోజుల్లోపు విబ్రియో, ఈహెచ్పీ, వైట్ స్పాట్, వైట్ గట్, వైట్ ఫీకల్, రెడ్ డిసీజ్ వంటి వ్యాధులు ప్రబలి రొయ్య పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. ఈహెచ్పీ సోకిన రొయ్యల్లో 60 రోజులు గడిచినా పెద్దగా పెరుగుదల ఉండదు. ఒక రొయ్య 2 గ్రాములు, మరొకటి 5 గ్రాములు ఇలా వేర్వేరు బరువుతో ఉంటాయి. ఒకవైపు మంచి కౌంట్ రాకపోవడం, మరోవైపు మేత వృథా పోవడంతో రైతులు నష్టపోతున్నారు. చాలా వరకూ అనధికార హేచరీల్లో వ్యాధులున్న బ్రూడర్ (తల్లి) రొయ్యలను కొనుగోలు చేసి, వాటి పిల్లలను అమ్ముతున్నారు. ఆరోగ్యకరమైన బ్రూడర్ రొయ్యలున్నా వాటి నుంచి ఏడు దఫాలుగా మాత్రమే పిల్లలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ హేచరీల యజమానులు అత్యాశకు పోయి 12 నుంచి 15 దఫాలుగా రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల వాటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో, పెట్టుబడి పెరిగి, తగినంతగా లాభాలు రాక వనామీ రైతులు నిరాశ చెందుతున్నారు.
టన్నుకు రూ.25 వేలు పెంచి..
కరోనా సమయంలో టన్ను సోయాబీన్ ధర అంతర్జాతీయంగా రూ.90 వేలకు చేరింది. దీంతో, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులు రాత్రికి రాత్రే మేత ధరను టన్నుకు రూ.25 వేలకు పైగా పెంచారు. తరువాతి కాలంలో సోయాబీన్ ధర టన్ను రూ.25 వేలకు తగ్గింది. ప్రస్తుతం రూ.40 వేలుగా ఉంది. అయినప్పటికీ మేత కంపెనీలు ధరలు తగ్గించడం లేదు. మేతలో వాడే మినరల్స్, ఇతర పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం ఉండగా.. వాటిని కూడా ఎత్తేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టన్ను మేతను రూ.25 వేల నుంచి రూ.30 వేలు తగ్గించి విక్రయించాలి. కానీ, మేత ఉత్పత్తిదారులు దిగి రాబోమని అంటున్నారు. అధికార టీడీపీ అండదండలు పుష్కలంగా ఉన్న ఓ మేత కంపెనీ రాష్ట్రంలోని ఆక్వా పరిశ్రమపై పెత్తనం చెలాయిస్తూ ధరలు తగ్గించకుండా చేస్తోంది. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వనామీ రొయ్యల చెరువుల్లో వినియోగించే మందులపై కూడా 150 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని కూడా తగ్గించారు. అయినప్పటికీ వాటి ధరలను కూడా తగ్గించడం లేదు. రొయ్యల కౌంట్ ధరల నష్టాల కన్నా మేత, రొయ్య పిల్లలు, మందుల వల్ల అధికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాణ్యత లేని సీడ్తో నష్టం
నాసిరకం రొయ్య పిల్లల వల్ల రైతులు పలు రకాలుగా నష్టపోతున్నారు. అవి చాలా త్వరగా వ్యాధులు బారిన పడుతున్నాయి. చిన్న వయసులోనే చనిపోవడం వల్ల రైతులు కనీస పెట్టుబడులు కూడా పొందలేకపోతున్నారు. ఒకవేళ బతికినా రొయ్యల కౌంట్ల మధ్య వ్యత్యాసం అధికంగా వస్తోంది. దీనివల్ల మార్కెట్లో సరైన ధరలు పొందలేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి, మత్స్యశాఖ ద్వారా హేచరీలపై నిఘా పెట్టి, రైతులకు నాణ్యమైన రొయ్య పిల్లలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
– పి.రామ్మోహనరావు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్
ఫ ముంచేస్తున్న సీడ్.. ఫీడ్
ఫ శాపంగా మారిన ఫీడ్ ధరలు
ఫ గతంలో కేజీకి రూ.16 చొప్పున పెంపు
ఫ ఇప్పుడు రూ.4 తగ్గించి
రైతుకు మేలు చేశామంటూ గొప్పలు
ఫ హేచరీల్లో 80 శాతం నాసిరకం సీడ్
ఫ రొయ్యల పెరుగుదల లేక నష్టాలు

వనామీ.. కష్టాల సునామీ

వనామీ.. కష్టాల సునామీ

వనామీ.. కష్టాల సునామీ

వనామీ.. కష్టాల సునామీ