High Court of Judicature at Hyderabad
-
మరియమ్మ లాకప్డెత్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరా రికార్డులను పెన్డ్రైవ్లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బంగారం కుదవ పెట్టి..బిల్లులు కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, రోగుల బంధువులు బంగారాన్ని కుదవపెట్టి బిల్లులు కట్టాల్సి వస్తోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు ఒకే తరహాలో ధరలు నిర్ణయించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మేరకు కొత్త జీవో జారీచేయాలని ఆదేశించినా పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?’అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ధరలు నిర్ణయిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది. ‘జీవో జారీకి సంబంధించి ప్రభుత్వానికి సూచన చేయలేదు, జీవో జారీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశాం. అయినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేశారంటూ ప్రైవేటు హాస్పిటల్స్పై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? అధిక బిల్లులపై 79 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొన్నా.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు? ప్రభుత్వమే ఇంత బాధ్యతారహితంగా ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉంటే ఎలా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక ఇచ్చారు ‘గతంలో ఇచ్చిన జీవోను సవరించి పీపీఈ కిట్లు, సీటీ స్కాన్ తదితర పరీక్షలకు ధరలను నిర్ణయించాలని ఆదేశించాం. ఈ మేరకు గతంలో ఉన్న ధరలను రివైజ్ చేసి తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాం. ఈ జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పాం. విపత్తు నిర్వహణ చట్టం కింద అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నాం. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని స్పష్టం చేశాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమన్నాం. కానీ ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సమర్పించిన నివేదికలో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేశారో లేదో ఎక్కడా పేర్కొనలేదు. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక సమర్పించారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు ఇందులో సమాధానం లేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఎలా..?’అంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ నివేదించగా...15 రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొనగా.. కొన్ని ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేసి డబ్బు కట్టకపోతే స్వస్థత పొందినా.. రోగిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు, లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని, విచారణకు ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా నియంత్రణకు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేటాయించిన ఔషధాలను ఆసుపత్రులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అంతకుముందు ధర్మాసనం ప్రశ్నించింది. కేటాయించిన వాటిలో ఒక్క ఇంజక్షన్ అందని పరిస్థితి ఉందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. కాగా ‘అధిక బిల్లులు వసూలు చేసిందంటూ గత ఏడాది విరించి ఆసుపత్రికి కరోనా చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఆసుపత్రిపై ఇదే తరహా ఆరోపణలు రావడంతో మళ్లీ చికిత్సలు చేయరాదని ఆదేశించారు. దీంతో లక్షలాది రూపాయలు ఫీజుగా చెల్లించిన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి వారికి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..’అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు అర్జున్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎం.రంగయ్య తదితరులు నివేదించారు. చిన్నారులకు ఒకే ఆసుపత్రా? ‘కరోనా మొదటి, రెండో దశతో ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పొంచి ఉన్న మూడో దశతో రాబోయే తరం...చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్రలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒక్క జిల్లాలోనే 8 వేల చిన్నారులు కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల వైద్యానికి నీలోఫర్ లాంటి ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రా? ఇందులోనూ 8 ఐసీయూ, 12 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉన్నాయా? ఇలా ఉంటే కరోనా బారినపడే చిన్నారులకు ఎలా చికిత్స అందిస్తారు?’అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో చర్యలు తీసుకుంటున్నామని నామమాత్రంగా మాత్రమే పేర్కొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకోసం కొత్తగా ఎన్ని పడకలను ఏర్పాటు చేశారు? ఎంతమంది వైద్య సిబ్బందిని నియమించారు? అవసరమైన ఔషధాలను ఏమేరకు సమకూర్చుకున్నారు? ఇలాంటి వివరాలేవీ నివేదికలో పేర్కొనలేదు’అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా రోగులతో ఉన్న అంబులెన్సులను ఆపేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలు తీస్తారా, రాజ్యాంగం కల్పిం చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా’ అని మండిపడింది. కేంద్రం అనుమతి లేకుండా జాతీయ రహదారులపై అంబులెన్స్లను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈ నెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ మెమో ఉందని.. ఆ మెమో జారీచేసిన అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసేలా ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్ రూం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలోకి అంబులెన్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ మెమోను మార్చి.. మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సరిహద్దుల్లో ఉన్న అధికారులకు సమాచారమిచ్చి అం బులెన్స్ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించింది. మా ఆదేశాలకు వక్రభాష్యం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం అంబులెన్సుల నిలిపివేత ఆదేశాలు ఇచ్చినట్లు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అంబులెన్స్లు ఆపొద్దంటూ ఈనెల 11న మేమిచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని ఏ చట్టం నిషేధించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉంది. అహ్మదాబాద్లో ప్రభుత్వ అంబులెన్సుల్లో వచ్చే వారినే అడ్మిట్ చేసుకోవాలంటూ, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆస్పత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొం దించాలని సుప్రీం కోర్టు ఇటీవలే కేంద్రాన్ని ఆదేశించింది కూడా. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగుల అంబులెన్స్లను రాని స్తామనడం దారుణం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. పలు రాష్ట్రాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి: ఏజీ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్ఘడ్ నుంచి పెద్ధ సంఖ్యలో కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని.. ఇక్కడ అడ్మిషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హైకోర్టుకు వివరించారు. వారంతా రోడ్ల మీదే నిరీక్షిస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన కరోనా రోగులను ఆ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు వైద్యం నిరాకరించట్లేదు. కరోనా కట్టడి, లాక్డౌన్లో భాగంగానే.. ఆస్పత్రుల్లో అడ్మిషన్ లేనివారి అంబులెన్స్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నిబంధనలకు లోబడే ఉంది’ అని వివరించారు. వివక్ష చూపించడమే: ఏపీ ఏజీ ఎస్.శ్రీరాం అంబులెన్సుల కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల మేరకు మెమో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ చట్టాల సారాంశానికి విరుద్ధంగా ఆ మెమో ఉంది. నివాస ప్రాంతం ఆధారంగా కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమే. కంట్రోల్ రూం ముందస్తు అనుమతి పేరుతో జాప్యం జరిగితే.. తగిన సమయంలోగా వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమా దం ఉంది. అంబులెన్స్ల ప్రవేశానికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపుతున్నారు. ముందస్తు అనుమతి పేరిట వివక్షతో ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు. చదవండి : తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల -
ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు
సాక్షి, హైదరాబాద్ : ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపేయాలని.. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. గురువారం ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసింది. ( ‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలే..!’) రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగించాలని, కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని.. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని.. సాఫ్ట్వేర్, మ్యానువల్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. -
క్రాకర్స్ బ్యాన్: ఆత్మహత్యలు చేసుకుంటారు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకును నింపామని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. కాగా, హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. -
టపాసులు అమ్మటం, కాల్చటం నిషేధం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. కాగా, పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది. -
అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో–131.. అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉందంటూ హైకోర్టు మండిపడింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గత ఆగస్టులో ప్రభుత్వం తెచ్చిన జీవో–131ని సవాల్ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జీవో 131 చట్టవిరుద్ధమని, జీవో జారీ చేసి మరీ క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ప్రతి ఐదేళ్లకోకసారి అక్రమ నిర్మాణాలను, లేఔట్లను క్రమబద్ధీకరించడం సంప్రదాయంగా మారుతోందని పేర్కొన్నారు. మాస్టర్ప్లాన్కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను, లేఔట్ల క్రమబద్ధీకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం వల్లే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎప్పటిలోగా కౌంటర్ దాఖలు చేస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ప్రశ్నించగా, వారం రోజుల్లో వేస్తామని నివేదించారు. దీంతో 11లోగా కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. -
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు?
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్కు సంబంధించిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని మరో మారు ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది. వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేక పోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ రావు తండ్రి కరోనాతో మరణించినందున నివేదిక సమర్పించేందుకు గడువు సమయం ఇవ్వాలని ఏజీ కోరగా.. హైకోర్టు విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. (చర్ల ఎన్కౌంటర్పై హైకోర్టులో పిటిషన్) రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి : హైకోర్టు న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణ 15కి వాయిదా వేసింది. -
దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు
సాక్షి, ఖమ్మం : దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని, దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపం భూవివాదానికి సంబంధించి వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన పిల్పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ పేర్కొనగా, టీటీడీ ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే టీటీడీ పక్క భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఖమ్మం కార్పొరేషన్ హైకోర్టుకు వెల్లడించింది. ( ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్) దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, భూమి వెనక్కి తీసుకుంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనుక టీటీడీ ఉండొచ్చునని అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమిని టీటీడీ ఆక్రమించినట్లు కనిపిస్తోందని, భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. -
జీహెచ్ఎంసీ నివేదిక: హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : యాచకులను షెల్టర్ హోంలకు తరలించే ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించాలన్న పిటీషన్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణను చేపట్టింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు నివేదించగా.. ఎంతమందిని, ఎక్కడెక్కడికి తరలించారో అన్న వివరాలు సమగ్రంగా లేవని, ఈనెల 15లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
అన్ని చర్యలు తీసుకున్నాం..
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు వైద్యం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైద్య సేవలు అందించే వారందరికీ మాస్క్లు, గ్లౌజ్లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చామని, అతి ప్రమాదకరమైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యవసర విభాగాలు, అంబులెన్స్ల్లో కరోనా రోగిని తరలించేప్పుడు వ్యక్తిగత రక్షణ కిట్ (పీపీఈ)లను అందజేస్తున్నామంది. 446 సంక్షేమ హాస్టళ్లలోని వారికి ఆహారం, దుస్తులు, మాస్క్లు పంపిణీ చేశామని, మహిళలు, పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులు, వీధి బాలల సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని వివరించింది. నిత్యావసర వస్తువులు, మందులు, అత్యవసర వస్తువుల సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామని, వీటి రవాణాపై ఆంక్షలు ఏమీ లేవని తెలిపింది. ఆలయాలు, మసీదులు, చర్చిలను మూసివేయించామని, సామూహిక సమావేశాలు కాకుండా నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నామని తెలిపింది. నివేదికలో వెల్లడించిన అంశాలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి వివరాలతో తుది నివేదికను అందజేశారు. ‘13 ప్రభుత్వాసుపత్రుల్లో 4,497 ఐసోలేషన్ బెడ్లు, 361 ఐసీయూ బెడ్లు, 246 వెంటిలేటర్ ఉన్న బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అదనంగా 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను గుర్తించి వాటిలో 7 వేల ఐసోలేషన్, 800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాం. గచ్చిబౌలి క్రీడా వసతి ప్రాంగణాన్ని కరోనా ఆస్పత్రిగా మార్పు చేశాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వారికి కూడా పీపీఈలు అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తోంది. రాష్ట్రంలో వెంటిలేటర్ల తయారీ లేనందున 600 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇస్తాం. 3.85 లక్షల కరోనా పరీక్షల కిట్స్కు, 4,57,350 వీటీఎం టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ చేశాం. 3.14 లక్షల శానిటైజర్ బాటిళ్లకు ఆర్డర్ చేశాం. 27,785 లీటర్ల శానిటైజర్ను వివిధ సంస్థలు ఉచితంగా ఇచ్చాయి. 3,53,210 పీపీఈ కిట్లు కావాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 51,475 కిట్లు వచ్చాయి. సర్జికల్స్ గ్లౌవ్స్ 34 లక్షలు ఆర్డర్ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌవ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్–95 మాస్క్లు 7,72,480 ఆర్డర్ ఇస్తే 1,61,980 అందాయి. ప్రస్తుతం 73,227 అందుబాటులో ఉన్నాయి. మూడు పొరల సర్జికల్ మాస్క్లు 53 లక్షలు కావాలని ఆర్డర్ ఇస్తే 25.50 లక్షలు అందాయి. 22.48 లక్షలున్నాయి. నిపుణుల కమిటీ ఆదేశాలకు అనుగుణంగా 53 రకాల మందుల కొనుగోలు జరుగుతోంది. కరోనా అనుమానితుల్లో 80 శాతానికి స్వల్ప లక్షణాలు కనబడి తే 15 శాతానికి మోస్తరు, 5 శాతానికి వైరస్ లక్షణాలు తీవ్రంగానూ కనబడుతున్నాయి. వీరందరికీ కూడా వైరస్ నివారణ వైద్యం అందజేస్తున్నాం. లాక్డౌన్ రూల్స్కు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 75,800 వాహనాల్ని సీజ్ చేశాం. 4,900 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 33 వేల ఉల్లంఘనల్లో 17 వేల వాహనాల్ని సీజ్ చేశాం. జరిమానాగా 3.80 కోట్లు వసూలైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 40, రాష్ట్రంలో 230 చెక్పోస్ట్లను ఏర్పాటు చేశా రు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారి పైన, ప్రజల పట్ల దురుసుగా వ్యవహరించి న పోలీసులపై చర్యలు తీసుకుంటున్నాం..’అని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. -
కరోనా ప్రపంచ విపత్తు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోందని, ఇదో ప్రపంచ విపత్తు అని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే అన్నీ చేయాలని ఆశించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. వైద్య పరికరాల కొరత ఉండటం సహజమని, ఉ న్నంతలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఉన్నంతలో వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసర చర్యలు తీసుకుంటున్నారో లేదో అనేదే ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యం లో కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యులకు తగిన రక్షణ పరికరాల్లేవని, రాష్ట్రాల సరిహద్దుల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరుతూ న్యాయవాదులు సమీర్ అహ్మద్, ఎస్.ఎస్.ఆర్.మూర్తి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు మరో సారి విచారణ జరిపింది. ప్రభుత్వం వైద్యపరంగా అ న్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని ప్రభు త్వం తరఫున కోర్టుకు అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ మధ్యంతర నివేదిక అందజేశారు. ఈ నివేదిక వాస్తవం కాదని లాయర్లు చెప్పడంతో ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జ స్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం పైవిధంగా అభిప్రాయçపడుతూ విచారణను 15కి వాయిదా వేసింది. మాస్క్లు, గ్లౌజ్స్లకు ఆర్డర్లు ఇచ్చాం.. ‘కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సేవలు అందించే వారందరికీ మా స్క్లు, గ్లౌజ్లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వా రికి కూడా వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు (పీపీఈ) అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్ సర్వీసె స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పీపీఈ కిట్ల కొరత ఉంది. 3,31,798 పీపీఈ కిట్లు కా వాలని ఆర్డర్లు జారీ చేశాం. ఇప్పటికి 47,603 కిట్లు వచ్చాయి. మిగతావి కూడా దశల వారీగా వస్తాయి. సర్జికల్ గ్లౌజ్స్ 34 లక్షలు ఆర్డర్ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌజ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక లాక్డౌన్ నేపథ్యంలో మం దుల షాపులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు’అని ప్రభుత్వం మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న రేవంత్రెడ్డి ఈ రోజు విడుదల కానున్నారు. ( ‘రేవంత్కు మేము మద్దతుగా ఉన్నాం’ ) కాగా, చట్ట వ్యతిరేకంగా డ్రోన్లను వినియోగించారన్న కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నెల రోజులు మాత్రమే జైలు శిక్ష పడే కేసులో రేవంత్రెడ్డిని ఇప్పటికే తొమ్మిది రోజులుగా జైల్లో పెట్టారని, చాలా చిన్న కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేయవద్దని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ హైకోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ నాటికి సగం శిక్షాకాలం పూర్తవుతుందని, వెంటనే బెయిల్ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టును కోరారు. చదవండి : తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు -
కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ వైరస్ విభృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు. చదవండి : కరోనా ఎఫెక్ట్.. మాస్క్తో ప్రభాస్ కరోనా ఎఫెక్ట్: అన్నీ రెడీ అయ్యాక వద్దన్నారు! -
రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒలంపిక్ సంఘం ఎన్నికలు హైదరాబాద్లోనే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని జస్టిస్ వినోద్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా తయారీపై కూడా హైకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తివి మరోసారి అదే పదవికి ఎలా పోటీ చేస్తావని జగదీష్ యాదవ్ను న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేదిగా ఉందంటూ హైకోర్టు జగదీష్ వర్గానికి అక్షింతలు వేసింది.కాగా, రేపు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్పై కూడా అరిసనపల్లి జగన్మోహన్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
మున్సిపల్ ఎన్నికల విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. కాగా తమ వాదనకు... ప్రభుత్వం చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాదనలపై కౌంటర్ ఫైల్ చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం 26 కంటే ముందే పిటిషన్ను విచారించాలని కోరగా... ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. -
రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ జస్టీస్ సంజయ్ కుమార్ను పంజాబ్, హర్యానా కోర్ట్కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా టి. వినోద్ కుమార్, ఏ. అభిషేక్ రెడ్డి, కె.లక్ష్మణ్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. -
అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్ అండ్ బీ చెప్పిందా?
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ భవనాలు వినియోగానికి యోగ్యంగా లేవని ఆర్అండ్బీ శాఖ ఇచ్చిన నివేదిక గురించి స్వయంగా వివరించేందుకు ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి శుక్రవారం జరిగే విచారణకు హాజరుకావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆర్ఆండ్బీ నివేదిక ఇచ్చి ఉంటే.. అసెంబ్లీ భవనాలు ఎంతకాలం వినియోగానికి యోగ్యంగా ఉన్నాయి, భవనం ఖాళీ చేయాలని నివేదికలో ఉందా, కొత్త అసెంబ్లీ నిర్మాణానికి ఎంత స్థలం కావాలి, నిర్మాణ ప్రణాళిక వంటివి వివరించేందుకు ఆయన స్వయంగా హాజరుకావాలంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం ఎదుట గురువారం వాదనలు జరిగాయి. ఏ నిబంధనల మేరకు ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలను వినియోగించరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేబినెట్ ఎజెండాలోని అంశాలు తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు నిజాం కాలంలో నిర్మించినవని, టౌన్హాల్ నిమిత్తం నిర్మించిన వాటిలో అసెంబ్లీ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. ఆర్అండ్బీ అధ్యయనంలో అసెంబ్లీ భవనాలు సురక్షితంగా లేవని తేలిందన్నారు. ‘పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదా’అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇస్తూ ‘ఇప్పటికే పలుమార్లు మరమ్మతులు చేయడం జరిగింది, అదే మాదిరిగా కొనసాగించడం క్షేమదాయకం కాదు’అని అన్నారు. ఎర్రమంజిల్ పురాతన భవనాల జాబితాలో లేదని, అక్కడ శాసనసభ భవనాల సముదాయాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని గట్టిగా చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదంటూ సుప్రీంకోర్టుతో పాటు, రాజస్తాన్ హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించగా, ఇలాంటి తీర్పును ఉదహరించి మంచిపని చేస్తున్నారని అదనపు ఏజీని ధర్మాసనం అభినందించింది. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని అదనపు ఏజీ చెప్పగానే.. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంజనీర్ దగ్గరకు వెళ్లి ఫలానా సౌకర్యాలు ఉండేలా ప్లాన్ వేయించుకుంటారని, ఇక్కడేమో ప్లానే లేదని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ కల్పించుకుని.. ప్లాన్ రూపొందించాలని హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు చెందిన కన్సల్టెన్సీలకు బాధ్యతలు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి కూడా సమాచారం లేదన్నారు. ఎన్ని ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారనే ప్రశ్నకు.. 17 ఎకరాల్లో నిర్మించాలని యోచిస్తున్నామని, ఇప్పుడున్న చట్టసభ సభ్యుల సంఖ్య మరో పాతికేళ్లకు రెట్టింపు కావచ్చునని, అప్పటి అవసరాలకు అను గుణంగా, పార్కింగ్, అధికారిక సమావేశాలకు వీలుగా కొత్త చట్టసభల సముదాయాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ విధానమని అదనపు ఏజీ బదులిచ్చారు. కన్సల్టెన్సీల నుంచి ప్లాన్లు వచ్చాక వాటి లో ప్రభుత్వం ఆమోదించే దాని ఆధారంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పా రు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఎర్రమంజిల్ భవనాన్ని హెచ్ఎండీఏ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చట్టంలో అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ఉందని, దీని ప్రకారం ఎర్రమంజిల్లోని చారిత్రక భవనాన్ని హెచ్ఎండీఏ రక్షించాలని ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది స్వరూప్రెడ్డి హైకోర్టులో వాదించారు. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం కూడా హైకోర్టు వాదనలు కొనసాగాయి. గుర్తించిన భవనాలను రక్షించే బాధ్యత మాత్రమే హెచ్ఎండీ తీసుకుంటుందని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం స్పందిస్తూ.. హెరిటేజ్ కమిటీకీ, హెచ్ఎండీఏలోని అర్బన్ ఆర్ట్స్ కమిషన్ మధ్య తేడాలు, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆ రెండింటి పాత్ర ఏమిటో చెప్పాలని కోరింది. వాదనలు మంగళవారం కొనసాగుతాయి. -
ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్లోని పురాతన భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. వివిధ రకాల కేసులు తమ వద్ద విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చుతుందని తాము భావించట్లేదని వ్యాఖ్యానించింది. కోర్టులపట్ల ప్రభుత్వానికి గౌరవభావం ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం... ఎర్రమంజిల్లో 150 ఏళ్ల నాటి పురాతన భవనాన్ని కూల్చి అక్కడ శాసనసభల ప్రాంగణాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం విచారించింది. భవనాన్ని కూల్చరాదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తెలిపారు. ఈ సమయంలో మరో పిటిషనర్, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్ తరఫు రచనారెడ్డి కల్పించుకొని యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేయాలని లేకుంటే భవనాన్ని ప్రభుత్వం కూల్చేసే అవకాశం ఉందన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. విచారణ దశలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం. ఎర్రమంజిల్ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోదని భావిస్తున్నాం’అని మౌఖికంగా పేర్కొంది. హైదరాబాద్లో ప్రభుత్వ భవనాలపై గవర్నర్కే నిర్ణయాధికారం... అంతకుముందు వాదనల సందర్భంగా తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్కే నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 8 (2) (3) ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు, శాంతిభద్రతల అంశాలపై గవర్నర్కే అధికారం ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. గతంలో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించారని చెప్పగా అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది. ప్రభుత్వం గుర్తించకుండానే వందేళ్లు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించరని కూడా చెప్పింది. అయితే ఆ వివరాల్ని తర్వాత అందజేస్తామని, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం గత నెల 28న ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని న్యాయవాది బదులిచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చూపవద్దని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేదా జీవోలను ఆధారాలుగా చూపాలని ధర్మాసనం కోరింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కౌంటర్లో ప్రభుత్వం చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని ఎర్రమంజిల్లో అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని మాత్రమే ఉందని, ఉన్న భవనాన్ని కూల్చుతామని ఎక్కడా కౌంటర్లో లేదని గుర్తుచేసింది. ఎర్రమంజిల్ వద్ద అసెంబ్లీ నిర్మిస్తే అక్కడి ఇరుకురోడ్ల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో చెప్పారని, దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్లతో వివరించాలని ధర్మాసనం కోరింది. ఉన్న భవనాన్ని వదిలి కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నవాబు వారసులు... ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్ వివా దం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వార సులు నూరి మజుఫర్ హుస్సేన్, మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవా ది రచనారెడ్డి కోరారు. ఎర్రమంజిల్లో వివిధ రూపాల్లో వినియోగించగా ఎకరం 21 కుంటల స్థలం విషయంలో ప్రభుత్వంతో 1951 నుంచి సివి ల్ వివాదం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదం పరిష్కారం కాకుండానే అసెంబ్లీ భవనాల నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. -
చేప ప్రసాదం పంపిణీకి లైన్ క్లీయర్
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు(శనివారం) జరిగే చేప మందు ప్రసాదం పంపిణీ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని పిటిషనర్ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
నీటి ప్రాజెక్టుల్ని అడ్డుకోం
సాక్షి, హైదరాబాద్ : ‘ఒకరిద్దరి కోసం ప్రాజెక్టుల నిర్మాణాల్ని ఆపలేం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసమే. కోట్ల మంది దాహార్తిని శాశ్వతంగా తీరుస్తాయి. పైగా పర్యావరణ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు దోహదపడతాయి. కొద్ది మంది కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోజాలం. అదే సమయం లో ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు సకాలంలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ధిక్కార కేసులకు మినహాయింపు... ‘పునరావాసం, పునర్నిర్మాణం, పరిహారం చెల్లింపులను విచారిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన 177 వ్యాజ్యాలన్నీ కలిపి విచారిస్తాం. అంతే కాకుండా ఇకపై వ్యాజ్యాలు దాఖలైతే వాటిని కూడా ఇక్కడికే నివేదించేలా హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి వద్ద తీర్పు వెలువరించాల్సిన మూడు కోర్టు ధిక్కార కేసులను మాత్రం మినహాయింపు ఇస్తున్నాం’అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎవరి అంగీకారంతోనో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చట్టం కూడా చెబుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును ఉల్లంఘిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం పనులు చేస్తోందంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాలను, దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులపై దాఖలైన ఇతర కేసుల్ని, మొత్తం 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే... ‘వాతావరణంలో ప్రతికూల మార్పులు కనబడుతున్నాయి. వర్షాలు పడటం లేదు. నూరు శాతం వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఈసారి 93 శాతం రుతుపవనాలు వస్తాయని చెప్పడం అదృష్టమే. రాజస్తాన్ ఎడారిగా మారకుండా ఉండాలంటే నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాల్సిందే. రాజస్తాన్లోని బనాస్ ప్రాజెక్టుపై దాఖలైన న్యాయ వివాదాల్ని పరిష్కరించిన ధర్మాసనంలో నేనున్నాను. ఆ ప్రాజెక్టుతో తొమ్మిది జిల్లాలకు నీరు అందింది’అని అదనపు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పరిహార ఒప్పంద పత్రాలు తెలుగులో ఉండేలా చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు వాటిని అందజేసే ముందు వాటిలోని విషయాల్ని తెలుగులోనే వివరించాలని పేర్కొంది. దీంతో బాధిత రైతులకు అన్నీ తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పింది. పరిహారం తీసుకుని పోరాడండి... ‘భూ సేకరణ ప్రజల సమస్య. చట్టపరమైనది కాదు. పదేళ్ల కిత్రం అందుకోవాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని తీసుకుని న్యాయపోరాటం చేస్తే బాధితుడు నష్టపోడు. ఆ పరిహారం తీసుకోకుండా ఇప్పుడు రూ.8 లేదా 9 లక్షలు పరిహారం తీసుకుంటే అది రూ.5 లక్షలతో సమానం అవ్వదు. పరిహారం పెంపు కోసం పాతికేళ్ల వరకూ న్యాయపోరాటం చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతుంటే భూమి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటారు. భూమిని సర్కార్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్వరూ అడ్డకోలేరు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ కథను ధర్మాసనం ఉదహరించింది. ‘గంగా నదిలో ఓ రైతు గొడ్డలి పడిపోయింది. గంగా మాత ప్రత్యక్షమై బంగారం, వెండి, రాగి గొడ్డళ్లు తెచ్చి ఇచ్చింది. అవి నావి కావని రైతు చెప్పాడు. దీంతో గంగా మాత పోయిన ఇనపు గొడ్డలితోపాటు బంగారు, వెండి, రాగి వాటిని కూడా రైతుకు ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా రైతులు తమకు ఏది కావాలో కోరాలి. కానిది అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. హైకోర్టు మీకు న్యాయపరంగా అండగా నిలుస్తుంది’అని ధర్మాసనం హితవు చెప్పింది. ‘భూ సేకరణ కోసం రైతులు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం వ్యక్తి. గ్రామం కోసం కుటుంబం. పట్టణం కోసం గ్రామం. రాష్ట్రం కోసం పట్టణం. చివరికి దేశం కోసం ఒక రాష్ట్రం త్యాగం చేయాలి. ఇది ఇప్పటి హితోపదేశం కాదు. మహాభారతంలోనే ఉంది. అయిదారు ఎకరాల కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం ధర్మం కాదు. ప్రాజెక్టులు కూడా లక్షలాది మంది ప్రజల కోసమేనని గుర్తించాలి’అని వ్యాఖ్యానించింది. పరిహారం అందజేత... హైకోర్టులో 93 మంది పిటిషన్లు దాఖలు చేస్తే పరిహారం తీసుకోని 33 మందికి, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వేసిన ఆరుగురి చెందిన పరిహారాన్ని రూ.7.5 లక్షల చొప్పున వారి తరఫున వాదించే న్యాయవాది, న్యాయమూర్తుల సమక్షంలో అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అందజేశారు. దీంతో మొత్తం 93 మందికి పరిహారం అందజేసినట్లు అయింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు వద్దని చెప్పి తిరిగి తీసుకోడానికి సమ్మతిని తెలిపిన ఇద్దరికీ కూడా కోర్టులోనే చెక్కుల్ని అందజేశారు. అనసూయ అనే పిటిషనర్ భర్తతో విభేదించి పదేళ్లుగా విడిగా ఉంటున్నారని, భర్తకు పరిహారం ఇచ్చారని, ఆమెకు ఏదీ అందలేదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని అదనపు ఏజీ బదులిచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో 2,500 ఎకరాల రైతులకు పరిహారం చెల్లించామని, ఆర్ఆర్ ప్యాకేజీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. గృహాల సేకరణ అంశంపై ప్రాథమిక నోటీసు ఇచ్చామని వివరించారు. డిక్లకేషన్ ఇచ్చేందుకు రైతులు సహరించలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు అదనపు ఏజీ బదులిచ్చారు. విచారణ జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహాన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా చౌహాన్ వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీనితో సీనియర్ అయిన జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
హైకోర్టు సీజేగా ఆర్ఎస్ చౌహాన్.. !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం చౌహన్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. ఇక హైకోర్టు లో నెంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వీ. రామసుబ్రమణియన్ కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయి.. జస్టిస్ బాబ్దే.. జస్టిస్ ఎన్ వీ రమణలతో కూడిన కొలీజియం సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేసిన తరువాత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తరువాత వీరి నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తరువాత ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టు కి బదిలీ అయ్యారు. దీనితో సీనియర్ అయిన జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం... జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సినీయర్ న్యాయవాదులు కె. సార్వభౌమన్, టి.ఆర్. మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత కేంద్రం ఈయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గా నియమించింది. -
పేరా 8 చట్టబద్ధతను తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్: యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. యాదవరెడ్డికి సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని హైకోర్టు గురువారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. భూపతిరెడ్డి స్థానానికి సైతం ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయ బోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు హామీ ఇచ్చింది. యాదవరెడ్డి, భూపతిరెడ్డిల అనర్హత వేటుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుం చాలని శాసనమండలి కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగబద్ధతను తేలుస్తామని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏ హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు గానీ స్పీకర్ లేదా మండలి చైర్మ న్ అధికారాలకు సంబంధించిన 8వ పేరా రాజ్యాంగబద్ధతను తేల్చలేదంది. ఈ విషయానికి సంబంధించి పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదు పరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరో సారి విచారణ జరిపింది. దానికే అనర్హత వేటు వేస్తారా? ఈ సందర్భంగా యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ద్ధిష్టమైన ఆధారాలు లేవని, ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని నివేదించారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారన్నారు. పార్టీ ఫిరాయించడం వేరని, ఓ జాతీయ నేతను కలవడం వేరని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించలేకపోయారన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పార్టీలో చేరారా? లేదా ? అన్నదే ఇక్కడ ముఖ్యమని తెలిపింది. అనర్హత వేటుపై పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని మండలి కార్యదర్శిని ఆదేశించింది. దీనికి ప్రకాశ్రెడ్డి స్పందిస్తూ, యాదవరెడ్డి స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంద ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఎస్ఈసీ తరఫు న్యాయవాది మాధురి స్పం దిస్తూ, ఖాళీ అయిన స్థానాలకు 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీంతో ఈ నెల 15వరకు యాదవరెడ్డి స్థానానికి నోటిఫికేషన్ జారీ చేయవద్దని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. ఏకపక్ష అధికారాలు సరికాదు... తరువాత భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ, 10వ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అటు స్పీకర్కు, ఇటు మండలి చైర్మన్కు ఏకపక్ష అధికారాలున్నాయని, ఇది ఎంత మాత్రం తగదని తెలిపారు. దీని వల్ల వారు ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయాలు వెలువరిస్తున్నారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రాష్ట్రపతికి సైతం ప్రత్యేకాధికారాలు ఉంటా యని, ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని కూడా తప్పుపట్టవచ్చా? అని ప్రశ్నించింది. చట్టాలు చేసే బాధ్యత చట్టసభలదని, ఆ చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిం చే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదని కపూర్ చెప్పారు. శాసనసభ అంటే రెండు సభలు వస్తాయని, ఎవరి అధికారాలు వారివేనని, ఇందులో స్పష్టమైన విభజన రేఖ ఉందని తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం తమ ముందున్న విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా తీర్పునిచ్చిందా? అని ధర్మాసనం ఆరా తీయగా, కపూర్ పలు తీర్పులను ప్రస్తావించారు. కేంద్రం తరఫున ఎన్.హరినాథ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పార్లమెంట్ చట్టాలు చేసిందన్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే 10వ షెడ్యూల్ అమల్లోకి వచ్చిందన్నారు. వాదనలు విన్న కోర్టు, 8వ పేరా చట్టబద్ధతను తేలుస్తామంటూ తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం 50 శాతం లోబడే ఉండాలని చెబుతుందని కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది రామచందర్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై మరోసారి వాదనలు వింటామన్న కోర్టు.. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. -
‘మియాపూర్’పై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములపై సీల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని తేల్చి చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపట్ల కోర్టుకు సానుభూతి ఉండదని హైకోర్టు తెలిపింది. -
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తెలుగు మహిళ జస్టిస్ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు గతవారం కొలీజియం తీర్మానం చేసింది. ఈ సిఫార్సు కార్యరూపం దాలిస్తే తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె ఖ్యాతి గడిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదో న్నతి పొందారు. అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆమె అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేర కేంద్రానికి సిఫార్సు చేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన అన్నదాతలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పోలింగ్ను వాయిదా వేయాలని, పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచిన రైతులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు 16 మంది రైతు అభ్యర్థులు పిటీషన్ వేశారు. రైతుల పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును ఈనెల 8కి వాయిదా వేసింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, ప్రధాన పార్టీల అభ్యర్థులు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, తమకు ప్రచారం నిర్వహించుకునేందుకు సమయం లేకుండా పోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని రైతుల తరపున న్యాయవాది రచనారెడ్డి హైదరాబాద్లో మీడియాకు వెల్లడించారు. రెండో విడతలో పోలింగ్ నిర్వహించాలని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లినట్లు రచనారెడ్డి పేర్కొన్నారు. గుర్తు కేటాయింపునకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోర్టు పిటీషన్ వేసిన రైతులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తీర్పు సోమవారం వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మాటతప్పారని.. కొడుకు, కోడలికి హైకోర్టు చీవాట్లు
సాక్షి, హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలికి హైకోర్టు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని ఆస్తికోసం వేధించడంపై తీవ్రంగా మండిపడింది. ఆమె దగ్గరి నుంచి లాక్కున్న ఇంటిని తిరిగి అప్పగించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. కేపీహెచ్బీ కాలనీ, అడ్డగుట్టలోని శ్రీనిలయంలో ఉంటున్న తనను.. కొడుకు, కోడలు గెంటేయడమే కాకుండా, చంపేందుకు సైతం ప్రయత్నించారంటూ వి.శివలక్ష్మీ కేపీహెచ్బీ పోలీసులకు గతేడాది అక్టోబర్ 31న రెండు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఆమె కేపీహెచ్బీ పోలీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆమె జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంటిని ఆమెకే ఇచ్చేయాలని కొడుకు, కోడలిని ఆదేశించారు. తల్లిని బాగా చూసుకుంటామని వారిద్దరు ఆ సమయంలో న్యాయమూర్తికి తెలిపారు. అయితే కోర్టుకిచ్చిన హామీని నిలబెట్టుకోని వీరిద్దరు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం కొడుకు, కోడలికి చీవాట్లు పెట్టింది. ఇంటిని అప్పగించడంపై అప్పీల్ చేసే బదులు.. తల్లినే అడిగి ఎందుకు ఆశ్రయం పొందకూడదని నిలదీసింది. వాస్తవానికి జరిమానా విధించి ఈ అప్పీల్ను కొట్టేయాలని.. కానీ మానవతాదృక్పథంతో ఆ పని చేయడం లేదని పేర్కొంది. తల్లి ఇంటిని ఆమెకే అప్పగించాలంది. ఈ ఉత్తర్వులను అమలు చేయకుంటే కొడుకు, కోడలుపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చునని తల్లికి సూచించింది. నాటి అమెరికా పరిస్థితి నేడు దేశంలో.. ప్రస్తుతం సమాజంలో వద్ధ తల్లిదండ్రుల పరిస్థితిని విచారణ సందర్భంగా ధర్మాసనం వివరించింది. ‘ఈమధ్య తల్లిదండ్రుల పట్ల బిడ్డల ప్రవర్తన బాధాకరంగా ఉంటోంది. యువ దంపతుల్లో మానవతా విలువలు లేకుండా పోతున్నాయి. అమెరికాలో 1990ల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనదేశంలో కనిపిస్తున్నాయి. అప్పట్లో వదిలేసిన తల్లిదండ్రులు మానసికక్షోభను అనుభవించారు. ఇప్పుడు మనదగ్గరున్న పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు’అని « వ్యాఖ్యానించింది. -
ఏసీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఆయన్ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. దీంతో జస్టిస్ చౌహాన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ చౌహాన్ ఏసీజేగా నియమితులయ్యారు. ఏప్రిల్ 2న జస్టిస్ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే జస్టిస్ చౌహాన్ ఇక్కడ ఏసీజేగా బాధ్యతలు చేపడతారు. రాజస్తాన్కు చెందిన జస్టిస్ చౌహాన్ గత ఏడాది నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. -
ఆ వివరాలు బయటపెట్టాలని ఆదేశించలేం
సాక్షి, హైదరాబాద్: డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పంచుకున్న సమాచార వివరాలను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఒక పక్క సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకోవడం గోప్యత హక్కుకు భంగమని చెబుతున్న పిటిషనర్... మరోపక్క దాన్ని బహిర్గతం చేయాలని కోరడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఓటరు కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొంది. ఆన్లైన్ అన్నది ఓ మాయాబజార్ వంటిదని, అందులో ఓసారి సమాచారాన్ని బహిర్గతం చేస్తే దాన్ని నిమిషాల్లో లక్షల్లో కాపీ చేసుకుంటారని, దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తెలిపింది. ఒకవేళ ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకున్న ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం ఆ సమాచారాన్ని పునఃసృష్టించుకునే పరిజ్ఞానం ఇప్పుడు అంతటా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించే అంశంపై మాత్రం లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీ సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పుచేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గతేడాది పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలుగు న్యాయవాదులపై కళంకిత ముద్రా?
తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు సిఫారస్ చేసిన 60 మంది న్యాయవాదులకి వ్యతిరేకంగా నివేదికలు ఉన్నాయని వార్తలొచ్చాయి. వారిపైన అవినీతి ఆరోపణలు, వృత్తిపరమైన చెడు నడవడిక ఆరోపణలు ఉన్నాయని అందుకని న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగుతుందని, దీంతో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులని తిరిగి హైకోర్టు జడ్జీలుగా నియమించడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతిని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఆ అరవైమంది న్యాయవాదుల్లో అందరూ అవినీతిపరులూ, వృత్తిపరంగా చెడు నడవడిక కలిగి ఉన్నట్టుగా అభిప్రాయం వస్తోంది. ఈ 60 మందికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే వాళ్లు అవినీతిపరులని ముద్ర వేస్తున్నారు. వాళ్లమీద మాయని మచ్చని వేస్తున్నారు. ఏ నివేదికల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వస్తున్నారో తెలియదు. ఇది ఎంతవరకు సమంజసం? జనవరి 1, 2019న హైదరాబాద్ హైకోర్టు విడి పోయి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ హైకోర్టులు ఏర్ప డ్డాయి. తెలంగాణ హైకో ర్టుకి 13 మంది న్యాయమూ ర్తులను కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 11 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.వి. బట్టీని కేరళ హైకో ర్టుకి బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆయన్ని బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం తిరిగి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్యకి సగం మంది మాత్రమే ఈ రెండు హైకోర్టుల్లో పని చేస్తు న్నారు. ఈ రెండు హైకోర్టులు ఏర్పడక ముందు ఉన్న హైదరాబాద్ హైకోర్టుకి చాలా కాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే పదవీ బాధ్యతలు నిర్వర్తిం చారు. న్యాయమూర్తుల భర్తీకి వాళ్లు అవసరమైన చర్యలని తీసుకోలేదు. ఆ విధంగా ఖాళీలు పెరు గుతూ వచ్చాయి. హైకోర్టు విడిపోకముందు కొంతమంది న్యాయ వాదుల పేర్లను జిల్లా జడ్జీల నుంచి మరికొంత మంది న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించడానికి హైదరాబాద్ హైకోర్టు కొలీ జియం సిఫారస్ చేసింది. ఈ సిఫారస్ జరిగి నాలుగు మాసాలు గడిచింది. అవి ఏమైనాయో ఎవరికీ తెలి యదు. కాగా, ఓ నాలుగు రోజుల క్రితం టెలిగ్రాఫ్ దినపత్రికలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆందోళన కలిగించే వార్త ఒకటి కనిపించింది. ఆ వార్త ఆ తరువాత చాలా పత్రికల్లో దర్శనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు సిఫారస్ చేసిన 60 మంది న్యాయవాదులకి వ్యతి రేకంగా నివేదికలు ఉన్నాయన్నది అందులోని ప్రధాన వార్తల సారాంశం. వారిపైన అవినీతి ఆరో పణలు, వృత్తిపరమైన చెడు నడవడిక ఆరోపణలు ఉన్నాయని అందుకని న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగు తోందని, దీంతో రాజ్యాంగంలో అధికరణ 224ఎ ప్రకారం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను తిరిగి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్ర పతిని కోరినట్టుగా దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. హైకోర్టు న్యాయమూర్తులుగా, న్యాయవాదుల పేర్లను సిఫారస్ చేసినప్పుడు వాళ్ల పేర్లు దాదాపు అన్ని పత్రికల్లో దర్శనం ఇచ్చాయి. అంటే ఆ అరవై మంది న్యాయవాదుల్లో అందరూ అవినీతిపరులూ, వృత్తిపరంగా చెడు నడవడిక కలిగి ఉన్నట్టుగా ఒక అభిప్రాయం కలిగే విధంగా వార్త ఉంది. ఇది ఎంత వరకు సమంజసం? న్యాయమూర్తి నియామకం కోసం వాళ్లు దరఖాస్తు చేసుకోలేదు. వాళ్ల సమ్మతిని హైకోర్టు అడిగి ఉంటుంది. సమ్మతి ఇచ్చిన పాపానికి వాళ్లు ఈ ఆరోపణలు ఎదుర్కోవాలా? క్రిమినల్ కేసుల్లో, శాఖాపరమైన కేసుల విచా రణలో వాటిని ఎదుర్కొంటున్న వ్యక్తి నేరం చేశాడా లేదా అనే విషయం గురించి మూడు సందర్భాలలో ప్రశ్నిస్తారు. శిక్ష గురించి కూడా ప్రశ్నిస్తారు. కానీ ఈ 60 మంది న్యాయవాదులకి అలాంటి అవకాశం ఇవ్వకుండానే వాళ్లు అవినీతిపరులని, వృత్తిలో చెడు నడవడిక కలిగి ఉన్నారని ముద్ర వేస్తున్నారు. వాళ్ల మీద మాయని మచ్చని వేస్తున్నారు. ఏ నివేదికల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వస్తున్నారో తెలియదు. ఒక వ్యక్తి పేరు హైకోర్టు న్యాయమూర్తి పదవి నియామకానికి పరిశీలనలో ఉందని అంటే ఆయనకు ఎంతోమంది శత్రువులు పుట్టుకొస్తారు. తోటి న్యాయ వాదులు వారిపై ఏదో ఉత్తరాలు రాస్తారు. సంబం ధిత హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారి అభిప్రాయాలను కూడా అడిగే సంప్రదాయం ఉంది. వాళ్లు హైకోర్టుని వదిలి చాలాకాలం అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడి న్యాయవాదులని అంచనా వేయడానికి వారికి వారి దగ్గర ఉన్న పనిముట్టు ఏమిటీ? వాళ్ల దురభిప్రాయం కూడా కొలీజియం సిఫారస్ చేసిన న్యాయవాదుల మీద ఉంటుంది. బేరసారాలు ఉండవని అంటారు. అది కూడా వాస్తవం కాదని చాలామంది న్యాయమూ ర్తులు వ్యక్తిగత సంభాషణల్లో చెబుతూ ఉంటారు. సీనియర్ న్యాయవాదులే కరువైనట్టుగా భావించి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాజ్యాంగంలోని అధికరణ 224ఎ ప్రకారం నియ మించడానికి రాష్ట్రపతి అనుమతిని ప్రధాన న్యాయ మూర్తి కోరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భావించినప్పుడు రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకొని తన హైకోర్టులోగానీ మరే దైనా హైకోర్టులోగానీ న్యాయమూ ర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తిని తన హైకోర్టులో గౌరవ న్యాయమూర్తిగా నియమించు కునే వెసులుబాటుని అధికరణ 224ఎ కల్పిస్తుంది. రెగ్యులర్ న్యాయమూర్తులు ఉన్నప్పటికీ అధిక పనిభారం ఉన్నప్పుడు ఈ విధంగా నియమించుకో వడం సమంజసంగానీ, అనుమతించిన న్యాయ మూర్తులను నియమించకుండా ఈ అధికరణ కింద న్యాయమూర్తులను నియమించడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. తెలంగాణ, ఏపీలో మంచి న్యాయవాదులు లేరన్న అభిప్రాయం ఈ వార్త ద్వారా కలుగుతుంది. అది వాంఛనీయం కాదు. న్యాయవాదుల నుంచి మంచి వ్యక్తులను ఎంపిక చేయాల్సిన బాధ్యత కొలీజియంలోని న్యాయమూర్తుల మీద ఉంటుంది. ఆయా హైకోర్టుల్లో పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయ మూర్తులుగా పనిచేస్తున్న న్యాయమూర్తుల అభిప్రా యాలు కొలీజియంకు శిరోధార్యం కాదు. అందుకని వారి అభిప్రాయాలకు మరీ ఎక్కువ విలువ ఇచ్చి న్యాయవాదులను పక్కన పెట్టడం సరి కాదు. న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల ఎంపికకి ఏవో అడ్డంకులు ఉన్నాయని అనుకుందాం. జిల్లా జడ్జీల నుంచి న్యాయమూర్తుల నియామకాలకి ఈ ఆటంకాలు లేవు. వారి నియామకాల్లో జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు కొలీజియం ఈ దిశగా ఆలోచిస్తుందని ఆశిద్దాం. మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు మొబైల్ : 94404 83001 -
రాయలసీమ న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనను నిరసిస్తూ ఏపీ న్యాయవాదులు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద రాయలసీమకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్టు విభజనకు కొంత సమయం కావాలని కోరుతూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించడంతో విభజకు లైక్క్లియరైంది. దీంతో ఏపీకి చెందిన న్యాయవాదులు, న్యాయసిబ్బంది అమరావతికి తరలివెళ్లక తప్పట్లేదు. ఇదిలావుండగా సహచర ఉద్యోగులు తరలివెళ్లిపోతుండటంతో హైకోర్టు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. కొందరు న్యాయమూర్తులు తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏపీకి తరలివెళ్తున్న న్యాయవాదులకు తెలంగాణ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. అమరావతిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఏపీ న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
ఏపీ న్యాయవాదులకు ఆత్మీయ వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులు, లాయర్లు తరలివెళ్లిపోతుండటంతో ఉమ్మడి హైకోర్టు వద్ద వాతావరణం హడావిడిగా ఉంది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్న న్యాయమూర్తులకు తెలంగాణ లాయర్లు, న్యాయ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనవరి 1వ తేది నుంచి రెండు హైకోర్టులుగా విడిపోవడంతో ఒకవైపు హడావిడి మరోవైపు సహచర సిబ్బంది వెళ్లిపోతుండటంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని స్వీయచిత్రాలు తీసుకుంటూ ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. ఏపీకి సిబ్బందిని, లాయర్లను తరలించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక బస్సులను పంపించారు. ఈరోజు సాయంత్రం ఏపీ చేరుకోనున్న న్యాయమూర్తులకు విజయవాడలోని ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం అమరావతిలో ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్చే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి లైక్ క్లియరైంది. -
హైకోర్టు విభజనకు లైన్క్లియర్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్క్లియర్ అయింది. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జనవరి 2వ తేదీన సుప్రీంకోర్టు తిరిగి తెరచుకోనుంది. ఆ రోజున ఈ పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ రోజే (సోమవారమే) ఆఖరి రోజు. దీంతో హైకోర్టు విభజన ప్రక్రియ యథాతథంగా కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం విభజన ప్రక్రియ సాగనుంది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి హైకోర్టు విభజన, తరలింపు ప్రక్రియకు అనుమతిస్తూ.. సుప్రీంకోర్టు జారీచేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ ఏపి హైకోర్టు న్యాయవాదుల సంఘం పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు రిజిస్టర్ వద్ద దాఖలైన ఈ పిటిషన్పై జనవరి 2న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. -
హైకోర్టు విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆందోళన
సాక్షి, అమరావతి : ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రాలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హై కోర్టు విభజన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తెలంగాణకు కేటాయించగా.. ఏపీ హై కోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. -
సీఎం క్యాంప్ ఆఫీస్లోనే హై కోర్టు కార్యకలపాలు
సాకి, అమరావతి : ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఊరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలపాలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ భవనాలు సిద్ధం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్నే హైకోర్టు కార్యకలాపాలకు వాడేలా ప్రతిపాదించారు. ఒకవేళ క్యాంప్ ఆఫీస్లో కోర్ట్ నిర్వహణ సాధ్యం కాకపోతే కొద్దిరోజుల పాటు ఉమ్మడి హైకోర్ట్ భవనంలోనే ఏపీ హైకోర్టు ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను కోర్టు వర్గాలకు సూచించారు. అయితే అమరావతిలో నాలుగేళ్ల క్రితమే తాత్కలిక హైకోర్టు నిర్మణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికే తాత్కలిక భవనాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రకటించారు. జనవరి నుంచి కోర్టు నిర్వహణకు ఇబ్బంది లేదని కూడా గతంలో ప్రకటించారు. తీరా గడువు పూర్తయ్యేనాటికి ప్రభుత్వం హై కోర్టు నిర్మణాన్ని పూర్తి చేయ్యలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తాత్కాలిక హై కోర్టు భవన నిర్మణాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
బోగస్ ఓట్లపై హైకోర్టులో నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నమోదైన బోగస్ ఓట్లపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. బోగస్ ఓట్లపై గతంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. 32 వేల 574 బూతుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, 52 లక్షల 67వేల 636 బోగస్ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు పిటీషన్లో పేర్కొన్నారు. 34 లక్షల17వేల ఓట్లు వేరు వేరు చోట్ల రిపీట్ అయ్యాయని తెలిపారు. 18 లక్షల 5 వేల ఓట్లు తెలంగాణ, ఏపీలో రిపీట్ అయ్యాయని వెల్లడించారు. ఏపీలో కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించారని కోర్టుకు తెలిపారు. 2014లో ఓటు హక్కు వినియోగించుకున్న 17లక్షల ఓటర్లను తొలగించారని, ఒక్క కడపలోనే లక్ష మందికి పైగా ఓట్లను తొలగించారని పిటీషనర్ పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ఆధార్ లింకుతో, బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలని కోరారు. గత విచారణలో పిటీషనర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు అదేశించింది. హైకోర్టు నేడు ఈ పటీషన్పై మరోమారు విచారణ చేపట్టనుంది. -
ఇక ఎవరి హైకోర్టు వారిదే
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు పూర్తయింది. గత నాలుగు రోజులుగా అదిగో.. ఇదిగో అంటున్న విభజన నోటిఫికేషన్ వెలువడింది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ దానిని గెజిట్లో ప్రచురించింది. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్కు హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరి స్తారు. అలాగే తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన 10 మంది న్యాయమూర్తులు కూడా జనవరి 1, 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా చెలామణి అవుతారు. దీంతో ఉమ్మడి హైకోర్టు అంతర్థానమై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పడినట్లైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించేది వీరే. 1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.) 2. జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ 3. జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి 4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి 5.జస్టిస్ దామా శేషాద్రి నాయుడు (బదిలీపై ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు) 5. జస్టిస్ మంథాట సీతారామమూర్తి 6.జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు 7.జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి 8.జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 9.జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ 10.జస్టిస్ జవలాకర్ ఉమాదేవి 11.జస్టిస్ నక్కా బాలయోగి 12.జస్టిస్ తేలప్రోలు రజని 13.జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు 14.జస్టిస్ కొంగర విజయలక్ష్మి 15.జస్టిస్ మంతోజు గంగారావు. ఈ 16 మందిలో జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శేషాద్రి నాయుడు వేరే హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా కొనసాగుతున్నందున మిగిలిన 14 మందే జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల విషయానికొస్తే.. 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీరామచంద్రరావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు 5. జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి 6. జస్టిస్ బులుసు శివశంకర్ రావు 7. జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ 8. జస్టిస్ పోట్లపల్లి కేశవరావు 9. జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి 10. జస్టిస్ తొండుపునూరి అమర్నాథ్ గౌడ్ వ్యవహరిస్తారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఎక్కడికి బదిలీ..? ఇక బయట రాష్ట్రాల నుంచి బదిలీపై ఇక్కడి వచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సింది. అది కూడా జనవరి 1 లోపు జరగాల్సి ఉంది. కొలీజియం నిర్ణయం ఆధారంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకవేళ జనవరి 1లోపు వీరి బదిలీపై నిర్ణయం తీసుకోని పక్షంలో లేదా బయట నుంచి ఎవరైనా సీనియర్ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలి. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న ఏపీ న్యాయమూర్తుల సీనియారిటీ జాబితా ప్రకారం జస్టిస్ ప్రవీణ్కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆ పరిస్థితి వస్తుందా? రాదా? అన్న విషయం రెండు మూడు రోజుల్లో తేలనుంది. పోరాడి సాధించుకున్నాం హైకోర్టు విభజనపై ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనను టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన సంగతిని, పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు విభజనపై కేంద్రాన్ని పలుమార్లు నిలదీసిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కాబోతుండటం సంతోషం. పోరాటం చేయడం ద్వారా ఏర్పాటుకు ఉన్న అవాంతరాలను అధిగమించాం. చాలాసార్లు వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడంతోపాటుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు నిర్వహించాం. ఎట్టకేలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడే రాష్ట్ర సంపూర్ణ విభజన జరిగినట్టు భావిస్తున్నాం. కొన్నిశక్తులు ఉమ్మడి రాజధాని ఉన్నంతవరకు ఉమ్మడి హైకోర్టు ఉండేలా ప్రయత్నాలు చేయాలనుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండటం ద్వారా తెలంగాణలో సత్వరన్యాయం అందుతుందని ఆశిస్తున్నాం..’అని పేర్కొన్నారు. ఇది శుభదినం: జితేందర్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధించుకున్న రోజున సంతోషించినట్టుగానే హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన ఈరోజు కూడా అంతే సంతోషిస్తున్నామని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘అనేకసార్లు లోక్సభను స్తంభింపజేశాం. ఎంపీలందరం కలిసి పోరాడాం. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే హైకోర్టులు ఏర్పడ్డా తెలంగాణ విషయంలో అలా జరగలేదు. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుండటం హర్షణీయం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితోనే హైకోర్టు విభజనకు పోరాడాం. న్యాయమంత్రులుగా ఉన్న సదానంద గౌడ, ఆయన తర్వాత రవిశంకర్ ప్రసాద్లకు అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. పార్లమెంటులో కొన్ని రోజులు మౌనంగా పోరాడాం. ..’అని వివరించారు. -
హైకోర్టు విభజన : ఏపీకి 16, తెలంగాణకు 10 మంది జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 16 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 10 మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు) 2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ 3. జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి 4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి 5. జస్టిస్ దామ శేషాద్రినాయుడు 6. జస్టిస్ మాదాత సీతారామమూర్తి 7. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు 8. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి 9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 10. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ 11. జస్టిస్ కుమారి జవలాకర్ ఉమాదేవి 12. జస్టిస్ నక్కా బాలయోగి 13. జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజిని 14. జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు 15. జస్టిస్ శ్రీమతి కొంగర విజయ లక్ష్మి 16. జస్టిస్ మాతోజ్ గంగారావు తెలంగాణకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు 5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి 6. జస్టిస్ బులుసు శివ శంకర్రావు 7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్ 8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు 9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్ -
ప్రభాస్ గెస్ట్హౌస్ స్ధలంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
-
ప్రభాస్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన రెవెన్యూశాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో ప్రభాస్ భూమి వివాదం కేసులో తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో ప్రభాస్కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్లో అధికారులు వివరించారు. కౌంటర్ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ గత బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. -
పచ్చనేతల ఆశలపై హాయ్‘ల్యాండ్మైన్’
సాక్షి, అమరావతి: హాయ్ల్యాండ్ను అప్పన్నంగా కొట్టేద్దామనుకున్న ‘పచ్చ’నేతల ఆశలు ఆవిరయ్యాయి. హాయ్ల్యాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా నిర్ణయించి, విక్రయానికి బిడ్లు పిలవాలంటూ అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పెద్దలకు కలవరపాటుగా మారింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్ల్యాండ్ను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేతలు సాగిస్తున్న ప్రయత్నాలకు చెక్పెట్టినట్టు అయ్యింది. చెన్నై–కోల్కతా జాతీయ రహదారి–16 వెంబడి గుంటూరు జిల్లాలో ఉన్న హాయ్ల్యాండ్ దాదాపు 86 ఎకరాల్లో విస్తరించి ఉంది. 68 ఎకరాల్లో హాయ్ల్యాండ్తోపాటు క్లబ్, 18 ఎకరాల్లో కల్యాణమండపం, క్లబ్హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఇందులోనే సుమారు పది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక హాయ్ల్యాండ్పై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. ఎవరి లెక్కలు వారివే.. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత కీలకమైన హాయ్ల్యాండ్ను పచ్చ నేతలు కేవలం రూ.250 నుంచి 350 కోట్లలోపు ధరకే అప్పన్నంగా కొట్టేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే, హాయ్ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని అగ్రిగోల్డ్ యాజమాన్యం పేర్కొంది. ‘ఆర్కా’ సంస్థ రూ.1800 కోట్లుగా చెప్పింది. హాయ్ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. అగ్రిగోల్డ్ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్చంద్ర ఫౌండేషన్ హాయ్ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా అంచనా వేసింది. ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హాయ్ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. నిజానికి దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హాయ్ల్యాండ్ విలువ దాదాపు రూ.1,800 కోట్లు దేశంలో దాదాపు 32 లక్షల మంది ఖాతాదారులను మోసం చేసిన అగ్రిగోల్డ్ వ్యహారంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఈ కేసును సీఐడీకి అప్పగించడంపై అప్పట్లో అనుమానాలు తలెత్తాయి. అగ్రిగోల్డ్ సంస్థ మోసాలపై కేసులు నమోదు కావడం, ఆస్తుల స్వాధీనం వంటివి ప్రభుత్వ పెద్దలకు కలిసొచ్చాయి. తొలినుంచి అగ్రిగోల్డ్ సంస్థతో సంబంధం లేకుండా ఆస్తుల జాబితా నుంచి హాయ్ల్యాండ్ను తప్పించి అప్పన్నంగా కొట్టేసేందుకు గట్టి ప్రయత్నాలు సాగించారు. తొలుత ఆస్తుల ఎటాచ్మెంట్లో హాయ్ల్యాండ్ విషయమై ఆచితూచి వ్యవహరించారు. అటు తరువాత వేలం ప్రక్రియలోను హాయ్ల్యాండ్ తొలిదశలో లేకుండా తప్పించారు. రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల విలువ చేసే హాయ్ల్యాండ్ తమది కాదని చెప్పి తప్పించుకోవడం ద్వారా ప్రభుత్వ పెద్దలకు సహకరించి, తద్వారా లబ్ధి పొందేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రయత్నించిదనే విమర్శలున్నాయి. అగ్రిగోల్డ్ సంస్థకు హాయ్ల్యాండ్తో సంబంధం లేదంటూ యాజమాన్యం నివేధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు హడావుడిగా హాయ్ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. దీంతో మాట మార్చిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్ల్యాండ్ తమదేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హాయ్ల్యాండ్ను వేలం వేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దాన్ని ఎవరైనా సరే వేలంలో పోటీ పడి కొనుక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. శుక్రవారం పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం హాయ్లాండ్ వేలానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. హాయ్లాండ్ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. సీల్డ్ కవర్లో బిడ్డర్స్ను ఆహ్వానించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్లోనే ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్ పిటిషన్ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభాస్ వ్యాజ్యంపై రేపు హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభాస్ గెస్ట్హౌస్ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న కేసును ఆయన తరఫు న్యాయవాది గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో రేపు (శుక్రవారం) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. -
ట్రాన్స్ట్రాయ్ ఇండియాకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియాకు హైకోర్టు గట్టి షాక్నిచ్చింది. ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు ట్రాన్స్ట్రాయ్కి చెందిన ఆస్తులను ఆంధ్రా బ్యాంకు వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రాబ్యాంకు వేలం చర్యలను సమర్థించింది. తీసుకున్న రూ.584 కోట్ల రుణానికి ట్రాన్స్ట్రాయ్ హామీగా ఉంచిన ఆస్తులను సర్ఫేసీ చట్టంకింద వేలం వేసుకోవచ్చునని ఆంధ్రా బ్యాంకుకు స్పష్టం చేసింది. రుణాలను రాబట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆంధ్రాబ్యాంకు చివరకు సర్ఫేసీ చట్టం కింద చర్యలు ప్రారంభించిందని, అందువల్ల వాటిని తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ)కి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు జారీ చేయడానికి ముందే ఆంధ్రా బ్యాంకు వేలం చర్యలను ప్రారంభించిందని తెలిపింది. అందువల్ల ఎన్సీఎల్టీ ఆదేశాల నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ ఆస్తుల క్రయ విక్రయాలపై మారటోరియం ఉన్నప్పటికీ వేలం వేసుకునే హక్కు ఆంధ్రాబ్యాంకుకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్సీఎల్టీ జారీ చేసిన సీఐఆర్పీ ఆదేశాలు అమల్లో ఉండగా, తాము హామీగా ఉంచిన ఆస్తుల వేలానికి చర్యలు తీసుకోవడం చట్ట విరుద్ధమంటూ చెరుకూరి శ్రీధర్ మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిందే... సీఐఆర్పీ అమల్లో ఉండగా ఆంధ్రా బ్యాంకు వేలం నిర్ణయం వల్ల మిగిలిన బ్యాంకులు నష్టపోతాయన్న ట్రాన్స్ట్రాయ్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 2017 డిసెంబర్ 31 నాటికి బకాయిలు చెల్లించలేకపోతే ట్రాన్స్ట్రాయ్ విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన ఉత్తర్వులకు చట్టబద్ధత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులు మరో చట్ట నిబంధనలను అతిక్రమించేలా ఉండరాదని తెలిపింది. రుణాలను రాబట్టుకునే దిశగా రుణదాతల ఉమ్మడి వేదిక (జేఎల్ఎఫ్) 2017 డిసెంబర్లో జరిపిన ప్రయత్నాలు, చర్చలు విఫలమయ్యాయంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ బకాయిల వసూలుకోసం ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించడంలో ఎటువంటి తప్పు లేదంది. ఆంధ్రా బ్యాంకు సైతం సర్ఫేసీ చట్టం కింద అటువంటి ప్రత్యామ్నాయాలనే ఎంచుకుందని తెలిపింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన సీఐఆర్పీ ఆదేశాలకు ముందే ఆంధ్రా బ్యాంకు వేలం ప్రక్రియను ప్రారంభించినందున ఆ బ్యాంకు చర్యల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 14 బ్యాంకులు.. రూ.2,687 కోట్ల నిరర్థక ఆస్తులు ఇదే సమయంలో ఆ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఆర్బీఐ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించడం గురించి కూడా ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ట్రాన్స్ట్రాయ్ 14 బ్యాంకుల నుంచి భారీస్థాయిలో రుణాలు తీసుకుందని, 2014–16 సంవత్సరాల మధ్యలో రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిందని తెలిపింది. 14 బ్యాంకుల్లో ట్రాన్స్ట్రాయ్కు రూ.2687.13 కోట్ల నిరర్థక ఆస్తులున్నట్లు ఆర్బీఐ ప్రకటించినట్లు పేర్కొంది. కెనరా బ్యాంకు రూ.273.12 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.227.50 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.419.68 కోట్లు, యూకో బ్యాంకు రూ.60.64 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.293.61 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.232.63 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.172.79 కోట్లు, దేనా బ్యాంకు రూ.123.50 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.246.23 కోట్లు, విజయ బ్యాంకు రూ.15 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.298.14 కోట్లు, సౌత్ ఇండియన్ బ్యాంకు రూ.80 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.124.94 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.119.95 కోట్లు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలకు ట్రాన్స్ట్రాయ్ ఇండియా పలు ఆస్తులను తాకట్టుపెట్టింది. -
ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసిన కేంద్ర న్యాయశాఖ అందు లో మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్కు ప్ర«ధాని మోదీ ఆమోదముద్ర వేశారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే తేదీని (అపాయింటెండ్ డే) అందులో పొందుపరుస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పా టయ్యే ప్రాంతాన్ని కూడా నోటిఫై చేస్తారు. నోటిఫి కేషన్ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు హైకోర్టు ను తరలించాల్సి ఉంటుంది. ఈ గడువును పెంచాల ని కోరే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు విభజనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2019 జనవరి 1 నాటికి కేంద్రం విభజన నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 15 నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపిన విష యం తెలిసిందే. నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 15 నాటికి భవనం పూర్తవుతుందని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు డిసెంబర్ 31 నాటికి భవనం సిద్ధమ వుతుందని చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల బట్టి చూస్తే నెలాఖరుకు భవనం సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తరలింపు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. ‘నోటిఫికేషన్ వెలువడటం అన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయించిన విధంగా ఈ వారంలో నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తరలిం పునకు 90 రోజుల గడువు ఎలానూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ వచ్చినా, రాబోయే 3 నెల ల్లోపు ఎప్పుడైనా అమరావతికి హైకోర్టును తర లించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన తోనే ఉంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైకోర్టు విభజనకు వీలుగా న్యాయమూర్తుల విభజన కూడా పూరై్తన విషయం తెలిసిందే. -
చంద్రబాబు కుటుంబం ఆస్తులపై పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తుల వివరాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాతో విచారణ జరిపించాలని ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది రామారావు దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్న హెరిటేజ్ గ్రూప్ కంపెనీల ఆదాయాన్ని ఫోరెన్సిక్ అడిట్ చేయించాలని కోరారు. గతంలో మొత్తం 14 కంపెనీలపై ఆర్వోసీ(రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)కి ఫిర్యాదు చేస్తే కేవలం ఐదు కంపెనీలపై మాత్రమే చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మిగతా తొమ్మిది కంపెనీలపై కూడా చర్యలు చేపట్టేవిధంగా ఆర్వోసీని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. -
వైద్యారోగ్యశాఖలో అవినీతిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో అవకతవకలపై ప్రజాధన పరిరక్షణ సమితికి చెందిన రామరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రూ.370 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ఎంపికలో అక్రమాలు జరిగాయని, నకిలీ పత్రాలు సృష్టించి.. ధనుష్ సంస్థకు టెండర్ అప్పగించారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, ధనుష్ సంస్థ, ఏపీఎంఎస్డీసీ తదితరులను వివరణ కోరింది. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. వివరాలు దాచి అఫిడవిట్..! టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి రిటర్నరింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేసి ఇప్పుడు విజయం సాధించారు. -
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఈ శుక్రవారం అగ్రిగోల్డ్ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. హాయ్ల్యాండ్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఏపీ పోలీసులు కోర్టుకు తెలిపారు. హాయ్ల్యాండ్ ఎండీ అల్లూరు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశామని వారు కోర్టుకు వెల్లడించారు. హాయ్ల్యాండ్ ప్రాపర్టీపై అగ్రిగోల్డ్ యాజమాన్యం వైఖరిని హైకోర్టు ప్రశ్నించింది. వారం లోపు హాయ్ల్యాండ్ ఆస్తులపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య గుంటూరు : అగ్రిగోల్డ్ ఏజెంట్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వినుకొండలో చోటుచేసుకుంది. ధనరాజ్ అనే అగ్రిగోల్డ్ ఏజెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బుధవారం పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తేలిసిందే. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు హౌజ్ అరెస్ట్పై లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఎంపీ అవినాష్, సురేష్ బాబు, సుధీర్ రెడ్డిలు ఈ పిటీషన్ను ఫైల్ చేశారు. వైసీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేయలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే పిటీషనర్ తరపు న్యాయవాది ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచారు. దీంతో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి : పోలీసుల అత్యుత్సాహం: వైఎస్సార్సీపీ నేతల హౌజ్ అరెస్ట్ -
వరవరరావుకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ గడవు ముగిసేలోపు పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా గృహనిర్భందంలో ఉన్న వరవరరావుకు చికిత్స ఉందించాలని హైకోర్టు అదేశించినా.. ఇప్పటివరకు చికిత్స అందలేదని ఆయన తరుఫున న్యాయవాది న్యాయస్థానంలో తెలిపారు. -
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కేసుపై ఉమ్మడి హైకోర్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. హాయ్లాండ్ ప్రాపర్టీ తమది కాదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్ట్ మొదలైంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం విచారించింది. హాయ్లాండ్ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణ నుంచి ఆస్తుల వేలం వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. హాయ్లాండ్ ప్రాపర్టీపై స్పెషల్ సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. -
హాయ్లాండ్ ఆస్తులు తమవి కావన్న అగ్రిగోల్డ్ యాజమాన్యం
-
ధర్నాచౌక్కు ప్రాణప్రతిష్ట
హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్లో యధావిధిగా బహిరంగసభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు హర్షించదగినవి. ఇరవైయ్యేళ్లపాటు సామాన్యుడి సమస్యలను ఎలుగెత్తి చాటిన ధర్నా చౌక్ ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలతో మూగబోయింది. నిషేధాజ్ఞలకు ప్రభుత్వం చెప్పిన కారణాలు వింతగా ఉన్నాయని అప్పట్లోనే ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేయడం, వాటికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరాహారదీక్షలు నిర్వహిం చడం, సభలు పెట్టడం మన రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఆ హక్కుకు భంగం వాటిల్ల కుండా చూడటం వల్ల పాలకులకు రెండు ప్రయోజనాలుంటాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చినవారు దానికి బద్ధులై పరిపాలిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకు కలిగితే అది పాలకులకుండే గౌరవాన్ని పెంచుతుంది. మరోపక్క తాము తీసుకునే నిర్ణయాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉందన్న సంగతి పాలకులకు అర్ధమై, సవరించుకోవడానికి వీలవుతుంది. ధర్నా లకూ, నిరసనలకూ అవకాశం లేకుంటే ఇదంతా సాధ్యపడదు. స్థానికుల వినతి మేరకే ధర్నా చౌక్ను మార్చవలసి వచ్చిందన్న ప్రభుత్వ సంజాయిషీలో అబద్ధమేమీ లేదు. ఈ విషయంలో అంతకుముందే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ పరిసరాల నుంచి దీన్ని తరలించేలా ఆదేశించమని ఆ పిటిషన్ కోరింది. దానిపై విచారణ పెండింగ్లో ఉండగానే తెలంగాణ సర్కారు ధర్నాచౌక్ను సరూర్నగర్ స్టేడియానికి తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరసన సమస్యే అను కుంటే, ఆ సమస్య ధర్నాచౌక్ పరిసరాల్లోని వారికి మాత్రమే కాదు... రేపన్నరోజున సరూర్ నగర్ ప్రాంతవాసులకు కూడా ఏర్పడొచ్చు. అప్పుడు మళ్లీ దాన్ని ఇంకోచోటకు తరలిస్తారా? ఇలా అస మ్మతిని, నిరసన గళాలను శివార్లకు నెట్టుకుంటూ పోవడం ప్రజాస్వామిక పరిష్కారమవుతుందా? దీన్ని హైకోర్టు ధర్మాసనంతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పాలకులే నిశితంగా ఆలోచించి ఉంటే వారికే బోధపడేది. నిరసనలు వ్యక్తం చేయడం, బంద్లు, ధర్నాలు నిర్వహించడం మహాపాపమన్న అభిప్రాయం పాలకుల్లో మాత్రమే కాదు... మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజానీకంలో కూడా ఇటీవలి కాలంలో కనబడుతోంది. వారి దృష్టిలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా అభిప్రాయం చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా నిరసనలు రోడ్డెక్కడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోందని వారి ఫిర్యాదు. నిరుడు అక్టోబర్లో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) మరో అడుగు ముందుకేసి విచిత్రమైన ఉత్తర్వులిచ్చి అంద రినీ దిగ్భ్రాంతిపరిచింది. న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సాగే నిరసనలవల్ల ఆ ప్రాంతం కాలు ష్యమయమైందని, నిరసనల్లో పాల్గొనేవారి కార్యకలాపాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నా యని అది మండిపడింది. ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిందే తడవుగా ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులం దరినీ వెళ్లగొట్టారు. మళ్లీ మొన్న జూలైలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్నంతటినీ చక్కదిద్దాల్సి వచ్చింది. ఎన్జీటీ వంటి ఉన్నతస్థాయి సంస్థే నిరసనల్లో పర్యావరణానికి ముప్పు కలిగించే ప్రమా దాన్ని పసిగట్టినప్పుడు, కొన్ని గంటలపాటు నడిరోడ్డుపై చిక్కుకుపోయే సామాన్యులకు చికాకు కల గడంలో, వారు కోర్టుకెక్కడంలో వింతేముంది? నిరసనలకు ఎటు నుంచి ముప్పు కలుగుతుందో చెప్పడం కష్టం. ఎన్నాళ్లుంటుందో తెలియని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆమధ్య కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యా పకులకు జైల్ మాన్యువల్ను తలపించేలా ఒక హుకుం జారీ చేసింది. విద్యావేత్తలెవరూ ప్రభు త్వాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయరాదని దాని సారాంశం. 1964నాటి కేంద్ర పౌర సర్వీసుల నియమావళి(సీసీఎస్) అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని యూజీసీ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాలు రూపొందించే విధానాల్లో భాగస్తులవుతారు గనుక ఆ విధానాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని నిబంధనావళి చెబుతోంది. దాన్ని కొంతవరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ విశ్వవిద్యాలయ అధ్యాపకులు వారికి భిన్నమైనవారు. వారి నోరు నొక్కితే భిన్నాభిప్రాయం బెడద సమసిపోతుందని పాలకులు భావిస్తున్నారు. ఈ విష యంలో అధ్యాపకుల తరఫున మాట్లాడి విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన యూజీసీ... ప్రభుత్వ మనోగతాన్ని అధ్యాపకులపై రుద్దాలని చూస్తోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి నిరసనలంటే మొదటినుంచీ వెగటే. అమరావతి దరిదాపుల్లోకి అది చేరకుండా ఆయన కట్టడి చేశారు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచివాలయం సమీ పంలో ఉండే నిరసన వేదిక ఇప్పటి ధర్నాచౌక్కు తరలడం ఆయన నిర్వాకమే. ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పక్షం తన ఇష్టానుసారం పరిపాలించడం కాదు. అది చట్టసభలో విపక్షం వ్యక్తం చేసే అభిప్రాయాలతోపాటు, దాని వెలుపల ఉన్న విశాల ప్రజానీకం మనోభావాలను గుర్తించడం కూడా. చలనశీలమైన సమష్టి మేధోమథనం ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది తప్ప అందరి నోళ్లూ నొక్కి ప్రశాంతత నెలకొల్పడం ద్వారా కాదు. ఎవరూ ధర్నాలు, నిరసనలు చేయనవసరం లేని పరిస్థితులు ఏర్పరిచేందుకు చిత్తశుద్ధితో పాటుపడ దామనుకుంటే మంచిదే. అంతేతప్ప వాటిని నిషేధిస్తామని, ఊరు వెలుపలకు గెంటేస్తామని అన డం అప్రజాస్వామికమవుతుంది. హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విలువైనవి. అవి దేశంలోని పాలకులందరూ పరిగణనలోకి తీసుకోదగ్గవి. -
టీటీడీ ఆలయాల ఆడిట్ వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆస్తులు, ఆదాయ, వ్యయాలు, కానుకలు, విరాళాలు, ఖర్చులపై నిర్వహించే ఆడిట్ వివరాలు అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటర్ నియామకానికి సంబంధించి స్పష్టత లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తిరుమల దేవస్థానం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఆదాయాలున్న మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యస్వామి, డిల్లీకి చెందిన లా విద్యార్థి సత్యపాల్ సభర్వాల్ వ్యక్తిగత హోదాలో (పార్టీ ఇన్ పర్సన్) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఆదాయం ఉన్న ఆలయాలపై ప్రభుత్వానికి అజమాయిషీ కల్పిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టంలోని సెక్షన్లు 15, 29, 96, 97–ఎ/బి, 106, 108, 109, 110, 115లను వారు పిల్లో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాల ప్రకారం ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమని సుబ్రమణ్యస్వామి వాదించారు. ధార్మిక సంస్థల పర్యవేక్షణలో ఆలయాలను నిర్వహించాలని చెప్పారు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ చెల్లదని, కేవలం దేవుడి ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ధర్మకర్త పాత్ర పోషించాలన్నారు. టీటీడీ ఆలయాలపై ప్రభుత్వపాలన 85 ఏళ్లకుపైగా కొనసాగుతోందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. నిధుల వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆడిట్ పారదర్శకంగా లేదని, కాగ్ కూడా తప్పుపట్టినా పట్టించుకోవడంలేదని సుబ్రమణ్యస్వామి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ వాదిస్తూ ఏపీ ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా టీటీడీ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి లోబడి టీటీడీ ఆడిట్ జరుగుతోందని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీటీడీ తరఫు న్యాయవాది లలిత బదులిచ్చారు. వాదనల అనంతరం విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. -
హత్యాయత్నం కేసులో హైకోర్టు నోటీసులు
-
దద్దరిల్లనున్న ధర్నాచౌక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలను ప్రభుత్వం నిషేధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిరసన గళం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, అటువంటి నిరసన గళాన్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమావేశమయ్యే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, సహేతుక ఆధారాలు లేకుండా ఈ హక్కులపై ఏకపక్ష ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని తేల్చి చెప్పింది. ధర్నాచౌక్ కాకుండా నిరసన కార్యక్రమాల నిర్వహణకు వేదికగా సరూర్నగర్ స్టేడియాన్ని ఎంపిక చేశామని, అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా తమకు ఇబ్బంది లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోలాగే ధర్నాచౌక్ను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే నిరసనల నిర్వహణ సమయంలో అర్థవంతమైన ఆంక్షలు విధించవచ్చని పోలీసులకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆరు వారాలపాటు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టేందుకు తమ ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం లైసెన్స్ కాదని తేల్చి చెప్పింది. స్థానికులకు ఇబ్బంది అవుతోందనే... ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్గా పరిగణించింది. ఈ వ్యాజ్యాల్లో కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్ ఇదే అభ్యర్థనతో ఇంప్లీడ్ అయ్యారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు చేపడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ఇందిరాపార్క్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని, నిరసనల వల్ల భారీగా ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోందన్నారు. అంతేకాక ఆ ప్రాంతం అత్యధిక జనసాంద్రతగల ప్రాంతమని వివరించారు. అందుకే సరూర్నగర్ స్డేడియాన్ని ధర్నా చౌక్గా గుర్తించామని, అక్కడ నిరసనలు చేపట్టేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. ఆ గళాల వల్లే ప్రజాస్వామ్య బతికిబట్టకడుతోంది... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారు అంతేనా? జనాలు ఉన్న చోట కాకుండా అడవుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలా? ఇంట్లో ఏడుస్తున్న పిల్లాడిని పైగదిలోకి వెళ్లి ఏడువు అన్నట్లు మీ వాదన ఉంది. నిరసనల వల్ల ఇబ్బంది ఉంటే అర్థవంతమైన ఆంక్షలు విధించండి. పరిమితులు, షరతులతో అనుమతులివ్వండి. అంతేకానీ నిరసన గళాలు వినిపించకుండా చేస్తామంటే ఎలా? ఇంకా ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోందంటే ఈ నిరసన గళాలే కారణం. ఇవే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఇవి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ట్రాఫిక్ సమస్య ఉంటే వేల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్న కార్ల సంఖ్యను వాటిని వందల సంఖ్యలోకి తీసుకురండి’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తిరిగి శరత్ వాదనలు వినిపిస్తూ ధర్నాచౌక్ వద్ద అనుకోని ఘటన ఏదైనా జరిగితే బయటపడటం కష్టమని పేర్కొనగా ఇప్పటివరకు అటువంటి ఘటనలు ఎన్ని జరిగాయని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రైవేటు’కోసం నిరసనలను అడ్డుకోమంటారా?! ‘ఆ చుట్టుపక్కల అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఎవరు ఇవ్వమన్నారు? అన్ని విద్యా సంస్థలకు అనుమతులు ఎందుకిచ్చారు. ఇందులో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి? ఎన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలన్నది రాజ్యాంగకర్తల ఆలోచన. అయితే ఇప్పుడు అంతా ప్రైవేటుమయం అయిపోయింది. అందుకు మీరు చెబుతున్న ఉదాహరణలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కోసం నిరసన గళాలను అడ్డుకోమంటారా? ఈరోజు ధర్నాచౌక్ వద్ద నిరసనలు చేపట్టడానికి వీల్లేదంటారు. రేపు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలని కూడా నిర్ధేశిస్తారు. మీ (ప్రభుత్వ) వాదనతో మేం ఎంత మాత్రం ఏకీభవించడం లేదు’అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల అనంతరానికి ఈ వ్యాజ్యాలను వాయిదా వేయాలని, ఇప్పుడు ధర్నాచౌక్ వినియోగానికి అనుమతినిస్తే ఎన్నికల సమావేశాలన్నీ అక్కడే జరుగుతాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ పేర్కొనగా ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ధర్నాచౌక్ వద్ద పరిస్థితి ఏమిటని ధర్మాసనం ఆరా తీయగా వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్రెడ్డి స్పందిస్తూ అక్కడ ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్లు తమ బస్సులను పార్కింగ్ చేస్తున్నారన్నారు. ఆ హక్కు ఎందుకు లేదు..? ఈ సమయంలో నిరసన తెలియచేసే ప్రాంతాన్ని ఎంచుకునే హక్కు ఆందోళనకారులకు లేదని శరత్ వాదించగా ఎందుకు లేదని ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు ఈ దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో చాడ వెంకటరెడ్డి తరఫు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్, వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్రెడ్డి స్పందిస్తూ గత 20 ఏళ్లుగా ధర్నాచౌక్ కొనసాగుతోందని, ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, ఒకవేళ ఏవైనా జరిగి ఉంటే అవి పోలీసుల అత్యుత్సాహం వల్లే జరిగాయన్నారు. ఈ సమయంలో ఇంప్లీడ్ పిటిషనర్ నగేష్ ముదిరాజ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ రాజకీయ పార్టీలే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి అక్కడ దివ్యాంగులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, చిరుద్యోగులూ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అదే చీఫ్ జస్టిస్ బంగ్లాకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తారు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘ధర్నా చౌక్కు ఒక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు నేను మా కారు డ్రైవర్ను ధర్నా చౌక్ వద్దకు తీసుకెళ్లమంటే నేరుగా తీసుకెళ్తాడు. అదే ఓ ఆటో డ్రైవర్ను నన్ను చీఫ్ జస్టిస్ బంగ్లా వద్దకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తాడు. అది ఎక్కడుందని అడుగుతాడు. తాజ్కృష్ణకు సమీపంలో ఉందని, అక్కడి నుంచి ముందుకెళ్లి ఎడమ వైపు తిరిగి చీఫ్ జస్టిస్ బంగ్లా వస్తుందని చెప్పినా కూడా నేరుగా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ధర్నా చౌక్ పరిస్థితి అది కాదు. దానికున్న గుర్తింపు అలాంటిది’అంటూ వ్యాఖ్యానించింది. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ ధర్నాచౌక్ను గతంలోలాగా వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. -
జగన్పై హత్యాయత్నం: హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో తాము ఆదేశాలు ఇచ్చేంతవరకు సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. జగన్పై హత్యాయత్నం కేసులో హడా వుడిగా, మొక్కుబడిగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా కేసుకు ముగింపు పల కాలన్న ఆలోచనతో పోలీసులున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదే సమయంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని వైఎస్ జగన్ కోరుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సిటీ ఏసీపీ, 5వ పట్టణ ఎస్హెచ్వో, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీలకు న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు హత్యాయత్నం కేసు దర్యాప్తునకు తమ ముందు దాఖలైన ఈ వ్యాజ్యాలు ఎంత మాత్రంఅడ్డంకి కాదని, దర్యాప్తును యథావిధిగా కొనసాగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్లో మరో నివేదికను తమ ముందుంచాలని కూడా సిట్ అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజాగా జరిపింది. దర్యాప్తు పురోగతిపై కోర్టుకు నివేదిక సమర్పించిన ఏజీ... విచారణ ప్రారంభం కాగానే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్కవర్లో ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం నివేదికలోని అంశాల ఆధారంగా సందేహాల నివృత్తి కోసం ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన పలువురి వాంగ్మూలాలను కోర్టులో ఉన్న ఏసీపీ నాగేశ్వరరావును అడిగి తెప్పించుకుంది. ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయం లోపల ఉన్న వారి సాక్ష్యాలను కూడా నమోదు చేశారా? అంటూ ఆరా తీసింది. ఈ వాంగ్మూలాలను ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. సీఎం, డీజీపీకి వాస్తవాలు తెలిసే అలా మాట్లాడుతున్నారు ఆ తరువాత వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీలు దర్యాప్తు తీరును ప్రభావితం చేస్తున్నారని నివేదించారు. అందులో భాగంగానే జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే విలేకరుల సమావేశాలు నిర్వహించి ఘటనను తక్కువ చేస్తూ మాట్లాడారని తెలిపారు. ఇదంతా జగన్ డ్రామా అంటూ ఒకరు, ప్రచారం కోసం చేశారంటూ మరొకరు వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రి మండలి మొత్తం సీఎం చంద్రబాబునే అనుసరించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని చెప్పారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన నారా లోకేష్ ట్వీట్ల ద్వారా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటూ ఆ కాపీలను ధర్మాసనం ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్ను ఎవరైనా ప్రభావితం చేస్తుంటే న్యాయస్థానాలు వెంటనే జోక్యం చేసుకుని అటువంటి చర్యలకు అడ్డుకట్టవేస్తాయని, ఇక్కడ కూడా అలాంటి చర్యలే తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్పై హత్యాయత్నానికి సంబంధించిన వాస్తవాలు ముఖ్యమంత్రి, డీజీపీకి తెలుసని, అందుకే వారు దర్యాప్తును పక్కదారి పట్టేలా మాట్లాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాను ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి మాట్లాడారన్నారు. సీఎం, డీజీపీలు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నందునే తాము స్వతంత్ర సంస్థతో విచారణను కోరుతున్నామన్నారు. కోర్టు ఏ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించినా అభ్యంతరం లేదు... ఏ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కోరుతున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించగా... ఈ న్యాయస్థానం ఏ సంస్థ చేత చేయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు కావాల్సింది వాస్తవాలు వెలుగులోకి రావడమేనన్నారు. ఆ స్వతంత్ర సంస్థ దర్యాప్తును ఈ న్యాయస్థానం పర్యవేక్షిస్తే ఇంకా మంచిదని మోహన్రెడ్డి నివేదించారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు పని చేస్తున్న రెస్టారెంట్ టీడీపీ క్రియాశీలక నేతదని, ఆయన గతంలో ఆ పార్టీ టిక్కెట్ కోసం కూడా ప్రయత్నించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిష్పాక్షిక దర్యాప్తు బాధితుడి హక్కు... ఆ తరువాత వైఎస్సార్ సీపీ తరఫున దాఖలైన వ్యాజ్యంలో మరో సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ డీజీపీ, సీఎంల వ్యాఖ్యల నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమయ్యే అవకాశం లేదని కోర్టుకు నివేదించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, అయితే అందుకు భిన్నంగా వారు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు కోరే హక్కు బాధితుడికి ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి గురించి ప్రజలకు ముఖ్యమంత్రి వివరించడంలో తప్పేముందని ప్రశ్నించింది. దీనిపై ఏజీ శ్రీనివాస్ స్పందిస్తూ ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారని తెలిపారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడిందని, అందుకే ముఖ్యమంత్రి వాస్తవాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరించారని చెప్పారు. ముఖ్యమంత్రి అలా మాట్లాడటం వల్లే మేం కోర్టుకొచ్చాం... దీనికి ప్రకాశ్రెడ్డి సమాధానమిస్తూ... ప్రతి రాజకీయ నేత కూడా ఘటన జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని చెప్పడం పరిపాటని, అయితే ఇక్కడ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి గంటసేపు మీడియాతో మాట్లాడారని కోర్టుకు నివేదించారు. ఆయన ఇదంతా డ్రామా అని అనకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలాకాకుండా దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడటమే అనుమానాలకు తావిస్తోందని, అందుకే తాము నిష్పాక్షిక దర్యాప్తు కోసం కోర్టు మెట్లు ఎక్కామని తెలిపారు. ఘటన జరిగిన తరువాత ఎప్పటికో తాము కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పుపట్టవచ్చునని, అయితే ఘటన జరిగిన వెంటనే న్యాయస్థానానికి వచ్చామని నివేదించారు. తొలుత ప్రతివాదులందరికీ నోటీసులన్న ధర్మాసనం.. అందరి వాదనలు విన్న ధర్మాసనం సిట్ నివేదికను పరిశీలించిన తరువాత ఈ వ్యాజ్యాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నంత మాత్రాన ఇవి సిట్ దర్యాప్తునకు ఎటువంటి అడ్డంకి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి దర్యాప్తు పురోగతిపై మరో నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. ప్రతివాదుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రికి నోటీసు అవసరం లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మినహా మిగిలిన ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. -
జగన్పై హత్యాయత్నం: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
-
జగన్పై హత్యాయత్నం: హోం శాఖలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర, రాష్ట్ర హోంశాఖలతో పాటు ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ తో సహా 7 మందికి నోటీసులు జారీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ రెండు వారాల విచారణ రిపోర్ట్ను సీల్డ్కవర్లో మరోసారి తమకు సమర్పించాలని సిట్ అధికారులను ఆదేశించింది. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. సిట్ దర్యాప్తు పురోగతిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, సిట్కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీసు అధికారుల వివరాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు సిట్ అధికారులు మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ సీసీ టీవీ ఫుటేజ్ వివరాలు ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్ లేదని అధికారులు తెలపడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై కూడా సిట్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్ భద్రతా లోపాలు క్షమించరానివని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. హత్యాయత్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకుర్ వ్యాఖ్యలను వైఎస్ జగన్ తరుపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంశాన్ని కూడా వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం రిట్ పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
టీటీడీపై ఏపీ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదంటూ పిటీషన్!
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదని బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి విధానం కలిగి ఉండేలా ఉమ్మడి ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. ప్రభుత్వ అజామాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్లో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. మరి కొద్ది సేపట్లో ఈ పిటీషన్ను ఉమ్మడి ధర్మాసనం విచారించనుంది. -
ఎన్నికల హామీల అమలు బాధ్యత పార్టీలదే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు విచక్షణారహితంగా చేస్తున్న హామీలకు ఆయా పార్టీలను బాధ్యులను చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలైంది. సుబ్రమణ్యం బాలాజీ–తమిళనాడు ప్రభుత్వాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని చార్టర్డ్æ అకౌంటెంట్ ఎం.నారాయణాచార్యులు దాఖలు చేసిన పిల్లో హైకోర్టును అభ్యర్థించారు. అధికారమే పరమావధిగా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే హామీలు ఇస్తున్నాయని, పార్టీలిచ్చే హామీలపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈ పిల్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మంగళవా రం న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. అయితే ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టలేమని, గురువారం (8న) విచారించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తితో కూడి న ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని న్యాయ మూర్తులు తెలిపారు. ‘హామీల అమలుకు ఆదర్శ ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉంది. మేనిఫెస్టో అమలుకు ఎంసీసీని ఎవరూ అమలు చేయడం లేదు. అధికారమే పరమావధిగా పదవీ వ్యామోహంతో పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇచ్చేస్తున్నాయి. ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకా రం అమలు కాని హామీలు ఇవ్వడానికి వీల్లేదు. ఎంసీసీ అమలుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పా టు చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి...’అని పిల్లో కోరారు. -
హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన వరవరరావు
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్ర పోలీసులు జారీ చేసిన ట్రాన్సిట్ వారెంట్ను కొట్టివేయాలని విరసం నేత వరవరరావు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. భీమ్ కోరేగామ్ అల్లర్ల ఘటనలో భాగంగా వరవరరావు గృహనిర్భందంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు తెలిపారు. పిటీషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై నిమ్స్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఆయన ఇంటికి వెళ్లి వైద్యం అందించాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. -
జనవరి 1లోగా నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటుకు వీలుగా అన్ని వసతులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఇక ఉమ్మడి హైకోర్టు విభజనకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 1, 2019లోగా ఈ నోటిఫికేషన్ వెలువడుతుందని తాము ఆశిస్తున్నామని, తద్వారా రెండు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు నూతన భవనంలో త్వరగా తమ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ డిసెంబర్ 15లోగా హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతుందని. న్యాయమూర్తులకోసం తాత్కాలికంగా విల్లాలను అద్దెకు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ ఆ మేరకు అఫిడవిట్ సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రీ కూడా ఒక అఫిడవిట్ సమర్పించింది. ప్రతిపాదిత తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణంపై తనిఖీకోసం ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని, అక్కడికి వెళ్లేందుకు న్యాయమూర్తులు సిద్ధంగా లేరన్న అభిప్రాయం సరికాదని ఈ అఫిడవిట్లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు పేర్కొంది. ‘‘డిసెంబర్ 15, 2018 నాటికి ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులుగా వెళ్లనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఈ భవనంలోని వసతులపై సంతృప్తి చెందారు. అమరావతిలో ‘జస్టిస్ సిటీ’పేరుతో భారీ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. న్యాయమూర్తులు, సబార్డినేట్ జ్యుడీషియల్ అధికారులకు వసతి కల్పించేందుకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల జస్టిస్ సిటీ నిర్మాణం పూర్తయ్యేంతవరకు తాత్కాలిక భవనంలో హైకోర్టు విధులు నిర్వర్తించవచ్చు. అవసరమైన అన్ని వసతులు సమకూరినందున ఇక హైకోర్టును విభజించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. ఈ నోటిఫికేషన్ జనవరి 1, 2019లోగా వెలువడుతుందని ఆశిస్తున్నాం. తద్వారా రెండు హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు కూడా నూతన భవనంలో వీలైనంత త్వరగా కార్యకలాపాలు నిర్వర్తిస్తుంద ని ఆశిస్తున్నాం’’అని ధర్మాసనం పేర్కొంది. కోమటిరెడ్డి, సంపత్ కేసు తీర్పుపై స్టే పొడిగింపు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్లను బహిష్కరించడం చెల్లదని సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను మరో మూడు వారాలు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ/న్యాయ శాఖల కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే గడువు ముగిసిందని, తిరిగి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కోరారు. దీంతో ఉత్తర్వుల్ని మరో మూడు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
కుట్రకోణంపై దర్యాప్తు జరపాలి
-
బ్రేకింగ్: కుట్రకోణంపై దర్యాప్తు జరపాలి: హైకోర్టులో జగన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు దర్యాప్తులో కుట్రకోణాన్ని ఏపీ పోలీసులు విస్మరించారని పిటిషన్లో వైఎస్ జగన్ తెలిపారు. ఈ కేసు విచారణను సక్రమంగా జరపడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆయన తెలిపారు. ఈ కేసులోని కుట్రకోణంపై సజావుగా దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్లో మొత్తం ఎనిమిది మందిని వైఎస్ జగన్ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, సిట్ ఇన్చార్జి ఏసీపీ, ఎయిర్పోర్టు పీఎస్ ఎస్హెచ్వో.. తదితరులతోపాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా వైస్ జగన్ ప్రతివాదిగా చేర్చారు. ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణను చేపట్టనుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ.. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తాను తీసుకెళుతున్నానని వైఎస్ జగన్ తన పిటిషన్లో స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడున్న నేపథ్యంలో ఆపరేషన్ గరుడ పేరుతో ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని, ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ ఇది అంటూ ప్రచారం చేశారని వైఎస్ జగన్ తన పిటిషన్లో హైకోర్టు దృష్టికి తెచ్చారు. ‘టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శివాజీయే ఆపరేషన్ గరుడ పాత్రధారి.. పాదయాత్రలో భాగంగా నాపై దాడి జరుగుతుందని శివాజీ గతంలో ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ పతనానికి అది దారితీస్తుందని శివాజీ చెప్పారు’ అని వైఎస్ జగన్ తెలిపారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదొక భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి.. అది ఆపరేషన్ గరుడలో భాగమని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్పోర్టుకు తాను వచ్చానని, విమానాశ్రయం లాంజ్లో కూర్చుని ఉండగా రెస్టారెంట్లో పనిచేసే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరికి వచ్చి.. తనపై దాడి చేయబోయాడని వైఎస్ జగన్ వెల్లడించారు. పదునైన కత్తితో దుండగుడు తనపై దాడి చేశాడని, ఈ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని, తాను కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలోకి గుచ్చుకుందని, దీంతో ప్రాణాపాయం తప్పిందని వైఎస్ జగన్ పిటిషన్లో తెలిపారు. ‘‘దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నేను హైదరాబాద్ వచ్చాను. సిటీ న్యూరో ఆస్పత్రిలో వైద్యులు నాకు చికిత్స అందించి.. గాయానికి9 కుట్లు వేశారు. నాపై దాడి జరిగిన గంట సమయంలోనే ఏపీ డీజీపీ ప్రెస్మీట్ పెట్టి.. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందంటూ దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా ప్రెస్మీట్ నిర్వహించి.. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమని చెప్పారు. దాడి చాలా చిన్న విషయమంటూ సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా ప్రవర్తించారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో నాపై జరిగింది హత్యాయత్నమేనని తేల్చారు. వేర్వేరు చేతిరాతలతో ఉన్న పదిపేజీల లేఖను పోలీసులు విడుదల చేసి.. ఘటన జరిగిన గంటలోనే ఓ ప్లెక్సీని తెరపైకి తెచ్చారు. దాడి చేసిన నిందితుడు వైఎస్సార్సీపీ అభిమాని అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేలా సీఎం, డీజీపీల ప్రకటనలు ఉన్నాయి. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు. నా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా ఏపీ పోలీసుల విచారణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించండి’’ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కోరారు. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం: విచారణ ఎల్లుండికి వాయిదా!
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఏపీ డీజీపీ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్, ఎయిర్పోర్ట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను సుబ్బారెడ్డి తన పిటిషన్లో చేర్చారు. ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును తప్పదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని, కేసును రాజ్యంగబద్ధంగా కాకుండా రాజకీయకోణంలో దర్యాప్తు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం తర్వాత ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే.. డీజీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆయన ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం తమకు ఉందని వైవీ సుబ్బారెడ్డి తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. -
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై ఈ శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్కు సంబంధించిన హాయ్లాండ్ విలువను రూ. 550కోట్లుగా కోర్టు నిర్ణయించింది. 2022 వరకు గడువు ఇస్తే రూ. 8.500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతి పాదనను హైకోర్టు తోసి పుచ్చింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ భవనాన్ని విక్రయించగా వచ్చిన 11 కోట్ల రూపాయలను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు. ఎపీ సీఐడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించగా, తెలంగాణ సీఐడి తెలంగాణలోని 195 అగ్రిగోల్డ్ అస్తుల విలువను కోర్టుకు సమర్పించింది. హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రైడ్డిపై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీచేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. (ఆ లేఖపై సందేహాలెన్నో!) తమ అధినేతపై కుట్ర జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఇక ఈ హత్యాయత్నం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిల్ను మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. (వైఎస్ జగన్పై హత్యాయత్నం; మరో కత్తి స్వాధీనం) -
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు స్పందిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దానిని కొనసాగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టివేసింది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం ముగిసిన తెలంగాణలోని పంచాయతీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు అదేశించిన విషయం తెలిసిందే. -
పంచాయతీకి పోవుడే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో ముహూర్తం ఖరారు కానుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీతో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి గ్రామ పరిపాలన కొనసాగిస్తోంది. కొత్త శాసనసభ కొలువుదీరాక పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, ఈలోపు అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావించాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికల అంశం ముందుకొచ్చింది. దీంతో రాజకీయ పక్షాలు గ్రామ రాజకీయాలపై దృష్టి సారించి.. పంచాయతీ పాలక వర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని ఆదేశించినా.. అందుకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కాకుండా బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహించనుండటంతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు తెప్పించి ఉంచారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో సహా అన్ని పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. వాటి నిర్వహణ, పోలింగ్ కేంద్రాలకు అనువైన భవనాల అన్వేషణ సైతం పూర్తి చేశారు. అయితే శాసనసభ ఎన్నికల పర్వం కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గల సానుకూల, ప్రతికూల అంశాలను అధికారులు పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక పంపే పనిలో నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ ఓటర్ల గణన పూర్తి కావాల్సి ఉంది. 584 జీపీలకు ఎన్నికలు జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో 427 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో పలు పంచాయతీలు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. కొత్తగా ప్రభుత్వం 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 99 ఏజెన్సీ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలోనే జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. అవసరమైన పోలింగ్ సామగ్రి, సిబ్బంది తదితర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపించారు. అన్నీ సిద్ధం.. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన సందర్భంలో గతంలోనే అధికారులు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. మొత్తం 4,870 పోలింగ్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. వీటిలో కర్ణాటక నుంచి 3,100 బాక్సులను తెప్పించారు. అవసరాన్నిబట్టి మరికొన్నింటిని కూడా తెప్పించనున్నారు. జిల్లాలోని 5,338 వార్డుల్లో అంతే మొత్తంలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు 7,193 మంది సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశారు. అలాగే రవాణా నిమిత్తం 298 బస్సులు, 88 జీపులు, కార్లను సిద్ధంగా ఉంచారు. 7,20,045 మంది ఓటర్లు.. జిల్లాలోని 584 గ్రామ పంచాయతీల్లో 7,20,045 మంది ఓటర్లు ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో ఎస్టీలు 5,105 మంది, ఎస్సీలు 3,145, బీసీలు 3,07,186, ఇతరులు 1,24,606 మంది.. అంటే మొత్తం 4,40,042 మంది ఉన్నారు. రూరల్ ప్రాంతంలో ఎస్టీలు 1,78,446 మంది, ఎస్సీలు 2,22,093, ఇతరులు 6,01,246 కలిపి మొత్తం జనాభా 10,01,785 మంది ఉన్నారు. 2013లో 760 జీపీలకు ఎన్నికలు 2013లో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 763 గ్రామ పంచాయతీలకుగాను 760 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో అత్యధికంగా టీడీపీ 227 గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. 439 గ్రామ పంచాయతీలకు పోటీ చేసిన కాంగ్రెస్ 145 స్థానాలను, 494 స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్ సీపీ 181, 228 స్థానాలకు పోటీ చేసిన సీపీఎం 77, 117 స్థానాలకు పోటీ చేసిన సీపీఐ 46, న్యూడెమోక్రసీ 30 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ బూత్లను ఎంపిక చేయడంతోపాటు ఓటర్ల జాబితాను సిద్ధం చేశాం. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు బ్యాలెట్ బాక్సులను సైతం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాం. కొత్త పంచాయతీల్లో సైతం పోలింగ్ స్టేషన్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. – శ్రీనివాసరెడ్డి, డీపీఓ -
ఓటర్ల జాబితాపై విచారణ మరోసారి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను ఉమ్మడి హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అక్రమాలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా గత శుక్రవారం రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు మిగతా రెండింటి విచారణను నేటికి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయడంతో ఈ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అక్రమ ఓటర్ల జాబితా ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించారని ఆరోపిస్తూ మొత్తం 14 అంశాలపై మర్రిశశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు సైతం హైకోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు షెడ్యూల్ను ప్రకటించింది. ఓటర్ల తుది జాబితా పై హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్లో మార్పు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. -
ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్పై ఇవ్వరాదని హైకోర్టు ఆదేశం
-
తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ఓటర్ల జాబితా ఆటంకం కలిగించనుంది. ఓటర్ల జాబితా అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చుతూ.. శుక్రవారమే పిటిషన్లు దాఖలు చేయాలని ఫిటిషనర్లకు సూచించింది. సుప్రీంకోర్టు కాపీ అందడంతో ఉమ్మడి హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల జాబితా, నోటిఫికేషన్ రిట్ ఫిటిషన్కు లోబడి ప్రకటించాలని సూచించింది. తుదిజాబితాను ఈసీ అధికారిక వెబ్సైట్లో పెట్టకూడదని, మొదటగా డ్రాఫ్ట్ కాపీని ఫిటిషనర్లకు, హైకోర్టుకు అందించాలని తెలిపింది. ఈనెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీచేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా న్యాయస్థానం రెండు పిటిషన్లను కొట్టేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించండంతో శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. -
ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో విచారణ
-
టీటీడీపై స్వామి పిటిషన్.. స్వయంగా వాదనలు
సాక్షి. హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఏపీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీని ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. స్వామి స్వయంగా బుధవారం హైదరాబాద్ వచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పదిరోజుల్లో తిరిగి హైదరాబాద్ వస్తానని.. తానే స్వయంగా ఈ కేసులో వాదలు వినిపిస్తానని ఆయన తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. కాగా టీటీడీ నిధులు గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీటీడీలో నిధుల దుర్వినియోగం, టీటీడీకి సంబంధించిన విలువైన నగలు, కానుకలు మాయం అవుతున్నాయని ఆరోపిస్తూ.. సుబ్రహ్మణ్య స్వామి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదివరకే టీటీడీ వివాదంపై స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. టీటీడీ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు మాయం కావడం, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ చేపట్టాలని స్వామి కోరుతున్నారు. -
ఆ అవినీతి పిటిషన్ ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్ : సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఐటీశాఖలో రూ. 23వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారించిన ధర్మాసనం.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని పిటిషనర్కు సూచించడంతో పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలు తెలపాలని పిటిషనర్ను కోర్టు కోరింది. ఆర్టీఏ ద్వారా సమాచారం కోరిన తనకు ఇవ్వడం లేదని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. పిటిషన్ నేపథ్యం.. ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డితో కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని పిటినర్ తెలిపారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం జరుపుకుని... నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. -
హడావుడి ఎన్నికలు వద్దు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్ద యిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు విడిగా నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఐదేళ్ల కాల పరి మితి ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించడం రాజ్యాంగ విరుద్ధమని, ముందస్తు ఎన్నికల దిశగా ఎటు వంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని వ్యాజ్యంలో పే ర్కొన్నారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. ‘నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగాలి. ఆ మేరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో జరగాల్సి ఉంది. ప్రజలు ఐదేళ్ల పాటు పదవీ కాలంలో ఉండేందుకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నా రు. మంత్రిమండలికి శాసనసభను రద్దు చేసే అధికారం ఉంది. త్వరలోనే పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి విడిగా నిర్వహించడం సరి కాదు. దీంతో కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతుంది. ముందస్తు వల్ల సంక్షేమ, అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఓటరుగా ‘ముందస్తు’కు వెళ్లాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలతో పాటు ఎన్నికలు నిర్వహిం చాలని మంత్రిమండలి కోరుకుంటోంది. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదు. అసలు ఓటర్ల జాబితా ఖరారు కాకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ లబ్ధి పొందేందుకు ఓ వ్యూహం ప్రకారమే శాసనసభ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసింది. ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సహేతుకమైన కారణం ఏదీ లేదు. కాబట్టి ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది..’అని పిటిషనర్ వాజ్యంలో పేర్కొన్నారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులకు గరిష్టంగా ఎంత చెల్లిస్తారు?
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల కొనుగోలు విషయంలో గరిష్టంగా ఎంత మొత్తం చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని సుభాష్ చంద్ర ఫౌండేషన్ను హైకోర్టు ఆదేశించింది. ఎంత కాలంలోగా ఆ సొమ్ము చెల్లిస్తారు? ఏయే ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వెల్లడించాలని ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత తదుపరి విచారణలో ఈ మొత్తం వ్యవహారంలో మీ భవితవ్యం ఏమిటో తేల్చేస్తామని సుభాష్ చంద్ర ఫౌండేష న్కు హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తామిచ్చే చివరి అవకాశమని పేర్కొంది. తదుపరి విచా రణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామ సుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిపాజిటర్లకు హైకోర్టు నేతృత్వంలోనే చెక్కుల పంపిణీ జరుగుతుం దని తెలిపింది. ఈ దశగా ఓ ప్రణాళికను రూపొందించాలని యోచిస్తున్నామని వివరిం చింది. డిపాజిటర్లు మండల, తాలుకా స్థాయి లో న్యాయ సేవాధికార సంస్థల ను ఆశ్రయిం చి, తమకు ఎంతెంత రావాలో చెబితే వివరా లను సరిపోల్చుకుని డిపాజిటర్లకు ఓ సర్టిఫికే ట్ ఇస్తారని, దాన్ని తమకు చూపితే చెక్కు జారీ చేస్తామని వెల్లడిం చింది. ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం.. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీఐడీ అదనపు డీజీ అమిత్గార్గ్ సిద్ధం చేసిన అఫిడ విట్ను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) కృష్ణప్రకాశ్ ధర్మాసనం ముందుం చారు. సుభాష్ చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదన ఏ రకంగా తమకు ఆమోదయోగ్యం కాదని, దాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఆ ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2, 200 కోట్లుగా చెబుతోందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.4,000 కోట్లకు పెరుగుతాయన్న అంచనాతో సుభాష్ చంద్ర ఫౌండేషన్ లెక్కలు వేస్తోందని, వీటిని ఆమోదిస్తే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.2,200 కోట్లుగా అంగీకరించినట్లు అవుతుందన్నారు. మా ప్రతిపాదనను అర్థం చేసుకోలేదు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోలేదని, అందుకే వ్యతిరేకిస్తోందని సుభా ష్ చంద్ర ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయ వాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిం చారు. ఈ వ్యవహారంలో తమకు మరింతగా ఏపీ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. -
‘ప్రగతి నివేదన’కు ఇప్పటివరకు నో పర్మిషన్..!
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు పోలీసులు ఇప్పటివరకు అనుమతివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సభకు అనుమతిచ్చే విషయం రాచకొండ పోలీసు కమిషనర్ పరిశీలనలో ఉందని తెలిపింది. చట్టానికి లోబడే అనుమతిపై నిర్ణయం ఉంటుందని పేర్కొంది. సభ విషయంలో రాచకొండ కమిషనర్ ఏ ఉత్తర్వులు జారీ చేసినా వాటిని కోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. ప్రగతి నివేదన సభ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యవసర సర్వీసులకు విఘాతం లేకుండా డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. ప్రగతి నివేదన సభకు అనుమతి విషయంలో రాచకొండ పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని తమ ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించి కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోందని, దాదాపు 25 లక్షల మందికిపైగా జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో సభకు ఇచ్చిన అనుమతులను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చాలంటూ నడిగడ్డ పర్యావరణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సభ ఆదివారం కదా.. ఇబ్బందేంటి? ఈ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శశికిరణ్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేస్తోందన్నారు. ఇంత స్థాయిలో వస్తున్న జనం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ఇవన్నీ పట్టించుకోకుండా పోలీసులు సభ నిర్వహణకు అనుమతినిచ్చారని తెలిపారు. ఈ సమయంలో సభ జరిగేది ఏ వారమని ధర్మాసనం అడగ్గా.. ఆదివారం అని శశికిరణ్ బదులిచ్చారు. అయితే ఇబ్బంది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజారక్షణ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని శశికిరణ్ విన్నవించారు. వారే కోర్టుకు వచ్చేవారు కదా..! ఈ సభకు అవసరమైన భూములను సంబంధిత భూ యజమానుల నుంచి బలవంతంగా తీసుకున్నారని వివరించారు. మరి బలవంతంగా తీసుకుని ఉంటే ఆ భూముల యజమానులే కోర్టుకు వచ్చే వారు కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. సభ వల్ల అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్కుమార్ నుంచి స్పష్టత కోరింది. రాజధానికి వెలుపల 31 కిలోమీటర్ల దూరంలో సభ జరుగుతోందని శరత్కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ సభ వల్ల హైదరాబాద్కు వచ్చే.. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ సభ వల్ల ఎవరికీ అసౌకర్యం, ఇబ్బంది కలగబోదని హామీ ఇస్తున్నట్లు నివేదించారు. జన సమీకరణే ప్రతి పార్టీ లక్ష్యం.. ‘ప్రతి రాజకీయ పార్టీ కూడా సభలు పెట్టుకుంటుంటాయి. ఆ సభలకు పరిమిత సంఖ్యలో జనం రావాలని ఏ పార్టీ అయినా చెప్పిందా.. భారీ జన సమీకరణ చేయడమే ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం.’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సభ జరిగే ప్రాంతం ఏ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుందని ధర్మాసనం ప్రశ్నించగా, రాచకొండ పరిధిలోకి వస్తుందని శరత్ చెప్పారు. -
ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ కొట్టివేత
-
టీఆర్ఎస్కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: టీఆర్ఎస్కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటిషన్ ద్వారా కోరారు. పిటిషన్పై మరోసారి విచారించిన హైకోర్టు ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్, న్యాయమూర్తికి తెలిపారు. ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ హామీ ఇవ్వడంతో హైకోర్టు, పిటిషన్ను కొట్టివేసింది. -
టీచర్ల పదోన్నతులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులపై తీవ్ర గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఏకీకృత సర్వీసు రూల్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో పదోన్నతుల అంశాన్ని ఉపాధ్యాయ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. పదోన్నతి ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘ఏకీకృతం’అంశం కోర్టు పరిధిలో ఉండటంతో పదో న్నతుల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు అంశాన్ని సాకుగా చూపుతూ బదిలీలే చేపట్టింది. కోర్టు తీర్పు తో స్పష్టత వచ్చినందున పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. పాత విధానంతోనే.. ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటివరకు పదోన్నతులు చేపట్టకుంటే విద్యాశాఖలో మరింత ఆటుపోట్లు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఈవో, ఉపవిద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ అగమ్యగోచరంగా మారింది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నా అకడమిక్ కార్యక్రమాలు, పరిపాలన అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. ‘ఏకీకృతం’విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొస్తుందని భావించిన విద్యాశాఖ 4ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టలేదు. తాజా హైకోర్టు తీర్పులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. యాజమాన్యాల వారీగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు చేపడితే సరిపోతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెం ట్లు, జీహెచ్ఎం కేటగిరీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు అనుకూలంగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనే అంశంపై మరోకేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ కేటగిరీల్లో పదోన్నతులు సులభతరమైనా ఎమ్ఈవో,డైట్ లెక్చరర్ తదితర పోస్టుల్లో చిక్కులు తప్పవని తెలుస్తోంది. -
ప్రగతి నివేదన సభకు అనుమతి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ పేరు తో సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సభకిచ్చిన అనుమతులను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. సభ పేరిట 25లక్షల మందిని ఒకచోట చేర్చే బదులు తమ పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను తెలియచేసేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకునేలా టీఆర్ఎస్ను ఆదేశించాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ రామ సుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ ప్రస్తావించారు. కేసు ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ప్రగతి నివేదన సభ కోసం 1600 ఎకరాలను చదును చేస్తున్నారని, ఇందులో ఉన్న చెట్లన్నింటినీ నరికేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఈ సభకు 25 లక్షల జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, దాదాపు లక్ష వాహనాలను వినియోగించనున్నారన్నా రు. ఈ సభ వల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న సభ లక్ష్యం ప్రభుత్వం ఘన విజయాలను ప్రజలకు తెలియచేయడమేనన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వంటి సాధానాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సభ వల్ల పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానిని టీఆర్ఎస్ నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. -
‘ప్రగతి నివేదన సభ’పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’ ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాద్యమాల ద్వారా చేయాలని.. ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. శరవేగంగా ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాట్లు సెప్టెంబర్ 2న కొంగర్ కలాన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. సభకోసం ఔటర్ రింగ్ రోడ్డునుంచి ప్రత్యేకంగా రోడ్లను వేశారు. ఔటర్ రింగ్ రోడ్డునుంచి నేరుగా పార్కింగ్ ప్లేసులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
వరవరరావుపై ఆందోళన వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు–మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్ ఆర్డర్ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ అరెస్ట్పై కౌంటర్ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్ ఆర్డర్ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్కుమార్ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్ ధర్మాసనానికి చెప్పారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
పరిపూర్ణానందస్వామికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవాలంటే పరిపూర్ణానందస్వామి వాదనలు కూడా తెలుసుకోవాల్సి ఉన్నందున ఈ మేరకు ఆయనకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించా లని తెలంగాణ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాల్లో చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. పరిపూర్ణానంద స్వామి వాదనలు వినకుండా సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిపూర్ణానందస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆయనను ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని ఆయన సవాల్ చేయడంతో వాటి అమలును సింగిల్ జడ్జి ఈ నెల 14న నిలుపుదల చేశారు. పోలీసులు చేసిన అప్పీల్లో ఇప్పటికిప్పుడే మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం తేల్చిచెబుతూ విచారణను వాయిదా వేసింది. -
‘క్రీడల కోటా’లో సర్కారుకు షాక్
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోటా జాబితా విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో 2018–19 విద్యా సంవత్సరానికి క్రీడల కోటా కింద ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను హైకోర్టు కొట్టేసింది. వైద్య విద్యలో క్రీడల కోటా కొందరి ధనార్జనకు ఉపయోగపడుతోందని, అలాంటి కోటాను రద్దు చేస్తే క్రీడా, వైద్య రంగాలకు మేలు చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పతకాలు రానప్పుడు, నైపుణ్యం ప్రదర్శించలేనప్పుడు, కొందరు వ్యక్తుల ధనార్జన కోసం క్రీడల కోటా కొనసాగించడంలో అర్థం లేదంది. సామాజిక, రాజకీయ కారణాల చేత కోటా రద్దు నిర్ణయం తీసుకోలేని పక్షంలో కనీసం ఎప్పుడూ వినని క్రీడలను జాబితా నుంచి తొలగించి క్రీడలు ఆడకుండానే లబ్ధి పొందుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేయాలంది. తగిన మార్పులతో క్రీడల కోటాను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశించింది. జీవో 334 ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ లేదా మరో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయం నిర్వహించి, ఆ తరువాత కోటా కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆడుతున్న ప్రధాన క్రీడలేంటి.. 14–18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు ఎంత మంది వీటిని ఆడుతున్నారు.. ఈ క్రీడల్లో ఎన్నింటికి సంబంధిత క్రీడా సంస్థల గుర్తింపు ఉంది.. ఈ క్రీడల్లో ఎంత మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించారు.. క్రీడల కోటా కింద వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో ఎంత మంది ఆ క్రీడల్లో కొనసాగుతున్నారు.. ఎంత మంది జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నారు.. తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు మెడికల్, డెంటల్ కోర్సుల్లో క్రీడల కోటా కింద ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ టి.శ్రియా మరో నలుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ఏడాదికి క్రీడల కోటా కింద ప్రవేశాలు చేపట్టవద్దంటూ ఈ ఏడాది జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ తరువాత ఈ వ్యాజ్యంతో తుది విచారణ జరిపిన ధర్మాసనం 4 రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఎప్పుడూ వినని ఆటలకూ.. గత 25 సంవత్సరాలుగా ఏటా క్రీడల జాబితాలో మార్పులు చేస్తూ వివిధ రకాల క్రీడలను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. జాబితాలో 48 క్రీడలకు సర్కారు స్థానం కల్పించిందని, వీటిల్లో కొన్నింటి పేర్లు ఎన్నడూ వినలేదని, ఇలాంటి క్రీడలను జాబితాలో చేర్చడంలో తర్కం ఏమిటో అర్థం కావడం లేదంది. జాబితాలో ఏకపక్షం గా మార్పులు చేయడం తదనుగుణంగా ఆయా క్రీడా సంస్థలు ఇష్టమొచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విధానం ఆందోళన కలిగిస్తోందని కోర్టు పేర్కొంది. జీవో 8ని పునరుద్ధరించలేం ప్రస్తుతం జారీ చేసిన జీవో 7ను రద్దు చేసి 2015లో జారీ చేసిన జీవో 8ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. జీవో 7ను రద్దు చేయడానికి ఇబ్బంది లేదు. అయితే జీవో 8ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఒకవేళ పునరుద్ధరిస్తే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అవినీతిని పట్టించుకోనట్లవుతుంది. క్రీడల కోటా అక్రమాలపై స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి పాత జీవోను పునరుద్ధరించడం లేదు. అలాగే ఈ ఏడాది జారీ చేసిన జీవో 7ను రద్దు చేస్తున్నాం. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై అధ్యయనం అనంతరం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం తీర్పులో తేల్చి చెప్పింది. షార్ట్కట్ అవలంబిస్తున్నారు వైద్య విద్యలో క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించడం క్రీడలకు ఏ రకంగా ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుందో ఏ మాత్రం అర్థం కావడం లేదని హైకోర్టు పేర్కొంది. ‘అంతగా ప్రతిభ లేని అభ్యర్థులు వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశంలో ఏ మూలన కూడా ఇంతవరకు వినని క్రీడలను ఎం చుకుంటున్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇలాంటి షార్ట్కట్ పద్ధతులు అవలంభిస్తున్న అభ్యర్థులు.. చదువు పూర్తయ్యాక కూడా ఇలాంటి పద్ధతులు అనుసరించకుండా ఉండలేరు. క్రీడల కోటాలో ప్రవేశాల నిమిత్తం ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. మొదటి కమిటీలో క్రీడలకు సంబంధించి వ్యక్తులు ఉంటే, రెండో కమిటీలో వర్సిటీ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల ఏర్పాటును తప్పుబట్టలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
హైకోర్టు స్టే, సాక్షి కథనాలతో దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : హైకోర్టు స్టే, సాక్షి కథనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బసవతారకం బేబీ కిట్ల పంపిణీలో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను రద్దు చేసింది. దీంతో తొలిరోజే బేబీ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదిర్చి.. నిబంధనలకు విరుద్ధంగా కిట్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అర్హతలేని సంస్థలకు బేబీ కిట్ల ఆర్డర్ను వైద్యశాఖ కట్టబెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ లో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా బేబీ కిట్ల పంపిణీలో అవినీతి జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు రాకముందే టెండర్లను రద్దు చేయడంతో... అవినీతి జరుగుతోందని పరోక్షంగా అంగీకరించినట్లయింది. -
టీచర్ల ఏకీకృత రూల్స్పై హైకోర్టులో చుక్కెదురు
-
కానిస్టేబుళ్ల భర్తీలో జోక్యం చేసుకోలేం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ చేపట్టిన 16,925 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓ వైపు పిటిషనర్ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేసి.. మరో వైపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న కారణంగా తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామస్తుడు మాదిగ మహేశ్ దాఖలు చేసిన పిల్లో.. తెలంగాణ ప్రత్యేక పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ల్లో పోస్టుల భర్తీ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి వెయిటేజీగా 3 మార్కులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని, హోంగార్డుల వయోపరిమితి పెంపు వెనుక రాజకీయ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. పోస్టుల కోసం దరఖాస్తు చేస్తూనే పిల్ వేయడంపై ధర్మాసనం అభ్యంతరం చెబుతూ పిల్ను కొట్టివేసింది. -
ఆశలు అడియాసలే?
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ టీచర్లు 26 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం చేస్తున్న పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. టీచర్ల సంఘాలు, ప్రభుత్వాలు ఏకమైనా తమ వాదనను నెగ్గించుకోలేకపోయాయి. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టేయడంతో సుమారు 1.20 లక్షల మంది టీచర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం, టీచర్ల సంఘాలు సందిగ్ధంలో పడిపోయాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అనేకమార్లు ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా కోర్టుల్లో నిలువలేకపోయాయి. 1992 నుంచి అనేకసార్లు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా న్యాయ వివాదాలుగా మారిపోయాయి. అసలేం జరిగిందంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను 1971లో రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిగా విభజించారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్రతో ప్రభుత్వం జీవో నంబర్ 529ని జారీ చేసింది. విద్యా శాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే చేర్చింది. అప్పటికి పంచాయతీరాజ్ టీచర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. తర్వాత కాలంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా పరిషత్లు ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను నియమించుకున్నాయి. దీంతో 1990 నాటికి ఆ స్కూళ్లు, టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. తమను కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలని.. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం 1992లో జీవో నంబర్ 40ను జారీ చేసింది. న్యాయపరమైన ఆటంకాలతో ఆ జీవోను ప్రభుత్వమే విరమించుకుంది. దీంతో అది అమలుకు నోచుకోలేదు. 1998లో ఒకసారి, 2005లో మరోసారి.. ప్రభుత్వం 1998లో ఉమ్మడి సర్వీసు రూల్సు రూపొందించి జీవో 505ను, 538లను జారీ చేసింది. పంచాయతీరాజ్ టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లోక ల్ కేడర్ పరిధిలో లేనందున ఉమ్మడి సర్వీసు నిబంధనలకు వీల్లేదని ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్ను ఆశ్ర యించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ను ట్రిబ్యునల్ సమర్థించగా ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాకే ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లను కలపాలని హైకోర్టు ఉమ్మడి సర్వీసు నిబంధనలను 2003లో కొట్టేసింది. అప్పటి నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ వంటి పోస్టుల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం 2005 మేలో మళ్లీ ఏకీకృత సర్వీసు కోసం జీవో 95, 96లను జారీ చేసి పదోన్నతులు కల్పించింది. వాటి పై మళ్లీ ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్లో సవాల్ చేసి గెలిచారు. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 2007లో ‘రూల్స్’కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 2007లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనేక వాదనలు, వాయిదాల తరు వాత 2015 సెప్టెంబర్ 30న తీర్పు ఇచ్చింది. సుప్రీం ఏం చెప్పిందంటే.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్గనైజ్ అయి ఉన్న ప్రభుత్వ టీచర్లకు, ఆర్గనైజ్ కాని పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ‘ఉమ్మడి సర్వీసు రూల్స్ తీసుకురావాలంటే రాష్ట్ర పతి ఉత్తర్వులకు కేంద్రం ద్వారా సవరణ చేయించాలి. ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా పొందుపరచడం ద్వారానే ఒకే సర్వీసు రూల్స్ తీసుకురావడం సా«ధ్యం అవుతుంది. అప్పటి వరకు ఉమ్మడి రూల్స్ కుదరదు’అని పేర్కొంది. 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్ చేసేలా చర్యలు చేపట్టాలని కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫైలుపై 2016 ఏప్రిల్ 5న సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఆ తరు వాత దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ సమస్య ఏపీతోనూ ముడిపడి ఉన్నందున ఆ రాష్ట్రం కూడా ప్రతిపాదనలు పంపింది. తరువాత పలుమా ర్లు సంప్రదింపులు, చర్చల అనంతరం 2017 జూన్ 23న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్లు 2017 జూలై 12న హైకోర్టులో కేసు వేశారు. తాజాగా మంగళవా రం రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అందువల్లే ఈ పరిస్థితి! రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి ముందే.. రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అభ్యంతరాలు ఉన్నాయా? అని రాష్ట్రపతి అడిగినపుడు అభ్యంతరాలు లేవని చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మామిడోజు వీరాచారి అన్నారు. ఏ దశలోనూ తమ వాదనను, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని చెప్పారు. న్యాయం తమవైపే ఉందని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. -
‘ఏకీకృత’పై సర్కారుకు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృతం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ఒకే కేడర్గా పరిగణిస్తూ 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ గతేడాది జూన్ 23న జారీ అయిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పంచాయతీరాజ్ టీచర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఏకీకరణ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులకు చేసిన సవరణలు రాజ్యాంగంలోని అధికరణ 371–డీకి విరుద్ధమని స్పష్టం చేసింది. పలు రకాల పోస్టుల నిర్వహణకు అధికరణ 371–డీ అధికారం కల్పిస్తుందే తప్ప కేడర్ ఏకీకరణకు, విలీనానికి అధికారం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిటెడ్ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్గా పేర్కొంటూ 1975 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వుల్లో పొందుపరిచిన 2–ఏ పేరాను హైకోర్టు కొట్టేసింది. అలాగే ఈ సవరణలు 1998 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్లో చేర్చిన 23–ఏలో మండల విద్యాధికారి, ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పొందుపరచడాన్ని కూడా కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను తమతోపాటు ఒకే కేడర్గా పరిగణించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ గతేడాది జూన్ 23న జారీ అయిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్ లేకపోవడంతో తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు, మరో ఇద్దరు టీచర్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేస్తూ అందులో చేర్చిన పేరా 2–ఏను, మూడో షెడ్యూల్లో చేర్చిన 23–ఏను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. 371–డీలో ఏకీకరణ ప్రస్తావనే లేదు... ‘అధికరణ 371–డీ అమల్లో ఉన్నంత వరకు రాష్ట్రపతి కేవలం లోకల్ కేడర్, లోకల్ ఏరియా, లోకల్ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుంది. అయితే ప్రస్తుత ఉత్తర్వుల విషయంలో రాష్ట్రపతి అధికరణ 371–డీలో నిర్దేశించిన అంశాలకే పరిమితమవకుండా ప్రభుత్వ టీచర్లతో స్థానిక సంస్థల్లో పనిచేసే టీచర్లను ఏకీకృతం చేశారు. ఇలా రెండు వేర్వేరు కేడర్లను ఏకీకృతం చేసే అధికారం రాష్ట్రపతికి ఉందా? అనే విషయంలో మాకు సందేహాలున్నాయి. కేడర్ ఏకీకరణ గురించి 371–డీలో ఎటువంటి ప్రస్తావనా లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3 ప్రకారం రకరకాల పోస్టులను ఏకీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓ యజమానిగా రకరకాల పోస్టులను, రకరకాల కేడర్లను ఏకీకృత చేయవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదే పనిని అధికరణ 371–డీ కింద చేయవచ్చా? తదానుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇందుకు స్పష్టమైన సమాధానం కూడా ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3ను పరిశీలిస్తే అందులో వివిధ రకాల కేటగిరీ పోస్టుల నిర్వహణ గురించి ఉంది తప్ప వివిధ కేటగిరీల పోస్టుల ఏకీకరణ, విలీనం గురించి ప్రస్తావన లేదు. ఏకీకరణ, విలీనం విషయంలో అధికరణ 371–డీ, రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3 ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయంటే ప్రాంతీయ అసమానతలు తొలగించి ఉద్యోగాల్లో సమానావకాశాల కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా అధికరణ 371–డీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశానికి, కేడర్ల ఏకీకరణకు ఎటువంటి సంబంధం లేదు. అయితే కేశవులు, పి. వేమారెడ్డి కేసుల విషయంలో తలెత్తిన న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయించింది. అయితే రాష్ట్రపతి ఈ తాజా సవరణ ఉత్తర్వులు అధికరణ 371–డీకి విరుద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు సిక్స్ పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. ఇందులో కేడర్ల ఏకీకరణకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఏ కోర్టు కూడా అటువంటి గ్లేమ్ప్లాన్ను ఆమోదించదు... ‘రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో పేరాలో కొత్తగా చేర్చిన 2–ఏలో ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని నాన్ గెజిటెడ్ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్గా ఆర్గనైజ్ చేస్తున్నట్లు పేర్కొని ఉంటే అందులో తప్పుబట్టడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఇందులో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు అని, ఏకీకరణ అని చేర్చారు. ఈ పదాలను చేర్చకుండా ఉండి ఉంటే 2–ఏ పేరా 371–డీకి అనుగుణంగా ఉండేది. అధికరణ 371–డీలో ఎక్కడా వేర్వేరు కేడర్ల ఏకీకరణ గురించి లేనే లేదు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో పేరాలో చేర్చిన 2–ఏ అధికరణ 371–డీకి విరుద్ధం. అలాగే చేర్చిన 23–ఏ కూడా అధికరణ 371–డీకి విరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వులకు చేసిన సవరణలు 1998 నవంబర్ 20 నుంచి వర్తిస్తాయని పేర్కొనడం కూడా సరికాదు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తెచ్చుకుని, దాన్ని 1998 నుంచి వర్తింపజేసుకోవడం తగదు. ఇది వక్ర మార్గాన్ని అనుసరించడమే. ఏ న్యాయస్థానం కూడా ఇటువంటి గేమ్ప్లాన్ను ఆమోదించదు’అని ధర్మాసనం తీర్పులో తేల్చిచెప్పింది. -
పుట్టా మధుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు తన కుమారుడి వివాహ వేడుకల నిమిత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ల్యాబొరేటరీ భవనాల్ని కూల్చివేయడంపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే మధుతోపాటు ప్రతివాదులైన ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్ బోర్డు డైరెక్టర్, జిల్లా కలెక్టర్, వరంగల్లోని ఆర్జేడీ, మంథని మున్సిపల్ కమిషనర్, పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇతరులకు నోటీసులు జారీ చేసింది. కుమారుడి వివాహ విందు నిర్వహించేందుకు అడ్డుగా ఉన్నాయని మంథని జూనియర్ కాలేజీలోని భవనాల్ని రాజకీయ హోదాను అడ్డం పెట్టుకుని మధు కూల్చివేయించారని ఆ కాలేజీ పూర్వపు విద్యార్థి ఇనుముల సతీశ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. ప్రతివాదులు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. -
న్యాయాధికారుల విభజన : రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ రేపటికి వాయిదా పడింది. విభజనపై మంగళవారం సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సీనియారిటీ ప్రకారం విభజన చేస్తే తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున సల్మాన్ ఖుర్షి, అహ్మద్లు వాదనలు వినిపించారు. గంటకు పైగా వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణను రేపటికి (బుధవారం)వాయిదా వేసింది. న్యాయాధికారుల విభజనపై హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్పై తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఫిర్యాదు చేసేందుకు చిరునామా ముద్రించాలి
సాక్షి, హైదరాబాద్: ‘బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే మంచినీటి సీసాలను కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి భారతీయులకు ఏర్పడింది. ఆ కంపెనీలు విక్రయించే మంచినీటి సీసాలు లేదా ప్యాకెట్లపై అభ్యంతరాలు తలెత్తినప్పుడు, వినియోగదారుడికి ఫిర్యాదు చేసేందుకు వీలుగా పూర్తి వివరాల్ని ముద్రించాలి’ అని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనల్ని పరిశీలిస్తే మంచినీటి బాటిళ్లు, ప్యాకెట్లను కొనుగోలు చేసిన వినియోగదారుడు ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడేలా పూర్తి వివరాలు వాటిపై ముద్రించాలని అభిప్రాయపడింది. ఇరు పక్షాల వాదప్రతివాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. మెదక్ జిల్లా పటాన్చెరులోని హిమజల్ బేవరేజెస్ సంస్థ సరఫరా చేసే కిన్లే వాటర్ బాటిళ్లపై వినియోగదారుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా వివరాలు ముద్రించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు లక్షల బాటిళ్లను సీజ్ చేసింది. టోల్ఫ్రీ నంబర్ ఇతర వివరాలు ఉన్నందున వాటిని విడుదల చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించడాన్ని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ, తూనికలు కొలతల శాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలపై ధర్మాసనం ఎదుట వాదనలు ముగిశాయి. -
హైదరాబాద్లోనే ఏపీ హైకోర్టు?
సాక్షి, హైదరాబాద్ : అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఓవైపు ఏపీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. ఉమ్మడి హైకో ర్టును రెండుగా విభజించి, తెలంగాణ భూ భాగం పైనే ఏపీ హైకోర్టు ను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారం భించింది. తెలంగాణ భూ భాగంపై 2 హైకోర్టులు ఉండరాదంటూ 2015, మే 1న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గత వారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్ర చూడ్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందిం చిన ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం రోస్టర్ ప్రకారం సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని తమ రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు ఈ వారంలో విచా రణ జరిపే అవకాశం ఉంది. ఈ లోపు ఈ వ్యాజ్యం దాఖలులో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించు కోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర తాత్సారంపై పిల్... హైకోర్టు విభజన విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందంటూ హైదరాబాద్కు చెందిన ధన్గోపాల్ రావు 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ సమయంలో ఏపీ హైకోర్టుకు తెలంగాణ భూ భాగంపై స్థలం కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనం ముందుంచింది. తెలంగాణలో ఏపీ హైకోర్టు చట్ట విరుద్ధం... అందరి వాదనలు విన్న అనంతరం 2015, మే 1న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేసేం దుకు స్థలాన్ని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఒకే ప్రాంగణంలో 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అలా చేయడం ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. తెలంగాణ హైకోర్టును హైదరాబాద్లోని మరో చోటుకు తరలించడం కూడా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర హైకోర్టును తెలంగాణలో ఎక్కడా ఏర్పాటు చేయడానికి వీల్లేదని, అలా చేయడం చట్ట విరుద్ధమంది. తెలంగాణ హైకోర్టును ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకి (గచ్చిబౌలి) తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర న్యాయ మంత్రి ఎలా పరిగణనలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదని, పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం ఇది అసాధ్యమని ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. హైకోర్టు విభజనపై కమిటీ... ఇదిలా ఉండగా అమరావతి పరిసర ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటునకు ఏపీ ఇటీవల చర్యలు చేప ట్టింది. శాశ్వత భవనం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభ మయ్యేలా చూడాలని ఏపీ సర్కార్ చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్కు ఓ లేఖ రాసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామ సుబ్రమణి యన్, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ పి.నవీన్ రావులు ఉన్నారు. ఈ కమిటీ త్వరలోనే హైకోర్టు భవ నం నిర్మితమవుతున్న నేలపాడు, తుళ్లూరు గ్రామా లకు వెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం ప్రధాన న్యాయ మూర్తికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తెలంగాణలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పావులు... ఇదిలా ఉండగానే 2015, మే1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుండ టం, ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు ఏపీలో హైకోర్టు ఏర్పాటును హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు వ్యతిరేకిస్తుండటంతో కేంద్రం మరో రకమైన ఆలోచన చేయడం ప్రారంభించింది. ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా హైకోర్టు విభజనకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టును హైదరాబాద్లోనే ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదంటూ 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారడంతో దీన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ పిటిషన్ను ఆమోదించి హైకోర్టు 2015లో ఇచ్చిన తీర్పును సవరిస్తే, తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటునకు రంగం సిద్ధమవుతున్నట్లే లెక్క. కేంద్రం పిటిషన్ను ఏపీ సర్కార్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రభుత్వం మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను తప్పిందని హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ విమర్శించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో వాస్తవ సాగు దారుల హక్కులపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షిత కౌలు రైతు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 30 శాతం మంది కౌలు రైతులు సేద్యం చేస్తున్నారని, వారు ఆత్మహత్యలు చేసుకుంటే నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. 2011 సాగుదారుల చట్టం ప్రకారం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. భూ సంస్కరణలు అమలు చేయాలి: వరవరరావు రైతులను ఆదుకోవటం ప్రభుత్వ కనీస బాధ్యత అని, ఆ బాధ్యతను కూడా నెరవేర్చడం లేదని విరసం నేత వరవరరావు విమర్శించారు. గత ప్రభుత్వాల విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తుందని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్యవేదిక నాయకుడు విస్సా కిరణ్ మాట్లాడుతూ.. కౌలు రైతులు ఈ సదస్సు నిర్దేశించిన నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. సదస్సు లో సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, పశ్య పద్మ, టి.సాగర్, సాయన్న, వీరన్న, అచ్యుత రామారావు పాల్గొన్నారు. కౌలు రైతుల మిస్డ్ కాల్ కాంపెయిన్.. కేసీఆర్ రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కడ? అని అడుగుతున్నారు కాబట్టి, కౌలు రైతులందరూ మిస్డ్ కాల్ కాంపెయిన్లో పాల్గొనాలని సదస్సు పిలుపునిచ్చింది. 040–39560444కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు కౌలు రైతు అని తెల పాలని పిలుపునిచ్చారు. కౌలు రైతుల సమస్యల కోసం 8500983300 నంబర్ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. -
జోనల్ వ్యవస్థ సవరణపై భరోసా
-
త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు!
సాక్షి, న్యూఢిల్లీ: నూతన జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఎంపీలు బి.వినోద్కుమార్, బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలపై చర్చించారు. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని ఆమోదం పొందడంలో హోం మంత్రి చొరవ చూపినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరగా, హోం మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే హైకోర్టు విభజన తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపై కూడా చొరవచూపి వేగంగా పరిష్కరించాలని కోరారు. షెడ్యూలు 9, 10 సంస్థల విభజనలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరగా.. ఈ అంశాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ అధికారులకు అప్పగిస్తామని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎంఈఎల్) సంస్థ, ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన తదితర సంస్థల విభజన వివాదాలను కూడా ప్రస్తావించారు. ఆర్థిక మంత్రితో సమావేశం హోంమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు పలు అంశాలపై నివేదించారు. ఆర్థిక మంత్రి ఆరోగ్య కారణాల రీత్యా సీఎం ఒక్కరే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధన మేరకు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 450 కోట్ల చొప్పున మూడు విడతలుగా విడుదల చేశారని, నాలుగో విడత విడుదల చేయాల్సి విన్నవించారు. అలాగే మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలో కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద కేటగిరీ–2 జిల్లాలైన నల్లగొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉందని వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి రూ.102.86 కోట్లు, 2015–16కు రూ.87.15 కోట్లు, 2016–17కు 53.04 కోట్లు, 2017–18కు రూ. 96.20 కోట్లు.. మొత్తంగా రూ.339.25 కోట్లు విడుదల కావాల్సి ఉందని విన్నవించారు. ఎఫ్ఆర్బీఎం సడలింపుపై.. ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితి అయిన జీఎస్డీపీలో 3 శాతానికి అదనంగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు మరో అర శాతం సడలించేందుకు పద్నాలుగో ఆర్థిక సంఘం అవకాశం కల్పించిందని ఆర్థిక మంత్రికి గుర్తు చేశారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి సడలించిందని, 2017–18లో కూడా రాష్ట్రంలో రెవెన్యూ మిగులు ఉన్నందున 2018–19కి సైతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సాగునీరు, తాగునీటి పథకాలకు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నామని, అందువల్ల మరిన్ని రుణాలు పొందాల్సి ఉందని వివరించారు. పెండింగ్ నిధులు విడుదల చేయండి.. అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ వివరాలను బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ‘తెలంగాణలో నాలుగు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులున్నాయి. వీటికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వడ్డీలో కేంద్ర వాటా కింద గత నాలుగేళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.339 కోట్లు విడుదల చేయాలని కోరారు. దేశంలో అత్యధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ. దీని ప్రకారంగా అదనంగా 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకునే అవకాశం ఉంది. తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని జీఎస్డీపీలో 3.5 శాతంగా సడలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం నివేదించారు’అని తెలిపారు. కేసు పరిష్కారమైతే హైకోర్టు విభజన... కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రితో సీఎం సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు బి.వినోద్కుమార్, బూర నర్సయ్య గౌడ్ మీడియాకు సంబంధిత వివరాలు వెల్లడించారు. ‘రాజ్నాథ్ను ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో విభజన చట్టంలో పేర్కొన్న చాలా విషయాలు పరిష్కరించడానికి కొంత ప్రయత్నం జరిగింది. ఇంకా కొన్ని పరిష్కరించలేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అంశాలను ఇంకా తేల్చాల్సి ఉంది. హైదరాబాద్ రాజధానిగా ఉన్న సందర్భంలో విభజన చట్టంలో ఆస్తుల విషయంలో స్పష్టంగా చెప్పారు. ఎక్కడి ఆస్తులు అక్కడ ఉంటాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఇంకా ఈ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని సీఎం కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కొన్ని గదులు ఏపీ భవన్కు, కొన్ని గదులు తెలంగాణ భవన్కు ఇచ్చారు. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కమిషనర్లు, రెసిడెంట్ కమిషనర్లు పనిచేస్తున్నారు. దీని విభజనపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇది వరకే తెలియపరిచినా తెలంగాణ దీనిపై మరింత స్పష్టత కోరింది. అది తెలంగాణ ఆస్తిగా గతంలో మేం చెప్పాం. అయితే 58ః42 నిష్పత్తిలో పంచాలని కేంద్రం చెప్పింది. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరాం. ఇలాంటి అంశాలన్నింటినీ హోం మంత్రికి వివరించాం. అతి ముఖ్యమైన సమస్య హైకోర్టు విభజన. ఇది న్యాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ కేంద్ర హోం శాఖ నోడల్ ఏజెన్సీ అయినందున త్వరగా పరిష్కరించాలని కోరాం. విభజన చట్టంపై సుప్రీం కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఈ వారంలో సంబంధిత కేసు రానుంది. ఆ కేసు పరిష్కారమైతే ఆ వెంటనే హైకోర్టు విభజనపై ఉత్తర్వులు వెలువడేందుకు మార్గం సుగమమవుతుంది’అని వివరించారు. -
‘పనిచేసే చోటే నివాసం’పై ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: మండలస్థాయి అధికారులు, వైద్యులు తాము పని చేసే ప్రాంతంలోనే నివాసం ఉండేలా ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పనిచేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఉద్యోగులతో సక్రమంగా పనిచేయించుకునే అంశంపై ప్రభుత్వం సర్వీస్ రూల్స్కు అనుగుణంగా స్పందించవచ్చని ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వచ్చి.. తొందరగా వెళ్తున్నారు.. మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, వ్యవసాయ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, పీహెచ్సీల్లోని వైద్యులు తదితర మండల స్థాయి అధికారులు స్థానికంగా ఉండటం లేదని, జిల్లా, పట్టణ కేంద్రాల నుంచి రోజూ వచ్చి విధులు నిర్వహించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ‘‘రోజూ 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం నుంచి ఈ అధికారులు ప్రయాణించి రావడం వల్ల అలిసిపోతున్నారు. చాలామంది కార్యాలయాల్లోనే గంటకుపైగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారు.. గంట ముందుగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వీరిని చూసి కిందిస్థాయి ఉద్యోగులు కూడా అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు పనిచేసే కేంద్రంలోనే వారి నివాసం ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయాధికారులంతా వారు పనిచేసే కేంద్రాల్లోనే నివాసం ఉంటున్నారని, పని చేసే కేంద్రం నుంచి గంట సమయం విడిచి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటారని పేర్కొన్నారు. ఉద్యోగులంతా తాము పనిచేసే కేంద్రంలోనే ఉండేలా చేస్తేనే ప్రభుత్వ పాలన పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ అవుతుందని కోరారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ప్రజావసరాలు, ప్రజాహితం కోసం ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని, ఇది పూర్తిగా సర్వీస్ నిబంధనల అమలుకు సంబంధించినది కాబట్టి తాము ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. -
'టాస్క్ల పేరుతో వెకిలి చేష్టలు'
సాక్షి, హైదరాబాద్ : బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. ఓ టీవీ చానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో టాస్క్ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా ఈ షో ఉందని ఆయన ఆరోపించారు. బిగ్బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వ్యాపార సంస్థలతో కలిసి యాజమాన్యం తమ లాభాలు, టీఆర్పీల కోసం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎవరికీ కనపడని బిగ్ బాస్ బాత్రూమ్లు కడగాలని, తాను చెప్పినట్టు చేయాలని 16మంది పోటీదారులను బానిసల్లా పరిగణిస్తూ ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. టాస్కుల పేరుతో చెడు సంప్రదాయాలను చూపించి సమజానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేస్తాయన్నారు. ఇలాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్లు మానసిక వేదనకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వ్యయాల ఆధారంగా వాసవి కాలేజీలో ఫీజును ఏడాదికి రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును ఏడాదికి రూ.1.37 లక్షలుగా ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఫీజుల ఖరారు విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్ధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు కు రూ.91వేలను ఫీజుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ శ్రీనిధి కాలే జీ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫీజును రూ.97వేలుగా ఖరారు చేయడం పై వాసవి కాలేజీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు టీఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుల ను తప్పుపట్టింది. ఆ కళాశాలల వ్యయాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందంది. వాసవి కాలేజీ ఫీజును రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును రూ. 1.37 లక్షలుగా ఖరారు చేయాలని టీఎఫ్ఆర్సీని ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల సుదీర్ఘ విచారణ జరిపింది. నిర్దిష్ట కాల వ్యవధి లోపు ఫీజులను ఖరారు చేయకపోవడంపై విచారణ సందర్భంగా ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనంతరం తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించింది. -
సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ.. ఫీజు మోత?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం లోని నాలుగు ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులపై అదనపు ఫీజుల భారం తప్పేలా లేదు. సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ కాలేజీల్లో చేరిన విద్యార్థులంతా అదనపు ఫీజుల నుంచి తప్పించుకునే పరిస్థితి కన్పించట్లేదు. శ్రీనిధి, వాసవి కాలేజీల్లో ఫీజులపై హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో పెంచిన ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెరిగిన ఫీజుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా.. లేదా మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లకపోతే ఆయా కాలేజీల్లో చేరిన 12 వేల మందికి పైగా విద్యార్థులు ఏటా రూ.40 వేల నుంచి రూ.86,500 వరకు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అసలేం జరిగింది..: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో వార్షిక ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) 2016లో ఖరారు చేసింది. అయితే అందులో సీబీఐటీ, ఎంజీఐటీ, శ్రీనిధి కాలేజీలకు తక్కువ పెంపును ప్రతిపాదించింది. వాసవి కాలేజీకి గతంలో ఉన్న ఫీజులో రూ.12 వేల కోత విధించి రూ.97 వేలకు పరిమితం చేసింది. దీంతో ఆయా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. తమ వాస్తవ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఏఎఫ్ఆర్సీ ఫీజులు ఖరారు చేసిందని పేర్కొంది. దీంతో వారి ఆదాయ వ్యయాలను పరిశీలించి హైకోర్టు గతేడాది ఆయా కాలేజీల ఫీజులు పెంచారు. ఏఎఫ్ఆర్సీ ముందుగా సీబీఐటీకి రూ.1,13,500 ఫీజుగా నిర్ణయిస్తే హైకోర్టు దానికి అదనంగా రూ.86500 పెంపునకు ఓకే చెప్పి రూ.2 లక్షలకు పెంచింది. ఎంజీఐటీలో రూ.1 లక్ష ఉన్న ఫీజును రూ.1.6 లక్షలకు పెంచింది. వాసవిలో రూ.97 వేల నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది. శ్రీనిధిలో రూ.91 వేల నుంచి రూ.46 వేలు పెంచి రూ.1.37 లక్షలు చేసింది. అయితే వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు. దానిపై యాజమాన్యాలు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం హైకోర్టులో మళ్లీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనిధి, వాసవి కాలేజీలకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత ఫీజుల పెంపును అమలు చేయాలని చెప్పడంతో గందరగోళంలో పడింది. విద్యార్థులపై ఒత్తిళ్లు హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ఫీజులను చెల్లించాల్సిందేనంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వకపోవడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయినా యాజమాన్యాలు పెరిగిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి అమలుకు ఉత్తర్వులు జారీచేస్తే టాప్ పది వేల ర్యాంకులతో కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల ఫీజులను వంద శాతం ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కారకులెవరు? ఫీజల ఖరారు వ్యవహరంలో ఏఎఫ్ఆర్సీ నియమించిన కన్సల్టెంట్ వైఖరే ఈ వివాదానికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యుల ఆమోదం, సంతకం లేకుండానే ఆ కన్సల్టెంట్ కాలేజీల ఫీజుల ఖరారు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తం చేతులు కూడా మారినట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. గతంలో రూ.77 వేలు దాటని కాలేజీల వార్షిక ఫీజును ఆ కన్సల్టెంట్ వ్యవహారం వల్ల రూ.లక్షకు పైగా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన వాసవి కాలేజీలో వార్షిక ఫీజు కోత విధించడంపైనా విమర్శలొచ్చాయి. ఈ కాలేజీల ఫీజులను కమిటీ సభ్యుల ఆమోదం లేకుండానే జరిగిపోయినట్లు సమాచారం. ముడుపులు ఇచ్చిన వారికి పెంచి.. ఇవ్వని వారి కాలేజీల ఫీజులో కోత విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదీ ఆ నాలుగు కాలేజీల్లో ఫీజుల పరిస్థితి.. విద్యా సంస్థ 2013–16ఫీజు 2016–19ఫీజు అదనపుపెంపు మొత్తంఫీజు సీబీఐటీలో 1,13,300 1,13,500 86,500 2,00,000 వాసవి 1,09,300 97,000 63,000 1,60,000 శ్రీనిధి 79,900 91000 46,000 137000 ఎంజీఐటీ 82,400 1,00,000 60,000 1,60,000 -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన మహబూబ్నగర్ పూర్వపు జాయింట్ కలెక్టర్ కె.శివకుమార్ నాయుడుకు 30 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అధికారులు అకారణంగా జైలుపాలు చేసినందుకు పిటిషనర్కు ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఆదేశించారు. ఈ తీర్పుపై అప్పీల్కు ఉత్తర్వులను 3 వారాలపాటు నిలిపేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్నగర్లో బుచ్చయ్య అనే ప్రభుత్వ మాజీ ఉద్యోగికి చెందిన స్థలంలో కల్యాణ మంటపం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి జేసీ పనులు చేయరాదని 2017 జూలై 1న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై బుచ్చయ్య హైకోర్టు నుంచి ఆగస్టు 29న స్టే ఉత్తర్వులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించారు. సెప్టెంబర్లో జేసీ ఆదేశాల మేరకు పోలీసులు బుచ్చయ్యను అరెస్టు చేసి 2 నెలల 29 రోజులు జైల్లో పెట్టారు. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి తనను జైల్లో పెట్టారని బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పునిచ్చింది. -
బీసీ విద్యార్థులకు అన్యాయం
ఢిల్లీ: ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో 550 మంది, తెలంగాణలో 250 మంది నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు ఎన్నారై మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడులు కౌన్సెలింగ్లో అన్యాయం చేశారని మండిపడ్డారు. హడావుడిగా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేశారని చెప్పారు. కౌన్సిలింగ్ హైకోర్టు తీర్పు ప్రకారం జరగడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు భారీగా నష్టపోయారని వెల్లడించారు. జీవో 550 ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు మాట్లాడుతూ..జీవో 550ని సుప్రీంకోర్టు సమర్ధించడం హర్షణీయమన్నారు. అయితే ఈ ఏడాది హైకోర్టు తీర్పు ప్రకారం జరిగిన కౌన్సెలింగ్లో తాము జోక్యం చేసుకోమని చెప్పడం వల్ల 500 మందికి పైగా విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేందుకు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఆధిపత్య కులాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు హడావిడిగా కౌన్సిలింగ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. -
ఆగస్టు 30 లోపు జైలుకు రావాల్సిందే!
పట్నా: బిహార్ రాజకీయ నేత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన పెరోల్ను పొడిగించాలని పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఆగస్టు 30వ తేదీ లోపు జైలుకు రావాలని ఆదేశించింది. దాణా కుంభకోణంలో అప్పటి బిహార్ సీఎంగా ఉన్న లాలూ నిందితుడిగా తేలడంతో ఆయనకు రాంచీలోని సీబీఐ కోర్టు జైలుశిక్ష విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవడంతో కోర్టు మే 11న పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా అప్పటి నుంచి పెరోల్ను పొడిగిస్తూ వచ్చారు. ఆరోగ్యం మెరుగు పడలేదని పెరోల్ను మరింత పొడిగించాలని లాలూ తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాలూకు చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాలూ ప్రసాద్ యాదవ్కు తొలిసారి మే 11న ఆరువారాల పాటు ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆయన బయటనే ఉన్నారు. అవసరమైతే రాంచీలో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని తెలిపింది. -
ఎంబీబీఎస్ సీట్ల అవతవకలపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఎన్సీసీ కోటా ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న వారిని తప్పించి... రెండో లిస్టులో ఉన్న కొత్తవారికి 2ఎఫ్ కేటగిరీలో అవకాశం కల్పించారని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కాళోజీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ విద్యార్థులను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
పాత పద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: పాతపద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంలో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ పాత పద్దతి ప్రకారమే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా జీవో 550లో మార్పులు చేయాలని కూడా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత ఆ స్టేను సమర్థ్ధిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఆగస్టు 31లోపు దేశ వ్యాప్తంగా మెడికల్ కౌన్సెలింగ్లు పూర్తి చేయాలి. ఇప్పటికే జాతీయస్థాయి కౌన్సెలింగ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. -
ఫీజు పెంపు జీవోపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ వైద్య కళాశాలల్లోని సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీజులు పెంచుతూ జారీ అయిన జీవో 78 అమలును 2 వారాలు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫార్సుల్లేకుండా ఫీజులు పెంచడం చెల్లదంటూ వైద్య విద్యార్థి అనిల్రెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14న వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీవో 78 ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో ఫీజును రూ.25 లక్షలకు పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. జీవో జారీ విషయం గోప్యంగా ఉంచారని, చెప్పాపెట్టకుండా ఫీజును భారీగా పెంచేశారని, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీకి సంబంధం లేకుండా చట్ట వ్యతిరేకంగా ఫీజు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరణలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
వైద్య విద్య ప్రవేశాలపై నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవో 550పై తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ 16 మంది విద్యార్థులతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్ వర్సిటీ, కాళోజీ వర్సిటీలు పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం విచారించింది. సీటు ఖాళీచేసిన అభ్యర్థిని ఎలా గుర్తిస్తారు? తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వికాస్సింగ్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు ఓపెన్ కోటాలో సీటును వదులుకుని రిజర్వేషన్ కోటాలో మెరుగైన సీటు పొందినప్పుడు ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును కూడా అదే రిజర్వేషన్ కేటగిరీకి చెందిన మరో విద్యార్థికి కేటాయించాలని, దీని వల్ల ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం వాటిల్లదని వాదించారు. అయితే హైకోర్టు ఈ ప్రక్రియలో రిజర్వేషన్లు 50 శాతం దాటివెళుతున్నాయని భావిస్తూ జీవో 550లోని పేరా 5 (2)ను పక్కనపెట్టిందని, హైకోర్టు ఉత్తర్వులను నిలు పుదల చేయాలని కోరారు. ఈనేపథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా పలు ప్రశ్నలు సంధించారు. ‘ఓపెన్ కేటగిరీలోని సీటు ఖాళీ అయినప్పు డు అది తిరిగి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే అవకాశం ఉండగా.. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థికి కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారు కదా? రాష్ట్ర ప్రభుత్వంగా మీరు నిష్పాక్షికంగా వ్యవహరించాలి కదా.. ఇక్కడ హైకోర్టు కూడా సరైన తీరులో వ్యవహరించిందని మేం అనడం లేదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. కౌన్సెలింగ్ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థి మెరిట్ కోటాలో సీటు పొంది.. అంతకంటే మెరుగైన సీటు కోసం రిజర్వేషన్ కోటాలో మరో సీటు పొందాలనుకునే ప్రక్రియలో ఖాళీ చేసిన వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తారు’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు న్యాయవాది వికాస్ సింగ్, ఏపీ తరఫున బసవ ప్రభు పాటిల్, విద్యార్థుల తరఫు న్యాయవాది రమేష్ అల్లంకి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరకు దీనిపై సాంకేతికంగా వివరిస్తామని, కొంత సమయం కావాలని వికాస్ సింగ్ కోరగా విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. -
దుర్గగుడి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: దుర్గగుడి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చీరపోయినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా తీసివేయడాన్ని సవాలు చేస్తూ ట్రస్టు బోర్డు మెంబర్ కోడెల సూర్యలతా కుమారి పిటిషన్ వేసింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, దుర్గ గుడి ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోన్మెంట్, ట్రస్ట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ధర్మాసం కోరింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన కొడెల సూర్యలతాకుమారి
-
‘స్థానిక సంస్థల’ చట్ట సవరణలపై నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించేలా చేసిన చట్ట సవరణలకు సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ చట్టాలకు చేసిన సవరణలు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నందున ఆ సవరణల్ని రద్దు చేయాలనే పిల్పై వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శులకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. -
‘హారన్ల శబ్ధం ఎంతమేర ఉండవచ్చో చెప్పండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ మహానగ రంలో రాజకీయ నేతలు, ప్రముఖులు వినియోగిం చే వాహనాల సైరన్, సౌండ్ హారన్ల వినియోగంపై ఆంక్షలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేయాలని తెలంగాణ ప్రభు త్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందిన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో, బుగ్గ కార్ల వినియోగ నిబం ధనలు ఏం చెబుతున్నాయో కూడా తమకు వివ రించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సౌండ్ హారన్లు వినియోగించరాదని, ఎర్ర బుగ్గ కార్లను ఎవరు పడితే వారు వినియోగించకుండా ఉత్తర్వులు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారిం చింది. నగరానికి చెందిన న్యాయవాది వినీత్ దన్దా దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ కల్పించుకుని వివరాలు సేకరించి తెలియజేసేందుకు సమయం కావాలని కోరగా, ధర్మాసనం పైవిధంగా స్పందించింది. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. -
సర్కారీ స్థలమనుకొని.. ప్రైవేట్ కట్టడం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని అధికారులు తొందరపడి ఓ స్థలంలోని కట్టడాన్ని కూల్చేశారు. తీరా విచారిస్తే అది ప్రైవేటు స్థలం. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈలోగా ఆ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాలక పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించామని తహసీల్దార్ కోర్టులో చెప్పారు. ప్రభుత్వ భూమిలోనే అక్రమ కట్టడాలు చేస్తున్నారనుకుని ఆ కట్టడాన్ని కూల్చేశానని రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) తప్పు ఒప్పుకోక తప్పలేదు. సొంత ఖర్చుతో కట్టడాన్ని నిర్మిస్తానన్నారు. కోర్టు చర్యలు తీసుకుంటుందని భయపడి కూల్చిన నిర్మాణాన్ని నిర్మిస్తామని కోర్టుకు ఆర్ఐ హామీ ఇచ్చారని నిర్మాణ సంస్థ అపనమ్మకం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ స్పందిస్తూ.. కోర్టు చర్యలు ఉంటాయని భయపడి నిర్మాణం చేస్తామని హామీ ఇస్తే సరిపోదని, కచ్చితంగా తిరిగి నిర్మించాలన్నారు. అక్రమ నిర్మాణం అనుకుని.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సర్వే నం. 168/ పిలో ఎకరా 35 సెంట్ల భూమిలోని క్రీడా సముదాయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ డీసీఎస్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘సర్వే నం 1170 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం అనుకుని అధికారులు క్రీడా సముదాయాన్ని కూల్చేశారు. చట్ట ప్రకారం నిర్మాణాన్ని కూల్చేయడానికి అనుసరించాల్సిన నిబంధనల్ని అధికారులు తుంగలోకి తొక్కారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్రెడ్డి వాదిం చారు. దీనిపై తహసీల్దార్ దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘సర్వే 1170లో నిర్మాణాలుంటే అడ్డుకోవాల ని ఆర్ఐ, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారీ భూములు అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే ఆదేశించాను. కూల్చివేత చర్యలు తీసుకోవాలని ఆదేశించలేదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలనే.. అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమి ని కాపాడాలని ప్రహరీతో పాటు క్రీడా సముదాయ నిర్మాణ గోడ కూల్చేశామని విడిగా దాఖలు చేసిన అఫిడవిట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) పేర్కొన్నారు. ‘అది ప్రభుత్వ స్థలం కాదని తర్వాత తెలిసింది. చట్ట వ్యతిరేకంగా చేసినట్లు నిర్ధారణ చేసుకున్నాను. కూల్చిన నిర్మాణాలను సొంత సొమ్ముతో పునః నిర్మాణం చేస్తాను’అని హామీ ఇచ్చారు. ఆర్ఐ హామీపై పిటిషనర్ న్యాయవాది అనుమానం లేవనెత్తగా న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు చర్యలు తప్పవనే ఆర్ఐ హామీ ఇచ్చినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తిరిగి నిర్మాణం చేయాలే గానీ భవనం విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. చట్ట ప్రకారం హద్దులు నిర్ణయించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఊరట
-
సినిమా చూసేటప్పుడే తినాలా?
సాక్షి, హైదరాబాద్:మల్టీప్లెక్స్లోని సినిమా హాళ్లల్లోకి ప్రేక్షకులు తమ వెంట తినుబండారాలు తీసుకుని వెళ్లేలా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్టీప్లెక్స్లోని సినిమా హాళ్లల్లో ఆహార పదార్థాల నాణ్యత, అధిక ధరలు అంశాలపై వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆహార భద్రత, తూనికలు–కొలతలు, సినిమా రెగ్యులేషన్ యాక్ట్లతో ముడిపడిన ఈ వ్యవహారంపై పిల్ ద్వారా న్యాయ సమీక్ష వీలుకాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. మల్టీప్లెక్స్ల్లోని సినిమా హాళ్లల్లో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని, ప్రేక్షకులే తమ వెంట ఆహార పదార్థాలను తీసుకువెళ్లేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది సతీశ్కుమార్ దాఖలు చేసిన పిల్ను కోర్టు కొట్టివేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
-
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా.. ఈ తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో.. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ రెండు నెలలపాటు స్టే విధించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయకపోవడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని, ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా స్టే ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్కుమార్లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
ఆదిత్యున్ని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీకాకుళం : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకున్నారు. అలాగే సీఐఎస్ఎఫ్ కమాండెంట్ జయప్రకాష్ఆజాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు జడ్జి బాలయోగి తోపాటు, జిల్లా జడ్జి నిర్మలా గీతాం బ, తహసీల్దార్ మురళీకృష్ణ కూడా ఉన్నారు. ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. ముఖలింగేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని ఉమ్మడి రాష్టాల హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి.. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న దేవతా విగ్రహాలకు పూజలు, వారాహి అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ శిఖరం దర్శనం చేయించి స్వామివారి చరిత్రతో పాటు ఆలయ విశేషాలు వివరించారు. అలాగే స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, అడిషనల్ సబ్ జడ్జి వివేకానంద, కోటబొమ్మాళి జడ్జి కె.ప్రకాశ్బాబు, పర్యవేక్షకులు టి.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, ఈఓ వీవీఎస్ నారాయణ, ఎస్ఐ ఎం.గోవింద, అర్చక సంఘం అధ్యక్షుడు టీ.పెద్దలింగన్న, అర్ఐ చిన్నారావు ఉన్నారు. -
సీఐలకు పదోన్నతి నిబంధన సడలింపు సబబే : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే నిబంధనను సడలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పోలీస్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వాలంటే కనీసం రెండేళ్లపాటు వారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఇంటెలిజెన్స్, సీఐడీ వంటి విభాగాల్లో పనిచేయాలనే నిబంధనను తెలంగాణ హోం శాఖ సడలిస్తూ 2016లో జీవో 122, 2017లో జీవో 133లను జారీ చేయడాన్ని పలువురు ఇన్స్పెక్టర్లు హైకోర్టులో సవాల్ చేశారు. వీటిపై వాదప్రతివాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. నిబంధన సడలింపు వెనుక దురుద్దేశాలు కనబడటం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో తాము పనిచేసినా డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వడం లేదని, వీటిలో పనిచేయని ఇతర సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఇన్స్పెక్టర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది శరత్కుమార్ ప్రతివాదన చేస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతిభద్రతల విధుల నిమిత్తం పలువురు ఇన్స్పెక్టర్లు ఆయా విభాగాల్లో పనిచేయలేకపోయారని, అందరికీ న్యాయం చేయాలనే ఆ నిబంధనను ప్రభుత్వం సడలించిందని వివరించారు. దీంతో ధర్మాసనం ఆ వ్యాజ్యాలను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. -
‘రాయదుర్గ్’ భూములకు రక్షణ
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామంలో కోట్ల రూపాయల విలువైన భూముల హక్కులు అన్యాక్రాంతం కాకుండా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.తిరుపతిరావుకు కోర్టు ధిక్కార కేసులో సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను కూడా రద్దు చేసింది. ప్రజాప్రయోజనాలకు భంగం కలిగే విధంగా వంద ఎకరాలకుపైగా ఉన్న భూములపై హక్కుల్ని కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గ్లోని 1 నుంచి 49వ సర్వే నంబర్ వరకూ ఉన్న భూములపై హక్కులు కల్పించాలని ఎం.లింగమయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నాటి తీర్పునకు లోబడి రెవెన్యూ రికార్డుల్లో లింగమయ్య పేరు నమోదు చేయాలని, ప్రభావిత కుటుంబాల వాదనలు విన్న తర్వాతే మ్యుటేషన్ చేయాలని 2009 మార్చిలో శేరిలింగంపల్లి తహసీల్దార్ను జడ్జి ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో లింగమయ్య కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అప్పటి తహసీల్దార్ తిరుపతిరావు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు రెండు మాసాల జైలు, రూ.1500 జరిమానా విధిస్తూ గత ఏడాది అక్టోబర్లో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ తిరుపతిరావు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. తహసీల్దార్ జైలు శిక్ష రద్దు ‘‘సీఎస్ 7/1958 నాటి దావాకు సంబంధించి లింగమయ్య పేరున 2002 నుంచి జారీ అయిన ఉత్తర్వులు మోసపూరితంగా ఉన్నాయి. ప్రజాప్రయోజనాలకు హాని కలిగించేలా వంద ఎకరాలకుపైగా ఉన్న భూముల హక్కుల్ని ప్రభుత్వం చేజారేలా ఆదేశాలు జారీ చేయలేం. 1959 ఏప్రిల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా లింగమయ్య భూములపై హక్కులు కోరుతున్నారు. 7/1958 నాటి కేసు ప్రకారం షెడ్యూల్–ఎ లోని ఐటం 234లో ఆస్తుల వివరాలు మక్తా రాయదుర్గ్లో ఉన్నాయి. సదరు ఐటంకు చెందిన భూములు, సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలు పేర్కొనలేదు. అందుకే లింగమయ్య కోరినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పునకు (మ్యుటేషన్) అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. థర్డ్పార్టీలకు భూములపై హక్కులు కల్పించాలని సింగిల్ జడ్జి ఆదేశాలను ఆమోదించలేం. తహసీల్దార్కు విధించిన జైలుశిక్ష, కోర్టు ధిక్కార తీర్పును రద్దు చేస్తున్నాం ’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
మైనింగ్ మాఫియా సరికొత్త డ్రామా!
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్కు పాల్పడి తాము తవ్విన తెల్లరాయిని మాత్రమే మిల్లుల్లో దించుకోవాలని గత నాలుగేళ్లుగా భయపెట్టి దౌర్జన్యంగా కోటి టన్నులకు పైగా కొల్లగొట్టిన పల్నాడులోని మైనింగ్ మాఫియా కేసు నుండి బయటపడేందుకు ఇప్పుడు కొత్త అంకానికి తెరతీసింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటివరకూ మిల్లర్లకు నోటీసులు ఇప్పించి వారిని భయాందోళనకు గురిచేసింది. కానీ, కేసు తీవ్రతతో ఇంకా మథనపడుతున్న మాఫియా సూత్రధారులు ఇప్పుడు తాజాగా తాము చెప్పినట్లు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం.. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ మాఫియా సూత్రధారులు వడ్డవల్లి బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లులు పిడుగురాళ్ళ, నడికుడి ప్రాంతాల్లోని మిల్లర్ల యజమానులను దగ్గరుండి కలెక్టరేట్కు తీసుకొచ్చి వారిని కలెక్టర్ వద్దకు పంపారు. వీరు మాత్రం బయటే ఉండిపోయి కొత్త కథను నడిపించారు. ఇందులో భాగంగా ముందుగా.. మైనింగ్ను నిలిపివేయడంవల్ల కూలీలు ఉపాధి కోల్పోతున్నారని వారితో కలెక్టర్కు వినతిపత్రం ఇప్పించారు. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే తాము, కూలీలు ఇబ్బందులు పడుతున్నామని వారి నోటితో చెప్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం వారిని గుంటూరు నగరంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి తాము అండగా ఉంటామంటూ మిల్లర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో.. ఇప్పటికే తమకు మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారని, మిగతా శాఖలకు చెందిన అధికారులు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, అవైనా తమకు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేను మిల్లర్లు వేడుకున్నట్లు సమాచారం. అయితే, గతంలో మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలిసినప్పటికీ ఎదురు తిరిగితే కేసుల్లో ఇరికిస్తారనే భయంతో ఇష్టంలేకపోయినా మైనింగ్ మాఫియా ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి మిల్లర్లకు ఏర్పడింది. ఇదిలా ఉంటే.. నిజంగా ఎమ్మెల్యేకు, మైనింగ్ మాఫియాకు తమపై ప్రేమ ఉంటే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న మూడు క్వారీలను మాత్రమే నిలిపివేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే, మిగతా క్వారీలను సైతం ఎందుకు మూయించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు మిల్లర్లు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం. -
‘గోల్డ్స్టోన్’ ప్రసాద్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పీఎస్ ప్రసాద్ (గోల్డ్స్టోన్ ప్రసాద్), అతని కుటుంబసభ్యులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల విషయంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్(జేసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం హస్మత్పేట సర్వే నంబర్ 1లోని 74.08 ఎకరాలు, సర్వే నంబర్ 57లోని 39 ఎకరాల భూమిపై ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, కంపెనీలు, ఇతరులకు హక్కు కల్పిస్తూ పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయొ ద్దని సంబంధిత తహసీల్దార్ను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల ఎకరాల భూమిపై 1958 నుంచి కొనసాగుతున్న వివాదంలో తుది తీర్పు వచ్చేవరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. స్పష్టత వచ్చే వరకు ఆ భూములపై హక్కులు కోరజాలరని ప్రసాద్ తదితరులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రసాద్ తదితరులు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు తుది తీర్పు ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు ప్రసాద్ తదితరులు చేస్తున్న వాదన పిడికెడు బియ్యంలో గంపెడు గుమ్మడికాయను దాచే ప్రయత్నంలా ఉందని ఆక్షేపించింది. 113 ఎకరాల భూమి విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తుది తీర్పునిచ్చిందంటూ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు హక్కులు కోరారు. దీంతో బాలా నగర్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లను చేరుస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు జేసీ ముందు రివిజన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2018లో తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. జేసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, అతని కంపెనీలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. -
మీ అప్పీళ్లపై 21న విచారణ జరుపుతాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ నెల 21న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావు విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. దీంతో జస్టిస్ శివశంకర్రావు ఈ ఏడాది ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. గతవారం అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కోర్టు ధిక్కార కేసులో ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద జస్టిస్ శివశంకరరావు.. ఫాం–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే స్పీకర్, డీజీపీ, నల్లగొండ, జోగుళాంబ గద్వాల్ ఎస్పీలకు నోటీçసులిచ్చి ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఇరువురు కార్యదర్శుల అప్పీళ్లు కేసుల విచారణ జాబితాలో ఉన్నా అవి విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో వారి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్కు, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు జారీ చేసిన నోటీసులు, ఇరువురు కార్యదర్శులకు ఇచ్చిన ఫాం–1 నోటీసుల గురించి ధర్మాసనానికి వివరించారు. -
సంజయ్ కేసు.. హైకోర్టులో డీఎస్ పిటిషన్
హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
కత్తి మహేశ్ బహిష్కరణపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ బహిష్కరణ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. తనపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ పిటిషన్లో కత్తి మహేశ్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన హైకోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. -
వారికి అన్ని ప్రయోజనాలూ ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టు వల్ల ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు చట్ట ప్రకారం వర్తింపచేయాల్సిన ఆర్అండ్ఆర్ ప్రయోజనాలను వర్తింప చేసి తీరాల్సిందేనని ఎస్సీసీఎల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎస్సీసీఎల్పై ఉందని స్పష్టం చేసింది. వారికి చట్ట ప్రకారం అందించాల్సిన సాయాన్ని అందించి తీరాల్సిందేనంది. ఇందుకు సంబంధించి కొన్ని విధి విధానాలను నిర్దేశించింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో 2005లో జారీచేసిన జీవో 68, ప్రభావిత, నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ 2010లో జారీ చేసిన జీవో 34కు అనుగుణంగా కొత్తగూడెం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించాలని బాధిత వ్యక్తులు, కుటుంబాలను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వినతిపత్రాలు పెట్టుకోవాలని, అలా సమర్పించిన వినతి పత్రాలపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో జాయింట్ కలెక్టర్కు 2013 భూసేకరణ చట్టంకింద నియమితులైన ఆర్అండ్ఆర్ కమిషనర్ దిశా నిర్దేశం చేయాలంది. వ్యక్తిగత, గ్రూపు వినతులు, అర్హతలు, కుమార్తెల అభ్యర్థనలు తదితర వాటిన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 68, జీవో 34 కింద ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నీ వారికి దక్కేలా చూడాలని ఆర్అండ్ఆర్ కమిషనర్కు హైకోర్టు తేల్చి చెప్పింది. అటు జాయింట్ కలెక్టర్కు, ఇటు కమిషనర్కు పూర్తిస్థాయి సహకారం అందించాలని సింగరేణి కాలరీస్ అధికారులను ఆదేశించింది. డబ్బు చెల్లింపు బాధ్యత జేసీలకు.. కనీస వ్యవసాయ వేతనం అందని అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి తాజాగా సవరించిన లేబర్ రేట్ల ప్రకారం లేదా కనీస వేతన చట్టంకింద తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లోని రేట్లలో ఏవి ఎక్కువఉంటే వాటి ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలంది. ఇందుకు సంబంధించిన డబ్బును జాయింట్ కలెక్టర్కు అందుబాటులో ఉంచాలని సింగరేణి కాలరీస్ అధికారులను ఆదేశించింది. ఎంక్యూ, టీక్యూ క్వార్టర్లలో నివాసం ఉంటూ ఎవరైతే విద్యుత్, నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆ సౌకర్యాన్ని రెండు వారాల్లో కల్పించాలంది. ఖాళీ చేసేందుకు ఎవరైతే హామీ ఇచ్చారో వారు ఆర్అండ్ఆర్ ప్రయోజనాల ఉత్తర్వులు జారీఅయిన 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. నివాస ప్రాంతాలకు 250 మీటర్ల పరిధిలో ఎటువంటి బ్లాస్టింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా, యల్లందు మునిసిపాలిటీ పరిధిలో 450.57 హెక్టార్లలో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టు చేపట్టారు. దీని వల్ల ప్రభావితమవుతున్న, నిర్వాసితులవుతున్న తమకు సింగరేణి అధికారులు చట్ట ప్రకారం ప్రయోజనాలను వర్తింప చేయడం లేదంటూ ఐ.దిలీప్కుమార్, మరో 60 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ప్రభావిత, నిర్వాసిత కుటుంబాల విషయంలో సింగరేణి అధికారుల వ్యవహారశైలిని తప్పుపట్టారు. -
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: కోర్టుల పరిపాలనలో కాగితాల ఫైళ్లతో పని లేకుండా చేస్తున్నామని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల కంప్యూటరీకరణకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా కోర్టు రికార్డుల కంప్యూటరీకరణ (డిజిటైజేషన్) పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని వెల్లడించారు. సబార్డినేట్ కోర్టులూ నేషనల్ జ్యుడీషియ ల్ డేటాగ్రిడ్కు అనుసంధానమయ్యాయని, ప్రతి కోర్టులో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి కేసుల సమా చారాన్ని అప్లోడ్ చేయబోతున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం హైకోర్టు భవనంపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నేషనల్ సాఫ్ట్వేర్ ఫ్లాట్ ఫాం ద్వారా జరుగుతున్న డేటాబేస్ రూపకల్ప నలో భాగంగా కక్షిదారులు, న్యాయవాదులు, న్యా యమూర్తులు బాలారిష్టాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయమూర్తుల సమావేశం విషయాలను ఆన్లైన్ ద్వారానే తెలియజేస్తున్నామని.. హైకోర్టు తుది తీర్పు, మధ్యంతర ఉత్తర్వులు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. కింది కోర్టుల్లో జైళ్లలోని విచారణ ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నామని వివరించారు. కింది కోర్టులకు భవనాలు గతేడాది రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త కోర్టులను మంజూరు చేశాయని, దీంతో ముగ్గురు జిల్లా జడ్జీలు, 18 మంది సీనియర్ సివిల్ జడ్జీల పోస్టులను నేరుగా భర్తీ చేశామని జస్టిస్ రాధాకృష్ణన్ తెలిపారు. ఏపీలో రూ.160 కోట్ల వ్యయంతో 45 సబార్డినేట్ కోర్టు హా ళ్లు, రూ.2.65 కోట్లతో నాలుగు జడ్జీల నివాస భవనా లు నిర్మిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 40 కోర్టు హాళ్లను రూ.25 కోట్లతో, జడ్జీల నివాస సముదా యం రూ.57 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఏపీ తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై గోప్యమేల?: రామన్నదొర ఏపీలోని వెలగపూడిలో తాత్కాలిక హైకోర్టు భవనాలు నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోందని, ఏపీ ప్రభుత్వం తమ సంఘాన్ని కనీసం సంప్రదించలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ న్యాయవాదులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో తెలియదని, అరకొర సౌకర్యాలతో ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే ఎలా వెళ్తామని ప్రశ్నించారు. జడ్జీల ఖాళీలు భర్తీ చేయాలి: ఏజీ రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందని, ఎంతోమంది న్యాయవాదులు స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైతుబంధు లాంటి పథకాలతో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని కొనియాడారు. రాజ్యాంగం సమానత్వాన్ని ఇచ్చిందని, త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసులు తగ్గి సత్వర న్యాయం అందాలంటే ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్రెడ్డి కోరారు. కింది కోర్టుల పనితీరు భేష్ కింది స్థాయి కోర్టుల పనితీరు అద్భుతమని సీజే కొనియాడారు. సబార్డినేట్ కోర్టుల్లో 2017లో సివిల్, క్రిమినల్ కేసులు 7,23,502 దాఖలైతే.. పెండింగ్ కేసులు కలుపుకొని 7,60,582 పరిష్కా రమయ్యాయని, దీంతో 37,080 పెండింగ్ కేసు లు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది జూన్ చివరికి 3,69,462 కేసులు నమోదవగా 3,41,319 పరిష్కారమయ్యాయన్నారు. గతేడాది ఏపీలో 5 నేషనల్ లోక్ అదాలత్ల ద్వారా 1,05, 543 కేసులు, తెలంగాణలో 1,18,304 కేసులు పరిష్కరించామని, హైకోర్టులో లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా వివిధ కేసుల్లో 1,249 మందికి రూ.21.45 కోట్లు పరిహారం చెల్లింపులకు ఆదేశాలిచ్చామన్నారు. హైకోర్టులో 2017లో 95,894 కేసులు నమోదవగా 62,047 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై 31 నాటికి 54, 686 కేసులను నమోదయ్యాయని 32,544 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. క్రిమినల్ అప్పీళ్ల పరిష్కారం కోసం దాదాపు ప్రతి శనివారం కోర్టు ప్రత్యేకంగా సమావేశం కావడం ద్వారా 104 అప్పీళ్లల్లో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
బసవతారకం కిట్ల పథకానికి హైకోర్టు బ్రేక్
-
మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
సాక్షి, గుంటూరు: పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మైనింగ్ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాధరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని సీబీసీఐడీ విచారిస్తుందా? గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోంది. సీబీఐ విచారణకు సర్కారు జంకుతోంది. మైనింగ్ మాఫియాపై హైకోర్టు కన్నెర్ర చేయడం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆందోళనలు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తోంది. మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తోంది. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేసి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే పెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో కొనసాగుతున్నవారిని సీబీసీఐడీ విచారించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కలు దాచిపెట్టి కార్మికులపై చర్యలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం బలి పశువుల కోసం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది? ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. – కాసు మహేష్రెడ్డి (వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త) -
జీవో 550 పునఃసమీక్ష కేసు 21కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్స్కు సంబంధించి జీవో 550లోని పేరా 5(2) అమలు చెల్లదని హైకోర్టు వెలువరించిన తీర్పు పునఃసమీక్ష పిటిషన్పై విచారణ 21వ తేదీకి వాయిదాపడింది. జీవో నిబంధనలకు అనుగుణంగా తొలుత 50 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని, ఆ తర్వాత మిగిలిన 50 శాతం సీట్లను రిజర్వేషన్ కోటాలో భర్తీచేసేలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వాలని కె.ఉర్జిత యాదవ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారించాలని పిటిషనర్ న్యాయవాది మంగళవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషన్ను వచ్చేవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈలోగా ప్రభుత్వాల వైఖరి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కేటగిరీ సీటును ఎంపిక చేసుకుని ఆ తర్వాత దానిని వదులుకుని మరో కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీ కోటా సీటులో చేరితే, వారు వదులుకున్న సీటును అదే సామాజికవర్గంలోని అభ్యర్థితోనే భర్తీ చేసేందుకు వీలుకల్పించే జీవోలోని ఆ పార్ట్ను హైకోర్టు కొట్టివేసింది. -
వారినెందుకు క్రమబద్ధీకరించరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సమస్యకు కొంతవరకైనా పరిష్కారం చూపినట్లు అవుతుందని అభిప్రాయపడింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని, అందువల్ల ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వడం లేదని, అయితే కేవలం సూచనలు మాత్రమే చేస్తున్నామని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, శాశ్వత ప్రాతిపదికన టీచర్ల పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకట్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్కుమార్ రాష్ట్రంలో దాదాపు 1,800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని చెప్పడంతో విస్మయం వ్యక్తంచేసిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మంగళవారం నాటి విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాణిరెడ్డి ధర్మాసనం కోరిన వివరాలను సమర్పించారు. ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం 988 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపింది. ఈ కొరతను తీర్చేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని వాణిరెడ్డి తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం విద్యావలంటీర్ల గురించి ఆరా తీసింది. వారి అర్హతలు ఏమిటని ప్రశ్నించింది. సాధారణ ఉపాధ్యాయులకున్న అర్హతలే వీరికి కూడా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో, అయితే వారిని ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించింది. -
‘మెడికల్’ రెండో విడత మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత తానిచ్చిన స్టేను సమర్థ్ధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసుకొని సీట్లు పొందిన విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో తరగతులకు హాజరవుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జీవో నంబర్ 550పై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున కౌన్సెలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రకారం ఈ నెలాఖరులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి. అప్పటిలోగా కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంసీఐ అనుమతి ఇవ్వాలి. కానీ అంత సులువుగా ఎంసీఐ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. రెండో విడతలో 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. -
లైంగిక వేధింపుల కేసులో జడ్జి అరెస్ట్
హైదరాబాద్/తుంగతుర్తి: ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేసిన జడ్జిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావు హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఉంటున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సివిల్ కోర్టు మహిళా న్యాయవాది రజిని ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల సత్యనారాయణరావు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయమై సత్యనారాయణరావును నిలదీయగా అతడితో పాటు ఆయన తల్లి రజినీపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో ఈ నెల 4న ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు సత్యనారాయణరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసు నమోదు చేశారు. హైకోర్టు అనుమతితో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. -
పరిపూర్ణానంద బహిష్కరణపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నగర బహిష్కరణ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్వామీజీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్వామీజీ నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు స్వామీజీని జూబ్లీహిల్స్లో బస చేసిన నివాసంలోనే నిర్బంధంలో ఉంచారు. మెజార్టీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటూ కత్తి మహేశ్ను అప్పటికే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. అనంతరం స్వామీజీని కూడా నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణం చూపించి ఈ బహిష్కరణ చేశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర చర్యల నివారణ చట్టం కింద స్వామీజీని నగర బహిష్కరణ చేయడం అన్యాయమని, ఇతర జిల్లాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమని స్వామీజీ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాశ్రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. స్వామీజీ నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రటరీ నిరంజన్ రావ్లు ఇద్దరూ నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
కోమటిరెడ్డి,సంపత్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
-
పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టులో పరిపూర్ణానంద స్వామికి ఊరట లభించింది. హైదరాబాద్ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన నగర బహిష్కరణను కోర్టు నిలిపివేసింది. తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్ శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఈ మేరకు జులై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్లో అడుగుపెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ముందే కత్తి మహేష్ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. -
గ్రేటర్లో విపరీతమైన శబ్ద కాలుష్యం
సాక్షి, సిటీబ్యూరో: రణగొణ ధ్వనులతో మహానగరంలో మోత మోగుతోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలు తదితర సున్నిత ప్రాంతాల్లోనూ విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని కోరుతూ... మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్లర్ విపిన్ శ్రీవాత్సవ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం ఇటీవల సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధానంగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలను(శబ్దకాలుష్య రహిత ప్రాంతాలు– నో హాంకింగ్ జోన్స్)గా ప్రకటించాలని ఆయన తన లేఖలో కోరారు. ట్రాఫిక్, రవాణా, పోలీస్ శాఖలు ఆయా ప్రాంతాల వారీగా శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించాలని... అంతకుమించి ధ్వనిని వెలువరించే సంస్థలు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విన్నవించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, పెరుగుతోన్న వ్యక్తిగత వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, చోదక సామర్థ్యం లేని వారికి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నివారణ చర్యలను వివరించాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో శబ్ద కాలుష్యానికి కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ‘సాక్షి’ కథనం. పరిమితికి మించిన ధ్వనులతో గ్రేటర్ గూబ గుయ్మంటోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ మోత మోగుతోంది. నగరంలోని కొన్ని సున్నిత, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల కంటే అధికంగా ధ్వని కాలుష్యమవుతోంది. అబిడ్స్, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల (పారిశ్రామిక ప్రాంతం), జూపార్క్ (నిశ్శబ్ద జోన్), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ (నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు, మరో 100 ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవీ కారణాలు... ⇒ నగరంలో శబ్ద కాలుష్యానికి రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర ప్రధాన కారణాలు. ⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్ల మోత మోగిస్తుండడం. ⇒ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు. వీటిలో 15ఏళ్లకు మించి కాలం చెల్లిన వాహనాలు 15లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ⇒ ఇక యూత్ ప్రత్యేక గుర్తింపు కోసం అధిక శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లను వినియోగిస్తుండడంతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ⇒ గ్రేటర్లో సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లున్నాయి. వీటి దగ్గర అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మోగుతోంది. ⇒ నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు ఏర్పాటు చేస్తుండడంతో... అక్కడి డీజేల హోరు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ⇒ గ్రేటర్లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో బోరుబావుల తవ్వకం, లోడర్లు, డంపర్లు లాంటి కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం పెరిగింది. వీటి నుంచి అధిక శబ్దాలు వెలువడుతున్నాయి. శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం... ⇒ గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేకపోవడంతో రోగులు అధిక ధ్వనులు విని ఆందోళనకు గురవుతున్నారు. ⇒ నగరంలో సుమారు 5వేల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇవి కూడా దాదాపు ప్రధాన రహదారులు, ముఖ్య వీధులు, కాలనీల్లోనే ఉన్నాయి. వీటిల్లోనూ శబ్ద గ్రాహకాలున్న పాఠశాలలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నష్టాలివీ... ⇔నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబా ్దలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ⇔పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. ⇔అతిధ్వనులు విన్న జంతువులు ఇంటి నుంచి పరుగెత్తి రోడ్డు ప్రమాదాల బారిన పడడం, కరవడం లాంటివి చేస్తాయి. ⇔90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ⇔చిన్నపిల్లల కర్ణభేరీలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ⇔అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. నివారణ చర్యలివీ... ♦ ప్రధానంగా పాఠశాలలు, ఆస్పత్రుల గోడలను అధిక శబ్దాలను నిరోధించే జిప్సం బోర్డులు, ఫైబర్ గ్లాస్ ఇన్సులేషన్స్తో కప్పి వేస్తే ధ్వని లోపలికి చేరకుండా ఉంటుంది. ♦ అధిక శబ్దాలు వెలువడే ప్రాంతాల్లోని భవనాలకు విధిగా శబ్దగ్రాహకాలు ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి ఆస్పత్రి, పాఠశాల ఆవరణలో గ్రీన్బెల్ట్ను అధికంగా ఏర్పాటు చేయాలి. అధిక శబ్దాలను గ్రహించేందుకు హరిత వాతావరణం దోహదం చేస్తుందని గుర్తించాలి. గ్రీన్బిల్డింగ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ♦ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8గంటల పాటు 85 డెసిబుల్స్కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ♦ అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్ప్లగ్లు వాడాలి. ♦ ట్రాఫిక్ రద్దీలో బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. దీర్ఘకాలంలో వినికిడి లోపం... వినికిడి అవధిని దాటి అధికంగా వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్ద కాలుష్యం అవధిని మించి నమోదయితే అక్కడి నివాసితులకు చెవిలో రింగురింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. దీర్ఘకాలం ఈ శబ్దాలను వినే వారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తిని కోల్పోతారు. – డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ వైద్యనిపుణులు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి -
బోడెపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గత వారం రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత నెల 9న బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే రోజాను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారన్నారు. దీనిపై గత నెల 14న పెనమూరు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపగా, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు.