రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్‌’కే ఇది సాధ్యం! | MI vs CSK: Rohit Sharma Scripts History Creates Incredible World Record | Sakshi
Sakshi News home page

Rohit Sharma: రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్‌’కే ఇది సాధ్యం!

Published Mon, Apr 21 2025 12:10 PM | Last Updated on Mon, Apr 21 2025 12:54 PM

MI vs CSK: Rohit Sharma Scripts History Creates Incredible World Record

Photo Courtesy: BCCI

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ దిగ్గజ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో సతమతమైన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (MI vs CSK)తో మ్యాచ్‌ సందర్భంగా ‘వింటేజ్‌ హిట్‌మ్యాన్‌’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

రోహిత్‌ ధనాధన్‌
చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్‌ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్‌ యాదవ్‌ (30 బంతుల్లో 68 నాటౌట్‌)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.

ఇక చెన్నైతో మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్‌’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్‌ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.

 

ఈ క్రమంలో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది.

ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్‌ క్రికెట్‌లో కలిపి) బాదిన క్రికెటర్లు
👉రోహిత్‌ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు
👉క్రిస్‌ గేల్‌- వెస్టిండీస్‌లో- 357 సిక్సర్లు
👉విరాట్‌ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు
👉మహేంద్ర సింగ్‌ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు
👉కీరన్‌ పొలార్డ్‌- వెస్టిండీస్‌లో- 276 సిక్సర్లు
👉సంజూ శాంసన్‌- ఇండియాలో- 274 సిక్సర్లు
👉నికోలస్‌ పూరన్‌- వెస్టిండీస్‌లో- 271 సిక్సర్లు.

ఇక ఓవరాల్‌గా రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో 264 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.

సీఎస్‌కే 176.. ఆలౌట్‌
ముంబై- చెన్నై మధ్య మ్యాచ్‌ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హార్దిక్‌ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.

అనంతరం కేవలం ఒక వికెట్‌ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్‌ కొట్టిన హార్దిక్‌ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌!.. వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement