వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్‌! | Sakshi Editorial On TDP Chandrababu Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్‌!

Published Sun, Apr 6 2025 12:56 AM | Last Updated on Sun, Apr 6 2025 3:59 PM

Sakshi Editorial On TDP Chandrababu Govt By Vardhelli Murali

జనతంత్రం

‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్‌ సిక్స్‌’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్‌’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.

ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. 

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?

జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2021 జూలై – 2022 జూన్‌ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్‌ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్‌ సిక్స్‌’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్‌లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్‌’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. 

ఇక ‘సూపర్‌ సిక్స్‌’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్‌ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. 

కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్‌ సిక్స్‌’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.

ఐదేళ్ళ పదవీకాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్‌–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్‌ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 
 


జగన్‌ సర్కార్‌ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్‌ సర్కార్‌ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!

‘సూపర్‌ సిక్స్‌’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్‌’ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. 

చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్‌’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.

ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్‌’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. 

‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్‌.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.

2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్‌ 135 ప్రకారం కార్పొరేట్‌ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. 

ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. 

అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి.                                      

దిద్దుబాటా... ఇంకో పొరపాటా?
ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. 

అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.

ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్‌ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్‌’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్‌ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్‌ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. 

భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్‌ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.

పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్‌ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్‌’గా) పరిగణించేవారు. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ‘హైదరాబాద్‌ స్టేట్‌’ ఇండియన్‌ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్‌ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. 

ఇందుకోసం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.

హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. 

కాకపోతే భూముల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్‌సీయూకు చీఫ్‌ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.

కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. 

నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.

మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్‌ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!

రద్దును సవాల్‌ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్‌ ద్వారా కమ్యూ నికేట్‌ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్‌ కట్టించింది.

ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. 

ఈ భూముల్ని అకడమిక్‌ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్‌ హోల్డర్లు ఇంకెవరూ లేరా?

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. 

ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్‌ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్‌లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.

వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్‌ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,
ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 

400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్‌’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్‌ వర్సిటీకి ఫ్యూచర్‌ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. 

రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్‌ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. 

రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్‌ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్‌ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement