Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sakshi Editorial On Pahalgam Terror Attack2
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope In Telugu From 27-04-2025 To 03-05-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.వృషభం...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.మిథునం....ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. . దేవీఖడ్గమాల పఠించండి.కర్కాటకం...పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.సింహం..కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్య....వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.తుల.....ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. . సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దత్తాత్రేయుని ఆరాధించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. . దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.మీనం...ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి.

450 Indians Leave From Pakistan4
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?

లాహోర్‌: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్‌ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు. శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్‌ఎల్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్‌ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్‌కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్‌ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్‌ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్‌..!భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్‌ సింగ్‌ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్‌ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్‌ సింగ్‌ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్‌ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్‌ సింగ్‌ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్‌ పోస్ట్‌ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్‌ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్‌పుట్‌ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

International law allows India to suspend Indus Waters Treaty with Pakistan5
Indus Waters Treaty: సస్పెన్షన్‌ సాధ్యమే 

పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్‌ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్‌ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్‌ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్‌ సస్పెండ్‌ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్‌ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్‌ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్‌ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్‌ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్‌ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్‌ అడ్వకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్‌ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్‌ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్‌ చేసేదేమీ ఉండబోదని కౌల్‌ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్‌ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్‌ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్‌ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్‌ వల్ల సింధూ బేసిన్‌ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్‌ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్‌ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్‌ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్‌ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్‌ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్‌ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్‌ తదితరాల కోసం పాక్‌ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Massive Arrangements for Today BRS Silver Jubilee Celebrations at Warangal6
రజతోత్సవ రణన్నినాదం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా. సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా.. 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్‌ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్‌.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. విద్యుత్‌ వెలుగుల్లో సభా ప్రాంగణం అట్టహాసంగా ఏర్పాట్లు రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికపై 500 మంది.. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.సభ ఏర్పాట్లు ఇలా⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు ⇒ బీఆర్‌ఎస్‌ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు ⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు ⇒ ప్రధాన వేదికపై సీటింగ్‌: 500 మందికి ⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు. ⇒ వాహనాల పార్కింగ్‌ : 1,059 ఎకరాలు ⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్‌ బాటిళ్లు: 10.80 లక్షలు ⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు ⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు ⇒ మెడికల్‌ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ⇒ ట్రాఫిక్, పార్కింగ్‌ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు

Kollywood Star Hero Suriya Next Film with Tollywood Crazy Director7
టాలీవుడ్‌ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రెట్రో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో హీరో సూర్య ఫ్యాన్స్‌కు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వచ్చే మూవీని టాలీవుడ్‌ డైరెక్టర్‌తోనే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్యనే స్వయంగా ప్రకటించారు. దీంతో సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సూర్య గజిని సినిమా వచ్చినప్పుడు నా ఇంజినీరింగ్‌ పూర్తయిందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఆ సినిమాను థియేటర్లో చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించిందన్నారు. సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్ చూసినప్పుడు.. లవ్‌, ఫెయిల్యూర్, క్రమశిక్షణ నేర్పిన సినిమా సార్ అది అని వెంకీ అన్నారు. #Suriya46 💥💥@Suriya_offl - #VenkyAtluri - @Vamsi84 - @SitharaEnts ❤️‍🔥❤️‍🔥 🎥 pic.twitter.com/CD7XEkRz6h— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2025

Sleep Divorce Rise In India Why The Details Here8
సుఖనిద్రకు ‘స్లీప్‌ డైవోర్స్‌’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ‘‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.నయా ట్రెండ్‌... స్లీప్‌ డైవోర్స్‌‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు. నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్‌ డైవోర్స్‌’ అంటున్నారు!కాపురాలను నిలబెడుతుందిభారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్‌ డైవోర్స్‌’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్‌’ గ్లోబల్‌ స్లీప్‌ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి. నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్‌ డైవోర్స్‌’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్‌ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్‌లు. అంటే.. విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా. కళకళలాడుతూ నిద్ర లేస్తారునిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకే విడిపోవటంఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్‌ డైవోర్స్‌ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!స్లీప్‌ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్‌ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు. ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్‌ డైవోర్స్‌’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒ­క­రు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొ­నసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు.

Punjab Kings vs Kolkata Knight Riders match called off due to rain9
‘ఈడెన్‌’ను ముంచెత్తిన వాన

కోల్‌కతా: ఈ మ్యాచ్‌ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్‌ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్‌ బ్యాటింగ్‌ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్‌ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్‌ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ మ్యాచ్‌ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్‌తో మొదలైన పంజాబ్‌ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్‌ 50 స్కోరును దాటింది. హర్షిత్‌ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్‌ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్‌ కొడితే... ప్రభ్‌సిమ్రన్‌ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్‌ ఓపెనింగ్‌ జోడీకి చెక్‌ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్‌ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ అవుట్‌ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్‌ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్‌ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) వైభవ్‌ (బి) రసెల్‌ 69; ప్రభ్‌సిమ్రన్‌ (సి) పావెల్‌ (బి) వైభవ్‌ 83; శ్రేయస్‌ నాటౌట్‌ 25; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7; యాన్సెన్‌ (సి) వెంకటేశ్‌ (బి) వైభవ్‌ 3; ఇన్‌గ్లిస్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–34–2, చేతన్‌ సకారియా 3–0–39–0, హర్షిత్‌ రాణా 2–0–27–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–39–1, సునీల్‌ నరైన్‌ 4–0–35–0, రసెల్‌ 3–0–27–1. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ నాటౌట్‌ 1; నరైన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్‌ కోల్పోకుండా) 7. బౌలింగ్‌: యాన్సెన్‌ 1–0–6–0. మాల్దీవుల్లో సన్‌రైజర్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్‌ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్‌ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్‌... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్‌’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్‌లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

International Dance Day 202510
నాట్యవేదం జీవననాదం

సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్‌పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్‌ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్‌ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్‌ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్‌ జున్‌ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్‌ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్‌లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్‌ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్‌ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్‌ పట్నాయక్‌ వంటి కవి పండితులు, కేలూచరణ్‌ మహాపాత్రో, పంకజ్‌చరణ్‌ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్‌ మాన్‌సింగ్‌ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్‌ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్‌కోర్, పాలక్కాడ్‌ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్‌ శివరామన్‌ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్‌’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్‌ థాంగ్‌ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్‌ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1891లో మణిపూర్‌ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్‌ టాగోర్‌ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్‌కుమార్‌ సింఘజిత్‌ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్‌ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్‌కోర్‌ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్‌ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్‌ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్‌. కథక్‌ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్‌ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్‌ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్‌ నృత్యానికి మొఘల్‌ కాలంలో రాజాదరణ లభించింది. కథక్‌ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్‌ శైలిని కలుపుకొని కథక్‌ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్‌ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్‌ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్‌లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్‌ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్‌ డిగ్రీ కోర్సుకు సిలబస్‌ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్‌ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్‌ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్‌ నృత్యం దేశ విదేశాలకు పాకింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement