Top Stories
ప్రధాన వార్తలు

రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్ఆర్ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ (డెబిట్ సర్వీస్ రిజర్వ్ ఎకౌంట్) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్ఎస్ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్ లోపల.. బడ్జెట్ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్ ఇచ్చింది. అంటే.. డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ), వేజ్ అండ్ మీన్స్ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్ అధికారి అయిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్ కమిషనర్ ప్రవీణ్కుమార్ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్ కుమార్ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించి మరీ పొలిటికల్ బాస్ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా, దట్ ఈజ్ భారత్!
ఎట్టకేలకు పాకిస్తాన్ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్ మునీర్ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్గామ్ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్ ప్రస్థానానికి భిన్నంగా భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్ భారత్’ అనే అంబేడ్కర్ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్.వి. కామత్ ఒక్కరే తొలుత ‘హింద్’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్ సైన్యాలు కశ్మీర్ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్ హుస్సేన్ సజీవ కశ్మీరియత్కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్ ఆర్మీ చీఫ్. సిసలైన పాక్ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్లోని లద్దాఖ్, పాక్ ఆక్రమిత గిల్గిట్లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్ భూభాగం, పాక్ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్ నది, గిల్గిట్ నది, హూంజా నది, స్వాట్ నది ముఖ్యమైనవి. కానీ భారత్ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్ నదీ జలాలపై మాత్రమే భారత్కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్), 6 శతుద్రి (సట్లెజ్), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

రజతోత్సవ రణన్నినాదం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా.. 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే విలన్గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. 2024 మార్చి 31న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. విద్యుత్ వెలుగుల్లో సభా ప్రాంగణం అట్టహాసంగా ఏర్పాట్లు రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికపై 500 మంది.. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.సభ ఏర్పాట్లు ఇలా⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు ⇒ బీఆర్ఎస్ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు ⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు ⇒ ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి ⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు. ⇒ వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు ⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు ⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు ⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్లు ⇒ మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ⇒ ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.వృషభం...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.మిథునం....ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. . దేవీఖడ్గమాల పఠించండి.కర్కాటకం...పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.సింహం..కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్య....వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.తుల.....ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. . సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దత్తాత్రేయుని ఆరాధించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. . దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.మీనం...ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి.

భారత్, పాక్లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్లో పోస్ట్ చేశారు.

కిడ్ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
యూ ట్యూబ్లో కిడ్ఫ్లూయెన్సర్ల వైరల్ వీడియోలు ప్రవాహంలా కనిపిస్తాయి. క్యాచీ కంటెంట్తో లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన దేశంలో క్లిడ్ఫ్లూయెన్సర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెర వెనుక కథ గురించి చర్చ మొదలైంది. షూటింగ్ల కోసం వారు తరచుగా స్కూల్కు వెళ్లకుండా ఎక్కువ సెలవులు పెడుతున్నారా? సరిగా తింటున్నారా? తగినంత నిద్ర ఉంటోందా? కంటెంట్కు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారా? అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా... ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి.బాగా చదివే పిల్లలు కూడా ‘కిడ్ఫ్లూయెన్సర్’ ట్యాగ్లైన్ పుణ్యమా అని చదువులో వెనకబడి పోతున్నారు. ‘నేను చాలా సాధించాను. నేను చాలా గ్రేట్’ అనే భావన పెరిగిపోతుంది. ‘యాభై ఏళ్ల క్రితం అకాడమిక్ ఎక్స్లెన్స్ గోల్డ్ స్టాండర్డ్, ముప్పై ఏళ్ల క్రితం ఆటలు ఉండేవి. ఇప్పుడు క్రియేటివిటీ, డ్యాన్స్, మ్యూజిక్, విజువల్ కంటెంట్. ఒక్క వైరల్ వీడియో చాలు పిల్లలకు రాత్రికి రాత్రి స్టార్డమ్ తీసుకురావడానికి. ఈ తక్షణ పాపులారిటీ వల్లే పిల్లలు, తల్లిదండ్రులు వైరల్ కంటెంట్పై దృష్టి పెడుతున్నారు’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.మేఘా పుష్కర్ణ.

పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
టీఆర్ఎస్ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్ ఛాన్స్లర్లు నవనీత రావు, ఆర్వీయార్ చంద్రశేఖర్ రావు, జయశంకర్, జస్టిస్ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్ కెప్టెన్ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్ ఫైట్– స్ట్రీట్ ఫైట్ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్ఎస్ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా)

Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్

ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు.

‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్ను పూర్తిగా ఆడిన ప్రభ్సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్రైజర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
తవ్వకం ఆరంభం
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’
కిడ్ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
డీఎస్సీ వెబ్సైట్లో మార్పులు
నిరీక్షణ ఫలించింది...
కశ్మీరుకు కాదు కోనసీమకు..
సోలార్ సఖి
కాలుష్యకాసారంగా కృష్ణా నది
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
ఈ రాశి వారికి పట్టుదల పెరుగుతుంది.. అనుకున్నది సాధిస్తారు
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
...కన్నబిడ్డలా పోషించి ఎంతో పెద్ద చేశాం!
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ఇండియా, దట్ ఈజ్ భారత్!
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
ప్రాణాలు కాపాడిన ఉప్పు
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ఇంట్లో పాముల కలకలం
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
మళ్లీ ఉగ్ర కాండ!
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ముష్కరుల వేటలో భారత్కు సహకరిస్తాం
బంగారం తగ్గింది కానీ...
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
భారత్, పాక్లది వెయ్యేళ్ల పోరు!
ఒకేచోట 15 లక్షల కార్లు: ఇండియాలో సౌత్ కొరియా బ్రాండ్ హవా
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
‘ప్రైవేట్’కు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదు
విశాఖలో దంపతుల దారుణహత్య
ఒకే ఇల్లు.. ఒకే వంట
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
టాపర్ కాస్త హంతకుడిగా..
బర్త్డే రెండు రోజులనగా ఇన్ఫ్లూయెన్సర్,హెయిర్ బ్రాండ్ సీఈవో ఆత్మహత్య
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
ఈసారి వేలం వేస్ట్.. ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్?
సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
హైదరాబాద్లో హై అలర్ట్
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
బయోమెట్రిక్స్, చిరునామా
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
ప్రతీకార పోరు
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
తవ్వకం ఆరంభం
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’
కిడ్ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
డీఎస్సీ వెబ్సైట్లో మార్పులు
నిరీక్షణ ఫలించింది...
కశ్మీరుకు కాదు కోనసీమకు..
సోలార్ సఖి
కాలుష్యకాసారంగా కృష్ణా నది
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
ఈ రాశి వారికి పట్టుదల పెరుగుతుంది.. అనుకున్నది సాధిస్తారు
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
...కన్నబిడ్డలా పోషించి ఎంతో పెద్ద చేశాం!
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ఇండియా, దట్ ఈజ్ భారత్!
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
ప్రాణాలు కాపాడిన ఉప్పు
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ఇంట్లో పాముల కలకలం
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
మళ్లీ ఉగ్ర కాండ!
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ముష్కరుల వేటలో భారత్కు సహకరిస్తాం
బంగారం తగ్గింది కానీ...
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
భారత్, పాక్లది వెయ్యేళ్ల పోరు!
ఒకేచోట 15 లక్షల కార్లు: ఇండియాలో సౌత్ కొరియా బ్రాండ్ హవా
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
‘ప్రైవేట్’కు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదు
విశాఖలో దంపతుల దారుణహత్య
ఒకే ఇల్లు.. ఒకే వంట
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
టాపర్ కాస్త హంతకుడిగా..
బర్త్డే రెండు రోజులనగా ఇన్ఫ్లూయెన్సర్,హెయిర్ బ్రాండ్ సీఈవో ఆత్మహత్య
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
ఈసారి వేలం వేస్ట్.. ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్?
సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
హైదరాబాద్లో హై అలర్ట్
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
బయోమెట్రిక్స్, చిరునామా
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
ప్రతీకార పోరు
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
సినిమా

హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్ సిమ్రాన్ (Simran). ఈమె ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్ ఇచ్చింది.లైలా? జ్యోతిక? ఎవరన్నారు?లైలా గురించే సిమ్రాన్ ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్ సిరీస్లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. ఆంటీ అనే పదం ఇష్టంఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్ కాలేరని రుజువైంది. ఫ్రెండ్ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్ వెల్లడించలేదు.చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు

స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ అనసూయస్టైల్ మార్చి సరికొత్తగా తయారైన బేబి వైష్ణవి చైతన్యచీరలో నడుము అందాలు చూపించేస్తున్న శ్రీముఖిపొట్టి డ్రస్సులో రచ్చ లేపుతున్న దిశా పటానీబ్లూ కలర్ డ్రస్సులో హీరోయిన్ సమంత క్లాస్ లుక్రోజురోజుకీ హాట్ నెస్ పెంచేస్తున్న ఈషా రెబ్బాబీచ్ ఒడ్డున హాట్ హాట్ లుక్ లో సుప్రీత View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
మే 9న అనగానే తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన రోజు అని అంటారు. ఎందుకంటే అదే రోజున రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిరు చిత్రాలు ఆ రోజున రిలీజైనవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే తేదీన మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్ ఉండబోతున్నాయి.మొదటి దాని విషయానికొస్తే రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడి మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9నే ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని పెట్టగా.. ఇప్పుడు చరణ్ ఆ లిస్టులోకి చేరబోతున్నాడు.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) మరోవైపు చిరు కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. దీన్ని మే 9న రీ రిలీజ్ చేయబోతున్నారు. 2డీ, 3డీ వెర్షన్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో మే 9నే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇలా ఒకేరోజున మెగా అభిమానులకు రెండు ట్రీట్స్ రాబోతున్నాయనమాట. లెక్క ప్రకారం మరొకటి కూడా ఉండాలి. అదే 'హరిహర వీరమల్లు'. పవన్ కల్యాణ్ నటించిన ఈ లేటెస్ట్ చిత్రాన్ని మే 9నే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈసారి కూడా వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి)

తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్ పూరే (ఏప్రిల్ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.విడాకులకు కారణం..ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.ఎంతో ప్రయత్నించా..మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదువిడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్ అయ్యాక కూడా నేను అతడితో టచ్లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్లో ఉన్న పీయూశ్ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.సీరియల్స్తో ఫేమస్శుభంగి ఆత్రే- పీయూశ్ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్ పర్ హైర్, హవన్ వంటి పలు సీరియల్స్ చేసింది. చదవండి: పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్ను పూర్తిగా ఆడిన ప్రభ్సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్రైజర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. గత మ్యాచ్కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్మెంట్ తిరిగి తుది జట్టులో చోటు ఇచ్చింది.మార్కస్ స్టోయినిష్ స్ధానంలో జట్టులోకి వచ్చిన మాక్స్వెల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్సీ పెవిలియన్కు చేరాడు. వరుణ్ అద్బుతమైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్..87.50 స్ట్రైక్ రేటుతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్.. 8.00 సగటుతో కేవలం 48 పరుగులు చేశాడు. దీంతో మాక్స్వెల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్లేయర్ అంటూ ఎక్స్లో ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్

ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి దూసుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కారణంగా వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించడంతో ఆర్సీబీతో మ్యాచ్లో డుప్లెసిస్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్గర్క్ ధ్రువీకరించాడు. ఆర్సీబీతో మ్యాచ్కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండనున్నాడు. నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని మెక్గర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్లో డుప్లెసిస్ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతడు తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్పై వేటు పడే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్

కోబీ బ్రయాంట్ జెర్సీకి రూ. 59 కోట్లు
న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్ ఎన్బీఏ అరంగేట్ర మ్యాచ్లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తొలి పోరులో బ్రయాంట్ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.ఎన్బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్బీఏలో భాగంగా బ్రయాంట్ 1996–97 సీజన్లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన కోబీ 8వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్ సంస్థ వెల్లడించింది. ఓవరాల్గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్ రూత్ జెర్సీ (24 మిలియన్ డాలర్లు), మైకేల్ జోర్డాన్ ఎన్బీఏ జెర్సీ (10.1 మిలియన్ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బిజినెస్

మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి.. వారి పిల్లల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే వారి కోడళ్ళు కూడా వ్యాపార సామ్రాజ్యంలో తమదైన గుర్తింపు తెచుకున్నవారే.. అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ అధినేతల కోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.శ్లోకా మెహతాముఖేష్ & నీతా అంబానీల పెద్ద కోడలు, ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. 2014 నుంచి తన కుటుంబ వ్యాపారమైన రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. శ్లోకా రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా. ఈమె నికర విలువ రూ.130 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.రాధిక మర్చంట్ముఖేష్, నీతా అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య 'రాధిక మర్చంట్' ఎన్కోర్ హెల్త్కేర్లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతే కాకుండా ఈమె ఎన్కోర్ హెల్త్కేర్కు సీఈఓ & వైస్-చైర్మన్ కూడా. ఈమె నికర విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..పరిధి ష్రాఫ్గౌతమ్ అదానీ కోడలు, కరణ్ అదానీ భార్య 'పరిధి ష్రాఫ్'.. వృత్తిరీత్యా న్యాయవాది. ఈమె న్యాయ దిగ్గజం సిరిల్ ష్రాఫ్ కుమార్తె. పరిధి ష్రాఫ్ భారతదేశంలోని అత్యంత చురుకైన చట్టపరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఒకరు. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్లో భాగస్వామిగా ఉన్న ఈమె ఎస్సార్-రోస్నెఫ్ట్ వంటి బిలియన్ డాలర్ల ఒప్పందాలపై పనిచేశారు.దివా జైమిన్ షాఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ చిన్న కొడుకును వివాహం చేసుకున్న 'దివా జైమిన్ షా'.. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె చార్టర్డ్ ఫైనాన్స్ అనలిస్ట్.. గతంలో డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా పనిచేశారని సమాచారం. ఈమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె మరియు ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ సి. దినేష్ అండ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని.

ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంటే.. మన దేశం మాత్రం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది. దేశీయ స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశాభివృద్ధిపై దేశీయ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, సులభతర పెట్టుబడి విధానం వంటి రకరకాల కారణాలతో విదేశీ పెట్టుబడిదారుల వాటా గతేడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 2 శాతం నుంచి ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగిందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోవిదేశీ పెట్టుబడుల వెల్లువ..దేశంలోకి 2024 క్యూ1లో 552.1 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో విదేశీ పెట్టుబడులు కేవలం 4 శాతమే. అంటే 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదే 2025 క్యూ1 నాటికి మొత్తం 813.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో విదేశీ పెట్టుబడుల వాటా ఏకంగా 43 శాతం. 346.9 మిలియన్ డాలర్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నివాసంలోకే అత్యధికం.. నివాస విభాగంలో పెట్టుబడులకే విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రంగంలోకి 506 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో రెసిడెన్షియల్ సెక్టార్ వాటా 62 శాతం. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. విలువల పరంగా చూస్తే.. పెట్టుబడులు వార్షికంగా 125 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆ తర్వాత వాణిజ్య విభాగంలోకి 307.2 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.ఇదీ చదవండి: పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!ఈ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 38 శాతం. అయితే ఈ క్యూ1లో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగం, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విభాగంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి.

పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ

అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం తన కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్గా చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ'ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.అనంత్ అంబానీ.. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన అనంత్ అంబానీ.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్గా ఉండనున్నారు. ఇప్పటికే అనంత్ పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనంత్ వేతనం.. ఏడాదికి రూ.4.2 కోట్లు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్గా నియామకమవ్వడంతో ఆయన వేతనం అంతే ఉంటుందా? పెరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అనంత్ అంబానీ, జంతు సంక్షేమం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం.. వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆకాష్ అంబానీ గ్రూప్ టెలికాం అండ్ డిజిటల్ సేవల విభాగం అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్గా కూడా ఉన్నారు. ఇషా అంబానీ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతే కాకుండా ఆకాశ్, ఇషా అంబానీలు కూడా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు.
ఫ్యామిలీ

సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
మనుషుల్లో ఎవరినైనా మీ వయసెంతా అని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే మనుషులు మాట్లాడ గలరు. కాని సింహాలకి వయసునెలా లెక్కపెడతారు? వాటికి మనలాగా మాటలూ రావు... బర్త్ సర్టిఫికేట్లు కూడా ఉండవు. మరి సినిమాల్లో, జియోగ్రఫీ ఛానళ్లలో ఎనిమిదేళ్ళ మగ సింహం... ఆరేళ్ళ ఆడ సింహం...అని అంత నిక్కచ్చిగా ఎలా చెబుతారు. ఎలాగంటే సింహాల వయస్సును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పలు శారీరక లక్షణాలను పరిశీలిస్తారు. ఇవి సింహం వయస్సును నిర్ధారించడంలో సహాయపడతాయి. వాటిలో ప్రధానమైనది దాని ముక్కు రంగు. సింహపు ముక్కు రంగు వయస్సుతోపాటు మారుతుంది. చిన్నపిల్లలకు గులాబీ ముక్కు ఉంటుంది. మూడేళ్ల వయస్సు నుంచి ముక్కుపై చిన్న నలుపు మచ్చలు కనిపించటం ప్రారంభమవుతాయి. ఈ మచ్చలు వృద్ధి చెందుతూ సింహానికి ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేనాటికి ముక్కు పూర్తిగా నలుపు రంగులోకి మారుతుంది. అంతే కాకుండా సింహాల దంతాల రంగు, ముఖంపై ముడతలు, శరీర ఆకృతి, ఇతర లక్షణాలను పరిగణలోకి తీసుకుని వయసును లెక్కిస్తారు. బోనస్గా ఇంకో విషయం... సింహాల జీవితకాలం అడవులలో 8-12 సంవత్సరాలు, జూలో 18-25 సంవత్సరాలు. ఇప్పటివరకు అత్యధికంగా 25 సంవత్సరాలు బ్రతికిన సింహం పేరు ’జెండా’. వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు...‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు’ అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పూర్వకాలం పుణ్యం కోసం దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న తీర్థక్షేత్రాలను అన్వేషించి అక్కడికి వెళ్లి తీర్థస్నానం చేసి వస్తూ ఉండేవారు. అలాంటి రోజులలో ఆవిర్భవించిన జాతీయం ఇది. ఓ వ్యక్తి ఒక తీర్థక్షేత్ర మహిమను గురించి విన్నాడట. ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నంత లోనే తన ఎదురుగా ఉన్నది తాను విన్న తీర్థమేనని తెలుసుకొని ఎంతో ఆనందించాడట. ఏ మాత్రం కష్టపడకుండా ఇలా తమకు కావల్సినవి తమ సమీపంలోనే ఉన్నాయని తెలుసుకొన్నప్పుడు లేదా తాము వెతుకున్నవారు తమకు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. వెతకపోయిన తీర్థం ఎదురైనట్టు నీకోసం బయలు దేరుతుంటే నీవే ఎదురొచ్చావు సంతోషం’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.గుండె ఆరోగ్యం: ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ అవుతుందని అన్నారు. గట్హెల్త్: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)

కంటికి ఆహారం... వ్యాయామం
మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు ఈ కంటి వ్యాయామాలు చెయ్యడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ఎప్పుడు.. ఎక్కడ... ఎలా వీలయితే అలా సులువుగా చేసుకోవచ్చు. ఏం లేదు... పైకి, కిందికీ, పక్కలకూ కళ్ళను కదుపుతూ కొంతసేపు కంటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. అలాగే కంటికి మంచి చేసే ఆహారం కూడా ఉంది. ఆకుకూరల్లో కరివేపాకు, పొన్నగంటి, మెంతికూర, తోటకూర కంటిచూపును కాపాడుకోవడానికి దోహదం చే స్తాయి. పండ్లలో బొప్పాయి, మామిడి, ఉసిరి మంచిది. అలాగే క్యారట్, కోడిగుడ్డు,పాలు కంటికి మేలు చేస్తాయి. 20–20–20ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారికి కళ్లు బాగా అలసటకు గురవుతాయి. అలాంటివారు ఈ 20–20–20 రూల్ ని ΄ాటించాలి. అది వెరీ సింపుల్. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుని కంప్యూటర్ని కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్లపాటు చూడండి. ఇదే 20–20–20 రూల్. అలాగే కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కళ్ళు దెబ్బతినకుండా ఉండడం కోసం యాంటీ గ్లేర్ గ్లాసెస్ను ఉపయోగించండి.ఇంతవరకూ ఏ సమస్యలూ లేక΄ోతే ఏడాదికి కనీసం ఒక్కసారైనా కంటిపరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే కళ్లజోడు వాడుతున్నవారయితే ఏడాదికి రెండుసార్లు విధిగా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మంచి ఆహారం తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు ఉన్నవారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఏ వ్యాధీ లేనివారు భవిష్యత్తులో కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

పారేయకండి.. పదును పెట్టండి..!
ఒకసారి వాడి పడేసే కార్టర్లను ఆహ్లాదకరమైన జంతువుల ఆకారాలుగా మార్చవచ్చు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంచడానికి దోహద పడుతుంది. ఇందుకోసం పిల్లలను వారికి ఇష్టమైన జంతువు లేదా పక్షుల గురించి అడిగి, వాటి ఆకారాలను కాగితంపై ఔట్లైన్ గీయడం ద్వారా ప్రారంభించవచ్చు. కావలసినవి: ఖాళీ కార్టన్లు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, గమ్, గూగ్లీ కళ్ళు, పైప్ క్లీనర్లు. ఆలోచనకు తగ్గట్టు కార్టర్ను వివిధ ఆకారాలుగా కత్తిరించుకుని వారికి ఇష్టమైన రంగులలో పెయింట్ చేయనివ్వండి. రంగులు కలిపి నమూనాలను రూపొందించడానికి వారికే అవకాశం ఇవ్వడం మంచిది. అలంకరణ: రంగు ఆరిన తర్వాత, గూగ్లీ కళ్ళపై జిగురు వేయండి. మార్కర్ల సాయం తో ముఖంలో ఇతర భాగాలను లేదా నమూనాలను గీయండి. పైప్ క్లీనర్లతో కాళ్ళు, యాంటెన్నా లేదా తోకలుగా చేసి చిన్న రంధ్రాలు చేసి దారంతో అటాచ్ చేయండి.టాయిలెట్ పేపర్ రోల్ బైనాక్యులర్లు.. ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్ను బైనాక్యులర్లుగా మార్చుకోండి, కావలసినవి: రెండు ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్, నూలు లేదా రిబ్బన్, యాక్రిలిక్ పెయింట్ బ్రష్లు, గమ్, స్టిక్కర్లు, డెకరేషన్లు.పెయింటింగ్: పిల్లలను టాయిలెట్ పేపర్ రోల్స్కు పెయింట్ వేయమని చెప్పి, వాటిని పూర్తిగా ఆరిన తర్వాత పక్కపక్కనే అతికించండి. గ్లూ గట్టి పడగానే మెడ పట్టీకోసం రెండువైపులా నూలు లేదా రిబ్బన్ముక్కను అటాచ్ చేయండి. వీటికి స్టిక్కర్లు, మార్కర్లు, ఇతర అలంకరణలతో డెకరేట్ చేయండి. అలా తయారైన∙బైనాక్యులర్లతో సరదాగా బయటి ప్రదేశాలను చూడమని చెప్పండి. బాటిల్ క్యాప్ అయస్కాంతాలు...పాత బాటిల్ మూతలను అయస్కాంతాలుగా మార్చండి. వీటితో మీ రెఫ్రిజిరేటర్ను అందంగా అలంకరించండి.కావలసినవి: మెటల్ బాటిల్ మూతలు, చిన్న గుండ్రని అయస్కాంతాలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, పూసలు, బటన్లు, సీక్విన్ , గ్లూతయారీ: బాటిల్ మూత లోపల, వెలుపల బ్రైట్ కలర్స్ తో పెయింట్ చేయండి.ఆరిన తర్వాత క్యాప్ల లోపల చిన్న పూసలు, బటన్లు లేదా గవ్వలను అతికించండి. గ్లూ లేదా మంచి గమ్తో ప్రతి బాటిల్ మూత వెనుక భాగంలో ఒక చిన్న గుండ్రని అయస్కాంతాన్ని అటాచ్ చేయండి. ఇలా తయారైన వాటితో రిఫ్రిజిరేటర్పై కళాకృతులు, నోటీసులు లేదా ఫోటోలను ప్రదర్శించండి.ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్లు...ప్లాస్టిక్ బాటిళ్లను అందమైన ప్లాంటర్లుగా తిరిగి ఉపయోగించవచ్చు, పిల్లలకు రీసైక్లింగ్, తోటపని నేర్పచ్చు.కావలసినవి: ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, కత్తెర, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, మట్టి, చిన్న మొక్కలు లేదా విత్తనాలు.తయారీ: ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కట్ చేసి, పైభాగాన్ని పారవేయండి. సీసాల దిగువ భాగాలను రంగులతో అలంకరించండి. ఇలా అలంకరించిన సీసాలను మట్టితో నింపి వాటిలో విత్తనాలు లేదా చిన్న మొక్కలను నాటండి. వీటిని ఎండ పడే ప్రదేశంలో ఉంచి, రోజూ నీరు పెట్టండి.వార్తాపత్రిక కోల్లేజ్ కళ...పాత వార్తాపత్రికలను కథను చెప్పే అద్భుతమైన కొల్లేజ్ కళాఖండాలుగా మార్చండి కావలసినవి: పాత వార్తాపత్రికలు, కత్తెరగ్లూ స్టిక్, కాగితం లేదా కాన్వాస్, మార్కర్లు తయారీ: వార్తాపత్రికల నుంచి ఆసక్తికరమైన చిత్రాలు, ముఖ్యాంశాలు, ఇతర న్యూస్ను కత్తిరించండి. కొల్లేజ్ సృష్టించడానికి కటౌట్ లను కాగితం లేదా కాన్వాస్పై అమర్చండి. విభిన్న లే ఔట్లు, థీమ్లతో ప్రయోగం చేయండి. తర్వాత, ఈ ముక్కలను అతికించండి. మార్కర్లు లేదా రంగు పెన్సిళ్లతో కొల్లేజ్కు నేపథ్యాలను జోడించండి. ఇలా తయారైన∙కోల్లెజ్ను కనిపించేలా వేలాడదీయండి.సీడీ సన్ క్యాచర్లు...పాత సీడీలకు మిరుమిట్లు గొలిపే సన్ క్యాచర్లుగా కొత్త జీవం పోయవచ్చు, కావలసినవి: పాత సీడీలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, క్రాఫ్ట్ జిగురు, స్ట్రింగ్ లేదా రిబ్బన్, పూసలు, ఇతర డెకరేషన్లు.తయారీ: రంగురంగుల డిజైన్లు, నమూనాలు లేదా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్తో సీడీలు మెరిసే వైపు పెయింట్ చేయండి. అంచుల చుట్టూ లేదా మధ్యలో పూసలతో అలంకరించి వాటిని సీడీ మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా దారంతో అతికించండి. వీటిని ఎండ పడే కిటికీలో వేలాడదీస్తే అందమైన కాంతులు వెదజల్లుతాయి.న్యూస్ పేపర్లతో ఫోటో ఫ్రేమ్...కొన్ని పాత న్యూస్పేపర్లను తీసుకొని ప్రతి షీట్ను ముక్కలుగా చింపివేయండి. ఇప్పుడు, వార్తాపత్రికను ఒక మూల నుండి చుట్టడం ద్వారా సన్నని రోల్స్ తయారు చేయండి. రోల్ను భద్రపరచడానికి వార్తాపత్రిక అంచుని అతికించండి. ఇప్పుడు మీకు కావలసిన ఏ పరిమాణంలోనైనా కార్డ్బోర్డ్ ముక్కను తీసుకోండి. మీరు ఫ్రేమ్ చేయాలనుకుంటున్న ఛాయాచిత్రాన్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచి, దాని రూపురేఖలను గీయండి. వార్తాపత్రిక రోల్స్ను అవుట్లైన్లపై అతికిస్తూ నాలుగు వైపులా కవర్ చేయండి. అదనపు వార్తాపత్రికను కత్తిరించండి. ఫ్రేమ్కు మీకు నచ్చిన ఏ రంగునైనా పెయింట్ చేసి ఫోటోగ్రాఫ్ను అతికిస్తే సరి.. మీ ఫోటో ఫ్రేమ్ రెడీ!పిల్లల చేత ఇలాంటి వాటిని తయారు చేయిస్తే వారికి మంచి కాలక్షేపం అవుతుంది.వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, న్యూస్ పేపర్లు, పనికిరాని ఇతర గృహోపకరణాలను బుర్రకు కాస్త పడును పెడితే చాలు... కళాఖండాలుగా తయారు చేయచ్చు. ఈ వేసవి సెలవల్లో పిల్లలకు దీనిపై కాస్తంత ఐడియా ఇస్తే చాలు... ఆనక వాళ్లే అల్లుకుపోతారు. వీటితో సృజనాత్మకత పెరగడమే కాదు.. కుదురు వస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్య తెలుస్తుంది. వనరుల పరిరక్షణ, రీసైక్లింగ్ ప్రాముఖ్యత తెలిసొస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. (చదవండి: జర్నలిస్టులకు.. సండేస్ ఆన్ సైకిల్)
ఫొటోలు
అంతర్జాతీయం

బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది.

భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని ట్రంప్ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రోమ్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతపై ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, "I am very close to India and I'm very close to Pakistan, and they've had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h— ANI (@ANI) April 25, 2025అంతకుముందు ట్రంప్.. కశ్మీర్ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో భారత్ అంశంపై ప్రశ్నించిన పాక్ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్ను ఓ పాక్ జర్నలిస్టు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటాను. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్పై ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు.

శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్(Steve Witkoff).. ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్కాఫ్తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్పై, అటు జెలెన్స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
జాతీయం

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్లో ఛత్తీస్గఢ్వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వెల్లైౖకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
శ్రీనగర్: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్ఈటీ ఆపరేటివ్స్పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్ ఉల్ హక్, షోపియాన్లోని చోటీపోరాలోని షాహిద్ అహ్మద్ , కుల్గాంలో జకీర్ గని ఇళ్లు బుల్డోజర్, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్లో చోటిపోరా గ్రామంలో ఎల్టీ కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే నివాసానికి బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్ అహ్మద్ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్ అహ్మద్(జకీర్ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్ ప్రాంతంలో ఎషన్ ఉల్ హక్ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్ఈటీ ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్ లోకల్ టెర్రరిస్టులు ఆసిఫ్ షేక్, అదిల్ మహమ్మద్ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్ షేక్ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె.

ఇంట్లో పాముల కలకలం
అన్నానగర్(తమిళనాడు): నాగర్కోయిల్ సమీపంలోని పల్లందురై లూర్దేస్ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు.
ఎన్ఆర్ఐ

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)
క్రైమ్

విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు.

వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్హ్యండెడ్గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్హ్యండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025

‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’
అనంతపురం: ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని అలజడి.. గుండెను ఎవరో మెలిక పెడుతున్నట్లుగా బాధ... అయినా మనువరాలి పరీక్ష కోసం అన్నీ ఓర్చుకున్నాడు. ఆటోలో పిలుచుకొచ్చి ‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’ అంటూ పరీక్ష కేంద్రం వద్ద వదిలాడు. లోపల మనవరాలు పరీక్ష రాస్తుండగా బయట ఆటోలో గుండెపోటుతో మృతిచెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ బొజ్జన్న (65) శుక్రవారం ఉదయం తన మనవరాలు చంద్రకళను పిలుచుకుని ఏపీఆర్జేసీ పరీక్షలు రాయించేందుకు అద్దె ఆటోలో అనంతపురానికి చేరుకున్నారు. మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్ద కాస్త నలతగా ఉండడం గమనించిన చంద్రకళ ‘తాతా ఏమైంది’ అంటూ అడగడంతో తనకేమీ కాలేదని నవ్వుతూ పరీక్ష రాసి వచ్చేంత వరకూ తాను అక్కడే ఉంటానని, బాగా రాయాలంటూ చెప్పి కేంద్రంలోకి పంపాడు. అనంతరం ఆటోలోనే సేదదీరుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చంద్రకళ నేరుగా ఆటో వద్దకు చేరుకుంది. తాత నిద్రిస్తున్నాడనుకుని లేపేందుకు ప్రయత్నించడంతో ఆయన సీటులోనే జారిపోయాడు. దీంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించింది. ‘నేను వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటానని.. ఎక్కడికెళ్లావ్ తాతా..’ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. స్థానికుడి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అనంతపురానికి చేరుకుని సాయంత్రానికి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు.

అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.