నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్‌ | Sakshi
Sakshi News home page

నాన్న చనిపోయినా వేళ్లలేదు.. డబ్బులే ముఖ్యమని విమర్శించారు: కోవై సరళ ఎమోషనల్‌

Published Sun, May 5 2024 3:25 PM

Kovai Sarala Didn't Go To Her Father Funeral, Here The Reason

కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్‌ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.

చాలా కాలం తర్వాత ఈ సీనియర్‌ నటి బాక్‌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్‌ కమెడిన్‌ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్‌, ఒక బ్రదర్‌ ఉన్నాడు. 

అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్‌ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్‌ కొడుతూ సందడి చేయాలి. 

నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్‌ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్‌. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్‌ అయింది. 
 

Advertisement
Advertisement