
ఇస్లామాబాద్: కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని తోషాఖానాలో ఉంచాలో లేదో తన ఇష్టమేనని అన్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం దేశ ప్రముఖులు తమకందని కానుకలను తోషాఖానాలో ఉంచాలి. లేదంటే సగం ధరకు కొనుక్కోవాలి. తాను అలాగే కొనుక్కున్నానని ఇమ్రాన్ అన్నారు. చట్ట ప్రకారం అది తన హక్కన్నారు. ఇమ్రాన్ 58 కానుకలను రూ.14 కోట్లకు అమ్ముకున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే.
పీఓకే ప్రధానిగా సర్దార్ తన్వీర్ ఇల్యాస్
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ ఇల్యాస్ సోమవారం ఎన్నికయ్యారు.