సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును, వారి కూటమిని నమ్మలేక, వారి మేనిఫెస్టో పై విశ్వాసం లేక జగనన్న మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయని జలవనరుల శాఖా మంత్రి, నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర లో భాగంగా జరిగిన చేరికల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా 1,2 వార్డుల నుంచి 60 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు.ఒకటవ వార్డు కౌన్సిలర్ వరికల్లు కోటేశ్వరావు, స్థానిక నాయకులు నిజాంపట్నం అమరేంద్రల ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల్లో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నే రానున్నారని, ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారన్నారు. కూటమిగా వచ్చినా, కట్టకట్టుకు వచ్చినా జగనన్నను ఎవరూ ఆపలేరన్నారు. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే కూటమిగా వస్తున్నారని, అబద్దపు వాగ్దానాలతోనైనా సరే అధికారం చేపట్టాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు..కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెండెం బాబురావు, జిల్లా గ్రంధాల యాల సంస్ధ మాజీ ఛైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి, పక్కాల సూరిబాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ నాగుర్మీరాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు ఉన్నారు.
కారెంపూడి: కారెంపూడి మండలంలో టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామానికి చెందిన మరో 35 కుటుంబాలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల అభ్యున్నతికి చేకూర్చిన లబ్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పేటసన్నెగండ్ల గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
పెదకూరపాడు: కూటమిలో కుమ్ములాటలతో టీడీపీ,జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలు వీడి వైఎస్సార్సీపీలోకి చేరారు. మండలంలోని పాటిబండ్ల, హుస్సెన్నగరం, బలుసుపాడు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వాసించారు. అనంతరం శంకరరావు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారరని, పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు.