
ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,139 పోస్టులు
● జోనల్ స్థాయిలో మరో 400 పోస్టులు ● డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ● జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు
విశాఖ విద్య: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఆదివారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో ఐదు ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/ సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో 400 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రోస్టర్ పాయింట్లు ప్రకటించిన
జిల్లా విద్యాశాఖ
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విద్యాలయాల్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది విద్యాశాఖాధికారులు ఇప్పటికే లెక్క తీశారు. మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్ మేనేజ్మెంట్ల వారీగా రోస్టర్ పాయింట్లు సైతం ప్రకటించారు. ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీ/మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలో భర్తీ చేయనున్న 734 పోస్టుల్లో 290 ఓపెన్ కేటగిరీ కోసం కేటాయించారు. ఈ పోస్టులకు ఎవరైనా పోటీ పడవచ్చు. బీసీ ఏ–42, బీసీ బీ–65, బీసీ సీ–6, బీసీ డీ–44, బీసీ ఈ –26, ఎస్సీ గ్రూప్ 1–26, ఎస్సీ గ్రూప్ 2–7, ఎస్సీ గ్రూప్ 3–36, ఎస్టీ–37, ఈడబ్ల్యూఎస్–65 పోస్టులు కేటాయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు ఏఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు కేటాయించామనేది స్పష్టత ఇస్తూ.. జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు.
షెడ్యూల్ ఇలా.. : 2024 జూలై 1 కటాఫ్గా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీల వారికి మరో ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. తగిన విద్యార్హతలు ఉన్న వారు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వారంతా కొత్తగా దరఖాస్తు ఫారాన్ని నింపి వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. అయితే అర్హతల మేరకు మరేదైనా సబ్జెక్టు కోసం పరీక్ష రాయాలనుకుంటే.. తగిన ఫీజు చెల్లించి, మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ట్రైబల్ వెల్ఫేర్లో..
ఎస్ఏ తెలుగు 7
హిందీ 11
గణితం 7
ఫిజికల్ సైన్సు 35
సోషల్ 5
ఎస్జీటీ 335
మొత్తం 400
జువనైల్ విభాగంలో
ఎస్జీటీ 4
పీఈటీ 1
జోనల్ పరిధిలో పోస్టులు ఇలా..
ఉత్తరాంధ్రలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టులు భర్తీ చేయనున్నారు.
పీజీటీ 73
టీజీటీ 299
పీడీ 6
పీఈటీ 22
సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
ఎస్ఏ లాంగ్వేజీ–1 26
హిందీ 28
ఇంగ్లిష్ 55
గణితం 59
ఫిజికల్ సైన్స్ 39
బయాలజీ 58
సోషల్ 91
పీఈటీ 139
ఎస్జీటీ 239
మొత్తం 734