
ధర్మ సందేహం
వివిధ దేవాలయాలలో ద్వారతోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది.
పూర్వం ‘కీర్తిముఖుడ‘నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనాలలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో శివపత్ని జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా ధరించాడు.
ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను‘ అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగం నుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్త దేవాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు ‘అని వరమిచ్చాడు. ఆ నాటినుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అలంకరించి భక్తులలో ఉండే వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది.