Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Amid US-China tariff row Donald Trump dials Xi Jinping1
డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రాప్‌లో జిన్‌పింగ్‌!

వాషింగ్టన్‌: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్‌ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఫోన్‌..అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. జిన్‌పింగ్‌తో ట్రంప్‌ ఫోన్‌లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్‌ తన సోషల్‌ మీడియా సైట్‌ ‘ట్రూత్‌’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు. సంకాల ‘వార్‌’సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్‌. అయితే చైనా కూడా ట్రంప్‌ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. అమెరికాకు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్‌ చేశారు. అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్‌ వార్‌ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్‌ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది.

Sakshi Editorial On RCB Stampede at Bengaluru Chinnaswamy Stadium2
ప్రాణాంతక నిర్లక్ష‍్యం

హద్దులెరుగని అభిమానం, నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం, తన బాధ్యతేమిటో పూర్తిగా మరి చిన ప్రభుత్వం... వెరసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సాయంత్రం 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, అందులో అయిదుగురి స్థితి ఆందోళనకరంగా ఉన్నదంటున్నారు. దుర్మరణం పాలైన వారిలో ఎక్కువమంది టీనేజ్‌ వయస్కులు. ఎంతో భవిష్యత్తుగల యువత ప్రాణాలు ఇలా హఠాత్తుగా కడతేరిపోవటం వారి తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ మాత్రమే కాదు... సమాజం మొత్తానికి తీవ్ర దుఃఖం కలిగించే అంశం. ఒక కథనం ప్రకారం ఈ కార్యక్రమానికి రాయల్‌ చాలెంజెర్స్‌బెంగళూరు(ఆర్‌సీబీ), కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ), డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల్లో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోలేదు! ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇప్పుడు సిటీ పోలీసు కమిషనర్‌నూ, డెప్యూటీ కమిషనర్‌నూ సస్పెండ్‌ చేశామంటున్నారు. మంచిదే. ఇతరుల మాటేమిటి? సెలబ్రిటీలు వచ్చినప్పుడూ, రాజకీయ సభలప్పుడూ, మతసంబంధ ఉత్సవాల సంద ర్భాల్లో భారీయెత్తున జనం గుమిగూడటం... తొక్కిసలాటలు, మరణాలు రివాజుగా మారాయి. కానీ ప్రభుత్వాలు, పోలీసులు నేర్చుకున్నదేమీ ఉండటం లేదని ఇవి పునరావృతం అవుతున్న తీరు చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి మొదట్లోనే తిరుపతిలో టీటీడీ నిర్వాకం కారణంగా తొక్కి సలాటకు ఆరుగురు బలయ్యారు. ఆ నెలాఖరులో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా వద్ద ఇలాంటి దుర్ఘటనలోనే 30 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట వల్ల 18 మంది కన్నుమూశారు. ఎన్ని ప్రాణాలు పోతే ప్రభుత్వాలు మేల్కొంటాయి? సామాజిక మాధ్యమాల ప్రభావమేమిటో అందరికీ తెలుసు. వాటిల్లో ఆ కార్యక్రమం గురించి ఆర్‌బీసీయే విస్తృత ప్రచారం చేసింది. తామున్నచోటికి అభిమాన ఆటగాళ్లు రాబోతున్నారని యువత ఉవ్విళ్లూరటం అసాధారణమేమీ కాదు. మన దేశంలో క్రికెట్‌కు మరే క్రీడకూ లేనంత ఆకర్షణ ఉంది. విరాట్‌ కోహ్లీ వస్తున్నాడంటే అది మరిన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఇవి చాలవా పకడ్బందీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటానికి? నిజానికి బెంగళూరు, దాని శివారు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే అభిమానుల కోలాహలం మొదలైందని, బుధవారం ఉదయం నుంచి అది క్రమేపీ పెరుగుతూ పోయిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదంతా గమనించాక సాయంత్రం కార్యక్రమానికి అభిమానులు పోటెత్తుతారన్న అంచనా వుండొద్దా? బుధవారం వీధులన్నీ కిక్కిరిసిన వైనం గమనించి క్రికెటర్ల ర్యాలీని రద్దుచేసి కూడా 35,000 మందికి మాత్రమే సరిపడే స్టేడియంలో వేడుకలు సజావుగా ముగుస్తాయని ఎలా అనుకోగలిగారు? అందులోనూ ఈ కార్యక్రమానికి టిక్కెట్‌ విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ లేవు. మొత్తానికి స్టేడియంకు వెళ్తే తమ అభి మాన క్రికెటర్లనూ, వారు గెల్చుకున్న కప్పునూ స్వయంగా చూడొచ్చన్న సందేశం ప్రచారమైంది. పర్యవసానంగా నియంత్రణకు అందని రీతిలో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.కార్యక్రమం కోసం 5,000 మంది పోలీసులను మోహరించామని, అయినా ఈ విషాదం చోటు చేసుకున్నదని కంటతడి పెడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెప్పారు. పోలీసులు తమ శాయశాక్తులా విధులు నిర్వర్తించారని, దాదాపు మూడు లక్షలమంది రావటంతో విఫల మయ్యామని ఆయన వివరించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది పోలీసుల్ని రంగంలోకి దించామని ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర హైకోర్టులో చెప్పారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయాన్ని సూచిస్తోంది. అసలు ఆ వేయి మందైనా ఉన్నారా అనే సంశయాన్ని కలగజేస్తోంది. ప్రత్యక్ష సాక్షులైతే పోలీసుల సంఖ్య మొదటి నుంచీ తక్కువేనంటున్నారు. ఇంతమంది గుమిగూడే సందర్భాల్లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సలహా తీసుకోవాలి. కానీ అదీ జరిగినట్టు లేదు. అసలు ఎవరు ఏ గేటువైపు వెళ్లాలో, ఎవరెక్కడ కూర్చోవాలో సూచించే బోర్డులు లేవు. మహిళలు, పిల్లల కోసమైనా విడిగా ప్రవేశద్వారం ఉండాలని నిర్వాహకులకు తోచలేదు. అభిమానుల్ని క్యూలో నియంత్రించేవారూ లేరు, పకడ్బందీ బ్యారికేడ్లూ లేవు. ఉన్న కొన్ని బ్యారికేడ్లూ తొక్కిసలాటలో ధ్వంసమయ్యాయి. ఇన్ని లోపాలు పెట్టుకుని ఊహించని స్థాయిలో జనం వచ్చిపడటంవల్లే ఇదంతా జరిగిందని చెబితే సరిపోతుందా? అసలు ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన 24 గంటలలోపే క్రికెటర్లకు నగరంలో సన్మానం చేయాలన్న తొందరెందుకు? అందుకోసం ఒకటి రెండు రోజుల వ్యవధి తీసుకుంటే జరిగే నష్టమేమిటి? జనం వేలంవెర్రిగా అభిమానించే క్రికెటర్లు వస్తున్నప్పుడూ, వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడూ తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వుంటుందన్న అంచనా లేకపోవటం సహించరానిది. అప్పుడెప్పుడో ఆఫ్రికా దేశాల్లోనూ, వర్తమానంలో పాలస్తీనాలోనూ రోజుల తరబడి పస్తులుండి అనుకోకుండా ఆహార పదార్థాలతో వచ్చిన వ్యాన్‌ కోసం జనం ఎగబడి తొక్కిసలాటలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి. ప్రాణాలు నిలుపుకోవా లన్న వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వెర్రి అభిమానం కోసమో, విశ్వాసాల కోసమో ఎగబడటం, ప్రాణాలు కోల్పోవటం, ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్టు ప్రవర్తించటం, మళ్లీ మరో విషాదం చోటుచేసుకునేవరకూ అంతా సవ్యంగా వున్నట్టు నటించటం ఎంతకాలం? కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. ఇలాంటివి జరగనీయరాదని సంకల్పించాలి.

Key decisions taken in cabinet meeting chaired by CM Revanth Reddy3
ఉద్యోగులకు 2 డీఏలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు (కరువు భత్యం) చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనుంది. ఇక మరో డీఏను 6 నెలల తర్వాత చెల్లించనుంది. వచ్చే ఏప్రిల్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు 5 పెండింగ్‌ డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి రెండు డీఏలపైనే కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలపై విస్తృతంగా చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్‌కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించి మిగిలిన వాటిని పరిశీలనకు స్వీకరించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లించనుంది. ఉద్యోగుల హెల్త్‌ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి నుంచి నెలకు రూ. 500 వసూలు చేయడంతోపాటు సమాన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ట్రస్ట్‌కు చెల్లించనుంది. ట్రస్ట్‌ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా ఇతర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ట్రస్ట్‌ ద్వారా వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏటా సెప్టెంబర్‌లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్‌ స్టేట్‌ కౌన్సిల్, అసోసియేషన్లను గుర్తించేందుకు ఒప్పుకుంది. ౖజీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రస్తుతం పూర్తిగా సెక్రటరియేట్‌ సర్వీసెస్‌ ఉద్యోగులే పనిచేస్తుండగా ఇకపై 12.5 శాతం నాన్‌ సెక్రటరియేట్‌ సరీ్వసెస్‌ కోటాను అమలు చేయాలనే మరో డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదనే మరో డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ కార్యదర్శి పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు తిరిగి పంపించేందుకు అంగీకరించింది. జిల్లా పరిషత్‌లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల పూర్తితోపాటు నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు డిమాండ్లకు సైతం సమ్మతి తెలిపింది. అంగన్‌వాడీల పదవీవిరమణ ప్రయోజనాలను రూ. 2 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుతోపాటు వాహనాల అద్దెల పెంపునకు ఆమోదం తెలిపింది. మరికొన్ని నిర్ణయాలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించింది. – స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 385 మంది మరణించగా రూ. 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. – హైబ్రీడ్‌ యాన్యూటీ మోడ్‌ (హామ్‌) కింద రాష్ట్రంలోని అన్ని (పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ) రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 7,947 కి.మీ. పంచాయతీరాజ్, 5,190 కి.మీ. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు కలిపి మొత్తం 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ. 16,780 కోట్లు, ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు రూ. 16,414 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. వచ్చే రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనుండగా 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకే ప్రభుత్వం అప్పగించనుంది. పార్లమెంట్‌ స్థానాన్ని ఒక యూనిట్‌గా లేదా ఉమ్మడి జిల్లాలవారీగా ఒక్కో జిల్లాను ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం. – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 19,579 కోట్లతో అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్‌–1లో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కి.మీ., కారిడార్‌–2లో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కి.మీ., కారిడార్‌–3లో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 22 కి.మీ. కలిపి మొత్తం 86.1 కి.మీ. కారిడార్‌ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి పొంగులేటి కోరారు. – రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహాన్ని కొనసాగించాలని.. ప్రజలకు మేలు చేసే కార్యాక్రమాలకు గ్రీన్‌ చానల్‌లో చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. – ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది.

Sakshi Guest Column On Operation Sindoor4
దాచటం దేశభక్తిని చాటడమా?

దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సి.డి.ఎస్‌.) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్‌’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్‌ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్‌గామ్‌ దురంతం, ఆపరేషన్‌ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్‌’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్‌ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్‌ సరఫరా చేసిన రఫేల్‌ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్‌ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్‌ విమానాలు కూలి పోవటం! రఫేల్‌ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్‌ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్‌ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్‌ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్‌ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్‌ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్‌ దస్సాల్ట్‌ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్‌దూ కంపెనీ స్టాక్స్‌ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్‌ స్టాక్స్‌ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్‌ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్‌ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్‌ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్‌ చౌహాన్‌ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

BRS MLA Maganti Gopinath Hospitalised after sickness5
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు.. హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.నిలకడగానే ఆరోగ్యం: దాసోజు శ్రవణ్‌ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై గోపీనాథ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. 48 గంటలు గడిస్తే గానీ గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శ్రవణ్‌.

Silver price hits record of Rs 1. 04 lakh per kg in indian markets6
వెండి వెలుగులు

న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్‌ టైమ్‌ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది. పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్‌ టైమ్‌ గరిష్టాన్ని తాకినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది. పసిడి పరుగు.. డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్‌లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ వీపీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.దీపావళి నాటికి దీపావళి నాటికి వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా చెప్పారు.

Bengaluru Stampede Incident: Case Filed Against RCB And KSCA7
ఆర్సీబీ, కేఎస్‌సీఏలకు షాక్‌

బెంగళూరు: ఐపీఎల్‌ టైటిల్‌ను ఎట్టకేలకు గెలిచామన్న ఆనందం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆర్సీబీ టైటిల్‌ సాధించిన తర్వాత నిన్న(బుధవారం, జూన్‌ 4వ తేదీ) బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దాంతో ఇది పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడమే కాకుండా హైకోర్టు వరకూ వెళ్లింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేన్‌లపై కేసు బుక్‌ చేశారు కర్ణాటక పోలీసులు. ఈ తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఆర్సీబీ, కేఎస్‌సీఏలపై కేసు నమోదు చేశారు. అనంతరం దీన్ని క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ)కి అప్పగించారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మేజిస్ట్రేట్‌ జి. జగదీషా కేఎస్‌సీఏ, ఆర్సీబీలకు నోటీసులు పంపనున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహం

Maoist Key Leader Sudhakar Died In Encounter8
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాల్పుల్లో అగ్రనేత మృతి

చత్తీస్‌గడ్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్‌ సుధాకర్‌ మృతిచెందారు. ఈరోజు(గురువారం) ఉదయం నుంచి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో గ పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సుధాకర్‌ మృత్యువాత పడ్డారు. ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు సుధాకర్‌. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్‌ పాల్గొన్నారు.కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావో​యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. ఇదిలా ఉంచితే, మావోయిస్టులపై కేంద్ర చేపడుతున్న చర్యలకు నిరసనగా జూన్‌ 10వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌​కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది.

Is Trump Stance A Benefit Or A Loss For America9
అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్‌!

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగెయిన్‌’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్‌ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్‌1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్‌కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్‌కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్‌ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్‌, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్‌ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్‌లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.వెనకడుగు వేస్తున్న కంపెనీలు..అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్‌ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్‌ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.బ్రిటన్‌ బొమ్మల కంపెనీ క్యారెక్టర్‌ గ్రూప్‌, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.భారత్‌లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలను ఐఫోన్‌ సీఈవో టిమ్‌ కుక్‌ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్‌లో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్‌ అయిన ట్రాక్టర్‌ తయారీ సంస్థ ‘జాన్‌ డీర్‌’ కూడా టారిఫ్‌ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్‌ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!- గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

Thug Life Movie Review And Rating In Telugu 10
‘థగ్‌ లైఫ్‌’ మూవీ రివ్యూ

38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్‌ హాసస్‌. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘థగ్‌ లైఫ్‌’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్‌ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్‌ లైఫ్‌’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్‌ హాసన్‌) ఒక గ్యాంగ్‌స్టర్‌. తన అన్న మాణిక్యం(నాజర్‌)తో కలిసి మరో గ్యాంగ్‌స్టర్‌ సదానందం(మహేశ్‌ మంజ్రేకర్‌)తో ఒక సెటిల్‌మెంట్‌కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్‌(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్‌ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్‌ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్‌నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్‌కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్‌ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్‌ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్‌ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్‌ లైఫ్‌’పై కమల్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్‌లో కమల్‌ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్‌ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ కథనే కమల్‌తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్‌’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్‌స్టర్‌ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్‌ చేసి ‘థగ్‌ లైఫ్‌’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్‌తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్‌ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్‌ మారిపోవడం.. ఆధిప‌త్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్‌గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్‌-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్‌ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్‌గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్‌ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్‌ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్‌ సన్నివేశాలు కూడా కమల్‌ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్‌ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్‌ రొటీన్‌ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్‌ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్‌ ఆఫీసర్‌గా అశోక్‌ సెల్వరాజ్‌, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్‌గా జోజు జార్జ్‌ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్‌ మంజ్రేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్‌ రెహమాన్‌. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్‌ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్‌ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement