
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్షీట్లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్ పేర్లను చార్జ్షీట్లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్పై ఈనెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.
కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు వ్యవహరిస్తోంది.
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది.
సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది.
ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపు
నేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనకు సిద్ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.