breaking news
NRI
-
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
బాల్టిమోర్: అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహా సభలను పురస్కరించుకుని బాల్టిమోర్లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన 'ఆటా' బాల్టిమోర్లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనుంది. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్లో విజయవంతంగా జరిగింది.ఆటా మహాసభల కిక్-ఆఫ్ ఈవెంట్లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్-ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్, స్థానిక ఆర్గనైజింగ్ టీమ్లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్వర్క్, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు.బోర్డు సమావేశం, కిక్-ఆఫ్ ఈవెంట్ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీమ్, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారత, వ్యాపార నెట్వర్కింగ్ అమెరికాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మానవతా సేవను ప్రోత్సహించడానికి ఆటా అంకితమైందన్న విషయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ను సందర్శించింది. ఇది 425,000ం చదరపు అడుగుల విస్తీర్ణంతో, అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లకు ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది.ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్గా మేరీలాండ్ కు చెందిన శ్రీధర్ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్ కో ఆర్డినేటర్గా శరత్ వేములను, డైరెక్టర్ గా సుధీర్ దమిడి, కో కన్వీనర్ గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్ గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్ గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్ కిరణ్ అల తదితరులను నియమించింది.అలాగే మహాసభ కోర్ టీమ్కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్విల్లే, టెన్నెస్సీ, రఘువీర్ మారిపెద్ది- టెక్సాస్, విజయ్ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు -
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి. -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
యూఎస్లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు
అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.ఈఏడీ అంటే..అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.జాతీయ భద్రతే లక్ష్యంగతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్లింక్ సర్వీసుల డెమో -
‘ద్రోహి.. అలాంటోడి కాళ్లు మొక్కుతావా?’
ఖలీస్తానీ ఉగ్రసంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' (SFJ) ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్పై బెదిరింపులకు దిగింది. ఆస్ట్రేలియాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించబోయే కచేరీని నిలిపివేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడమే ఇందుకు కారణంగా ఎస్ఎఫ్జే చెబుతోంది. అమితాబ్(Amitabh Bachchan) హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్బనేగా కరోడ్ పతి సీజన్-17కి దిల్జీత్ దోసాంజ్(Diljit Dosanjh) గెస్ట్గా వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ బిడ్డ అంటూ దిల్జీత్ను బిగ్బీ పరిచయం చేయగా.. దిల్జీత్ అమిత్ కాళ్లను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ఈ ఇద్దరి ఆలింగనం తర్వాత షో కంటిన్యూ అయ్యింది. అయితే పవిత్రమైన తలపాగా ఉండగా అమితాబ్ లాంటి వ్యక్తి పాదాలను తాకడంపై సిఖ్స్ ఫర్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. SFJ Demands Akal Takht’s Action Against Diljit DosanjhSikhs For Justice (SFJ) has urged Akal Takht Sahib to summon Diljit Dosanjh for touching the feet of Amitabh Bachchan on the KBC show.SFJ’s statement, however, did not mention any protest or threat regarding Diljit’s… pic.twitter.com/xhdJMX92YG— Gagandeep Singh (@Gagan4344) October 29, 2025అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలే.. 1984 సిక్కుల ఊచకోతకు ప్రేరణగా మారాయి. అలాంలోడి పాదాలు తాకడం అంటే బాధితులందరినీ అవమానించడమే అని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇది అజ్ఞానం కాదు, విశ్వాస ఘాతకమేనని మండిపడింది. పైగా నవంబర్ 1వ తేదీని సిక్కుల ఊచకోత దినంగా గుర్తించిన నేపథ్యంలో.. అదే రోజున ఆస్ట్రేలియాలో కన్సర్ట్ నిర్వహించడం సిక్కు సమాజాన్ని అవమానించడమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కన్సర్ట్ను రద్దు చేసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ చేష్టలపై దిల్జీత్ను విచారించాల్సిందేనని కోరుతూ అకాల్ తఖ్త్ జథేదార్(అత్యున్నత ధార్మిక అధికారి) గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజుకు లేఖ రాసింది. పంజాబీ సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్కు మాములు క్రేజ్ లేదు. అందుకే Aura Tour పేరిట ఆస్ట్రేలియాలో కచేరీ నిర్వహించబోతున్నారు. ఈ టూర్ కోసం 800 డాలర్ల రేటుతో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు 30 వేల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. అమితాబ్పై ఆరోపణలేంటి?.. (Is Really Amitabh Bachchan Anti Sikhs Call)1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింసాత్మక దాడులు జరిగాయి(1984 సిక్కుల ఊచకోత). ఆ సమయంలో ప్రముఖ నటుడు, ఇందిరాగాంధీకి ఆప్తుడైన అమితాబ్ బచ్చన్ “ఖూన్ కా బదలా ఖూన్” (రక్తానికి ప్రతీకారంగా రక్తమే) అనే నినాదం ఇచ్చారని, ఈ వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించాయని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దూర్దర్శన్లో ఆయన ఆ నినాదం ఇచ్చారంటూ జగదీష్ కౌర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది కూడా. దీంతో.. అమితాబ్ బచ్చన్ అకాల్ తఖ్త్ జథేదార్కు ఓ లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. నిరాధారమైనవని.. ఎంతో బాధ కలిగించాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేవారు కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు కూడా 2014లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలు ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025 -
విమానంలో కలకలం.. ప్రయాణికులపై భారతీయ విద్యార్థి దాడి
లుఫ్తాన్సా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ భారతీయ విద్యార్థి.. తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. పదునైన మెటల్ ఫోర్క్తో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడ్డాడు. షికాగో నుంచి జర్మనీకి ప్రయాణిస్తున్న విమానంలో ఘటన జరిగింది. నిందితుడిని ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా పైలట్లు విమానాన్ని బోస్టన్కు మళ్లించాల్సి వచ్చింది. అధికారుల సమాచారం మేరకు.. విమానం అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రణీత్ కుమార్.. 17 ఏళ్ల ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్తో దాడి చేశాడు. మొదట నిద్రలో ఉన్న ఓ యువకుడి భుజంపై ఫోర్క్తో గాయపరిచాడు. అనంతరం మరో యువకుడిపై తల వెనుక భాగంలో గాయపరిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై కూడా దాడి చేశాడు.ఈ ఘటన అనంతరం లుఫ్తాన్సా ఫ్లైట్ 431 బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనలో ప్రణీత్కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం అతను ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు. బోస్టన్లోని యూఎస్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రణిత్ కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థి వీసాతో అమెరికాలోకి ప్రవేశించాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అతడు అక్కడే ఉంటున్నట్లు సమాచారం. -
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
యూకేలో భారత యువతిపై లైంగిక దాడి.. 45 రోజుల్లో రెండో ఘటన
లండన్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. అయితే, ఈ ఘటన జాతి వివక్షతోనే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి రోనన్ టైరర్ మాట్లాడుతూ..‘వెస్ట్ మిడ్ల్యాండ్స్లో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. శనివారం వాల్సాల్లోని పార్క్ హాల్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమెపై జాతి వివక్ష కారణంగానే ఇలా దాడి జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ నుండి వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు నేరస్థుడి ఫొటోను విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆధారాలను సేకరించే అధికార బృందాలు మా వద్ద ఉన్నాయి’ అని తెలిపారు.Another racially aggravated rape in West Midlands, UK of an Indian origin woman in her 20sThe suspect is described as White and in his 30s, with short hair. pic.twitter.com/3n1RVj6zW9— Journalist V (@OnTheNewsBeat) October 26, 2025సిక్కు యువతిపై లైంగిక దాడి..ఇక, యూకేలో భారత సంతతి ప్రజలపై జాత్యాహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఓల్డ్బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, "మీ దేశానికి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యాహంకార వ్యాఖ్యలతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిని జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో, ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇచ్చారు.❗️BREAKING ❗️A woman was raped in a racially aggravated attack in Walsall, West Midlands.Police are investigating the rape of a woman which they are treating as a racially aggravated attack in Walsall last night.The attacker is described as white, in his 30s. pic.twitter.com/pk3fatJ4he— Narinder Kaur (@narindertweets) October 26, 2025ఈ అమానుష ఘటనను బ్రిటన్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. "ఇది అత్యంత హింసాత్మక చర్య. 'మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు' అని బాధితురాలితో అనడం దారుణం. కానీ ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది" అని పేర్కొన్నారు. మరో ఎంపీ జస్ అత్వాల్ స్పందిస్తూ, "దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ హేయమైన దాడి. దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్) -
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025 -
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు. -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు. -
నార్త్ అమెరికాలో అత్యంత ఎత్తయిన శ్రీరాముడు
ఇటీవలి కాలంలో భారతీయ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ పురాణాలకు, దేవుళ్లు దేవతలకు గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు లభిస్తోంది. దీంతో విదేశాలలో పలు చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అదే క్రమంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఢిల్లీ, గుర్గావ్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ మనేసర్లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్లో చెక్కిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా కెనడాకు తరలించారు. తరువాత దీనిని అమెరికా నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఒకటే మూర్తిగా మలచింది. ఈ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్గ్లాస్ స్టీల్తో తయారు చేయడం విశేషం. ఇటీవలే జరిగిన ఈ శ్రీరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా భిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులలో, మహిళా లింగ సమానత్వ మంత్రి రీచర్ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షఫ్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూ కూడా హాజరయ్యారు. విగ్రహం ఏర్పాటు చేసిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, శ్రీరాముని కొలువుదీర్చడం వల్ల ఉత్తర అమెరికా అంతటా సందర్శకులకు ఆసక్తి పెరుగుతుందని గుర్తించామన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారన్నారు. చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!ప్రజలు ఆలయాన్ని సందర్శించడంతో పాటు కెనడాలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారు‘ అని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ‘చాలా గర్వించదగ్గ విషయం‘ అని సిద్ధూ అన్నారు. ఈ మూర్తిని ఏర్పాటు చేయడం కేవలం గర్వకారణం కాదు. ఇది సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ధర్మం ఎల్లప్పుడూ మన మార్గాన్ని నడిపించాలని గుర్తు చేస్తుంది‘ అని కేంద్రం వ్యవస్థాపకుడు ప్రధాన పూజారి ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అన్నారు.చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు కుషాగర్ శర్మ మాట్లాడుతూ, ‘10,000 మందికి పైగా ప్రజలు భక్తి ఐక్యత కలిసి శ్రీరాముని 51 అడుగుల ఎతై ్తన మూర్తిని ఆవిష్కరించింది‘ అని అన్నారు. ‘ఇది కేవలం మన విశ్వాసానికి ఒక వేడుక మాత్రమే కాదు, సాంస్కృతిక సామరస్యం ఆధ్యాత్మిక వారసత్వానికి విలువనిచ్చే కెనడియన్లందరికీ గర్వకారణమైన క్షణం‘ అని అన్నారు. మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు దిగేటప్పుడు ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని చెప్పారు. అలాగే ఈ అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం త్వరలో ప్రయాణీకులను స్వాగతించే మొదటి ప్రదేశాలలో ఒకటిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
బ్రూనైలో సేవ కార్యక్రమాలతో ఘనంగా దీపావళి వేడుక
బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం, దీపావళి పండుగను దాతృత్వం సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సమాజ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సంఘం ప్రతి త్రైమాసికం శుభ్రపరుస్తూ వస్తోంది. ఈసారి బృందం ఏడు ట్రక్కుల వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్కు తరలించింది.ఈ కార్యక్రమానికి సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించగా, రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు శ్రీ మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ గారి నేతృత్వంలోని MPK బృందం సమన్వయం, సహకారం అందించింది.అదే రోజున, సంఘం సభ్యులు రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 24 యూనిట్ల రక్తం విజయవంతంగా సేకరించగా, కొంతమంది సభ్యులు ఆరోగ్య కారణాల వల్ల తమ రక్తదానాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ శ్రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని హాజరై, సభ్యులను అభినందించి, సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు తెలిపారు.తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకట రమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ.. “దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు దాతృత్వానికి ప్రతీక. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయి. సభ్యుల ఉత్సాహం సేవా మనసు సంఘానికి గర్వకారణం.” అని తెలిపారు.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు.భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావంభారతీయ ఐటీ సేవల సంస్థలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయలున్నాయి. సాంప్రదాయకంగా ఈ సంస్థలు భారతదేశం నుంచి ఉద్యోగులను H-1B వీసాలపై బదిలీ చేస్తుంటాయి. వీరి వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భాతర ఐటీ కంపెనీలు తాము H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని చెబుతున్నాయి. స్థానికులనే ఎక్కువగా నియమించుకుంటున్నట్లు తెలిజేస్తున్నాయి.విప్రో వంటి సంస్థల్లో యూఎస్ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది స్థానిక ఉద్యోగులేనని సమాచారం. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ సైతం కొద్దిమంది ఉద్యోగులను మాత్రమే ఇమ్మిగ్రేషన్ సేవలకోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిగిలినవారు ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారని తెలిపారు. టీసీఎస్ కూడా ప్రతి సంవత్సరం వేలాది వీసాల కోసం దాఖలు చేసినా కేవలం 500 మంది మాత్రమే H-1B వీసాపై యుఎస్కు వెళ్తున్నట్లు గతంలో తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తున్నారా? -
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు. -
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
‘అడాప్ట్-ఎ-విలేజ్’కి అపూర్వ స్పందన
సాక్షి, హైదరాబాద్: శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-విలేజ్కి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నారై దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వేల మంది చికిత్స అందుకుంటున్నారు. మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల కంటి శిబిరాలు(Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు ముందుకు వస్తున్నారుశంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న అడాప్ట్-ఎ-విలేజ్ దాతలతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక దాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే నుంచి ఎన్నారైలు ఈ సేవా కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి వీలైనంత మందికి ఉచిత చికిత్స అందించబోతున్నారు. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాలు నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్లు, భోజనం, రవాణా సేవలు ఉచితంగా అందజేస్తారు. అక్టోబర్ 30వ తేదీ దాకా 11 రోజులపాటు అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్కు చెందిన రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు హాజరయ్యారు. దాతలు ముందుకు రావడంతో పాటు.. స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని బాలరెడ్డి తెలిపారు. -
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు
ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని తెలుగు సంఘాలు, ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి సిలికాన్ వ్యాలీని కాంతిమయం చేశాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) కూడా మిల్పిటాస్లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో సుమారు 25 వేలమందికి పాల్గొన్నారు. (చదవండి: టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు) -
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాలనీకి చెందిన విఘ్నేష్-రమాదేవి దంపతుల కూమార్తెలు స్రవంతి, తేజస్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భర్త, పిల్లలతో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుళ్ల వద్దకు వెళ్లారు.విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్రక్కు ఢీ కొనడంతో రమాదేవి(52), తేజస్వి (32) మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలు గాయపడ్డారు. -
లండన్ పార్లమెంట్లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం
తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి, ప్రముఖ రచయిత షేక్స్ పియర్ గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో వివరించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ వ్యవస్థాపకులు సురేష్ మంగళగిరి ,సభ్యులు రాగసుధా ,యశ్వంత్ నూక గారు, అశ్విన్, వాస భరత్ వాస, హర్ష మైనేని, రాజ్ దేవరపు, శరత్ తమ, సుభాష్ రెడ్డి, షణ్ముఖ్, సుదర్శన్ రెడ్డి, రంజిత్, కాటిపల్లి సచిందర్ రెడ్డి, వివేక్, జయా తులసి తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు. -
డాలస్లో ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు
డాలస్, అక్టోబర్ 12: డాలస్ నగరంలో ఆదివారం సాయంత్రం, భావప్రధానమైన సంగీతంతో, శ్రుతి-లయల అద్భుత సమన్వయంతో డా. కొమరవోలు శివప్రసాద్ గారి ఈలపాట సంగీత విభావరి, సంగీతాభిమానులైన ఆహూతులకు ఒక గొప్ప రసానుభూతిని కలిగించింది.కాపెల్లోని పింకర్టన్ ఎలిమెంటరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో, "విజిల్ విజర్డ్" (Whistle Wizard) గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ, కళారత్న డా. కొమరవోలు శివప్రసాద్ తన ఈలపాటతో శ్వాసస్వర మాధుర్యాన్ని పంచి, సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు.ఎటువంటి ముందు పరిచయం లేకుండా, ఒక్క రిహార్సల్ కూడా లేకుండా నేరుగా ఈ కచేరీలో సహాయక వాయిద్యకారులుగా చేరిన రామకృష్ణ గడగండ్లకు, నిండు సరస్వతీ కటాక్షం సంపాదించుకున్న చిరంజీవి చిదాత్మ దత్త చాగంటికి, చిరంజీవి స్వప్నతి మల్లజోస్యులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియశారు.ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వోల్డీలక్స్, ఇన్సూరెన్స్ సంస్థ SNR ఇన్సూరెన్స్, సిలికానాంధ్ర మనబడి డాలస్ జట్టు సభ్యులు సంయుక్తంగా ఈ సంగీత వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు.బాల్యంలోనే ఈలపాట రఘురామయ్య గారి సాహచర్యం, ఆ తర్వాత సంగీతసమ్రాట్ పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యరికంతో డా. శివప్రసాద్ సంగీతంలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఎక్కువమంది చేపట్టడానికి సాహసించని ఈ అరుదైన "శ్వాసాధార సంగీత" ప్రక్రియపై ఆయన పరిశోధన చేసి, దానిని పరిపుష్టం చేశారు. ప్రతిరోజూ ఐదు గంటలకు పైగా సాధన చేస్తూ, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలను నియంత్రించి, గుక్కతిప్పుకోకుండా సంగీతాన్ని సృష్టించే ఒక విశిష్ట శైలిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ కచేరీలో ఆయన త్యాగరాజ కీర్తనలు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనల నుండి శక్తివంతమైన "భో శంభో శివ శంభో" భక్తి గీతం వరకు, శంకరాభరణం రాగంలోని తిల్లానాల వరకు ఎన్నో ప్రఖ్యాత గీతాలను తన ఈలపాటలో అలవోకగా పలికించారు. ఆయనకు తోడుగా డాలస్కు చెందిన యువ కళాకారులు తబలా, వయోలిన్, మృదంగంపై అద్భుతమైన స్వరసమరస్యాన్ని ప్రదర్శించి, కచేరీ స్థాయిని మరింత పెంచారు. ప్రతి కీర్తన ముగిసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.కార్యక్రమం ముగింపులో, దాదాపు రెండు వందల మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో తమ అపారమైన ఆనందాన్ని, కళాకారుడి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. డా. ప్రసాద్ తోటకూర, శ్రీ శ్రీకాంత్ బొర్రా దంపతులు, శ్రీమతి శారద, శ్రీ భాస్కర్ రాయవరం కళాకారులకి గౌరవ సత్కారాలని అందించారు. శ్రీ ప్రసాద్ జోస్యుల సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేశ్ నారని, శ్రీ రంగాల మన్మధ రావు సాంకేతిక సహకారం అందించారు.శ్రీ సూర్యనారాయణ విష్ణుభొట్ల ఆడిటోరియం సదుపాయాలు, ఏర్పాట్లు, సమయపాలనలో సహాయం చేశారు. కాపెల్ విద్యాలయం అడ్మిన్ జట్టు సహకారం వల్ల మంచి సదుపాయాలతో కూడిన ప్రాంగణం ఈ సంగీత కచేరి చక్కగా జరగడానికి దోహదపడింది. 'పద్మశ్రీ', 'కళారత్న' పురస్కారాలు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు, మరియు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత డా. శివప్రసాద్ గారు సంప్రదాయ సంగీతానికి ఆధునికతను జోడించి, "శ్వాసలో సంగీతం" అనే కొత్త స్ఫూర్తిని ఆయన ప్రపంచానికి అందించారు. -
చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు) -
అమెరికాలో ఐదేళ్లలో 100 మందిపైగా భారత విద్యార్థుల మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. 40 కుటుంబాలకు సహాయం''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.జాగ్రత్తలు తప్పనిసరికాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.చెడు అలవాట్లతో..మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులుఅక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్పై కాల్పులు జరిపారు.జనవరి 20, 2025: హైదరాబాద్కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్లోని న్యూ హెవెన్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు
లండన్: ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన మేధస్సుతో వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బర్మింగ్హామ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నైతిక, ధార్మిక విలువలపై ప్రసంగించారు. లండన్లో జరిగిన ప్రవచనం ప్రధానంగా ధర్మబద్ధమైన జీవనం, జాతి నిర్మాణంలో NRIల పాత్ర అనే అంశాల చుట్టూ సాగింది. ఆయన ప్రసంగంలో హాస్యం, భక్తి, తత్వశాస్త్రం మేళవించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రసంగంలో గరికపాటి గారు AI వాడకంపై చమత్కారమైన హెచ్చరికలు చేస్తూ, తగిన నియంత్రణ లేకపోతే దాని ప్రమాదాలు గురించి పునరుద్ఘాటించారు. అంతేకాక, ప్రతి NRI తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిట్సెస్ బృందాన్ని సురేష్ మంగళగిరి పరిచయం చేశారు. కాటెపల్లి సచిందర్ రెడ్డి, వాసా బరత్, యశ్వంత్, రాగసుధ, షణ్ముఖ్, సుభాష్, అశ్విన్, సుదర్శన్, రాజ్ దేవరపు, శరత్ తమా, వివేక్, శ్రీనివాస్, బాలు తదితరులు కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాలంటీర్లు, స్పాన్సర్లు అందించిన మద్దతుతో ఈ పర్యటన తెలుగు సంస్కృతికి, ధర్మబద్ధమైన జీవన దృక్పథానికి అద్భుత వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో భజనలు, శాస్త్రీయ నృత్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది ఎన్ఆర్ఐలు తమ కళా, సాంస్కృతిక విలువలను ఎలా నిలబెట్టుకుంటున్నారనే దానికి నిదర్శనంగా నిలిచింది. -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
న్యూయార్క్లో ఘనంగా నైటా తెలంగాణ ఫోక్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫీస్ట్
అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం. New York Telangana Telugu Association (NYTTA) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్తో కార్యక్రమాలు ఈ వీకెండ్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు.ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్ లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెలుగువారు అమెరికా అభివృద్దిలో అంతర్భాగమయ్యారని సూజి అన్నారు.అమెరికాలో స్థిరపడినా సొంత ప్రాంత పండగల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరాలకు పరిచయం చేయటం కోసమే దసరా వేడుకలను నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు.ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మళ్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు. -
చికాగోలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన అరి మూవీ టీం
అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మూవీ అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. ఈ మూవీ అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. అర్ వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ మూవీని నిర్మించారు. వినోద్ వర్మ, సూర్య, అనసూయ,సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చికాగోలోని సినీ లాంజ్ లో మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రొడ్యూసర్ ఆర్ వీ రెడ్డి తో పాటు చికాగోలోని పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీం మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. దర్శకుడు ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా అరి మూవీని తెరకెక్కించారని వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీమ్ ను పలువురు ప్రశంసించారు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో మూవీ టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
ఇండియాకు వెళ్లిపో, భారతీయ యువతిపై జాత్యహంకార దాడి
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ఐర్లాండ్లోని డబ్లిన్లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India) వేధింపులు, జాతి వివక్షకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో బాధితురాలు స్వాతి వర్మ మొత్తం సంఘటనవీడియోనుసోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న స్వాతి ఈఘటన తనను చాలా బాధపెట్టిందని, వ్యక్తిగతం ఇది కలవర పెట్టిందని విచారం వ్యక్తం చేసింది. జిమ్ నుంచి ఇంటికి నడిచి వెడుతుండగా గుర్తు తెలియని మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిందనీ, ఆధునిక సమాజంలో కూడా వలసదారులు వివక్ష, తిరస్కరణను ఎదుర్కొంటున్నారని ఈ వీడియోలో స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది.సాయంత్రం 9 గంటల ప్రాంతంలో, తాను జిమ్ సెషన్ తర్వాత ఇంటికి వెళుతుండగా, నేను నివసించే ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలో, రోడ్డు అవతలి వైపున డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (DCU) బ్యాడ్జ్ ధరించినఉన్న ఒక మహిళ ఈమెను సమీపించింది. ‘నువ్వు ఐర్లాండ్కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇండియా తిరిగి వెళ్లిపో’’ అంటూ నానా యాగీ చేసింది. View this post on Instagram A post shared by Swati Verma (@swatayva) అంతేకాదు "నీకు వర్క్ వీసా ఉందా?" సొంత ఇల్లు ఉందా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. అయితే తాను ఇక్కడ ఉచితంగా ఉండటం లేదనీ, టాక్స్లు కడుతూ ఇక్కడి దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారం అందిస్తున్నాను అంటూ గట్టిగానే బదులిచ్చింది. అయినా సరే వెంటనే ఇండియాకు తిరిగి వెళ్లిపో అంటూ రెచ్చిపోయింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయానని భయంగా ఉందని, అసలేందో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని స్వాతి పోస్ట్ చేసింది. అయితే జాత్యహంకారం, బెదిరింపు , ద్వేషం ఇప్పటికీ మన వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అందుకే తనలా ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేసి, మీతో షేర్ చేసుకుంటున్నాని తెలిపింది. బహుశా ఆమె ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు.దయచేసి ఎవరైనా ఆమెకు హెల్ప్ చేయండి. అందుకే సం దీన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అని కూడా వివరించింది. ఈ వీడియో వైరల్గా మారింది. స్వాతి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, జాగ్రత్తగా ఉండమని సూచించారు. -
ఈబీ–5 వీసాతో అమెరికాలో స్థిరపడడం సులభం
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడడానికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా సులభ మార్గమని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్ (Ilya Fishkin) అన్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా గురించిన అవగాహన సదస్సును న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ గురువారం విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఇల్యా ఫిష్కిన్ మాట్లాడుతూ.. అమెరికాలో అనేక మంది భారతీయుల గ్రీన్కార్డ్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వారు సకాలంలో గ్రీన్ కార్డ్ పొందలేకపోతే అమెరికా వీడి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.అలాంటి వారికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా (EB-5 investor visa) అద్భుత అవకాశమని తెలిపారు. ఈబీ–5 వీసా పొందాలంటే దాదాపు రూ.9.32 కోట్లు(1.05 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రాజెక్టు పెడితే మాత్రం రూ.7.11 కోట్లు సరిపోతుందన్నారు. ఈబీ–5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పార్టనర్లు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్న్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈబీ–5 వీసా అమెరికాలో ఉన్న భారతీయులు శాశ్వత నివాస హక్కు పొందే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షల సంపాదన! -
డాలస్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్ ప్రాంతంలో ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగద్విఖ్యాత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ అక్టోబర్ 2వ తేదీన వేకువ ఝామునే మహత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట ప్రసిద్ధ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి విచ్చేశారు.మహత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సచిన్ ను సాదరంగా ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న కార్యవర్గ సభ్యుల శ్రమ, వేలాది ప్రవాస భారతీయుల సమిష్టి కృషి, దాతల దాతృత్వం, అనుమతి ఇవ్వడంలో అధికారులు అందించిన సహకారంతో దశమ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు.సచిన్ మాట్లాడుతూ – “గాంధీజయంతి రోజున అమెరికాలో గాంధీస్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమని, మహాత్మాగాంధీ జీవితం ప్రపంచంలో ఉన్న మానవాళిఅంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు” అన్నారు.మహాత్మాగాంధీ 156 వ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన “గాంధీ శాంతి నడక-2025” లో వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షులు మహేంద్ర రావు అందరినీ ఆహ్వానించి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జెనరల్ ఆఫ్ ఇండియా డిసి మంజునాథ్, ప్రత్యేక అతిథులుగా సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ టాకూర్, ఆంధ్రప్రదేశ్ “హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు, ఐ.ఎ.ఎస్ (రి) హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించి మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నిరతిని గుర్తుచేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఆహుతుల కేరింతల మధ్య అతిథులు, నాయకుల అందరూ కలసి ఆకాశంలోకి ఎగురవేసి అందరూ కలసి శాంతినడకలో పాల్గొన్నారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బి.యెన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా. జెపి, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని మొదలైన వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు.మురళి వెన్నం హాజరైన అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతంలో కృషి చేసిన కార్యకర్తలకు, వేడి వేడి అల్పాహారం అందించిన “ఇండియా టుడే కెఫే” అధినేత వినోద్ ఉప్పు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు. -
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
‘ఒరిగిందేం లేదు..’ ట్రంప్ టారిఫ్లకు గీతా గోపినాథ్ నెగెటివ్ మార్క్
ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్.. ట్రంప్ సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారామె. పైగా ఈ 6 నెలల కాలంలో టారిఫ్లు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని తేల్చేశారామె(Gita Gopinath On Trump Tariffs).ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్, బ్రెజిల్పై 50 శాతం సుంకాలను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. బ్రాండెడ్ ఔషధాలపైనా 100 శాతం టారిఫ్లు విధించారు. వీటితో పాటు చాలా రంగాలపై సుంకాలు విధించారు.. ఇంకా విధించుకుంటూ పోతున్నారు. అయితే.. లిబరేషన్ డే పేరిట ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి(Liberation Day Tariffs) ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో హార్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్ ఫ్రొపెసర్ గీతా గోపినాథ్ స్పందించారు. ట్రంప్ సుంకాలను నెగటివ్ స్కోర్కార్డ్గా అభివర్ణిస్తూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం కాకుండా నష్టం కలిగించాయని అన్నారామె. ఈ టారిఫ్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ.. ‘పన్నుల్లా’ వాటి భారం అమెరికా కంపెనీలు, వినియోగదారులపై పడిందని ఆమె అన్నారు. టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా పెరిగినప్పటికీ.. గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ వంటి వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందని.. ఇది మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం చూపినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి.. తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందలేదు. అలాగే, వాణిజ్య లోటు తగ్గిన సంకేతాలు కూడా లేవు. టారిఫ్లతో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు అని ఆమె తేల్చేశారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పోటీని తట్టుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని IMF మాజీ అధికారి అభిప్రాయపడటం గమనార్హం.It is 6 months since "Liberation day" tariffs. What have US tariffs accomplished?1. Raise revenue for government? Yes. Quite substantially. Borne almost entirely by US firms and passed on some to US consumers. So it has worked like a tax on US firms/consumers. 2. Raise… pic.twitter.com/KZG3UgKB3S— Gita Gopinath (@GitaGopinath) October 6, 2025 గీతా గోపినాథ్(53) భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో IMF చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులై, 2022లో ఆ సంస్థకు తొలి డిప్యూటీ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. 2025లో IMF పదవిని వీడి.. హార్వర్డ్లో తిరిగి ప్రొఫెసర్గా చేరారు.ఇదీ చదవండి: క్వాంటమ్ మెకానిక్స్కు ఎట్టకేలకు గుర్తింపు -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
టీపాడ్ బతుకమ్మ- దసరా సంబరాలు.. థమన్, హీరోయిన్లు శివాని, అనన్య సందడి
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (TPAD-టీపాడ్) ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడాదిలాగానే ఈసారి కూడా డే టైమ్లో స్థానిక కళాకారులు, స్టూడెంట్స్ తమ ప్రదర్శనలతో అదరగొట్టగా సాయంత్రం బతుకమ్మ, దసరా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సంగీతంతో షేక్ చేశారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత స్పెషల్గెస్ట్గా హాజరైన ఈ వేడుకలో హీరోయిన్లు శివాని, అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.దద్దరిల్లిన అల్లెన సెంటర్టీపాడ్ వేడుకలకు వేదికైన డాలస్లోని అల్లెన ఈవెంట్ సెంటర్ దద్దరిల్లిపోయింది. ఈ మెగా ఈవెంటుకు తెలుగువారంతా భారీగా తరలి వచ్చారు. ఏటా పదిహేను వేల మందికి పైగా ఏర్పాట్లు చేస్తున్న టీపాడ్.. ఈసారి అంతకుమించి జనం వస్తారని ఊహించి అందుకు తగ్గట్టు సౌకర్యాలు సమకూర్చినా.. సుమారు రెండు వేల మంది మాత్రం కనీసం నిల్చుకునేందుకు స్థలం లేక వెనుదిరిగిపోయారు. ఉదయం 11 గంటలకే ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటలకు థమన్ మ్యూజిక్ కన్సర్ట్తో ముగిశాయి. మహిషాసుర మర్ధిని నృత్యరూపకంవేడుకల్లో భాగంగా తొలుత సుమారు 200 మంది స్థానిక కళాకారులు, విద్యార్థులు డ్యాన్సలు, సింగింగ్ టాలెంట్తో ఆహూతులను మెస్మరైజ్ చేశారు. రోజంతా సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవన్న అనుభూతికి లోనయ్యేలా చేశారు. సాక్షాత్తూ అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టు సాగిన 70 మంది సంప్రదాయ నృత్యకారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకం ప్రతి ఒక్కరిలో గూస్బంప్స్ తెప్పించాయి. డెబ్బయ్ మంది అడుగులు కాలిగజ్జెలతో నర్తిస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ప్రతి ఒక్కరూ ఆ శబ్దానికి, నృత్యానికి పులకించి, కొత్తలోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగింది. తెలంగాణ నేలపై నవరాత్రుల వైభవాన్ని చూడలేకపోయామే అనుకున్న వారికి ఈ వేడుక ఆ గ్యాప్ను భర్తీ చేసింది.బతుకమ్మ ఆడిన హీరోయిన్లుసాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోయిన్లు శివాని, అనన్య మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం శమీవృక్షానికి, అమ్మవారికి పూజలు నిర్వహించి దేవేరులను పల్లకిలో ఊరేగించారు. ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఓవైపు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి గిన్నిస్రికార్డ్లో నమోదు చేయిస్తే.. ఇటు టీపాడ్ డాలస్లో దాదాపు అదే స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహించి వేలాది మంది మహిళల మనసు దోచుకుంది. కన్వెన్షనను తలపించిన ప్రాంగణంరోజంతా మీడియా ప్రతినిధులతో పాటు ఇనఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల సందడి కనిపించింది. అల్లెన సెంటర్ ప్రాంగణంలో నగలు, దుస్తులతో పాటు కన్వెన్షనను తలపించేలా అనేక వెండర్బూతలు వెలిశాయి. రకరకాల ఫుడ్కోర్టులు కొలువుదీరాయి. జోష్ నింపిన థమన్ మ్యూజిక్సంప్రదాయ వేడుకలన్నీ ముగిశాక థమన్ హైఓల్టేజీ ఎనర్జీ మ్యూజిక్ వెరీవెరీ స్పెషల్గా మారింది. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ప్రతి ఒక్కరూ జోష్లో ఉండిపోయారు. డాలస్లోనే తన మొదటి కాన్సర్ట్ జరిగిందని చెప్పిన థమన.. మళ్లీ టీపాడ్ వేడుకపై ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రోగ్రామ్లో సింగర్స్ పాడిన ఒక్కొక్క పాటకు స్టేడియంలో పలువురు స్టెప్పులేసి, చప్పట్లు కొట్టి హుషారు నింపారు. ఓజీ డైరెక్టర్ సుజిత ఈ వేదికపై అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ఈ మెగా ఈవెంట్ను ఫౌండేషన కమిటీ చెయిర్ రావు కల్వల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చెయిర్ పాండురంగారెడ్డి పాల్వాయి, ప్రెసిడెంట్ అనూరాధ మేకల, కోఆర్డినేటర్ రమణ లష్కర్, ఫౌండేషన కమిటీ సభ్యులు అజయ్రెడ్డి, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు పర్యవేక్షించారు. వంద మంది వలంటీర్లు రెండు నెలలు శ్రమించి ఎక్కడా నిర్వహణ లోపాలు రాకుండా ఏర్పాట్లకు సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. -
పిట్స్బర్గ్లో దారుణ హత్యకు గురైన ఎన్నారై
చంద్రమౌళి నాగమల్లయ్య ఉదంతం మరువక ముందే.. అమెరికాలో భారత సంతతి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ మోటల్ మేనేజర్గా పని చేస్తున్న రాకేశ్ ఇహగబన్(51)ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. తన మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన క్రమంలోనే ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పెన్సిల్వేనియా స్టేట్ పిట్స్బర్గ్లో ఉన్న ఓ మోటల్లో రాకేశ్ ఇహబగన్(Rakesh Ehagaban) మేనేజర్గా పని చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన(శుక్రవారం) మధ్యాహ్నా సమయంలో మోటల్ బయట పార్కింగ్ వద్ద ఏదో అలజడి వినిపించింది. బయటకు వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్తో ఓ మహిళపై కాల్పులకు దిగడం కనిపించింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని ‘‘ఆర్ యూ ఆల్రైట్ బడ్’’ అంటూ రాకేష్ పలకరించాడు. అంతే తన చేతిలో గన్ను రాకేష్ వైపు తిప్పి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశాడు ఆ దుండగుడు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. నిందితుడిని స్టాన్లీ వెస్ట్గా(38) నిర్ధారించిన పోలీసులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన అదనపు వివరాల ప్రకారం.. స్టాన్లీ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేష్ మేనేజర్గా పని చేస్తున్న పిట్స్బర్గ్ మోటల్లోనే ఉంటున్నాడు. పార్కింగ్ వద్ద అతను కాల్పులు జరిపిన మహిళ కూడా అతనితోనే అక్కడే ఉంటోంది(ఓ చంటి బిడ్డతో సహా). అయితే శుక్రవారం ఏదో గొడవ జరిగి ఆమె వెళ్లిపోతుంటే.. స్టాన్లీ ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె మెడలో తూటా దిగి తీవ్రంగా గాయపడింది. వెనక సీటులో ఉన్నా ఆమె బిడ్డకు అదృష్టవశాత్తూ ఏం కాలేదు. రక్తస్రావం అవుతుండగానే.. ఆమె తన వాహనాన్ని తీసుకుని కొద్దిదూరం పారిపోయింది. తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని కేసు దర్యాప్తు చేస్తున్న రాబిన్సన్ టౌన్షిప్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఏం సంబంధం లేకుండా గొడవను ఆపేందుకు వెళ్లి భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ ప్రాణాలు పొగొట్టుకున్నారని వెల్లడించారు.సెప్టెంబర్ 10వ తేదీన.. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలోని ఓ మోటల్ మేనేజర్ అయిన చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను అక్కడ పని చేసే.. యోర్డాన్స్ కోబోస్ కత్తితో తల నరికి హత్య చేసిన ఘటన తెలిసిందే. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో చిన్నపాటి గొడవకే ఆగ్రహంతో ఊగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కోబోస్. ఈ దారుణం మల్లయ్య భార్య, కుమారుడి కళ్ల ముందే జరగడం గమనార్హం. తల నరికి.. దానిని కాలితో తన్ని.. ఆపై చెత్త బుట్టలో వేసిన దృశ్యాలు కలవరపాటుకు గురి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
రెడింగ్లో భవ్యంగా బతుకమ్మ జాతర
బర్క్షైర్ (యూకే): యునైటెడ్ కింగ్డమ్ రెడింగ్లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు. పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్రెడ్డి, రామ్ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు. -
మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
కౌలాలంపూర్, అక్టోబర్ 4: భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో, మలేషియాలోని అన్ని భారతీయ సమాజాలు కలసి ఘనంగా “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవాన్ని టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో నిర్వహించాయి.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు లోక్సభ సభ్యుడు, హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు. అతిథులు మాట్లాడుతూ – “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. నిజంగా కన్నుల పండుగగా నిలిచింది” అని అభినందించారు.సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేషియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు విశేషంగా పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.BAM ప్రధాన కమిటీ సభ్యులు* చోప్పరి సత్య – అధ్యక్షుడు* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి * గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి * రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు* రహిత – కార్యవర్గ సభ్యుడు* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడుBAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ: “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు -
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్కు అటాచ్ చేస్తారు. ప్లాన్లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్కి పట్టమా?? -
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐర్లాండ్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలు అల్లే శ్రీనివాస్, బలరాం కొక్కుల ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు సుమారు 750 మంది హాజరయ్యారు. దుర్గా పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆడపడుచులు బతుకమ్మ, కోలాటం, దాండియా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశేషాలను వివరించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. వేడుకలకు హాజరైన వారందరికీ ప్రసాదంతోపాటు రుచికరమైన వంటలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తమ భవిష్యత్తు తరాలకు కూడా తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్ (Telanganites Of Ireland) ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా ఏటా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది వాలంటీర్లు, 50 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
గ్లాస్గో మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
గ్లాస్గో (స్కాట్లాండ్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో బతుకమ్మ వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెంపుల్ అధ్యక్షుడు డా. పునీత్ బెడి,,ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ఈ దేవాలయం, ఈ ఏడాది బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరిపింది. డా. మమత వుసికాలా, వినీల బత్తులా, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.మహిళలు అందరూ రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గానం చేస్తూ, నృత్యాలు, కోలాటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా టెంపుల్లో భక్తి శ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీప సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ అనంతరం భోజన విందు కూడా ఏర్పాటు చేయగా, అందరూ మంచి ఆహారం ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా ఉత్సవాన్ని ముగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ప్రకటించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అంతర్జాతీయ సమస్యలకు అండగా కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కొత్త బ్రాంచ్
హనుమకొండ హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో పిట్టల సునీల్ కుమార్ మరియు భూపతి శంకర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ అసోసియేట్స్ సంస్థతో కరీంనగర్ వాస్తవ్యులు, సీనియర్ న్యాయవాది ప్రస్తుతం అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సొలిసిటర్ కావేటి శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకొని, హనుమకొండలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా కావేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాను ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని అక్కడ సొలిసిటర్గా , బ్రిటన్లో అటార్నీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, వివిధ దేశాలలో తమ శాఖలు ఉన్నాయని తెలిపారు. హనుమకొండలో కూడా సునీల్ అసోసియేట్స్ సహకారంతో నూతన శాఖను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంటి నుండి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. వారిలో చాలామంది విదేశాలలో ఇమిగ్రేషన్ , వీసా, పాస్పోర్టు మరియు ఎంబసీ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటితో పాటు భార్య భర్తలు వైవాహిక సమస్యలతో అక్కడ కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. అలాగే అక్కడ రోడ్డు, ఇతర ప్రమాదాలలో మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిందని అలాంటి సమస్యలకు తాము పరిష్కారం చూపేలా, దేశంలో శాఖలను విస్తరిస్తున్నామని బాధితులకు అండగా ఉంటామన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని.. అందుకోసం బాధితులు తమ ప్రాంతంలో గల కావేటి లా ఫర్మ్ సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని, విదేశాలలో గల చట్టపరమైన సమస్యలకు తాము పరిష్కార మార్గం చూపిస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని బాధితులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ కన్జ్యూమర్ కౌన్సిల్ చైర్మన్ పల్లెపాడు దామోదర్, లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ సీనియర్ న్యాయవాదులు వరంగల్ ప్రస్తుత జనరల్ సెక్రెటరీ డి. రమాకాంత్, హనుమకొండ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, మాజీ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణమూర్తి, మాజీ పీపీ గుర్రాల వినోద్ కుమార్, స్పెషల్ జిపి మహాత్మ, సీనియర్ న్యాయవాది కె.వి.కె గుప్తా, కేశవ్, వేల్పుల రమేష్, మామిడాలగిరి, సత్యనారాయణ, మొలుగురి రాజు , సూరయ్య, శీలం అఖిల్ రావు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
యూకేలో ఎల్టీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
యూకేలోని లూటన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు.. లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దాంతో అక్కడ దసరా వేడుక కనుల పండువలా సాగింది. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. -
ఐఐటీ హైదరాబాద్తో ఆటా చారిత్రక ఒప్పందం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆటా.. ఐఐటీ హైదరాబాద్తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం జరిగింది.వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయని జయంత్ చల్లా పేర్కొన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందన్నారు. -
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక సంబవాంగ్ పార్క్ లో సెప్టెంబర్ 27, శనివారం రోజున ఘనంగా జరిగాయి. భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు మరియు ఎన్నారైలు సుమారు 2500 నుండి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ISKM), సింగపూర్ వారికి , వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గార్లకు TCSS సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షులు జూలూరి సంతోష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగువారు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పుతూ TCSS చరిత్రలో నిలిచిపోతుందని సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దాదాపు 11 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు వెండి వస్తువులు,చీరలు, తదితర ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ చెక్కిలిపై సిరివెన్నెల కురిసేరా... పూలకే పూజ చేసే పండుగే మళ్ళొచ్చేరా" యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. ఈ పాట మేకింగ్ కి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన స్థానిక ఏఐ పాల్స్ ప్రై. లి సంస్థకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ , కృత్రిమబతుకమ్మ ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు కార్పొరేట్ స్పాన్సర్స్ కు, సహకరించిన మిత్రులకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ లోని బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్ , టాంపనీస్ ,బెడోక్ , మేల్విల్లీ పార్క్ మరియు సెరంగూన్ ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. సింగపూర్ వేడుకలను సొసైటీ సోషల్మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే కమిటీ ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించి భక్తులందరూ సంతోషం ప్రకటించారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనిత రెడ్డి, హేమ లత, దీప నల్ల, జూలూరు పద్మజ,కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమ రెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత కీలక పాత్ర పోషించారు.ఈ పండుగ వేడుకకు సహకరించిన పార్క్ యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను మరియు సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన మాధవి లాలంగర్, స్వప్న ముద్దం, సృజన బైస మరియు స్వప్నకైలాసపు, బతుకమ్మ ఆటకు కొరియోగ్రఫీగా సహకరించిన దీప రెడ్డి, స్థానిక మీడియాకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాసర్ల శ్రీనివాస్, రవికృష్ణ విజాపుర్, ప్రవీణ్ కుమార్ సి హెచ్ మరియు సాత్విక నడికట్ల & సంజన బొందుగుల (జూనియర్ కమిటీ మెంబెర్స్) లు పండుగ వేడుకల వ్యాఖ్యాతలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
“తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” సభ విజయవంతం
డాలస్, టెక్సస్: తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన “తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” అనే అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభిస్తూ తెలంగాణా గడ్డపై జన్మించిన ఎంతోమంది సాహితీవేత్తలు విశేష కృషి చేశారని, కాళోజీ జయంతి సందర్భంగా వారిలో కొంతమందిని ఈ రోజు స్మరించుకోవడం ఆనందదాయకం అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగునేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య, సంగీత, విద్యా, వైజ్ఞానిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక, సినీ, రాజకీయ, క్రీడా, సేవా రంగాలలో కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకతీతంగా ప్రతి తెలుగుగుండె గర్వంతో ఉప్పొంగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంతమందిని తెలంగాణా రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకుని ఘన నివాళులర్పించుకోవడం సముచితమైనది, సందర్భోచితమైనది అన్నారు. వీరు చేసిన సాహిత్య కృషి భావి తరాలకు స్పూర్తిదాయకమైనది అన్నారు”, ముఖ్యఅతిధిగా హాజరైన ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు బహుభాషా పండితులని, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు. విశిష్టఅతిథులుగా విచ్చేసిన - డా. జుర్రు చెన్నయ్య (ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శి కావేరమ్మపేట, మహబూబానగర్ జిల్లా) - ప్రముఖ పాత్రికేయుడు, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత అయిన డా. దేవులపల్లి రామానుజరావు గురించి; డా. కెడిడి మృణాళిని ( ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, హైదరాబాద్) - ప్రముఖ సాహితీవేత్త, జానపద విజ్ఞాన పరిశోధకుడు అయిన ఆచార్య డా. బిరుదురాజు రామరాజు గురించి; రంగరాజు పద్మ (రచయిత్రి, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా, ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి కుమార్తె) - ప్రముఖ సాహితీవేత్తలు శ్రీయుతులు ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుల గురించి; డా. వి. జయప్రకాష్ (ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, దేవుని తిర్మలాపురం, నాగర్ కర్నూలు జిల్లా) - ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యుల గురించి; డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (ప్రముఖ రచయిత, విమర్శకులు, కరీంనగర్) – ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు డా. కపిలవాయి లింగమూర్తి గురించి; డా. బ్రాహ్మణపల్లి జయరాములు (అధ్యాపకులు, సాహితీవేత్త, హైదరాబాద్) - అభినవ పోతన, ఉద్ధండ పండితుడు అయిన డా. వానమామలై వరదాచార్యుల గురించి; శ్రీధర్ రావు దేశ్ పాండే (ప్రముఖ రచయిత, బోథ్, ఆదిలాబాద్ జిల్లా) - తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు అయిన డా. సామల సదాశివ గురించి; డా. కొండపల్లి నీహారిణి (ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, హైదరాబాద్, కొండపల్లి శేషగిరిరావుగారి కోడలు) - సుప్రసిద్ద చిత్రకారుడు అయిన డా. కొండపల్లి శేషగిరిరావు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుని, ఈ లబ్ధప్రతిష్టులైన జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించి నివాళులర్పించారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/nB5Pw6gfuhs -
సింగపూర్లో ఘనంగా చండీ హోమ మహోత్సవం
సింగపూర్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేయబడింది.SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్ల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
జర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలు
యూరప్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలను ఎత్తి, సాంస్కృతిక పాటలతో, నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకున్న మహిళలు, పూలతో తయారుచేసిన బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ వేడుకలు జర్మనీ వాసులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, భోజన విందులు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించడంతో కుటుంబ సమేతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ వేడుకలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తమ మూలాలను గుర్తుచేస్తూ, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు. కౌలాలంపూర్లోని బ్రిక్స్ఫీల్డ్స్లోలోని కృష్ణా టెంపుల్లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసంతిసిన్ని సామిమలేషియాలో భారతీయవారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణినారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు . అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు. అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతి అందించారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలందరికీ వారందరికీ వెండి నాణేలు కానుకగా ఇచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు వెండి బహుమతులు. మలేషియాలో ఉన్న తెలుగు రెస్టారెంట్లు స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించారు.తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ , కోశాధికారి నాగరాజు , మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ప్రెసిడెంట్ శారదా , భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ప్రెసిడెంట్ గీత హజారే , భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగుఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు , తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతికసంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్కప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించినస్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ , టూట్కర్ సొల్యూషన్స్ ,సెంట్రల్ స్పైస్ ,టెక్మ్యాట్రిక్స్ ,రెడ్వేవ్ సొల్యూషన్స్ , టెక్డార్ట్ ,స్ప్రౌట్అకాడమీ ,బిఆర్ఎస్ మలేషియా ,జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ ,లులు మనీ , బిగ్ సివెడ్డింగ్ కార్డ్స్ , శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి , మై బిర్యానీ , శ్రీ బిర్యానీ ,స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81 , MY81 , మెరిడియన్ , ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు , స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞత లుతెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డిమోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మకనుమూరి,ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శిభాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావుగునుగంటి,యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతికవిభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహకసభ్యులు నాగరాజుకాలేరు,నాగార్జున దేవవరపు, ఫణీంద్రకనుగంటి,సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఘనంగా శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్
శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ వార్షిక 5K వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం, సెప్తెంబర్ 14th, 2025 నాడు స్థానిక నోవై నగరంలోని ఐటిసి స్పోర్ట్స్ పార్క్ లో ఈ వాక్ నిర్వహించారు.శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారి ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5K వాక్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి; మరియు చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, మరియు వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేసారు.ఈ 5K వాక్లో రెండు క్యాటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు బహుమతులను అందింపజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులకు, కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించిన పలువురు సభ్యులకు, శంకర నేత్రాలయ కార్యనిర్వాహక సంఘం డెట్రాయిట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్షెల్, పిస్తా షెల్లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్పడినా..ఆ లాక్డౌన్ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
బర్లిన్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
బర్లిన్, 21 సెప్టెంబర్ 2025 – బర్లిన్ హాసెన్హైడేలోని శ్రీ గణేశ ఆలయం రంగురంగుల పూలు, సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో అలంకరించబడింది. తెలంగాణా అసోసియేషన్ జర్మనీ (TAG) e.V., స్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి నాయకత్వంలో 12వసారి బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది.ప్రధాన అతిథిగా భారత రాయబార కార్యాలయం (బర్లిన్) మంత్రి (పర్సనల్) డాక్టర్ మంధీప్ సింగ్ తులీ హాజరై బతుకమ్మను తలపై మోసి పూజల్లో పాల్గొన్నారు. జర్మనీలోని అనేక భారతీయ సంఘాల అధ్యక్షులు కూడా వేడుకను శుభాకాంక్షలతో అభినందించారు.300 మందికి పైగా తెలుగు మహిళలు, కుటుంబ సభ్యులు బర్లిన్ , పరిసర ప్రాంతాల నుండి చేరి బతుకమ్మలను పేర్చారు. బొడ్డెమ్మ పూజ, గౌరి పూజలు నిర్వహించిన తరువాత, సాంప్రదాయ తెలుగు వంటకాలతో విందు చేశారు. సాంప్రదాయం, వినోదం కలిసిన కార్యక్రమంలో నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, తంబోలా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.వేడుక విజయవంతం కావడంలో TAG సభ్యులు – వెంకట రమణ బోయినిపల్లి, అలేఖ్య భోగ, శరత్ రెడ్డి కమిడి, బాలరాజ్ ఆండే, అవినాష్ పోతుమంచి, శ్రీనాథ్ రమణి, నరేష్ తౌటమ్, నటేష్ చెట్టి, అమూల్య బొమ్మరబోయిన – కీలకపాత్ర పోషించారు. అంతేకాక, అనేక మంది వాలంటీర్లు ఉత్సాహభరితంగా సహకరించారు.బతుకమ్మ లాంటి వేడుకలు సంప్రదాయాన్ని నిలబెట్టి, సమాజ బంధాలను మరింత బలపరిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రవాస తెలుగు సమాజానికి TAG ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాకులు ప్రకటించారు. TAG ఈ సమాజాన్ని ఒక యూనిట్గా బలంగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు నవ్వులు, స్నేహం, ఆత్మీయతలతో ముగిసిన ఈ ఉత్సవంలో, బర్లిన్లోని తెలుగు సమాజం తెలంగాణా సంస్కృతి, ఆత్మ, ఐక్యతను ఘనంగా ప్రతిబింబించింది -
మానవ మృగాన్ని వేటాడిన భారతీయుడు!
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ మధ్యే నాగమల్లయ్య అనే కర్ణాటకవాసిని డల్లాస్లో ఓ వలసదారుడు అతికిరాతకంగా తల నరికి చంపడమూ చూశాం. అయితే.. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా స్టేట్లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మట్టుపెట్టాడు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన ఫ్రెమాంట్ సిటీ(Fremont City)లో డేవిడ్ బ్రిమ్మర్(71) అనే వ్యక్తి వరుణ్ సురేష్(29) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పోలీసులకు తానే సమాచారం అందించి నిందితుడు లొంగిపోయాడు. ఈ క్రమంలో.. విచారణ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన హత్యా అభియోగాలను పోలీసులు అధికారికంగా నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఘటన ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. వరుణ్ సురేష్(Varun Suresh) పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. చనిపోయిన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిచి వచ్చాడు. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదు అయ్యింది. ఇది గమనించిన వరుణ్ సురేష్.. అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్నాడు. పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగు వేసుకుని కస్టమర్ల కోసం ప్రతీ ఇంటికీ తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలలపాటు వెతికాడు. అలా ఆఖరికి.. బ్రిమ్మర్ ఇంటి తలుపు తట్టి కలుసుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వాళ్లను అతని గురించి ఆరా తీశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి అతనేనని ధృవీకరించుకున్నాడు.సెప్టెంబర్ 18వ తేదీన మరోసారి డేవిడ్ బ్రిమ్మర్(David Brimmer) ఇంటి తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మెడలో తన దగ్గర ఉన్న కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా? అని ఆరా తీశాడు. అయితే రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి తాను చేపట్టిన సర్పయాగం వరుణ్ పూర్తి చేశాడు. చేసిన నేరానికి తానేం బాధపడడం లేదని, పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వరుణ్ సురేష్ 2021లో ఓ ఆసక్తికరమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫ్రెమంట్లోనే ఓ ప్రముఖ హోటల్లో బాంబు ఉందని బెదిరించడమే కాక.. చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయితే.. ఆ హోటల్ సీఈవో కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ సమయంలో అతన్ని చంపేందుకే తీవ్రంగా ప్రయత్నించాడనని వరుణ్ సురేష్ ఇప్పుడు వెల్లడించడం గమనార్హం. అలమెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసు విచారణ జరుపుతోంది. వరుణ్ సురేష్ నేపథ్యం ఏంటి?.. అతను పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని(Paedophile) ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు?. అనే వివరాలు తెలియరావాల్సి ఉంది.చదవండి: ప్రాణాల కోసం పరిగెత్తినా.. తల ఎగిరి పడింది! -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
నాట్స్ స్వర వీణాపాణి మ్యూజిక్ థెరఫీకి మంచి స్పందన
ఎడిసన్, న్యూ జెర్సీ: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. వాటిని అధిగమించడానికి సంగీతం కూడా ఒక మార్గమని నిరూపించే కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్లో జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన 'మ్యూజిక్ థెరపీ' కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు గ్రహీత, సప్తస్వర సామ్రాట్ స్వర వీణాపాణి విచ్చేసి తన స్వరాలతో అందరిని సమ్మోహితం చేశారు. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మనసును శాంతపరిచే ఒక శక్తిమంతమైన ఔషధం అని స్వర వీణాపాణి పేర్కొన్నారు. ఆయన అభివృద్ధి చేసిన 'స్మార్ట్-సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ' పద్ధతి ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పద్ధతిలో వివిధ రాగాలను, వాటిలోని తరంగాలను ఉపయోగించి మన మెదడులోని నరాలను ఉత్తేజపరచడం, తద్వారా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను నివారించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై ఆద్యంతం అందరిని అలరించింది. 72 మేళ కర్త రాగాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పాటను నాట్స్ పూర్వ అధ్యక్షుడు గంగాధర్ దేసు విన్నపం మేరకు వీణాపాణి పాడి వినిపించారు.అజాత శత్రువు దాము గేదెలకు నాట్స్ సత్కారంఅమెరికాలో పలు తెలుగు సంఘాలకు సేవలందిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంఘ సేవకులు దాము గేదెలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సత్కరించింది. తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా దాము గేదెల అందించే మద్దతు అపూర్వమని కొనియాడింది. న్యూజెర్సీ ఎడిసన్లో జరిగిన ఒక కార్యక్రమంలో దాము గేదెలను నాట్స్ సేవా పురస్కారాన్ని అందించి సత్కరించింది. జూలై లో టంపా వేదికగా జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో దాము గేదెలకు నాట్స్ సేవా పురస్కారాన్ని ప్రకటించారు. ఆనాడు సంబరాల్లో సమయా భావం వల్ల అందించలేని ఆ పురస్కారాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఎడిసన్లో ప్రత్యేకంగా దాము గేదెలను ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు గంగాధర్ దేసు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా దాము గేదెల అమెరికాలో తెలుగు సంఘాలను, తెలుగువారికి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. దాము గేదెల లాంటి సేవా దృక్పథం ఉన్న వారు సాటి తెలుగువారిలో స్ఫూర్తిని నింపుతారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రశంసించారు.ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం లో నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి , నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట కీలక పాత్ర పోషించారు, నాట్స్ న్యూజెర్సీ టీమ్ పాస్ట్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళి మేడిచెర్ల, న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు, రామకృష్ణ బోను, జతిన్ కొల్ల, వెంకట చైతన్య మాదాల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, శ్రీదేవి జాగర్లమూడి, ఈశ్వర్ అన్నం, సోమ తదితురులు సహకరించారు. సాయి దత్త పీఠం డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, శేఖర్ & వల్లీ వేదుల, తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు అన్న మరియు వారి కార్య నిర్వాహక సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గ్లాస్గోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం
తెలంగాణకు ప్రత్యేకమైన మరియు ఆడపడుచుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివసించే తెలుగువారు ఘనంగా ప్రారంభించారు. నిన్నటితో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డా. మమతా వుసికల,వినీల బతులా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో అనేక మహిళలు పాల్గొని పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేశారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బతుకమ్మ పాటలకు గుంపులుగా చిందులేసి ఉత్సాహంగా నర్తించి ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాక, విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఐక్యతకు, వారి భాషా-బాషా సంస్కృతులకు నిదర్శనంగా నిలిచింది.ఈ ఉత్సవానికి మదర్ ఎర్త్ హిందూ టెంపుల్ గ్లాస్గో అధ్యక్షులు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమతా వుసికల ముఖ్య నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో మరింత విస్తృతంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ విధంగా గ్లాస్గో నగరంలో బతుకమ్మ పండుగ ఆరంభం ప్రవాసాంధ్రులు, ప్రవాసతెలంగాణ వాసుల్లో ఆనందం కలిగించిందని, తమ పుట్టిన గడ్డ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ముందడుగని హాజరైన వారు పేర్కొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో బతుకమ్మ వేడుకల సన్నాహాలు జోరుగా
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఉన్న మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంపుల్ అధ్యక్షుడు డాక్టర్ పునీత్ బెడి, ఉపాధ్యక్షురాలు మమతా వూసికల, కార్యదర్శి వినీలా బత్తుల సమర్థవంతంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు, మాతృశక్తిని ఆరాధించే విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. అంతేకాక, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.బతుకమ్మ మరియు నవరాత్రులు మిలితంగా జరుపుకోవడం అనేది అక్కడి భారతీయ సమాజానికి విశేషమైన ఆనందాన్ని అందిస్తోంది. సామూహికంగా జరుపుకునే ఈ పండుగలు, భారతీయ సాంస్కృతిక విలువలను కొత్త తరానికి పరిచయం చేస్తున్నాయి.అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలను ఎదురుచూస్తున్నారు. -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభు త్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో తనతోపాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతడి ని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లొంగిపోవాలని హెచ్చరించినా నిజాముద్దీన్ వినకపోటంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు.. త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మాకు న్యాయం చేయాలి నా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాదిపాటు వెదక గా జాబ్ వచ్చింది. నాలుగేళ్లు పని చేసిన తర్వాత 2023లో ప్రమోషన్తో కాలిఫోర్నియాకు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీవాళ్లు ఆపని చేయలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే, రూమ్మేట్ తరుచుగా ఏసీ బంద్ చేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. మా బాబు స్నేహితుడు రాయచూర్కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ గురువారం ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పిండు. అంతవరకు మాకు సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియాలి. న్యాయం చేయాలి. దీనిపై విదేశాంగమంత్రికి ఫిర్యాదు చేస్తాం. – హసానుద్దీన్, నిజాముద్దీన్ తండ్రి -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్నగర్ యువకుడి మృతి
అమెరికాలో మహబూబ్నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. మహబూబ్నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్ -
యూఎస్లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్గా ఎదగడానికి భారత్కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి) -
శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి
శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్ ఎ విలేజ్ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది. తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెక్సాస్లోని డల్లాస్లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.టెక్సాస్లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో పేర్కొన్నారు.నిందితుడు కోబో మార్టినెజ్పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి. -
డల్లాస్ ఎన్నారై హత్య: ప్రాణభయంతో నాగమల్లయ్య..
అమెరికా టెక్సాస్ డల్లాస్ నగరంలో జరిగిన ఎన్నారై దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటక మూలాలున్న చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య(50)ను యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డల్లాస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్లో డౌన్టౌన్ సూట్స్ మోటల్ ఉంది. ఇందులో చంద్ర నాగమల్లయ్య(50) మేనేజర్గా పని చేసేవాడు. అదే హోటల్లో క్యూబాకు చెందిన యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ సిబ్బందిగా పని చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీన నాగమల్లయ్య పాడైపోయిన వాషింగ్ మెషిన్ విషయంలో కోబాస్కు ఏదో సూచన చేశాడు. అయితే అది నేరుగా చేయకుండా.. పక్కన ఉన్న మరో మహిళా సిబ్బందికి చెప్పి అతనికి చెప్పమన్నాడు. ఇది కోబాస్కు కోపం తెప్పించింది. తన గదిలో ఉన్న కత్తితో నాగమల్లయ్యను కోబాస్ వెంటాడి చంపాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్లో నాగమల్లయ్యను కోబాస్ ఆ మోటల్ కారిడార్లో కత్తితో వెంబడించిన దృశ్యాలు రికార్డయ్యాయి. నాగమల్లయ్య కొడుకు(18)బేస్బాల్ బ్యాట్తో కోబాస్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. నాగమల్లయ్యను అతని భార్యాకొడుకు ముందే కిరాతకంగా తలనరికి చంపాడు కోబాస్. అంతటితో ఆగకుండా.. ఆ తలను కాలితో ఫుట్బాల్లాగా తన్నాడు. అది కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్లాక.. దానిని చెత్తబుట్టలో పడేశాడు. ఇది కూడా అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యింది. ఆపై పోలీసులు హత్యానేరం కింద కోబాస్ను అరెస్ట్ చేసింది. తొలుత క్షణికావేశంలో జరిగిన హత్య అని.. కాదు జాత్యాంహకార హత్య అని.. ఇలా రకరకాల కోణాల్లో చర్చ జరిగింది. అయితే.. నిందితుడు యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) అందించిన వివరాల ప్రకారం.. కోబాస్-మార్టినెజ్కు క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారు. పైగా అతనిపై అమెరికాలోనే ఇంతకు ముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేరచరిత కూడా ఉంది. అయితే.. క్యూబా ప్రభుత్వం అతనిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద Immigration and Customs Enforcement కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆనాడు అలా విడుదల చేయకుంటే లీగల్గా సమస్యలు ఎదురయ్యేవి. ఈ ఘటనపై భారతీయ సమాజం, అంతర్జాతీయ వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ హత్య.. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, అలాగే ప్రవాస భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. “బాబ్” అనే ముద్దుపేరుతో స్నేహితులు పిలిచే నాగమల్లయ్యను కర్తవ్యపరుడని, మానవతావాదిగా గుర్తు చేస్తోంది. మరోవైపు.. భారతీయ కమ్యూనిటీలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఫ్యూనరల్ ఖర్చులు, కుమారుడి విద్యా ఖర్చుల కోసం ఫండ్ రైజర్ ఏర్పాటు చేశాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మందలించినందుకు తల నరికేశాడు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు. హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు. అసలేం జరిగింది? చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్లోని డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే హోటల్లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు. ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్ఫోన్ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. మారి్టనెజ్ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. కర్ణాటక వాసి నాగమల్లయ్య నాగమల్లయ్య స్వస్థలం భారత్లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం. -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది. -
విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ.1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తున్నారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఈరన్న ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకుగాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలో పదవతరగతిలో టాపర్గా వచ్చిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి సహాయం మరువలేనిదని ఈరన్న అన్నారు. తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అవ్వాలని తన కోరిక అని కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని, సహకరిస్తున్న తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లికి ఈ సందర్భంగా రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, మోషన్ రెసిడెన్షియల్ కళాశాల కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.(చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
హాంకాంగ్లో గిడుగుకు ఘనంగా తెలుగు నివాళి
తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ రోజును గిడుగు రామమూర్తి జయంతిగా జరుపుకుంటూ, తెలుగు భాష వికాసానికి ప్రధాన కారకుడైన గిడుగు రామమూర్తికి ఇది ఘన నివాళి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.గిడుగు రామమూర్తి పంతులు గారి తెలుగు భాషపై చేసిన కృషిని గురించి కొన్ని ముఖ్యాంశాలు: వ్యావహారిక భాషా ఉద్యమం: గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషలో వ్యావహారిక భాషా ఉద్యమానికి పితామహులుగా పిలువబడతారు. వారు రాసిన కొన్ని ముఖ్యమైన రచనలు:"తెలుగు వ్యాకరణ విమర్శ" - తెలుగు భాషలో గ్రాంథిక, వ్యావహారిక భేదాలపై విశ్లేషణ"ఆంధ్ర పండిత భిషక్కులు" - తెలుగు భాషా సంస్కరణపై వ్యాసంసరళ వ్యావహారిక భాషా ప్రయోగం" - వ్యావహారిక భాష ఆవశ్యకతపై వివరణముఖ్య సిద్ధాంతాలు: "మాట్లాడే భాషే రాయాలి, రాసే భాషే మాట్లాడాలి" "భాష ప్రజల కోసం, ప్రజల భాషే అసలైన భాష" "గ్రాంథిక భాష కాకుండా వ్యావహారిక భాష విద్యాబోధనకు ఉపయోగపడుతుంది"భాషా సంస్కరణలు:-పాఠశాలల్లో వ్యావహారిక భాష బోధనకు కృషి-తేలికైన తెలుగు భాషా ప్రయోగాన్ని ప్రోత్సహించడం-తెలుగు భాషలో ఉన్న క్లిష్టమైన పదజాలాన్ని సరళీకరించడంఆయన రాసిన ముఖ్య పుస్తకాలు:సమాజిక భాషా శాస్త్రము"ఆంధ్ర భాషాభివృద్ధి"వ్యావహారిక భాషా వాదము""నూతన వ్యాకరణము"గిడుగు వారి ఆలోచనలు:భాష ప్రజల అవసరాలను బట్టి మారుతుందిభాష సజీవమైనది, నిరంతరం పరిణామం చెందుతుందిసామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషే ఉత్తమమైన భాషవిద్యాబోధన సులభతరం కావాలంటే వ్యావహారిక భాష అవసరం ఈనాటికీ గిడుగు వారి భాషా సిద్ధాంతాలు తెలుగు భాషా అభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఆయన చూపిన బాట తెలుగు భాషా వికాసానికి ఎంతగానో తోడ్పడింది.ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గిడుగు రామమూర్తి పుట్టినరోజును తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా జరుపుకుంది. గిడుగు సేవలను తెలుపుతూ, తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను స్థాపక సభ్యురాలు జయ పీసపాటి వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు తెలుగు భాష, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తు క్లాసికల్, సెమి క్లాసికల్, జానపద మరియు టాలివుడ్ పాటలు - నృత్యాలను ఘనంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కవితలు, కథా విన్యాసాలు కూడా నిర్వహించారు. పిల్లలకు చిత్రకళా పోటీలు కూడా నిర్వహించారు. వార్షికంగా, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పిల్లలని - వారి అభిరుచుల్ని, కళలను ప్రోత్సహించడాన్ని సమర్థిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతంలో తెలుగు తరగతులు నిర్వహిస్తున్నామని, తమ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన తమ కార్యవర్గ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలుపుతు , పిల్లలని వారి తల్లిదండ్రిని అభినందిస్తూ భాష నేర్చుకోవడంలో ముందడుగు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నందుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.ఆ వీడియోలో బీహార్కి చెందిన వ్యక్తి లండన్లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెపె్టన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
శాశ్వత నివాసం కోసం ఆకర్షణీయ మార్గం
యూరప్లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది. ఈ అవకాశం కోసం దరఖాస్తు రుసుము కేవలం 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది.ఐర్లాండ్లో శాశ్వత నివాసంఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ అని పిలుస్తారు. ఇది నాన్ ఈయూ/ ఈఈఏ(ఈయూతోపాటు ఐస్ల్యాండ్, లీచెన్స్టీన్, నార్వే) పౌరులు దేశంలో నివసించేందుకు అనుమతించే విధానం. ఇది దేశ పౌరసత్వం కానప్పటికీ, అనుమతులు అవసరం లేకుండా పనిచేసే హక్కు, ప్రజా సేవలకు అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఐర్లాండ్లో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం తర్వాత నిబంధనల ప్రకారం ఈ హోదా ఇస్తారు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?(భారతీయులు కూడా అర్హులు)ఐర్లాండ్లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి, అక్కడ పనిచేసిన ఈయూ/ఈఈఏయేతన జాతీయులు ఈ కింది షరతులకు అనుగుణంగా స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఐర్లాండ్ లో ఐదు సంవత్సరాలు (60 నెలలు) నిరంతర చట్టపరమైన నివాసం ఉండాలి.క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ లేదా జనరల్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ వంటి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలి.దరఖాస్తు సమయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారని ధ్రువీకరించుకోవాలి.క్లీన్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి.ఆర్థిక స్వాతంత్ర్యం- ప్రజాధనంపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యం ఉండాలి.ఐరిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాలి.పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్తో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాస అవసరాలను తెలియజేసేలా డాక్యుమెంటేషన్ తయారు చేయాలి.రెసిడెన్సీ కోసం ఆ దేశ నిబంధనల ప్రకారం ఫారం 8ను పూర్తి చేయాలి.పాస్పోర్ట్, ఐరిష్ రెసిడెన్స్ పర్మిట్ (ఐఆర్పీ) వివరాలు వెల్లడించాలి.గత ఉపాధి అనుమతులు, పని చరిత్రను నివేదించాలి.నిరంతర నివాసం కోసం రుజువులు చూపాలి.అప్లికేషన్ను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డెలివరీ (ఐఎస్డీ)కి సబ్మిట్ చేయాలి.అప్రూవల్ నోటీస్ అందుకున్న 28 రోజుల్లోగా 500 యూరోలు (సుమారు రూ.52,000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.ప్రాసెసింగ్ కోసం 6 నుంచి 8 నెలలు పట్టవచ్చు.ఆమోదం పొందితే ఐర్లాండ్లో దీర్ఘకాలిక నివాసాన్ని ధ్రువీకరించే స్టాంప్ 4 వీసాను అందుకుంటారు.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
తానా “తెలుగుభాషా యువభేరి” విజయవంతం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు. ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు” విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX(చదవండి: ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం) -
బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ) -
షార్జా, సౌదీలో వైఎస్సార్కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు. -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా, వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉత్సాహంగా జరిగాయి. ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్ , డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు , మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల , కృష్ణశ్రీ గంధం , అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు.ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైర్టకర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల , గంగవ్వ, జయశ్రీ, తదితర సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.GMA మహాసభలను ఆగస్టు 30 న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA టీమ్ పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలతో.. డప్పు చప్పుళ్ల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా వేదక వద్దకు తరలివచ్చారు.అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. ఇక కార్యకర్తలలో ప్రత్యక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపజేసేలా వేదిక్ మ్యాథ్య్ నిలిచింది. గాయత్రి రజినీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తుంది, గతకొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం విధితమే.! ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, GMA సరిగమ సంగీత పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ GMA అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, పలువురు నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా GMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు.ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. GMA ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు.ఈ మహాసభల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే సంప్రదాయ బద్ధంగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని.. స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ మహాసభల్లో భాగంగా రెండు రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరీర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఇక బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు.మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురికి GMA అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరిని ఆకర్షించాయి. ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు.. చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు.ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో పసందైనా విందు భోజనం అందిచారు. GMA వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకరించిన కమిటీ సభ్యులకు, EC, BOD, RVPS, సహాయ సహాకారాలు అందించిన దాతలకు, వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు.. సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ,ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కన్వెన్షన్ ముగింపు వేడుకలలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కన్సర్ట్ అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను మంత్రముగ్థులను చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. GMA కన్వెన్షన్లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు GMA కన్వెన్షన్ సరి కొత్త మార్గాన్ని చూపించింది.(చదవండి: మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం) -
లండన్లో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి
బడంగ్పేట్/ ఉప్పల్: లండన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువకులు దుర్మరణంపాలయ్యారు. మృతులను నాదర్ గుల్కు చెందిన చైతన్యయాదవ్ (అభి), పీర్జాదిగూడకు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్యయదవ్, మంగమ్మ దంపతులకు చిన్న కుమారుడు చైతన్యయాదవ్ (23) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో లండన్ వెళ్లాడు. బోడుప్పల్ లోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ అమృత కాలనీలో నివా ముండే రాపోలు రవీందర్రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ (21)హైదరాబాద్లో బీబీఏ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం గత మే నెలలో లండన్ వెళ్లాడు. వీరు మరికొందరు తెలుగు విద్యార్థులతో కలిసి అక్కడ నివా సం ఉంటున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని స్నేహితులంతా గణనాథున్ని ప్రతిష్టించారు. ఆదివారం సా యంత్రం నిమజ్జనం కోసం 9 మంది రెండు కార్లలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు మలుపు వద్ద వారి కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వెనుక వస్తున్న ట్రక్కు రెండు కార్లను ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో చైతన్య యాదవ్, రిషితేజ మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.రెండు కుటుంబాల్లో విషాదంఇద్దరు యువకుల మరణంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. చైతన్యయాదవ్ మరణవార్తతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రిషితేజ చివరగా తల్లి కిరణ్మయితో ఆదివారం మాట్లాడాడు. ‘నిద్ర వస్తోంది.. లేచాక మాట్లాడతాను అని చెప్పిన మాటలే చివరివి అయ్యాయి’అని అతడి తండ్రి రవీందర్రావు కన్నీరు మున్నీరయ్యాడు. -
మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం
మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 30న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీకళ్యాణ శ్రీచక్రవర్తి చేసిన అవధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డాక్టర్ తంగిరాల నాగలక్ష్మిగారు సంచాలకురాలిగా నిర్వహించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.ఈ కార్యక్రమము ఆధ్యాత్మిక కేంద్రమైన సంకట మోచన మందిరంలో విచ్చేసిన ప్రముఖులు ఆసాంతం వీక్షించి అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు. అప్రస్తుత ప్రసంగంలో పాల్గొన్న 11 ఏళ్ళ చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకంగా నిలిచింది. కృతిపద్యము అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు, తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.(చదవండి: YSR Vardhanthi: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు) -
విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్థంతిని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. పలువురు ఎన్నారైలు డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తెలుగు జాతి వైఎస్సార్కి రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా కన్వీనర్ కృష్ణారెడ్డి, సహ కన్వీనర్ భరత్, కోర్ టీమ్ సభ్యులు బ్రహ్మరెడ్డి, రామాంజి, సురేష్ రెడ్డి, సతీశ్, పవన్, బాషా, తేరా జయవర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, డి.శ్రీధర్ పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికాలో... సౌత్ ఆఫ్రికాలోని వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జోహనెస్బర్గ్లో సోమవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2 వర్ధంతి సందర్భంగా ముందురోజు సోమవారం జోహనెస్బర్గ్లోని కమ్యూనిటీ సెంటర్ బేకరీ అనాథాశ్రమంలో చిన్నారులకు ఆహారంతోపాటు రూ.5 లక్షల విలువచేసే వ్రస్తాలను దానం చేశారు. తమలో చాలామంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారానే ఉన్నత చదువులు చదువుకుని ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కల్లా నరసింహారెడ్డి, సూర్య రామిరెడ్డి, విజయ శ్రీనివాసు, శ్రీకృష్ణారెడ్డి, వాసు సింగారెడ్డి, పెట్లూరు విక్రం, మాగంటి వెంకట్, సానికొమ్మ అంజిరెడ్డి, అవనిగడ్డ పుష్పాంజలి, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు హరి, బుద్ధ సురేంద్ర, అనిపి రెడ్డి నవీన్ రెడ్డి, బాల భాస్కర్, రాజారపు శివ, పల్లె మధు పాల్గొన్నారు. ఐర్లాండ్లో.. ఆంధ్రప్రదేశ్కు వెలుగు నింపిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఐర్లాండ్లోని వైఎస్సార్సీపీ అభిమానులు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆలోచనలు, ప్రజల కోసం చేసిన కృషి ఎప్పటికీ మరవలేనివని అన్నారు. దివంగత మహానేత వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జీవన విధానం, ప్రజాసేవా పథకాలను స్మరించుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు. పేదల కోసం, రైతుల కోసం, సాధారణ కుటుంబాల కోసం వైఎస్సార్ చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మహానేత డాక్టర్ వైఎస్సార్ అంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ఆకేపాటి, గోపిరెడ్డి కోటి, వీర రెడ్డి, శ్రీను డేగ, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ రక్తదానం డాక్టర్ వైఎస్సార్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ రక్తదాన డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్రెడ్డి యర్రపురెడ్డి, ఆది, రేఖ మోర్రెడ్డి, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్పోలా, అంజిరెడ్డి, రుక్మాన్, రమేశ్, శ్రీధర్ చెమిడ్తి, బాలమురళీకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, నాగేషొ్పర్ల, వేమశేఖర్, విఘ్నేష్, కొండారెడ్డి, జ్ఞానదీప్, నాగి బోనం తదితరులు పాల్గొన్నారు. -
ఫీనిక్స్లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
ఫీనిక్స్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఉత్సవాలు అమెరికాలో (ఫినిక్స్,ఆరిజోనలో) ఘనంగా జరిగాయి. పురస్కరించుకుని, వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్త, బయోథెరపీ సంస్థ విటాలెంట్ సహకారంతో, ఈ శిబిరం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ఆర్కు పుష్పగుచ్ఛాలర్పణతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆయన జీవిత విశేషాలు, ప్రజాసంక్షేమం పట్ల ఆయన నిబద్ధతను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది. కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్తో తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ఆయన వినయం, ధైర్యం, ప్రజా కేంద్రిత పాలనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన సాంబశివారెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ను ‘జననాయకుడు’గా ప్రశంసించారు. ఆయన దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీని ప్రశంసిస్తూ, ఈ రక్తదాన కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ సేవా సూత్రాలను ప్రతిబింబిస్తుందని, సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని సోమశేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, ఆది & రేఖ మోర్రెడ్డి, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, అంజిరెడ్డి, రుక్మాన్, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, బాలమురళీకృష్ణ, ఇంద్రసేనా రెడ్డి, నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండారెడ్డి, జ్ఞానదీప్, అజయ్ కాల్వ, నాగి బోనంలు ఘనంగా నిర్వహించారు. విటాలెంట్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ..ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకులు, హాజరైన వారందరికీ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తద్వారా ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ, డాక్టర్ వైఎస్ఆర్ సేవా,కరుణ, సమాజ సంక్షేమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు తన అంకితభావాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. -
విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్లోని సాండ్రింగ్హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఫీనిక్స్లో మినీ కన్వెన్షన్గా సాగిన ‘ఆటా డే’
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA).. అనిర్వచనీయమైన వేడుక నిర్వహించింది. ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతమైన కార్యక్రమం ‘ఆటా డే’ (ATA DAY -2025)ను చేపట్టి నాలుగువేల మందికి పైగా ఆహుతులను మధురానుభూతుల్లో నింపింది. ఆటా (ATA) సంప్రదాయ కార్యక్రమం.. ఏడుకొండలవాడైన శ్రీనివాసుడి కల్యాణంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది.అందరి శ్రేయస్సు కోరుతూ నిర్వహించిన ఈ కమ్మని వేడుకలో భాగస్వాములవడం తమకు దక్కిన మహాభాగ్యమని హాజరైన తెలుగువారందరూ మురిసిపోయారు. ఎంతో రుచికరమైన.. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని కన్నులకద్దుకుని స్వీకరించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం కనువిందు చేసింది. రోజంతా జరిగిన కార్యక్రమాలతో మెసా కన్వెన్షన్ సెంటర్ కళకళలాడింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి. హాయిగొలిపే సాయంత్రం వేళ... గాయని సుమంగళి అండ్ రాగిన్ బ్యాండ్ లైవ్కాన్సర్ట్తో అందరినీ హుషారెత్తించారు. ఉర్రూతలూగించే పాటలతో ప్రతి ఒక్కరినీ కుర్చీలోంచి లేపి డ్యాన్స్ చేయించారు.ఔత్సాహికులకు మార్గదర్శిగా బిజినెస్ ఫోరంస్వామి వారి కల్యాణానంతరం బిజినెస్ ఫోరమ్ (Business Forum) సమావేశం నిర్వహించారు. తమతమ వ్యాపారాల్లో తమదైన మార్క్ చూపిన వ్యాపారులు తమ అనుభవాలను, అనుసరించిన మార్గాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వివరించి ప్రోత్సహించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, మాధవీరెడ్డి, కిరణ్ వేదాంతం, బాల పట్తెం, మధు రాయపాటి ఈ ఫోరంలో తమ అమూల్య సందేశమిచ్చారు. మొత్తమ్మీద ఈ కార్యక్రమం నూతన వ్యాపారవేత్తలకు ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు.ప్రశంసించిన చాండ్లర్ మేయర్ కెవిన్ హార్ట్కీచాండ్లర్ (ఫీనిక్స్) మేయర్ కెవిన్ హార్ట్కీ ఈ వేడుకకు హాజరై తెలుగు కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్రెడ్డి, కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికోపుల, ట్రస్టీ వెన్నరెడ్డి హాజరై ఫీనిక్స్ టీమ్కు అభినందనలు తెలిపారు.ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘునాథ్ గాడి, కోఆర్డినేటర్లు సునీల్ అన్నపురెడ్డి, శుభ గాయం, మదన బొల్లారెడ్డి, స్పోర్ట్స్ చైర్ శేషిరెడ్డి గాడి, మహిళా విభాగం బింద్యా, కో చైర్ దివ్య తలసిల, కల్చరల్ చైర్ కాంతిప్రియ, సహచరులు నివేదిత గాడి, ప్రధాన సభ్యులు పరితోష్ పోలి, శివ దేవగుడి, రవి గర్లపాటి, అరవింద్, ప్రణయ్, ప్రవీణ్, దీరజ్ పోలా, రుకుమైలా, మాలతి గర్లపాటి, విజయ్ కందుకూరి, సారితా బండారు, సుదర్శన్ ఈ ఈవెంట్ను గొప్పగా నిర్వహించడానికి విశేషంగా కృషి చేశారు.డిసెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆటా(ATA) సేవా కార్యక్రమాలుఆటా(ATA) నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా.. గత కొన్నినెలలుగా అమెరికాలోని 25 నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే 19వ ఆటా కన్వెన్షన్ (ATA Convention)ను వచ్చే ఏడాది(2026) జూలై 31, ఆగస్టు1, 2 తేదీల్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్రెడ్డి.. అమెరికాలో, భారత్ లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది (2025) డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. డిసెంబర్ 27న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గ్రాండ్ ఫినాలే (grand finale) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
భారతీయుల్లో వీసా గుబులు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అక్కడున్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు రెండేళ్లల్లో కోర్సు పూర్తి చేసి.. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. కనీసం మూడేళ్లల్లో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి హెచ్1బీ వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును నాలుగేళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక, ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోత పడ్డాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది. తగ్గుతున్న అవకాశాలుఅమెరికాలో భారత విద్యార్థులు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గినట్లు విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. ఈ దేశానికి అగ్రరాజ్యానికి ఏటా 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువారే ఉండటం గమనార్హం. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీపడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. అమెరికాతో పోలిస్తే కెనడాలో 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. అయితే ఇటీవల కెనడాలోనూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఏటా రూ.5.86 లక్షల కోట్లు అమెరికాలో రెండేళ్లుగా ఖర్చులు పెరిగాయి. రూపాయి మారక విలువతో పోలిస్తే యూనివర్సిటీ ఫీజులూ పెరిగాయి. సాధారణంగా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ విద్యార్థులు నెట్టుకొస్తారు. ట్రంప్ వచి్చన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను డబ్బు కోసం ఆశ్రయిస్తున్నారు. అమెరికాకు పంపేటప్పుడే అప్పులు చేసిన తల్లిదండ్రులు మళ్లీ అప్పులు తేవడం కష్టంగా ఉంటోంది. ఏటా పర్యాటకులతో కలిపి 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ.3.10 లక్షల కోట్లు. 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ. 3.93 లక్షల కోట్లకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10 శాతం మేర పెరిగి, రూ. 4.32 లక్షల కోట్లకు చేరింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ. 5.86 లక్షల కోట్ల మేర విదేశీ విద్య భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజు తలచుకుంటేనే... విదేశీ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులు తలుచుకుంటే భారత విద్యార్థులు వణికిపోతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు అమెరికా వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వసతి ఖర్చులు ఏకంగా 10–15 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. దీంతో విద్యార్థుల అంచనాలు తారుమారయ్యాయి. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లిందని అంటున్నారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే.. వీసా కాలపరిమితి తగ్గించడంతో భవిష్యత్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. వీసా కుదిస్తే ఎలా.. ఎంఎస్ పూర్తయ్యే వరకూ ఉద్యోగం చేయకూడదు. ఎంఎస్ అయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ తీసుకుంటారు. అప్పటికే మూడున్నరేళ్లు పూర్తవుతుంది. మిగిలిన ఆరు నెలల్లో ఉద్యోగం రాకపోతే హెచ్–1బీ వీసా రాదు. కాబట్టి భారత్కు వెళ్లాలి. నేను ఎంఎస్ పూర్తి చేసి ఆరు నెలలైంది. రూ.40 లక్షల అప్పు చేశాను. మరో రెండేళ్లు ఉద్యోగం రాకపోతే అప్పు రెట్టింపవుతుంది. అమెరికా ఆంక్షల వల్ల నలిగిపోతున్నాం. – మందస బాల శేఖర్ (అమెరికాలో భారత విద్యార్థి) ఇది అన్యాయంట్రంప్ వచ్చిన తర్వాత ఐటీ రంగం పరిస్థితి మారిపోయింది. ప్రతి కంపెనీలోనూ అనుభవం అడుగుతున్నారు. విద్య పూర్తి చేసిన వెంటనే అనుభవం ఎలా వస్తుంది. అనుభవం కోసం కనీసం ఏడాది ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉండాలి. వీసా కాలపరిమితి కుదిస్తే విద్యార్థులు నష్టపోతారు. – పరమేశ్వర్ త్రిపాఠి (అమెరికాలో భారత కన్సల్టెన్సీ నిర్వాహకుడు) -
సినీ రచయిత బుర్రా సాయిమాధవ్తో డాలస్ సాహితీ ప్రియుల ముఖాముఖి
డాలస్, టెక్సస్: ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయిమాదవ్ తో డాలస్లో సాహితీ ప్రియుల సమక్షంలో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా.. ఉల్లాసభరితంగా జరిగింది. రంగస్థల నటునిగా, నాటక రచయితగా, టి.వి ధారావాహికల రచయిత ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ఒక ప్రసిద్ధ సినిమా మాటల రచయితగా, సంభాషణల రచయితగా సినీమా పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి చేరడంలో చేసిన కృషి వెనుక ఉన్న నేపధ్యాన్ని, సాహితీ ప్రియులు అడిగిన అనేక ప్రశ్నలకు సాయిమాధవ్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సినీ సంభాషణల రచయితగా సినీ రంగానికి పరిచయమవడం, తాను మాటలు రాసిన “కంచె”, “మహానటి” రెండు సినిమాలు భారత ప్రభుత్వముచే ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు అందుకోవడం, “మళ్లీ మళ్లీ ఇది రానిరోజు” సినిమాకు ఉత్తమ మాటలర చయితగా నంది పురస్కారం, ”పుత్తడిబొమ్మ”, “సీతామహాలక్ష్మి” ధారావాహికలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలు అందుకోవడం తన రచనా జీవితంలో కొన్ని మైలురాళ్ళు మాత్రమేనని, ఇంకా ఎంతో సాధించ వలసినది ఉంది అన్నారు.‘కృష్ణం వందే జగద్గురుం”, “గోపాల గోపాల”, “కంచె”, “సర్దార్ గబ్బర్ సింగ్”, “గౌతమీపుత్ర శాతకర్ణి”, “మహానటి”, “ఖైదీ 150” లాంటి పలు సినిమాలలో తాను వ్రాసిన మాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ తనకు ఎంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చిందని ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, నటులకు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు” అన్నారు బుర్రా సాయిమాధవ్. తాను ఏమి వ్రాసినా సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రచనలు చేస్తానని, సమాజానికి హానికల్గించే మాటలు తనను ఎంత ప్రలోభపెట్టినా తన కలంనుండి వెలువడవని అందరి హర్షద్వానాల మధ్య సాయిమాధవ్ వెల్లడించారు.తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆహూతులందరితో కలసి బుర్రా సాయిమాధవ్ ని దుశ్శాలువ, సన్మాన జ్ఞాపికతో ఘనంగా సత్కరించి మాట్లాడుతూ – “సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, తాను వచ్చిన నాటక రంగాన్ని విస్మరించకుండా, ‘కళల కాణాచి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, రంగస్థల కళాభివృద్ధికోసం లక్షలాది రూపాయల తన స్వంత నిధులను సైతం వెచ్చిస్తూ, ఎన్నో సంవత్సరాలగా సాయిమాధవ్ చేస్తున్న కృషి ఎంతైనా అభినందించదగ్గది, ఇతరులకు ఆదర్శప్రాయమైనది అన్నారు.”ఇదే సభలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి వ్రాసిన “సిరివెన్నెల తొలి గురువు ‘సమ్మాన్యుడు’ కొత్తగా” అనే పుస్తకాన్ని డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించి తొలిప్రతిని బుర్రా సాయిమాధవ్కు అందజేశారు. “టి.వి, సినీ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన కళాకారులకు ఎన్నో సంవత్సరాలగా సంప్రదాయంగా ఇస్తున్న నంది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేయడం శోచనీయమని, వెంటనే వాటిని పునరుద్దరించి ఆ రంగాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు” డా. ప్రసాద్ తోటకూరబుర్రా సాయిమాదవ్ తనకు ఈ ఆత్మీయసమావేశం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఒక ప్రక్క ఎన్నో సంవత్సరాలగా తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం కృషి చేస్తూ, మరో ప్రక్క సామాజికసేవలో ముందుంటున్న మిత్రులు డా. ప్రసాద్ తోటకూర ఈ అభినందన సభను ఏర్పాటుచేసి, చక్కగా సభా సమన్వం చేసినందులకు వారికి, వారి మిత్రబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.ఆద్యంతం ఉత్సాహంగాజరిగిన ఈ సాహితీ సమావేశంలో సత్యన్ కళ్యాణ్ దుర్గ్, రవీంద్ర పాపినేని, సాయి సత్యనారాయణ, రాజా రెడ్డి, మురళి వెన్నం, సిద్ధూ, రమేశ్ ప్రేమ్ కుమార్, శివకుమారి, గాయకులు గని మరియు వారి కుటుంబసభ్యులు, యాజీ జయంతి, చినసత్యం వీర్నపు, ప్రశాంతి హారతి, చంద్రహాస్ మద్దుకూరి, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రాంకీ చేబ్రోలు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, ఇక్బాల్, శ్రీనివాస్, డా. ఇస్మాయిల్ పెనుగొండ, దయాకర్ మాడ, డా. జగదీశ్వరన్ పూదూర్, చంద్రశేఖర్ లంక, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, మడిశెట్టి గోపాల్, సతీష్ బండారు తదితరులు ఈ ముఖా ముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల , కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు , ఇంకా కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ గ్రూప్ బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ , వజ్ర బిల్డింగ్ వాల్యూస్ ఎవోల్వ్ కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధానం
ఆగస్టు 23 శనివారం నాడు సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారిచే చేయబడిన ఈ అవధాన కార్యక్రమానికి సాహిత్యరత్న శ్రీ తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకులుగా నిర్వహించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్యప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు శ్రీమతి సంధ్యారెడ్డిగారు అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు. తదుపరి 11 వత్సరాల చిరంజీవి కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసుల రంజింప చేసినది. 30 ఆగస్టు శనివారం నాడు మెల్బోర్న్ నగరంలో కూడా శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి చేతనే మరొక అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత సీతంరాజు తెలిపారు. -
నార్త్ కరోలైనాలో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలైనాలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నార్త్ క్వారీ పార్క్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్కు స్థానిక తెలుగు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 24 జట్లు ఐదు డివిజన్లలో పోటీ పడి తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ టోర్నమెంట్ కేవలం ఒక ఆటల పోటీగానే కాకుండా, తెలుగు వారందరిని ఒకచోట చేర్చే ఒక వేదికగా నిలిచింది. క్రీడాకారుల మధ్య కనిపించిన అద్భుతమైన సమన్వయం, తెలుగు వారి ఐక్యతకు ప్రతిబింబింలా నిలిచాయి. అభిమానుల నుంచి లభించిన ఉత్సాహభరితమైన మద్దతు ప్రతి మ్యాచ్లోనూ ఉత్కంఠను పెంచింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నిర్వహించిన ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు దగ్గుబాటి, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ ఉమాశంకర్ నార్నే, నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్ దీపిక సాయపురాజు, వెబ్ అండ్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ మన్నేపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రవి ఖాజా చేసిన కృషి ప్రశంసనీయం. వారి నిబద్ధత, అంకితభావం కారణంగా ఈ టోర్నమెంట్ ఒక చిరస్మరణీయమైన ఈవెంట్గా నిలిచింది. నార్త్ క్వారీ పార్క్లో నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ నార్త్ కరోలైనా టీం సభ్యులను అభినందించారు. ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. • Division 1: Beer Box జట్టు విజేతగా నిలవగా, Chill Out జట్టు ద్వితీయ స్థానంతో పోరాట స్ఫూర్తిని చాటింది.• Division 2: Infinity జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయం సాధించగా, Unicorn Beeta జట్టు రన్నరప్గా నిలిచింది.• Division 3: Strikers తమ పేరుకు తగ్గట్టుగా బలమైన ప్రదర్శనతో విజేతగా నిలవగా, Falcon Wings జట్టు పట్టుదలతో ద్వితీయ స్థానం సాధించింది.• Division 4: Warrior Xtremes మరియు Warrior Ignites జట్ల మధ్య జరిగిన పోరులో, Warrior Xtremes విజయం సాధించింది.• Division 5: Arrow Club జట్టు తమ కచ్చితత్వంతో గెలుపొందగా, Cava జట్టు బలమైన పోరాటాన్ని కనబరచి ద్వితీయ స్థానంలో నిలిచింది. -
న్యూయార్క్ వీధుల్లో ఉప్పొంగిన భారతీయత
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఎఫ్.ఐ.ఏ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నేనుసైతం అంటూ పాల్గొని మాతృభూమి పట్ల మమకారాన్ని చాటింది. నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక కూడా పాల్గొని ఈ పరేడ్కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ నరేష్ కొమ్మనబోయిన, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ నాయకులు నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, కో- కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, న్యూ జెర్సీ చాప్టర్ అడ్వైజర్ వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల, శంకర్ జెర్రిపోతుల, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్లేటి, గీత, కృష్ణ నెక్కంటి, రాకేష్ వేలూరు,సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, సురేష్ బొందుగుల, DJ శేఖర్ తదితరులు ఈ పరేడ్లో పాల్గొన్నారు. నాట్స్ సభ్యులు, నాట్స్ కుటుంబ సభ్యుల చిన్నారులు ఈ పరేడ్లో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తారిక, తన్వి లు చేసిన టాలీవుడ్ డాన్స్, సింధూర చేసిన క్లాసికల్ నృత్యం విశేషం గా ఆకర్షించాయి. రంగ మేడిశెట్టి చేసిన కృష్ణ వేషధారణ, భాగవత సందేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది. మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. చక్కటి సమన్వయంతో న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా చాప్టర్స్ నుంచి వచ్చిన నాట్స్ మిత్రులందరికీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందనలు తెలియచేసారు. -
లార్డ్ స్వరాజ్పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్లో అత్యంత సంపన్న ఏషియన్గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
అమెరికా నుంచి వచ్చి.. ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై
కోదాడరూరల్: తన మిత్రుడు మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను సోషల్ మీడియాలో చూసి అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కోదాడకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు ఓ ఎన్నారై. వివరాలు.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ పి. పెంటయ్య, హైదరాబాద్కు చెందిన డాక్టర్ చప్పిడి సుధాకర్ 30 ఏళ్ల కిందట హైదరాబాద్లోని పశువైద్య కళాశాలలో కలిసి చదువుకున్నారు.చదువు పూర్తయిన తర్వాత పెంటయ్య కోదాడ (Kodad) ప్రాంతంలో పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా.. సుధాకర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. డాక్టర్ పెంటయ్య కోదాడ పశువైద్యాశాలలో రైతులకు ఉపయోగపడేలా పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను కాలిఫోర్నియాలో ఉంటున్న అతడి స్నేహితుడు సుధాకర్ సోషల్ మీడియాలో చూశాడు. పెంటయ్య ఫోన్ నంబర్ తీసుకున్న సుధాకర్ త్వరలో కలుస్తానని అడ్రస్, లోకేషన్ షేర్ చేయమని చెప్పాడు.కాలిఫోర్నియా (california) నుంచి హైదరాబాద్కు వచ్చిన సుధాకర్ బుధవారం కోదాడకు వచ్చి తన మిత్రుడు పెంటయ్యను కలిసి సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఆనందంలో మునిపోయారు. అనంతరం పశుఔషధ బ్యాంక్కు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్తో పలు రకాల పండ్ల మొక్కలను నాటించారు.చదవండి: తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి -
హ్యూస్టన్లో విజయవంతమైన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరం, అమెరికాలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సాహితీ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేసి, 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని పంచుకున్నారు. హ్యూస్టన్ లో తెలుగు బడి, మన బడి బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి గురువందన సత్కారాలతో మొదలైన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సుని “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా ప్రారంభించగా భారతదేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా చేసిన ప్రధానోపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.కాలిఫోర్నియాలోని ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చమర్తి గారికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చెయ్యాలి అనే కంటే ఉన్న వ్యవస్థలని పటిష్టం చెయ్యాలి అని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునివ్వగా, దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుంది.ఈ సదస్సులో మొత్తం 17 నూతన తెలుగు గ్రంథాలు ఆవిష్కరింపబడగా అందులో 5 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల నిర్వహణలో జరిగిన ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహణలో జరిగిన కవితా చర్చా వేదిక, బుర్ర సాయి మాధవ్ తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజఝ్ఝల నిర్వహించిన సాహిత్య ప్రహేళికల కార్యక్రమాలు, కథా రచన పోటీ మొదలైన ఆసక్తికరమైన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డాలస్ నివాసి, తానా సాహిత్య వేదిక అధ్యక్షులు, అమెరికాలో ప్రముఖ సాహితీవేత్త అయిన డా. తోటకూర ప్రసాద్ గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది.రెండు రోజులపాటు 50కి పైగా వక్తలు పాల్గొన్న వివిధ ప్రసంగ వేదికలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జీ. వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, శారద ఆకునూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్, దయాకర్ మాడా, సత్యం మందపాటి, మద్దుకూరి విజయ చంద్రహాస్, కె గీత, అఫ్సర్, కల్పనా రెంటాల, వ్యాసకృష్ణ, జెపి శర్మ, కొండపల్లి నిహారిణి, విజయ సారథి జీడిగుంట, అత్తలూరి విజయలక్ష్మి, కేతవరపు రాజ్యశ్రీ తదితరులు ప్రసంగించగా, అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి నారాయణస్వామి, భాస్కర్ పులికల్ ప్రసంగించారు.సదస్సు నిర్వహణకి ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలుతెలిపింది. సదస్సు నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, పంకజ్, రామ్ చెరువు, పుల్లారెడ్డి, కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమా దేశభొట్ల, వాణి దూడల తదితరులు వ్యవహరించారు. రెండు రోజుల కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు అమెరికాలో అరుదైన గౌరవం
డాలస్, టెక్సస్: తెలుగు, హిందీ భాషల్లో పీహెచ్డిలు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, రెండుమార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది.టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో నెలకొనిఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లనుండి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు పొందడం తెలుగువారం దరికి గర్వకారణమని పలువురు ప్రవాస భారతీయులు కొనియాడారు. గార్లాండ్ నగర మేయర్ డిలన్ హెడ్రిక్ తో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డా. యార్లగడ్డకు అధికారిక గుర్తింపు పత్రాన్ని మేయర్ స్వయంగా అందచేసి అభినందిం చారు.సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల భారతదేశ వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినదుకుగాను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా టెక్సాస్ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి. మంగళవారం సాయంత్రం ఫ్రిస్కోలో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వీటిని ఆయా నగరాల అధికార ప్రతినిధులు ఆచార్య యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు డా. యార్లగడ్డ ను ఘనంగా సత్కరించారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్కు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పోనంగి, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, ఉదయగిరి రాజేశ్వరి, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, మాధవి లోకిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. తుమ్మల చైతన్య, చినసత్యం వీర్నపు, కాకర్ల విజయమోహన్, అత్తలూరి విజయలక్ష్మి, ఎ. ల్ శివకుమారి, జ్యోతి వనం, మడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోరిడాలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆత్మీయ సమావేశం
అమెరికాలోని ఫ్లోరిడాలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ వాసుదేవ రెడ్డి.. కాటసాని రాంభూపాల్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టులు వంటి వివిధ రంగాలలో చేసిన అభివృద్ధి కార్యకలాపాలను డాక్టర్ వాసుదేవ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక ఎన్నారై నాయకులకు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని రాంభూపాల్రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా మోహన్ రెడ్డి , డాక్టర్ వాసుదేవ రెడ్డి, సాయి ప్రభాకర్ , డాక్టర్ నరేందర్ రెడ్డి , రఘు , కేశవ్ , జనార్ధన్ , సంజీవ , సురేందర్, వీరారెడ్డి , వంశీ , రమేష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు -
లగ్జరీ కారులో పేరెంట్స్ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
ఎవరీ కృషాంగి మేష్రామ్? అతి పిన్నవయస్కురాలైన సొలిసిటర్గా..
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది. అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె. ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..పశ్చిమ బెంగాల్లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె. 2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్లైన్లో గ్లోబల్ ప్రోగ్రామ్లు కూడా చేసింది. పైగా సింగపూర్లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్టెక్, బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ. (చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?) -
బెర్లిన్లోని చారిత్రాత్మక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్
ఇండియన్ నేషనల్ డేస్ కల్చరల్ కమిటీ (INDCC), బెర్లిన్లోని వివిధ భారతీయ సంఘాల సహకారంతో, ఆగస్టు 16, 2025న చారిత్రాత్మక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్ (ఇండియన్ నేషనల్ డే పరేడ్)ను విజయవంతంగా నిర్వహించింది. ఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని INDCC అధ్యక్షుడు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.భారతదేశం - జర్మనీ మధ్య సామరస్యం, స్నేహం మరియు సాంస్కృతిక మార్పిడికి ప్రతీకగా బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద కవాతు ప్రారంభమై శాంతి స్థూపం వరకు కొనసాగింది.జర్మనీకి భారత రాయబారి శ్ అజిత్ వినాయక్ గుప్తే , ప్రీతి గుప్తే ఈ వేడుకల్లో పాల్గొని భారతీయ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం భారతీయ సంఘాలు, సాంస్కృతిక బృందాలు, కళాకారులు మరియు సమాజ సభ్యుల విస్తృత శ్రేణిని ఒకచోట చేర్చింది. కుటుంబాలు, పిల్లలు మరియు స్వచ్ఛంద సేవకులు సహా 5,000 మందికి పైగా పాల్గొన్నవారు రంగురంగుల భారత్ పరేడ్లో పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, ధోల్లు, దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశపు శక్తివంతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించాయి, బెర్లిన్ హృదయాన్ని "భిన్నత్వంలో ఏకత్వం" అనే స్ఫూర్తితో నింపాయి.తెలంగాణ/తెలుగు సమాజం బతుకమ్మ - తెలంగాణ పూల పండుగ - మరియు అందమైన కూచిపూడి శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడం ద్వారా ప్రత్యేక సహకారాన్ని అందించింది, ఈ రెండూ ప్రేక్షకులను ఆకర్షించాయి మరియు వేడుకలకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక రుచిని జోడించాయి. ఈ వేడుకను గొప్పగా విజయవంతం చేయడంలో అవిశ్రాంతంగా సహకరించిన అన్ని భారతీయ సంఘాలు, స్వచ్ఛంద సేవకులు, స్పాన్సర్లు మరియు శ్రేయోభిలాషులకు INDCC హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది.బెర్లిన్లో జరిగిన భారత్ పరేడ్ ఇండో-జర్మన్ సంబంధాలను బలోపేతం చేసిన మరియు జర్మనీలోని భారతీయ ప్రవాసుల ఐక్యత మరియు గర్వాన్ని హైలైట్ చేసిన చారిత్రాత్మక క్షణంగా గుర్తుండిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, TAG ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయినెపెల్లి, శ్రీమతి అలేఖ్య భోగా (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి), మరియు శ్రీ శరత్ కమిడి (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ సాంస్కృతిక కార్యదర్శి) ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. -
డాలస్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ, నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు. డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.(చదవండి: బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు) -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్లో ఉంటూ దిర్హామ్లలో సంపాదన కలిగిన నేను భారత్లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
ఎడారి దేశంలో బిక్కుబిక్కుమంటూ..
వెల్గటూర్: బతుకుదెరువు కోసం ఎడారి దేశం వెళ్లిన తొమ్మిది మంది తెలుగువారు అక్కడ ఓ ముఠా చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణవారు కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తమను కాపాడి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపించాడు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్ఎల్సీ కంపెనీలో ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరాడు. అతడితోపాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పనికి కుదిరారు. అక్కడ వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పగా.. అతడి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది అతడితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఆ ముఠా సభ్యులు వీరి నుంచి ఐడీ కార్డులు, సిమ్కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 5న విడిచిపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిరణ్తోపాటు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని విడిచి పెట్టారు. మిగిలిన ఏడుగురిని పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారంటూ కిరణ్ సెల్ఫీ వీడియో తీసి అతని స్నేహితులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డికి పంపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ తెలిపాడు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన అశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. పొట్ట కూటికి ఆశపడి పొరుగు దేశం వెళ్లి మోసపోయిన తమవారిని ప్రభుత్వం ఆదుకొని ఇండియాకు తీసుకురావాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష..
గ్రామీణ భారత్లో అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జార్జియాలోని కమ్మింగ్ వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలో MESU (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) “అడాప్ట్-ఎ-విలేజ్” నేత్ర శస్త్ర చికిత్స శిబిరాలకు మద్దతుగా $1.25 మిలియన్ (రూ.10.4 కోట్లు) నిధులు సమీకరించారు.అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమల్ల మాట్లాడుతూ.. సేవ కోసం అట్లాంటా ప్రజా హృదయం స్పందించిందన్నారు. ఈ సాయంత్రం జీవితాలకు వెలుగునిచ్చే లక్ష్యం కోసం అంతా ఐక్యంగా కృషి చేశామన్నారు. కోశాధికారి మూర్తి రేకపల్లి మాట్లాడుతూ.. ప్రజలు మంచి ఉద్దేశ్యంతో కలిసి వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుందన్నారు. ఈ సాయంత్రం దాతృత్వం, సంస్కృతి చేయి చేయి కలిపి నడవగలవని రుజువు చేసిందన్నారు.శాంతి మెడిచెర్ల, సందీప్ కౌతా, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, స్రవంతి కెటి, శిల్పా ఉప్పులూరి, శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల వంటి ప్రతిభావంతులైన గాయకులకు ఇదొక గొప్ప వేదికయ్యింది. నీలిమ గడ్డమణుగు సమన్వయం చేసి, వారి కళాత్మకత, సాయంత్రారానికి లోతైన, చిరస్మరణీయమైన కోణాన్ని జోడించి, హాజరైన వారందరి నుండి హృదయపూర్వక ప్రశంసలను పొందారు.ప్రారంభోపన్యాసం తర్వాత, వేదిక అద్భుతమైన శాస్త్రీయ భారతీయ నృత్య ప్రదర్శనలతో సజీవంగా మారింది. అట్లాంటా ప్రాంతం అంతటా నృత్య అకాడమీలు - లాస్య స్కూల్ ఆఫ్ డ్యాన్స్ కు చెందిన గురు.శ్రీదేవి రంజిత్-మోహినీయాట్టం, నాట్యవేద నృత్య అకాడమీకి చెందిన గురు.సోబియా సుదీప్ కిషన్-భరతనాట్యం, కళాక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (KIPA) నుండి గురు. మిటల్ పటేల్-కథక్, మరియు నటరాజ నాట్యాంజలికి చెందిన గురు. నీలిమా గడ్డమణుగు-కూచిపూడి సంప్రదాయం నృత్య ప్రదర్శనలో పాతుకుపోయిన నేపథ్య భాగాలను ప్రదర్శించారు. అధ్యక్షులు బాలరెడ్డి, మాధవి ఇందుర్తి దంపతులు శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, సలహాదారులు SV ఆచార్య, శ్రీమతి నిర్మలా ఆచార్య, శ్రీమతి లీలా కృష్ణమూర్తి, శ్రీమతి నాట్ కృష్ణమూర్తి, డాక్టర్ కిషోర్ చివుకుల, మరియు శంకర నేత్రాలయ అట్లాంటాలోని ప్రధాన బృందం - మూర్తి రేకపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్ ఐలా, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లులను సత్కరించి విందును నిర్వహించారు. -
నేషనల్ ఇండియా హబ్ గాలా డిన్నర్లో యువీ సందడి
అమెరికాలోని ఇల్లినాయిస్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చికాగోలోని నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇక ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని నేషనల్ ఇండియా హబ్ నిర్వహించిన గాలా డిన్నర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఈవెంట్ జరిగింది. గాలా డిన్నర్ లో భాగంగా యువరాజ్ సింగ్ తో పలు సంఘాల నాయకులు, ప్రవాసులు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇండియా హబ్ ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖ డాకర్ల సహాకారంతో ఉచిత వైద్య సేవలు అందిచనున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ YouWeCan కోసం భవిష్యత్తులో నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయటానికి ఆయన ఆసక్తి చూపించారు. నేషనల్ ఇండియా హబ్ వార్షిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఛారిటీ గాలా డిన్నర్ ఈవెంట్ కి విశేష స్పందన రావటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు K.K. రెడ్డి, పలువురు ప్రముఖులు, తదితరులు సంస్థ గురించి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. యువరాజ్ సింగ్ తో గాలా డిన్నర్ ఏర్పాటు చేయటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు. -
సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు. -
తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్కి మేరీల్యాండ్తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. -
ఆటిజం బాధితులకు అండగా నాట్స్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో స్పర్శ్ స్పెషల్ స్కూల్ ఫర్ ఆటిజం చిల్డ్రన్కు నాట్స్ మద్దతు ఇస్తుంది. తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారెలు ఈ ఆటిజం పాఠశాలను సందర్శించారు. ఆటిజం పిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటిజం పిల్లల మానసిక వికాసానికి నాట్స్ చేయూత అందిస్తుందని నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ తెలిపారు. గతంలో ఆటిజం ఆన్ వీల్స్ అనే వాహనాన్ని నాట్స్ ఈ పాఠశాలకు అందించింది. -
బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు. -
TDF: అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.కలర్ఫుల్గా మూడు రోజుల వేడుకలుటీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.పురస్కారాల ప్రదానంఈ సందర్భంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు, టీడీఎఫ్ లైఫ్టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.సాంస్కృతిక వైభవంతెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థిని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: విదేశీ ప్రయాణాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు!రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు. -
సింగపూర్లో కురిసిన రామాయణ ప్రవచనామృతం
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" (sri smakrithika kalasarathi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో, పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ఆధ్వర్యంలో శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజుల ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.సింగపూర్ దేశపు నాలుగు మూలల నివసించే తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా 5 వేర్వేరు వేదికలలో 5 భాగాలుగా, 15 గంటలపాటు మొత్తం రామాయణంలోని 7 కాండలు , రామాయణ ప్రాశస్త్యంపై సోదాహరణంగా డా. మేడసాని మోహన్ ప్రవచించారు.5 వేదికలలోనూ సుమారు 250 మంది తెలుగువారు పాల్గొనగా 'సింగపూర్ తెలుగు టీవీ'వారి సాంకేతిక నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఆన్లైన్ ద్వారా దాదాపుగా 2000 మంది పైగా వీక్షించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటినుండి తెలుగు పద్యములు కూడా ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమైన ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను కూడా రామాయణ గాథతో మేళవించి, పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా మేడసానివారు తమ ప్రవచనం అందించారు.ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి రాజ్యలక్ష్మి దంపతులు డాక్టర్ మేడసాని మోహన్ గారికి ఆతిథ్యమీయగా, మొదటి వేదిక పంగోల్ రివర్వెల్ కాండోలోను, రెండవ వేదిక బర్గండీ క్రెసెంట్ లోను, మూడవ వేదిక మెల్విల్ కాండోలోను, నాలుగవ వేదిక క్యాన్బర్రా కాండోలోను, 5వ వేదిక జూబిలీ రోడ్ లోను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వేదికలతో పాటు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా జరిగింది. 15వ తేదీ రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం సుసంపన్నం అవుతుంది."సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి ఈ సభలకు వ్యాఖ్యానం చేయగా, ప్రొ. బి వి ఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజశ్వని దంపతులు ఈ 5 వేదికల ఏర్పాటలో సహకరించారని, మరి ఎంతో మంది దాతలు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిని వారందరికీ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అయిదువేదికలలో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. -
వైఎస్సార్సీపీ డల్లాస్ మీట్ అండ్ గ్రీట్ విజయవంతం
అమెరికాలోని వైఎస్సార్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. రాంభూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుత్తూ.. అరాచకానికి కూడా తెరలేపిందన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్ర శేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి వీర శివా రెడ్డి, కృష్ణ కోడూరు, మణి శివ అన్నపు రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్బుక్లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది. -
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన) -
వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?


