కులమతాల ప్రస్తావన ఉండని స్వేచ్ఛ ఇవ్వండి | give admissions without any mention of community, PIL in high court | Sakshi
Sakshi News home page

కులమతాల ప్రస్తావన ఉండని స్వేచ్ఛ ఇవ్వండి

Mar 22 2017 3:57 AM | Updated on Aug 31 2018 8:31 PM

కులమతాల ప్రస్తావన ఉండని స్వేచ్ఛ ఇవ్వండి - Sakshi

కులమతాల ప్రస్తావన ఉండని స్వేచ్ఛ ఇవ్వండి

దరఖాస్తుల్లో దరఖాస్తుదారుడి కులం, మతం గురించి ప్రస్తావించకుండా ఉండగలిగే స్వేచ్ఛను కల్పించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

- హైకోర్టులో పిల్‌ దాఖలు
సాక్షి, హైదరాబాద్‌:
పాఠశాలల్లో ప్రవేశాలు, పరీక్షలు, టీసీల జారీ మొదలుకుని.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పలు సందర్భాల్లో నింపే దరఖాస్తుల్లో దరఖాస్తుదారుడి కులం, మతం గురించి ప్రస్తావించకుండా ఉండగలిగే స్వేచ్ఛను కల్పించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన డి.రామకృష్ణారావు, సలాది క్లారెన్స్‌ కృపాలనీ దంపతులు దీనిని దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.సురేశ్‌కుమార్‌ వాదిస్తూ... దరఖాస్తుల్లో కుల, మత ప్రస్తావన చేయడం ఇష్టం లేనివారు ఎందరో ఉన్నారని, కానీ ఆ వివరాలు నింపకపోతే అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

వైద్య బిల్లులను 58:42 నిష్పత్తిలో చెల్లించండి: ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం  
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రిబ్యునల్‌(ఏపీఏటీ) రిటైర్డ్‌ సభ్యుల వైద్య బిల్లులను 58:42 నిష్పత్తిలో చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీఏటీ విశ్రాంత సభ్యులు తమ బిల్లులను ఏపీఏటీ చైర్మన్‌కు సమర్పించాలని సూచించారు. చైర్మన్‌ నుంచి బిల్లులు అందుకున్న 10 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement