Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Andhra Pradesh Rajya Sabha name Confirmed1
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్‌ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్‌గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన.

Sakshi Editorial On Pakistan and India Issues about Terror attack2
పాక్‌ పాచికల్ని పారనీయొద్దు!

పహల్గామ్‌లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్‌ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్‌ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ (టీఆర్‌ఎఫ్‌) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్‌ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) పేరు ప్రస్తావించింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్‌ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్‌ఎఫ్‌ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్‌ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్‌ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్‌ కీ బాత్‌’లో కావొచ్చు, పహల్గామ్‌ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్‌ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. ఉగ్ర సంస్థ టీఆర్‌ఎఫ్‌తో పాక్‌ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్‌ఎఫ్‌ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్‌ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్‌ఎఫ్‌ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్‌ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్‌ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్‌ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.పాకిస్తాన్‌ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్‌ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్‌ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్‌ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్‌ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్‌ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి. దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి.

Sakshi Guest Column On Should we oppose if we disagree3
విభేదిస్తే వ్యతిరేకించాలా?

‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్‌ జాన్‌ డల్బర్గ్‌ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్‌ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.తటస్థత చూపనక్కర్లేదా?అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్‌ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్‌సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు. తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్‌ ఖడ్‌కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్‌ ఖడ్‌ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్‌ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది. గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్‌ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్‌ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం. నైతికత సారథులుగా వ్యవహరించాలి!రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్‌ఖడ్‌ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు. చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్‌ ఆఫ్‌ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు. అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం. దేశంలో ‘సివిల్‌ వార్‌’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్‌ టేలర్‌ కొలరిజ్‌ రాసిన ‘ద స్టేట్స్‌మన్స్‌ మాన్యువల్‌’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి. తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్‌ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.అభయ్‌ మోకాశీవ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్‌

Mega Power Outage Hits Spain, France, Portugal4
స్తంభించిన విద్యుత్‌.. మూడు దేశాలు అతలాకుతలం

మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Vaibhav Suryavanshi becomes youngest to score an IPL Century5
IPL 2025: చ‌రిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

ఐపీఎల్‌-2025లో జైపూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 210 భారీ లక్ష్య చేధనలో 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు.మహ్మద్ సిరాజ్‌, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఊతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో వైభవ్‌ కేవలం 35 బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. సూర్యవంశీ ఔటై పెవిలియన్‌కు వెళ్తుండగా స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇక మెరుపు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సూర్య‌వంశీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010 సీజన్‌లో ముంబై పై రాజస్తాన్ తరపున యూసఫ్ 37 బంతుల్లో శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉ఓవ‌రాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా వైభ‌వ్ నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన జాబితాలో క్రిస్ గేల్‌(30 బంతులు) ఉన్నాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్‌లో సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌ష్కుడిగా వైభ‌వ్ రికార్డులెక్కాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ 14 ఏళ్ల 32 రోజుల వ‌య‌స్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మ‌హారాష్ట్ర ప్లేయ‌ర్ విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌తో జోల్‌ను వైభ‌వ్ అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో హాఫ్ సెంచ‌రీ, సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌ష్కుడు కూడా వైభ‌వే కావ‌డం విశేషం.టీ20ల్లో సెంచ‌రీ చేసిన పిన్న వ‌య‌ష్కులు వీరే..వైభవ్ సూర్యవంశీ(14 సంవత్సరాల 32 రోజులు)విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు)పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (18 సంవత్సరాలు 179 రోజులు)గుస్తావ్ మెక్‌కీన్(18 సంవత్సరాల 280 రోజులు ) Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅Fastest TATA IPL hundred by an Indian ✅Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6— IndianPremierLeague (@IPL) April 28, 2025

Asaduddin Owaisi Strong Counter To Bilawal Bhutto Pak Leaders6
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?

న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్‌ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్‌. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్‌ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ‌ మొత్తం బడ్జెట్‌.. మా దేశ రక్షణ బడ్జెట్‌ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్‌ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్‌ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్‌ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్‌ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్‌ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్‌ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.

KSR Comments On Chandrababu And Yellow Media7
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?

‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్‌ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్‌ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్య​​​ం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్‌ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్‌ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్‌, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్‌సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్‌ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్‌ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Bill Gates Explains Why He Did Not Fund Daughter Phoebes8
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం

తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్‌ ప్లాట్‌ఫామ్‌. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్‌ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్‌ అందించడంతో పాటు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్.

Samantha Temple And Special Pooja On Her Birthday Latest9
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం

దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)

Peddapalli Agriculture Market Incident Viral Details10
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం

సాక్షి, క్రైమ్‌: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్‌) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్‌ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement