Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

SIT investigation based on false statements says Mithun Reddy1
అక్రమ కేసే.. బాబు కుట్రే!

సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్‌ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్‌ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్‌కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్‌ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్‌రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూ­లం ఇవ్వాలని సిట్‌ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్‌ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్‌రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్‌ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్‌ ప్రశ్నలకు మిథున్‌ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్‌ విచారణను ఎంపీ మిథున్‌ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్‌: అడాన్‌ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్‌రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్‌ టేక్‌ అవుట్‌ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్‌ అధికారులు మౌనం వహించారు) సిట్‌: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్‌ గ్రూప్‌నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్‌రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్‌ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్‌ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్‌ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్‌ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్‌ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్‌: రాజ్‌ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్‌రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్‌ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్‌: రాజ్‌ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్‌రెడ్డి: రాజ్‌ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్‌: మీరు కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్‌రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్‌లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్‌రెడ్డి సిట్‌ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్‌ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్‌ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు.

Number of toppers reduced in JEE Main 2025 results2
ర్యాంకర్లూ కటాఫ్‌!

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ పర్సంటైల్‌ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్‌ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్‌గా నిలవగా అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్‌ విభాగంలోనూ టాపర్‌గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్‌–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్‌ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్‌ కేటగిరీలో 93.102 పర్సంటైల్‌గా కటాఫ్‌ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్‌ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్‌ పర్సంటైల్‌ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను జూన్‌ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్‌ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్‌ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.

Lucknow Super Giants surprisingly beat Rajasthan Royals by 2 runs3
లక్నో ‘సూపర్‌’ విక్టరీ

జైపూర్‌: ఆఖరి ఓవర్‌... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ను వరించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్‌ హెట్‌మైర్‌ను అవుట్‌ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్‌జెయింట్స్‌ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్‌పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌; 4 సిక్స్‌లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్‌ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. మార్క్‌రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్‌ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్‌ (11), పవర్‌ ప్లే తర్వాత కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్‌ మార్క్‌రమ్, ఆయుశ్‌ బదోని సూపర్‌జెయింట్స్‌ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్‌రమ్‌ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్‌ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్‌ ఆనందం నింపింది. సందీప్‌ వేసిన 20వ ఓవర్లో మిల్లర్‌ (7 నాటౌట్‌) సింగిల్‌ తీసివ్వగా తర్వాత సమద్‌ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్‌జెయింట్స్‌ స్కోరు 180కి చేరింది. జైస్వాల్‌ శ్రమించినా... యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక వైభవ్‌ ఆటను మార్క్‌రమ్‌ ముగించగా, నితీశ్‌ రాణా (8)ను శార్దుల్‌ పెవిలియన్‌ చేర్చాడు.తర్వాత జైస్వాల్‌కు జతయిన కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ రన్‌రేట్‌ తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్‌ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్‌లను అవుట్‌ చేసిన అవేశ్‌...ఆఖరి ఓవర్లో హెట్‌మైర్‌ (12)కు చెక్‌ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) హెట్‌మైర్‌ (బి) ఆర్చర్‌ 4; మార్క్‌రమ్‌ (సి) పరాగ్‌ (బి) హసరంగ 66; నికోలస్‌ పూరన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్‌ 11; రిషభ్‌ పంత్‌ (సి) జురేల్‌ (బి) హసరంగ 3; ఆయుశ్‌ బదోని (సి) దూబే (బి) తుషార్‌ 50; మిల్లర్‌ నాటౌట్‌ 7; సమద్‌ నాటౌట్‌ 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్‌ శర్మ 4–0–55–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) అవేశ్‌ 74; వైభవ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) మార్క్‌రమ్‌ 34; నితీశ్‌ రాణా (సి) అవేశ్‌ (బి) శార్దుల్‌ 8; రియాన్‌ పరాగ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్‌ 39; జురేల్‌ నాటౌట్‌ 6; హెట్‌మైర్‌ (సి) శార్దుల్‌ (బి) అవేశ్‌ 12; శుభమ్‌ నాటౌట్‌ 3 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్‌: శార్దుల్‌ 3–0–34–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–37–3, దిగ్వేశ్‌ రాఠి 4–0–30–0, మార్క్‌రమ్‌ 2–0–18–1, ప్రిన్స్‌ 4–0–39–0, రవి బిష్ణోయ్‌ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్‌ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. లీగ్‌ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌ తన తొలి బంతికే సిక్స్‌ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఆ షాట్‌ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్‌ కావడంతో వైభవ్‌ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్‌కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్‌–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్‌ను రాజస్తాన్‌ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rasi Phalalu: Daily Horoscope On 20-04-2025 In Telugu4
ఈ రాశి వారు వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.సప్తమి ప.2.09 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.7.35 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.3.45 నుండి 5.23 వరకు, దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.23 వరకు, అమృత ఘడియలు: రా.1.33 నుండి 3.11 వరకు, భాను సప్తమి.సూర్యోదయం : 5.45సూర్యాస్తమయం : 6.12రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.మిథునం: బాకీలు వసూలవుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగయోగం.సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కన్య: దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.తుల: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.వృశ్చికం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.మకరం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.

Telangana Hydraa Shock to AP TDP MLA Vasantha Krishna Prasad5
‘పచ్చ’పార్టీ కబ్జాకాండ

గచ్చిబౌలి/హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌): స్వరాష్ట్రమే కాదు..పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను చెరబడుతున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.3 వేల కోట్లు పలికే ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లతో దొడ్డిదారిన యాజమాన్య హక్కులు పొందారు.దీనిపై ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. ఫాంహౌస్, విల్లాలు నిర్మిస్తూ విలువైన భూమిలో పాగా వేశారు. షెడ్లు, కార్యాలయాలు నిర్మించారు. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులుండగా, ఇటీవలి మరికొన్ని ఫిర్యాదులు సైతం రావడంతో హైడ్రా కదిలింది. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్‌ శివారు శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 79లో ఎమ్మెల్యే, మరికొందరు కలిసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాల్లో కొన్నిటిని కూల్చివేసింది. 39 ఎకరాలు దర్జాగా కబ్జా హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 79కి సంబంధించిన రికార్డులలో 39.06 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే బై నంబర్‌తో రికార్డులు సృష్టించిన వసంత కృష్ణప్రసాద్, మరి కొంతమంది ఆ భూమిని ఆక్రమించారు. చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిపై ఎన్నో ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్‌ (సీఎస్‌ 14/58) పెండింగ్‌లో ఉంది. స్టేటస్‌కో పాటించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా ఏళ్ల క్రితమే నిర్మాణాలు ప్రారంభించి 19 ఎకరాలలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు.మిగతా 20 ఎకరాలలో షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. పలు కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. కాగా అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారనే విమర్శలు ఉన్నాయి. ఫైనల్‌ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ఈ పిటిషన్‌ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ నేపథ్యంలోనే భూముల కబ్జాపై గత మూడు నెలలుగా మరిన్ని ఫిర్యాదులు అందడంతో శనివారం పోలీస్‌ బందోబస్తుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలోని షెడ్లు, కార్యాలయాలతో కూడిన నిర్మాణాలను కూల్చివేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే శిక్షార్హులని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులపై మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ.. హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 79లోని 39 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ ప్రైవేట్‌ వ్యక్తులు ఆ స్థలానికి 79/1 బై నంబర్‌ వేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో విల్లాలకు అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 39.08 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో ఇప్పటికీ ప్రభుత్వభూమి (పోరంబోకు)గానే ఉండటం గమనార్హం. రాయదుర్గంలోనూ హైడ్రా కొరడా తాము రోజూ ఆడుకునే స్థలంలోకి రానివ్వడంలేదని, అక్కడ చెరువు కూడా మాయమైందని, రహదారుల నిర్మాణం చేపడుతున్నారని క్రికెట్‌ ఆడే కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. శనివారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్‌ 5/2లోని ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అందులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఓ చోట ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ భూమిపై ఆక్రమణ కేసులు ఉన్నట్లుగా అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ, ప్లాట్ల కొనుగోలుకు తమను సంప్రదించాలంటూ కొందరు (నార్నే ఎస్టేట్స్‌) ఫోన్‌ నంబర్లతో సహా ఏర్పాటు చేసిన బోర్డులు హైడ్రా అధికారులు గుర్తించారు.

Humanoid Robots Run Half Marathon in Beijing6
మనిషి.. మరమనిషి సై 

మనిషికి దీటుగా కృత్రిమ మేధ ఆన్‌లైన్‌లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్‌లైన్‌లో అంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్‌ రోబోలు మనిషికి సవాల్‌ విసురుతున్నాయి. అనుకున్నదే తడవుగా పరుగుపందెంలో పోటీకి దిగి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధ సాంకేతికతలో అధునాతన ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 21 హ్యూమనాయిడ్‌ రోబోలు 21 కిలోమీటర్ల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరిగెత్తి శెభాష్‌ అనిపించుకున్నాయి. మానవులతో సమానంగా పరుగుకు ప్రయత్నించడంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్‌ రోబో హాఫ్‌ మారథాన్‌గా ఈ కార్యక్రమం చరిత్రకెక్కింది. చైనాలోని బీజింగ్‌ నగరంలో శనివారం ఈ రోబోలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. మనిషి సృష్టించిన మరమనిషి.. మనిషితోనే పోటీకి సై అనడం చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. వాటితో కలిపి సెలీ్ఫలు, వీడియోలు తీసుకున్నారు. ట్రాక్‌పై పరుగెడుతున్న రోబోలను ఉత్సాహపరుస్తూ జనం విజిల్స్‌ వేస్తూ చప్పట్లు కొట్టారు. అమెరికా రోబోటిక్స్‌ కంపెనీలతో పోటీపడుతూ హ్యూమనాయిడ్‌ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్‌లో ఇజువాంగ్‌ హాఫ్‌ మారథాన్‌ను నిర్వహించడం గమనార్హం. ఫార్ములా 1 తరహాలో.. ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్‌ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అక్కడున్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్‌ను కొనసాగించడానికి సాయపడతారు. శనివారం రోబోట్ల హాఫ్‌ మారథాన్‌లోనూ ఇదే నియమం పాటించారు. వేగంగా పరుగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా, చార్జింగ్‌ అయిపోయినా నిట్టనిలువుగా అక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్‌పాయింట్లను సిద్ధంచేశారు. అక్కడ వెంటనే బ్యాటరీలను మార్చుకుని రోబోలు పరుగు కొనసాగించాయి. ఒకదానితో మరోటి ఢీకొనకుండా ఉండేందుకు మొదట్లోనే వీటిని సమాంతరంగా 1–2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీని ప్రారంభించారు. ఎన్నెన్నో సైజులు, ఆకారాలు బీజింగ్‌ ఎకనామిక్‌–టెక్నలాజికల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో జరిగిన ఈ రేసులో ఒకే డిజైన్‌తో కాకుండా భిన్న పరిమాణాల్లో వేర్వేరు ఆకారాల్లో ఉన్న హ్యూమనాయిడ్‌ రోబోలు పాల్గొన్నాయి. మారథాన్‌ పూర్తయ్యాక ఆయా రోబోట్ల తయారీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పలు విభాగాల కింద అవార్డులు అందజేశారు. ‘అత్యంత పోటీతత్వం’, ‘గొప్ప డిజైన్‌’, ‘అత్యంత వినూత్న తరహా రోబో’ఇలా పలు అవార్డ్‌లు ప్రదానం చేశారు. 2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్‌ లైన్‌కు.. ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్‌ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. తమ అధునాతన రోబోలను రంగంలోకి దింపాయి. ప్రతి రోబోకి ఒక రిమోట్‌ ఆపరేటర్, ఒక సహాయకుడు వెంటే పరుగెత్తారు. బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న రోబోట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ వారి ‘తియాన్‌గాంగ్‌ అల్ట్రా’రోబో వేగంగా దూసుకొచ్చి విజేతగా నిలిచింది. 21 కిలోమీటర్ల పరుగుపందాన్ని కేవలం 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేసి ఔరా అనిపించింది. ‘‘మనిషిలాగా ఈ రోబోకు పొడవైన కాళ్లను అమర్చాం. మనిషిలా ఒక పద్ధతిగా పరుగెత్తేలా ప్రత్యేక అల్గారిథమ్‌ను ఇందులో సెట్‌చేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది’’అని దీని తయారీసంస్థ రోబోటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ చీఫ్‌ టెక్నాలజీ అధికారి టాంగ్‌ జియాన్‌ చెప్పారు. హాఫ్‌ మారథాన్‌లో పురుషుల విభాగంలో 12,000 మంది పాల్గొనగా ఇథియోపియాకు చెందిన ఎలియాస్‌ దెస్తా అందరికంటే వేగంగా ఒక గంట రెండు నిమిషాల్లో మారథాన్‌ను పూర్తిచేసి విజేతగా నిలిచాడు. ఫిబ్రవరినెలలో హాఫ్‌ మారథాన్‌లో ప్రపంచ పరుగువీరుడు, ఉగాండా అథ్లెట్‌ జాకబ్‌ కిప్లిమో ఇదే 21 కి.మీ.ల హాఫ్‌ మారథాన్‌ను కేవలం 56 నిమిషాల్లో పూర్తిచేయడం తెల్సిందే. ఇక్కడ పరుగు ముఖ్యం కాదు..! ‘‘ఇక్కడ కేవలం సరళరేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకుమించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరుగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగల్గడం, ట్రాక్‌పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్‌పై జారిపోయే స్వభావం ఉన్న చోట జాగ్రత్తగా పరుగెత్తడం, ఎత్తుపల్లాలున్న చోట్ల వేగాన్ని అందుకు తగ్గట్లు మార్చుకోవడం వంటివన్నీ కీలకం. ఎంత వేగంతో వెళ్తే ఎంత బ్యాటరీ అయిపోతుంది?. గజిబిజి పరుగులో రోబో భాగాలు వదులుకాకుండా చూసుకోవడం వంటివన్నీ ముఖ్యమే’’అని బీజింగ్‌ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ సీఈఓ జియాంగ్‌ యూజువాన్‌ చెప్పారు. చైనాలో హ్యూమనాయిడ్‌ రోబోల మార్కెట్‌ మరో ఐదేళ్లలో ఏకంగా 119 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. ‘‘రోబోల మారథాన్‌ ఇక్కడితో ముగిసినా హ్యూమన్‌ టెక్నలాజికల్‌ అభివృద్ధి శకం ఇక్కడితోనే మొదలుకానుందనే చెప్పాలి. నేటి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ముందుకొస్తాయి. భవిష్యత్‌ హ్యూమనాయిడ్‌ శకానికి ఇది నాంది’’అని ఇజువాంగ్‌ స్థానిక యంత్రాంగం కమిటీ డిప్యూటీ డైరెక్టర్‌ లియాంగ్‌ లెయాంగ్‌ వ్యాఖ్యానించారు. – బీజింగ్‌

DSC schedule released in Andhra Pradesh7
ఎట్టకేటకు డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్‌ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్‌ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్‌ వెలువరించింది. ఇందులో ఎస్‌జీటీ 6,599, స్కూల్‌ అసిస్టెంట్‌ 7,487, పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్‌ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌కు సంబంధించి మరో 2,259 స్టేట్‌/జోనల్‌ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్‌ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్‌సైట్‌లను చూడవచ్చు. షెడ్యూల్‌ ఇదీదరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూమాక్‌ టెస్ట్‌: మే 20 నుంచిహాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: మే 30 నుంచిపరీక్షలు: జూన్‌ 6 నుంచి జూలై 6 వరకుప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజునఅభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారుమెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు

Industrialist complaint to central government about Red Book ruling in ap8
కప్పం కట్టలేం

సాక్షి, అమరావతి: యునైటెడ్‌ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ అధినేత నవీన్‌ జిందాల్‌ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్‌ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్‌పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు. ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.కేంద్రానికే మొరశ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అను­చరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. » మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. » చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్నా­రు.కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకికొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్‌ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ యూనిట్‌ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్‌ డప్పు కొంటుకుంటున్నారు. » గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్‌కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు. » వైఎస్‌ జగన్‌ దావోస్‌ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్‌ కాల్‌తో అనకాపల్లిలో స్టీల్‌ ప్లాంట్‌ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.మరికొన్ని చిలక్కొట్టుళ్లు» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు » తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్‌ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం » నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్‌ షాపుల వరకు కమీషన్లు » కప్పం కడితేనే గనులకు లీజ్‌ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం » నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్‌ తయారు చేసే వాటర్‌బేస్‌ కంపెనీలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి » కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్‌ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్‌ ట్యాక్స్‌ చెల్లింపుసిమెంట్‌ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితితాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్‌ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్‌ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్‌ సిమెంట్, భవ్య సిమెంట్‌ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్‌ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. » రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచా­యి­తీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. » నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్‌ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్‌ సిమెంట్స్‌ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది. » సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యా­దు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్‌ అయ్యారంటే ప­రి­స్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్‌ టెక్‌ రెడీమిక్స్‌ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.

West Bengal Governor CV Ananda Bose on condemned the violence in Murshidabad9
అన్ని విధాలుగా  అండగా నిలుస్తాం

కోల్‌కతా: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్ల బాధితులను గవర్నర్‌ ఆనందబోస్‌ పరామర్శించారు. సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లర్ల సమయంలో దుండగులు షంషేర్‌గంజ్‌ ప్రాంతం జఫ్రాబాద్‌లో ఓ ఇంట్లో ఉన్న తండ్రి హర గోవింద్‌ దాస్, అతని కుమారుడు చందన్‌ దాస్‌లను కత్తితో పొడిచి చంపారు. వీరి కుటుంబీకులు శనివారం తమ ఇంటికి వచ్చిన గవర్నర్‌ కాళ్లపై పడి, న్యాయం చేయాలని వేడుకున్నారు. ‘వీరి అభ్యర్థనలను పరిశీలిస్తాం. బాధితుల నుంచి మూడు, నాలుగు సూచనలందాయి. స్థానికంగా బీఎస్‌ఎఫ్‌ పోస్టులను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ఈ అంశాన్ని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల చర్యలను కచ్చితంగా తీసుకుంటాం. రాజ్‌భవన్‌లో అందుబాటులోకి తెచ్చిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వారికి అందజేశా’అని గవర్నర్‌ మీడియాకు తెలిపారు. అనంతరం ధులియన్‌ బజార్‌ ప్రాంతంలో బాధితులను కలుసుకున్నారు. బాధితులు కోరిన ప్రకారం న్యాయం దక్కేలా చూస్తామన్నారు. జఫ్రాబాద్‌లోని బెట్బోనా గ్రామం వద్ద స్థానికులు రోడ్డుపై అడ్డంకులు ఏర్పాటు చేయగా గవర్నర్‌ ఆగి, వారిని శాంతపరిచారు. అంతకుముందు, ఫరక్కాలోని అతిథి గృహం వద్ద కూడా గవర్నర్‌ అల్లర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు చనిపోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించిన ఘటనలపై పోలీసులు 274 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గవర్నర్‌ ఆనందబోస్‌ మాల్డా జిల్లాలో తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న అల్లర్ల బాధిత ముర్షిదాబాద్‌ వాసులను పరామర్శించడం తెల్సిందే. బాధితుల గోడు విన్న మహిళా కమిషన్‌ జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ విజయా రాహత్కర్‌ శనివారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో ధులియన్‌ తదితర వక్ఫ్‌ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెట్బోనా గ్రామంలో దుండగులు తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బీఎస్‌ఎఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి, దాడులపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలి అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. హింసాత్మక ఘటనల తీవ్రత అనూహ్య స్థాయిలో ఉందని తెలిసిందని అనంతరం రాహత్కర్‌ మీడియాకు తెలిపారు. బాధితుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చామన్నారు. ఇక్కడి బాధిత మహిళల డిమాండ్లపై హోం మంత్రి అమిత్‌ షాకు నివేదిక అందజేస్తామని ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్‌ తెలిపారు. శుక్రవారం మాల్డాలో అల్లర్ల బాధితులను రాహత్కర్‌ సారథ్యంలోని బృందం కలుసుకోవడం తెల్సిందే. రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్‌పీ వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో చోటుచేసుకున్న అల్లర్లను నిరసిస్తూ శనివారం విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను నిర్వహించింది. బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేసింది. బెంగాల్‌లో హిందువులకు రక్షణ కలి్పంచాలని, ముర్షిదాబాద్‌ అల్లర్ల బాధితులకు తగు పరిహారం అందజేయాలని కోరింది. బెంగాల్‌లో బంగ్లాదేశీ–రొహింగ్యా చొరబాటుదార్లను గుర్తించి, వెళ్లగొట్టాలంది. సోమవారం కూడా నిరసనలు తెలుపుతామని తెలిపింది.

Upcoming Visual Experience Movies Updates in Tollywood10
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!

వెండితెరపై ఆడియన్స్‌కు అద్భుతమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్, సినిమాటిక్‌ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్‌ చేసి, ఆడియన్స్‌ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.విశ్వంభర వరల్డ్‌ఫాంటసీ జానర్‌లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్‌ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్‌లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్‌లో సాగుతుంది. ఈ సీక్వెన్స్‌లో వచ్చే సన్నివేశాలు సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడియన్స్‌కు మంచి విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్‌ విజన్‌ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌లో సరికొత్త విజువల్స్‌ కనిపిస్తున్నాయి.పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్‌ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఒక స్పెషల్‌ సాంగ్‌ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.నాలుగో ప్రపంచం కూడా ఉందా? కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్‌పై ఆడియన్స్‌కు చూపించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌తో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్‌ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్‌ అవుతుందనే టాక్‌ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్నారు.అలాగే ప్రభాస్‌ హీరోగా ‘హను–మాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్‌ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్‌ మరో మూవీ ‘సలార్‌’ కోసం ఖాన్సార్‌ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ ఖాన్సార్‌ గురించి మరింతగా ‘సలార్‌’ రెండో భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.సైన్స్‌ లోకం ఆడియన్స్‌ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్‌ల పేర్లను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్‌ అయ్యేలా సినిమా షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ ఫిల్మ్‌ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్‌తో త్రివిక్రమ్‌ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్‌పై కొత్త ప్రపంచాన్ని టీమ్‌ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ ఈ సినిమా నిర్మించనున్నారు.అంజనాద్రిలో జై హనుమాన్‌బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘హను–మాన్‌’లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ మూవీ రానుంది. ప్రశాంత్‌ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘జై హను మాన్‌’ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్‌’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్‌ శెట్టి. కాగా... ‘జై హనుమాన్‌’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్‌’ సినిమా క్లిప్‌ హ్యాంగర్‌ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్‌’ సినిమా మరింత పెద్ద స్పాన్‌తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్‌గా ‘అంజనాద్రి’ స్పాన్స్‌ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్‌’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.2027లో మూవీ రిలీజ్‌ కావొచ్చు. ఇంకా హను–మాన్‌లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.మిస్టిక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్‌లో జరిగే సంఘటనలు ఆడియన్స్‌ను అలరించాయి. సాయిదుర్గా తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్‌ దండు మరో మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్‌ దండు.ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కావొచ్చు.వెయ్యేళ్ల క్రితంఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్‌. జియో సైంటిస్ట్‌గా ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్‌ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. అర్చనా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీశారు మేకర్స్‌. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్‌ డేట్‌లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్‌ ఇటీవల తెలిపారు.ప్యారడైజ్‌‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్‌’. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్‌ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్‌కు సరికొత్త విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్‌ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్‌ 3’ సినిమా ప్రమోషన్స్‌తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్‌’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్‌’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కిష్కింధపురి!ఆడియన్స్‌ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్‌ అండ్‌ మిస్టీరియస్‌ వరల్డ్‌ను క్రియేట్‌ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. కౌశిక్‌ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్‌ అండ్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట మేకర్స్‌. హారర్‌ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.ఇలా ఈ తరహాలో ఆడియన్స్‌ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement