
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో 76 రైళ్లు మళ్లింపు
చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు
120 రోజులపాటు కొనసాగనున్న ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 10వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ఫాం వరకు మూసివేశారు. అలాగే 5, 6వ నంబర్ ప్లాట్ఫామ్లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు. నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకొని ప్లాట్ఫామ్ల మూసివేత, రైళ్ల మళ్లింపు చర్యలు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 120 రోజులపాటు రైళ్ల రాకపోకలపైన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.
టెర్మినల్ మార్పు...
నాంపల్లి నుంచి చెన్నై సెంట్రల్కు నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ (12603/12604), సికింద్రాబాద్–గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12590/12589), షాలిమార్–హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (18045/18046) రైళ్లను చర్లపల్లి టెర్మినల్కు మార్చారు. సికింద్రాబాద్–కర్నూల్ సిటీ (17023/17024) కాచిగూడ నుంచి రాకపోకలు సాగించనుంది.
తాత్కాలికంగా మారిన స్టేషన్లు...
» విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనుంది. పోర్బందర్–సికింద్రాబాద్ (20968/20967) ఎక్స్ప్రెస్ను ఉందానగర్ నుంచి నడుపుతారు.
» అలాగే సిద్దిపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్కు బదులు మల్కాజిగిరి నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ (12026/12025) నాంపల్లి నుంచి పుణేకు రాకపోకలు సాగించనుంది.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే...
» సికింద్రాబాద్–మణుగూర్ (12745/12746), సికింద్రాబాద్–రేపల్లె (17646/17645), సిలిచర్–సికింద్రాబాద్ (12513/12514), సికింద్రాబాద్–దర్భంగా (17007/17008), సికింద్రాబాద్–యశ్వంత్పూర్ (12735/12736), సికింద్రాబాద్–అగర్తల (07030/07029), సికింద్రాబాద్–ముజఫర్పూర్ (05294/05293), సికింద్రాబాద్–దానాపూర్ (07647/07648), సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07221/07222), హైదరాబాద్–రక్సాల్ (07051/07052) ఎక్స్ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనుల దృష్ట్యా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తాయి.
» అలాగే సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్, గుంటూర్–సికింద్రాబాద్ రైళ్లకు చర్లపల్లి టెరి్మనల్లో అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
చర్లపల్లి నుంచి మళ్లింపు...
వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిచే 32 రైళ్లను చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్కు రాకుండా లింగంపల్లి నుంచి సనత్నగర్, మౌలాలి రూట్లో చర్లపల్లికి చేరుకుంటాయి. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్, కాజీపేట్–హడాప్సర్, లింగంపల్లి–విశాఖపట్టణం, సంబాల్పూర్–నాందేడ్, విశాఖపట్టణం–నాందేడ్, విశాఖపట్టణం–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–నాగర్సోల్, నర్సాపూర్–నాగర్సోల్, వాస్కోడిగామ –జాసిఢ్, మచిలీపట్నం–సాయినగర్ షిరిడీ, కాకినాడ–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–ఎల్టీటీ ముంబై, పూర్ణ–తిరుపతి, నాందేడ్–ఈరోడ్, కాకినాడ– లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
చర్లపల్లికి కనెక్టివిటీ కటకట...
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 60కి పైగా రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఒకే ఒక్క ఎంఎంటీఎస్ రైలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొ ప్పున నడుస్తున్నాయి. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు సిటీబస్సులు కూడా పరిమితంగానే ఉన్నాయి. పైగా రాత్రిపూట బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించిన రైళ్లు 30
శాశ్వతంగా చర్లపల్లి టెర్మినల్కు మారినవి 8
చర్లపల్లిలో అదనపుహాల్టింగ్ కల్పించిన రైళ్లు 6
సికింద్రాబాద్కు బదులు చర్లపల్లి మీదుగా నడిచే దూరప్రాంత రైళ్లు 32