
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్న విషయం తెలిసిందే. స్వయంగా బస్సుల్లో ప్రయాణిస్తూ ఆర్టీసీ పనితీరును పరిశీస్తున్నారు. అదేవిధంగా వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళ్లుతూ.. ప్రయాణీకుల సమస్యలపై స్పందిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి టీఎస్ఆర్టీసీకి ఓ యువతి ట్వీట్ చేయగా ఎండీ వీసీ సజ్జనార్ వెంటనే స్పందించారు.
అర్ధరాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్ వద్ద 10 నిమిషాలు ఆపాలని పాలే నిషా అనే ఓ యువతి ట్విటర్లో కోరింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసింది.
అర్ధరాత్రి చేసిన ఆమె ట్వీట్కి ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించి.. ఈ విషయంపై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్యపై వీసీ సజ్జనార్ స్పందించడంతో సదరు యువతి పాలే నిషా ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
@tsrtcmdoffice మహిళలు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు @tsrtc యాజమాన్యం. స్త్రీ లఅవసరాల నిమిత్తం పెట్రోల్ బంక్స్ లల్లో ఒక పది నిమిషాలు ఆపితే మహిళలకు ఎంతో. సౌకర్యవంతంగా ఉంటుంది ( అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి )ఈ నిర్ణయం వల్ల గౌర్నమెంట్ కి కూడా ఎటువంటి భారం ఉండదు🙏🙏🙏
— Pale Nisha (@NishaPale) January 11, 2022