
సాక్షి, సిద్దిపేట : కరోనా వైరస్ ఎఫెక్ట్తో ప్రపంచానికి భారత సంస్కృతి విలువ తెలిసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. షేక్ హ్యాండ్ వద్దు, నమస్తే చాలంటూ ఇప్పుడు ప్రపంచమంతా భారత్ను అనురిస్తుందని తెలిపారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో పేదలకు బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందన్నారు. ఇందులో ప్రజల సహకారం, వైద్యులు, పోలీసుల సేవలు అమోఘమని ప్రశంసించారు. అనవసరంగా బయట తిరిగి కరోనాను అంటించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా బయటకు వస్తే తప్పని సరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. మాకేం కాదులే అనే నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్కు సహకరిస్తూ ఐక్యంగా కరోనాను తరిమికొడదామని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
(చదవండి : కష్టమొచ్చిందా.. కాల్ చేయండి)