
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనను నిరసిస్తూ ఏపీ న్యాయవాదులు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద రాయలసీమకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్టు విభజనకు కొంత సమయం కావాలని కోరుతూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించడంతో విభజకు లైక్క్లియరైంది. దీంతో ఏపీకి చెందిన న్యాయవాదులు, న్యాయసిబ్బంది అమరావతికి తరలివెళ్లక తప్పట్లేదు.
ఇదిలావుండగా సహచర ఉద్యోగులు తరలివెళ్లిపోతుండటంతో హైకోర్టు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. కొందరు న్యాయమూర్తులు తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏపీకి తరలివెళ్తున్న న్యాయవాదులకు తెలంగాణ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. అమరావతిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఏపీ న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.