Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tender Cancel For Option Not Given CM relative In AP2
బాబు మార్క్‌ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్‌ రద్దు

సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్‌ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్‌ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్‌ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్‌ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్‌ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుట్ర బట్టబయలుడీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్‌ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్‌ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్‌ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్‌ లిస్ట్‌ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్‌ కంట్రోల్‌ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్‌ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్‌ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్‌ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది.

India Effect Pakistan takes Emergency steps for pharma supplies3
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీ!

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్‌ ఆవేశంతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్‌కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్‌ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్‌ నుంచి పాకిస్థాన్‌.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్‌ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్‌ఏపీ) శనివారం వెల్లడించింది.అనంతరం, డీఆర్‌ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్‌ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్‌ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్‌లో బ్లాక్‌ మార్కెట్‌ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత ఫార్మానే పాక్‌కు కీలకం..ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్‌పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్‌లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్‌ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.🚨 Crisis Brews in Pakistan's HealthcareAfter suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025భారత్‌తో పెట్టుకుంటే పాతళానికి పాక్‌..ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్‌ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్‌.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ‍ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్‌ ఒకటిగా మారింది. కోవిడ్‌ మహమ్మారితో కుదేలైన పాక్‌ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్‌ ప్రణాళిక శాఖ మంత్రి అహ్‌సాన్‌ ఇక్బాల్‌ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల పాక్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీస్తుంది.

Kesineni Nani Fires On Kesineni Chinni 4
బాబు ‘ఛార్లెస్‌ శోభరాజ్‌’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో తనని అరెస్ట్‌ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్‌ శోభరాజ్‌’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్‌ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025

IPL 2025, MI VS LSG: Rohit Sharma Needs 5 More Sixes To Become First Indian To Complete 300 Sixes In IPL5
IPL 2025: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించే​ందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్‌ గేల్‌ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్‌ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్‌, రోహిత్‌ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 బ్యాటర్లుక్రిస్‌ గేల్‌- 357రోహిత్‌ శర్మ- 295విరాట్‌ కోహ్లి- 285ఎంఎస్‌ ధోని- 260ఏబీ డివిలియర్స్‌- 251ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ పేరిటే ఉంది. గేల్‌ ఈ ఫార్మాట్‌లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్‌ మినహా ఏ క్రికెటర్‌ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్‌ తర్వాత కీరన్‌ పోలార్డ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్‌లో 908 సిక్సర్లు బాదాడు. గేల్‌, పోలీ తర్వాత రసెల్‌ (737), పూరన్‌ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-4 బ్యాటర్లు విండీస్‌ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ ఏడో స్థానంలో, విరాట్‌ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్‌ తన టీ20 కెరీర్‌లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్‌ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-10 ఆటగాళ్లుక్రిస్‌ గేల్‌- 1056కీరన్‌ పోలార్డ్‌- 908ఆండ్రీ రసెల్‌- 737నికోలస్‌ పూరన్‌- 630కొలిన్‌ మున్రో- 557అలెక్స్‌ హేల్స్‌- 552రోహిత్‌ శర్మ- 540గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 530జోస్‌ బట్లర్‌- 528డేవిడ్‌ మిల్లర్‌- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో నేటి మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్‌లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్‌ (11) టాప్‌-4లో ఉన్నాయి.

Sakshi Editorial On Pahalgam Terror Attack6
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Tollywood Hero Vijay Devarakonda strong Comments On Pahalgam Incident7
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్‌లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్‌ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్‌ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్‌ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్‌ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది.

Massive Fire Accident At Ed Office Building In South Mumbai8
ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్‌ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్‌లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. #WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8— ANI (@ANI) April 27, 2025పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని కైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందింది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్‌ అధికారి తెలిపారు. ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్‌ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Interesting facts about Elon Musk9
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్‌.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!

ఎలాన్‌ మస్క్‌ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్‌. ఆయన కెమికల్‌ ఇంజినీర్‌. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్‌. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్‌ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్‌ ఫిక్షన్‌ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్‌’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్‌. ప్రాణాంతక హైడ్రోజన్‌ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్‌ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్‌’.ఫీజు కోసం క్లీనింగ్‌ పనికాలేజ్‌లో ఎలాన్‌ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్‌. స్టాన్‌ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్‌ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్‌ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్‌ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్‌.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్‌ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్‌2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్‌లైన్‌ సిటీ గైడ్‌ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్‌2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్‌ కంపెనీ జిప్‌2ను 307 మిలియన్‌ డాలర్‌లకు కొనేసింది. ఎలాన్‌ తన ఇంకో కంపెనీ ఎక్స్‌.కామ్‌ను 2000లో కాన్‌ఫినిటీ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్‌’ అనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్‌ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్‌ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్‌ఎక్స్‌ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్‌ ఏఐ, ‘ది బోరింగ్‌ కంపెనీ’, ఎక్స్‌ కార్పొరేషన్, ‘థడ్‌’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్‌ నెలకొల్పినవే.ఐరన్‌ మ్యాన్‌ 2లో చిన్న పాత్రఎలాన్‌ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్‌ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్‌ డాలర్లు. ఇంకో 567 బిలియన్‌ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ అవుతారు ఎలాన్‌. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో ‘టోనీ స్టార్క్‌’ పాత్రకు ఎలాన్‌ మస్క్‌ ఇన్‌స్పిరేషన్‌! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్‌ మ్యాన్‌ 2’ లో మస్క్‌ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్‌ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్‌ హ్యూమర్‌ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్‌డౌన్‌’’ అని లాక్‌ డౌన్‌ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్‌.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్‌ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్‌ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్‌ మస్క్‌. వెళ్లిపో’’ అని ట్వీట్‌ చేశారు. అందుకు మస్క్‌ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్‌ రిసీవ్డ్‌’ అని రిప్లయ్‌ ట్వీట్‌ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

450 Indians Leave From Pakistan10
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?

లాహోర్‌: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్‌ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు. శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్‌ఎల్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్‌ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్‌కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్‌ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్‌ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్‌..!భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్‌ సింగ్‌ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్‌ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్‌ సింగ్‌ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్‌ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్‌ సింగ్‌ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్‌ పోస్ట్‌ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్‌ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్‌పుట్‌ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement