Economists
-
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
‘అమెరికా విముక్తి దినం’గా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రోజు రానేవచ్చింది. ఇన్నాళ్లూ ‘అన్యాయమైన సుంకాల’తో ‘అధ్వాన్నమైపోయిన’ అమెరికాకు ఏప్రిల్ 2 (బుధవారం) నుంచి విముక్తి లభించి, లక్షల కోట్ల డాలర్లు ఆర్జించి పెట్టగల ప్రతి సుంకాల మోత మోగబోతున్నదని దేశ ప్రజలను ఆయన ఊరిస్తున్నారు. విలక్షణమైన ప్రకటనలతో ఏకకాలంలో తన భక్త గణాన్నీ, ప్రత్యర్థులనూ రంజింపజేయటం ట్రంప్ ప్రత్యేకత. అయితే ఆయన విధించబోయే సుంకాల రంగు, రుచి, వాసన ఆ రెండు వర్గాలకూ అంతుబట్టడం మాట అటుంచి... కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తల అవగాహనకే అందటం లేదు. ట్రంప్ చర్య వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుందని మాత్రం ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో వంటి 18, 19 శతాబ్దాల నాటి స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్తల ఆలోచనల్నించి బయటికొస్తేనే ట్రంప్ అర్థమవుతారని ఆర్థిక నిపుణులు కొందరి వాదన. ట్రంప్ ఒక మాట మీదవుంటే కాస్తయినా అర్థమయ్యే వారు. కానీ ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మిత్ర దేశాలకైనా, వేరే దేశాలకైనా ఒకటే నిబంధన అంటారు. మరోసారి తద్విరుద్ధంగా మిత్ర దేశాలతో చర్చించి పరిష్కరించుకుంటామంటారు. ఆ మాటెలావున్నా తొలిసారి అధ్యక్షుడైనప్పుడు 2018–19 మధ్య ట్రంప్ చైనాపై విధించిన ప్రతి సుంకాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పెద్దగా లేదుగనుక, ఇప్పుడూ ఉండకపోవచ్చని కొందరి మాట.ట్రంప్ ప్రకటించబోయే ప్రతి సుంకాల తీరుతెన్నులెలావుంటాయో ఆయన సన్నిహిత సలహా దారులకు సైతం ఇంతవరకూ తెలియదు. ప్రతి సుంకాలు మధ్యస్థంగా, పరస్పరం చర్చించి పరిష్క రించుకునే విధంగా ఉంటాయని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ గత నెలలో తెలిపారు. కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో విడివిడిగా చర్చించి ఒప్పందానికొస్తామని అన్నారు. మన వంతుగా ఎలాంటి చర్యలుంటాయో ప్రభుత్వం ఇంతవరకూ వెల్లడించలేదు. కానీ భారత్ తరఫున ట్రంప్ ఇప్పటికే ఒకటి రెండు ప్రకటనలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పక్షం రోజులనాడు చెబితే దానిపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇంతవరకూ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అమెరికాకు చెప్పింది కూడా లేదని ప్రభుత్వం వివరించింది. మంగళవారం మరోసారి ఆయన అదే తరహాలో మాట్లాడారు. భారత్ గణనీయంగా సుంకాలు తగ్గించబోతున్నట్టు ‘కొద్దిసేపటి క్రితమే’ తనకు సమాచారం అందిందన్నారు. దీనిపై మన ప్రభుత్వం స్పందించలేదు. కానీ యూరప్ నుంచి అమెరికాకు పెను సవాల్ ఎదురుకాబోతున్నదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేసిన ప్రకటన సూచిస్తోంది. ‘అమెరికా ప్రతి సుంకాలు ఏ స్థాయిలోవున్నాయో తెలిసిన వెంటనే ఏం చేయాలన్న అంశంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంద’ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలియజేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 2,800 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించినట్టు గత నెలలో ట్రంప్ ప్రకటించిన వెంటనే, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లు, బోట్లు, మద్యం వగైరాలపై ఈయూ సైతం భారీ సుంకాలు విధించింది. అయితే అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే కార్లపై 2.5 శాతం మేర సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా– ఈయూల మధ్య వార్షిక వాణిజ్యం లక్షన్నర కోట్ల డాలర్లు. యూరప్తో సాగుతున్న వాణిజ్యంపై అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు ఆధారపడివున్నాయి.ఈ ‘విముక్తి’ సుంకాల రగడ పర్యవసానంగా మనతోపాటు అమెరికా, యూరప్, లండన్, జపాన్, హాంకాంగ్ తదితర ప్రపంచమార్కెట్లన్నీ పల్టీలు కొడుతున్నాయి. అన్నిచోట్లా అమెరికా షేర్లు పతనమవుతున్నాయి. చాలామంది ఈ సుంకాలెలా ఉండబోతున్నాయో తెలిసేవరకూ వేచి చూసే ధోరణిలో ఉండబట్టి కొంత నిలకడ కనబడుతోంది. కానీ ట్రంప్ అన్నంతపనీ చేస్తే ప్రపంచ మార్కె ట్లకు బుధవారం శాపగ్రస్త దినం కావడం ఖాయం. సుంకాలు పెంచటంవల్ల అమెరికాకు దిగుమ తయ్యే సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఏటా అమెరికా 3 లక్షల కోట్ల డాలర్ల సరుకును దిగు మతి చేసుకుంటుంది. సరుకుతో నిమిత్తం లేకుండా అన్నిటిపైనా 20 శాతం అదనంగా సుంకం విధి స్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ లెక్కన ఏటా 60,000 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుంది. కానీ ఈ భారాన్ని చివరకు దేశ పౌరులే మోయాల్సివుంటుందని, అది భారమవుతుందని ట్రంప్ గ్రహించటం లేదు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి, బ్యాంకుఖాతాలు ఖాళీ అవుతూ, ఉద్యోగాలు కోల్పోయే స్థితి వుండగా, ప్రతి సుంకాలతో ఇది మరింత విషమిస్తుంది. మాంద్యం ముంచుకొస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరుస్తానని, ఉద్యోగాల విషయంలో శ్వేతజాతి అమెరికన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతానని ట్రంప్ ఇచ్చిన హామీని నమ్మి జనం ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అందుకు విరుద్ధంగా అమలులో ఉన్న అంతర్జాతీయ అమరి కను ధ్వంసం చేసే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు. ఆయన చర్యలు దేశాన్ని 1930నాటి ఆర్థిక మాంద్యం రోజులకు తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురి మాట. 1930 జూలైలో నాటి అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ స్మూట్–హాలీ ట్యారిఫ్ చట్టాన్ని తీసుకురావటంతో అమెరికా దిగుమతులు 67 శాతం పడిపోయి ఆ దేశ ఆర్థికవ్యవస్థ కళ్లు తేలేసింది. ఇప్పుడు ట్రంప్ అలాంటి దుస్సాహసానికి దిగబోతున్నారు. పర్యవసానాలెలావుంటాయో చూడటం తప్ప ప్రపంచంలో దీన్ని నివారించగల వారెవరూ లేరు. -
వికసిత్ భారత్ ఎలా సాధ్యం అవుతుందంటే..
న్యూఢిల్లీ: భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చే దిశలో ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆర్థికవేత్తలతో సమావేశం అయ్యారు. 2025–26 బడ్జెట్, ఆర్థిక పురోగతిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2025–26 కేంద్ర బడ్జెట్ను లోక్సభలో సమరి్పస్తుండడం ఈ సమావేశం నేపథ్యం. కీలక అంశాలపై సూచనలు.. ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను సమీకరించడం వంటి కొన్ని అంశాలు ప్రధాని–ఆర్థికవేత్తల పరస్పర చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశి్చతులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, యువతలో ఉపాధిని పెంపొందించే వ్యూహాలు వంటి పలు అంశాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఆర్థికవేత్తలు సూచనలు, సలహాలు అందించారు. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఎగుమతుల పెంపు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై కూడా ఆర్థికవేత్తలు కీలక సూచనలు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థికమంత్రి సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్సహా సుర్జిత్ భల్లా, డీకే జోషివంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
Narendra Modi: ఆహార మిగులు దేశంగా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని, ప్రపంచ ఆహార, పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయమే కేంద్ర బిందువని, ఆహార భద్రతకు చిన్న రైతులే అతి పెద్ద బలమని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. 65 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత్ నేడు ఆహార మిగులు దేశంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి భారత్ను ’విశ్వ బంధు’గా అభివరి్ణంచారు.ప్రకృతి సాగుతో సానుకూల ఫలితాలు ప్రకృతి వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించడంతో దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మోదీ తెలిపారు. సుస్థిరమైన, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల సాగు విధానాలపై ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. పంటల పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గడిచిన పదేళ్లలో భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే దాదాపు 1,900 కొత్త వంగడాలను రైతులకు అందజేసినట్లు చెప్పారు. సాంప్రదాయ రకాల కంటే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే వరి రకాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భారత తృణధాన్యాల బుట్టను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానం వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానిస్తున్నామని మోదీ వెల్లడించారు. సోలార్ ఫార్మింగ్ మొదలుకుని ఈ–నామ్ తదితరాలను ఉదాహరించారు. సంప్రదాయ రైతుల నుండి అగ్రికల్చర్ స్టార్టప్ల వరకు, సహజ వ్యవసాయం నుండి ఫార్మ్ వ్యవసాయం వరకు వివిధ వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధునీకరణ గురించి వివరించారు. పదేళ్లలో 90 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఒక్క క్లిక్తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నామన్నారు. పంటల సర్వే కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆధునిక చర్యలు భారతదేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తాయన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. -
ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి: ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని.. మన దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహౌన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని మిల్లెట్లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.2024-25 కేంద్ర బడ్జెట్లో సుస్థిర వ్యవసాయంపై పెద్దఎత్తున దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వం కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను అందించిందని చెప్పారు. భారతదేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని ప్రధాని వివరించారు. -
రేపు ఆర్థికవేత్తలతో మోదీ సమావేశం.. ఎందుకంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ను జూలై 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో గురువారం సమావేశమవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా హాజరుకానున్నారు. కాగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ3.0 మొదటి బడ్జెట్. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ను రూపొందించనున్నట్లు సమాచారం.ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గత నెలలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, సంస్కరణల వేగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలతో ముందుకు వస్తుందని సూచించారు. ప్రభుత్వం విధానాలు భవిష్యత్తు దృష్టికి బడ్జెట్ సమర్థవంతమైన పత్రంగా ఉంటుందని అన్నారు.నిర్మల సీతారామన్ ఇప్పటికే రాబోయే బడ్జెట్పై ఆర్థికవేత్తలు, భారతీయ పరిశ్రమలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపారు. ఇందులో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ.. వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలతో ముందుకు రావడానికి సామాన్యులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. -
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు. -
అసమానతల భారతం
ప్రపంచం ముందుకు పోతోంది... దేశం శరవేగంతో సాగిపోతోంది... అని పాలకులు భుజాలు ఎగరేస్తున్న వేళ కళ్ళు తిరిగే గణాంకాల లెక్క ఇది. అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కొందరు అంతెత్తున ఉంటే, అనేకులు అధఃపాతాళంలోనే ఉన్నారని తేలింది. భారతదేశంలో ఆదాయం, సంపదల్లో అస మానతలు గడచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తారస్థాయికి చేరాయని ‘వరల్డ్ ఇనీక్వా లిటీ ల్యాబ్’ అధ్యయన పత్రం వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టీ సహా నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రూపొందించిన ఈ పత్రం ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. ఆదాయ అసమానతలో మన దేశం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలను సైతం వెనక్కి నెట్టేసింది. బ్రిటీషు పాలనలో కన్నా ఇప్పుడే భారత్లో అసమానతలు ఎక్కువయ్యా యట. ఇది ఆందోళన రేపుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ‘భారతదేశ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల రాజ్య ఆవిర్భావం’ అనే ఈ పత్రం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2000ల నుంచి దేశంలో అసమానతలు తారాపథానికి దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశ సంపదలో 40 శాతం పైగా కేవలం ఆర్థిక బలసంపన్నులైన అగ్రశ్రేణి 1 శాతం మంది దగ్గరే పోగుబడింది. దేశ ఆదాయం లెక్కన చూస్తే 22.6 శాతం ఈ కొందరి వద్దే ఉంది. ఇక, కింది 50 శాతం జనాభా జాతీయ ఆదాయం మాత్రం 15 శాతమే. వెరసి, గడచిన ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్టు అత్యధిక స్థాయిలో ఒకేచోట సంపద పోగుబడుతోంది. మరో ముఖ్య విషయమేమంటే, భారత్లో ఆర్థిక సమాచార నాణ్యత అంతంతే గనక వాస్తవిక అసమానతా స్థాయులతో పోలిస్తే పత్రంలో పేర్కొన్న అంచనాలు ఇంకా తక్కువేనట. పైనున్న వర్గాలు పైపైకి పోతుంటే, కింది వర్గాలు ఇంకా కిందకు పోయేలా ఆర్థిక అసమానతలు పెరగడం ఆందోళన రేపుతోంది. సమాజంలో అశాంతి, అస్థిరత పెచ్చరిల్లే ముప్పుంది. ఇలాంటి అంతర్జాతీయ నివేదికలే కాదు దేశంలోని స్థానిక నివేదికలు సైతం అసమానతల్ని పట్టిచూపుతున్నాయి. కర్ణాటకలోని ప్రగతివాద బృందాల సమ్మేళనమైన ‘బహుత్వ కర్ణాటక’ సైతం దేశంలో, ముఖ్యంగా కన్నడ సీమలో పెరుగుతున్న ఆదాయ అసమానతల్నీ, ఉపాధి రంగంలోని ఆందోళనకరమైన ధోరణుల్నీ ఈ మధ్యే తన నివేదికలో వివరించింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి, ఆదాయ సమానత అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘గ్యారెంటీ’ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని వెల్లడించింది. నిజానికి, కేంద్రంలోని ప్రస్తుత పాలకులు పదేళ్ళ క్రితం అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల అజెండాతో గద్దెనెక్కారు. తమ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వంతున వృద్ధి చెందిందనీ, ముఖ్యంగా 2023లో ఆఖరి మూడు నెలల్లో అత్యంత వేగంగా ఈ పురోగతి సాగిందనీ వారు జబ్బలు చరుస్తున్నారు. అయితే, వారు అధికారంలో ఉన్న ఈ రెండుసార్లలోనే బీద, గొప్ప తేడా బాగా పెరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. పైపెచ్చు, ఢిల్లీ సర్కార్ శతకోటీశ్వరులకు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు సరేసరి. గమనిస్తే 1991నాటి ఆర్థిక సరళీకరణ ఆసరాగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 1991లో వారి సంఖ్య కేవలం 1 కాగా, 2022 నాటికి 162కు పెరిగిందని ఫోర్బ్స్ పత్రిక కథనం. పికెట్టీ తాజా పత్రం ఫోర్బ్స్తో పాటు పలు పత్రికలనూ, ఇతర అధ్యయనాలనూ ఉటంకించింది. అవన్నీ దేశంలో ధనికులకూ, గ్రామీణ నిరుపేదలకూ మధ్య అంతరం పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటనే మాట సత్యదూరమనే వారూ లేకపోలేదు. పికెట్టీ అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, అసమానతల్ని పెంచి చూపేలా ఫోర్బ్స్ వగైరా నుంచి సంపన్నుల జాబితాలను ఎంచుకుంటున్నారనీ దశాబ్ద కాలంగా విమర్శకుల అభ్యంతరం. అయితే ఎంత ఎక్కువనే మాట పక్కనపెడితే... దేశంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయనేది ఎవరూ కాదనలేనిది. వాటిని తగ్గించడానికి ప్రయత్నించడమే కర్తవ్యం. దారిద్య్రాన్ని తగ్గించడానికి వీలుగా వృద్ధిపై పెట్టడం వల్ల ఇటు ఆదాయ, సంపదల్లో అసమాన తలు పెరిగినప్పటికీ అదే పంథాను అనుసరించాలా అన్నది మరో ప్రాథమిక ప్రశ్న. 1960 – 80ల మధ్య పై శ్రేణిలోని 10 శాతంతో పోలిస్తే, దిగువనున్న 90 శాతం మంది గణనీయంగా వృద్ధి సాధించారు. ఆర్థికసరళీకరణ అనంతరం మాత్రం మిగతా జనాభా కన్నా అగ్రశ్రేణి వర్గమే పైకెదిగింది. ఇక, 2014–2022 నడుమ దిగువ 50 శాతంతో పోలిస్తే, మధ్య 40 శాతం జనాభా వృద్ధి నిదానించింది. అగ్రస్థాయి 10 శాతం వారి పురోగతేమో ఆపలేని వేగం అందుకుంది. ధనిక, పేద తేడాకు ఇది ప్రధాన కారణం. మొత్తానికి గత దశాబ్దిన్నరలోనే అసమానతలు హెచ్చాయనేది నిర్వివాదాంశం. శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని గుర్తిస్తే... ఆర్థిక వ్యత్యాసాల్ని చక్కదిద్దడానికి తాజా పత్ర రచయితలు చేసిన కొన్ని విధాన సూచనల్ని కొట్టిపారేయలేం. సంపద పంపిణీ దృష్ట్యా చూస్తే, పేదలతో పోలిస్తే ధనికులు తక్కువ పన్నులు కట్టే ఇప్పటి విధానంలో మార్పు తేవాలి. ఆదాయం, సంపదలు రెంటినీ పరిగణించేలా పన్ను షెడ్యూల్ను పునర్వ్యవస్థీకరించి, భారత్లోని బిలియనీర్ల పైన సూపర్ ట్యాక్స్ విధించాలని వారు సూచిస్తున్నారు. అలాగే, బీదాగొప్ప తేడాల్ని తగ్గించేందుకు వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించాలి. స్వల్పకాలిక వరాల కన్నా సుస్థిర, దీర్ఘకాల దారిద్య్ర నిర్మూలన పథకరచన సాగించాలి. సంక్లిష్టమైన ఈ వృద్ధి, దారిద్య్రం, ఆర్థిక అసమానత లాంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య భారతం ధనికస్వామ్యంగా మారితేనే కష్టం, నష్టం. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి 4.6 శాతం: ఎస్బీఐ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్ ఘోష్ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) అంచనాలకన్నా ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ అడ్వైజర్ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం. కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది. 2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్ కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. -
టైర్–2, 3 నగరాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్ 1, ఏవి టైర్ 2, టైర్ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్’ విధానం మొదట రియల్ ఎస్టేట్ రంగంలో 2007లో మొదలైంది. పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్ 3 కేటగిరీలో ఉన్నాయి. టైర్ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి కరోనా సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్ 1 సిటీలుకంటే తమ పెట్టుబడులకు టైర్ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్–లైఫ్ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్యమవడం, ఖర్చులు కూడా బడ్జెట్లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి. దాంతో టైర్ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్ 2 సిటీలైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 నగరాలివీ.. అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్ 1 (జెడ్ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, పూణే టైర్ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరిశ్రమలు, టాప్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు. టైర్ 2 సిటీలు భారతదేశంలో 104 నగరాలు టైర్ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు ఈ నగరాలు అనువైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్ 2 సిటీలుగా ఉన్నాయి. టైర్ 3 నగరాలు అంటే.. టైర్ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
నిర్మలమ్మకు 2023–24 వార్షిక బడ్జెట్ వినతులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్ఐ దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది. ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్ఏఐఎఫ్ఏ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్ఏఐఎఫ్ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. పీఎల్ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా రాబోయే బడ్జెట్లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం. లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్మ్యాప్ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్ఓ యోగేష్ పటేల్ కోరారు. ఆర్అండ్డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్లైఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు. ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు మానవ వనరుల (హెచ్ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్గా మిగిలిపోయిందని రాండ్స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసికట్టుగా పనిచేయాలని, అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ పరిధి దాటి విశాల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్కు ముందు ప్రముఖ ఆర్థికవేత్తలతో శుక్రవారం ప్రధాని సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. డిజిటల్ కార్యకలాపాల విషయంలో, ఫిన్టెక్ విస్తరణలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించినట్టు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది. సమ్మిళిత వృద్ధికి ఇది కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ వృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఉత్పాదకతలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని కోరారు. రిస్క్లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా డిజిటైజేషన్, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగాల్లో విస్తతమైన అవకాశాలున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ తన వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో ప్రధానికి సూచించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యలు కొనసాగుతాయంటూ, భారత్ మరింత బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు చర్యలను ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ, ఉన్నతాధికారులతోపాటు.. ఆర్థికవేత్తలు శంకర్ ఆచార్య, అశోక్ గులాటీ, షమిక రవి తదితరులు పాల్గొన్నారు. -
Pre-Budget 2023: శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆర్థివేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్లో జరగనున్న ఈ భేటీలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ ఎకానమీ వృద్ధి రేటు 6.5–7.0 శ్రేణిలో నమోదవుతుందని అంచనా. -
సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్పై ఆర్థిక వేత్తల కీలక లేఖ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకాల ఆవిష్కరణలపై 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దృష్టిసారించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 51 మంది ప్రముఖ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాశారు. సామాజిక భద్రతా పెన్షన్లను పెంచాలని, ప్రసూతి ప్రయో జనాలకు తగిన కేటాయింపులను ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో జీన్ డ్రేజ్ (గౌరవ ప్రొఫెసర్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్), ప్రణబ్ బర్ధన్ (ఎమిరిటస్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ), ఆర్ నాగరాజ్ (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐజీఐడీఆర్, ముంబై), రీతికా ఖేరా (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐఐటీ, ఢిల్లీ), సుఖదేయో థోరట్ (ప్రొ ఫెసర్ ఎమెరిటస్, జేఎన్యూ)తదితరులు ఉన్నారు. జైట్లీకీ రాశాం... ‘‘ఇది 20 డిసెంబర్ 2017 అలాగే 21 డిసెంబర్ 2018 (గత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి) నాటి మా లేఖలకు కొనసాగింపు. ఇక్కడ మేము తదుపరి కేంద్ర బడ్జెట్ కోసం రెండు ప్రాధాన్యతలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుదల అలాగే ప్రసూతి ప్రయోజనాల కోసం తగిన కేటాయింపు’’ అని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘రెండు ప్రతిపాదనలు గత సందర్భాల్లో విస్మరించినందున, మేము మళ్లీ అదే సిఫార్సులతో తదుపరి బడ్జెట్కు చాలా ముందుగానే ఈ లేఖను మీకు రాస్తున్నాము’’ అని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఎన్ఓఏపీఎస్) కింద వృద్ధాప్య పింఛన్లకు (దాదాపు 2.1 కోట్ల మంది పెన్షనర్లకు) కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం 2006 నుండి నెలకు కేవలం రూ.200గానే ఉందని లేఖలో వారు పేర్కొన్నారు. దీనిని తక్షణం రూ.500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇదే జరిగితే ఈ పథకం కింద అదనంగా రూ.7,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ రూ.300 నుంచి రూ.500కు పెంచాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనికి రూ.1,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి వస్తుందని తెలిపారు. మెటర్నటీ ప్రయోజనాల పెంపునకు రూ.8,000 కేటాయింపులు అవసరమన్నారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి విదితమే. -
వచ్చే ఏడాదీ రూపాయిపై ఒత్తిడి
ముంబై: రూపాయి వచ్చే ఏడాది కూడా డాలర్తో ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. డాలర్ మారకంలో 85 శ్రేణిని చేరుకోచ్చని భావిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత చమురు ధరలు పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తదితర అంశాల ప్రభావంతో రూపాయి విలువ అక్టోబర్ 19న జీవిత కాల కనిష్ట స్థాయి 83కు తగ్గిపోవడం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కోలుకుని ప్రస్తుతం 82 స్థాయిలో ట్రేడవుతోంది. ముంబైలో గురు వారం ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. కరెంటు ఖాతా లోటు విస్తరించినందున (జీడీపీలో 4 శాతానికి) ఇక ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఎగుమతులు సైతం గత నెలలో క్షీణించడాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది డాలర్ మారకంలో రూపాయి 82–85 శ్రేణిలో చలించొచ్చని అంచనా వేశారు. రూ పాయి గరిష్టంగా 83, కనిష్టంగా 85కు చేరుకోవచ్చని ఐసీఆర్ఐఈఆర్ సీఈవో దీపక్ మిశ్రా, జేపీ మోర్గాన్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సాజిద్ చినాయ్ పేర్కొన్నారు. రూపాయి 80–82 రేంజ్లో ఉండొచ్చని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశా రు. ఐజీఐడీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరిసేన్ గుప్తా 84–85కు చేరుకోవచ్చన్నారు. -
13 నుంచి 15.7 శాతం వృద్ధికి చాన్స్
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13 శాతం నుంచి 15.7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరున అధికారిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వృద్ధి తీరుపై తమ అంచనాలను వెలువరిస్తున్నారు. మహమ్మారి కరోనా మొదటి వేవ్ కారణంగా 2020 జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో అసలు వృద్ధి లేకపోగా 23.9 శాతం క్షీణించింది. ఇక 2021 జూన్తో ముగిసిన త్రైమాసికంలో భారీగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇదే కాలంలో చోటుచేసుకున్న రెండవ వేవ్లో మొదటి వేవ్కన్నా ప్రాణనష్టం అపారంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి రేటు (20.1 శాతం) నమోదుకు లో బేస్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఆగస్టు 5వ తేదీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 16.2 శాతం వరకూ క్యూ1 వృద్ది రేటు ఉండవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన త్రైమాసికంపై (2022 ఏప్రిల్–జూన్) అంచనాలు, అభిప్రాయాలను పరిశీలిస్తే... 15.7 శాతం దాటినా దాటచ్చు... మొదటి త్రైమాసికంలో జీడీపీ 15.7 శాతం దాటిపోతుందని భావిస్తున్నాం. తుది గణాంకాలు ఇంతకు మించి కూడా నమోదుకావచ్చు. ఇది వాస్తవరూపం దాల్చితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్బీఐ అంచనాలకు (7.2 శాతం) మించి జీడీపీ వృద్ధి రేటు నమోదుకావచ్చు. 41 రంగాలకు సంబంధించి 41 హై ఫ్రీక్వెన్సీ లీడిండ్ ఇండికేటర్స్ ప్రకారం, వృద్ధి విస్తృత ప్రాతిపదిక ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో కరోనా సవాళ్లతో రూ.4.77 లక్షల కోట్ల వరకూ గణనీయంగా పడిపోయిన వినియోగ వ్యయం 2021–22 మొదటి త్రైమాసికంలో 46 శాతం వరకూ రికవరీ అయ్యింది. 2022–23 క్యూ1లో మిగిలిన 54 శాతం రికవరీ అయ్యిందని సూచీలు తెలుపుతున్నాయి. సేవల రంగం రికవరీ ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష వాణిజ్యాన్ని యుద్ధం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే. ఇంధనం, వస్తువుల ధరలు, వినియోగ విశ్వాసం, పాలసీ చర్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్న మాట నిజమే. అయినప్పటికీ ఈ సవాళ్లను తట్టుకోగలిన ఫండమెంటల్స్ పటిష్టతను భారత్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. – సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 13 శాతానికి పరిమితం అవుతుందని భావిస్తున్నాం... అధిక బేస్ ఎఫెక్ట్తో పాటు (2021 ఇదే కాలంలో 20.1 శాతం వృద్ధి) గోధుమల ఉత్పత్తిపై వేసవి ప్రభావం, భౌగోళిక–రాజకీయ సమస్యలు, డిమాండ్–మార్జిన్లపై పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం క్యూ1లో వృద్ధి వేగాన్ని 13 శాతానికి తగ్గిస్తాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ సంబంధించిన ఉత్పత్తి (జీవీఏ) స్థూల విలువ జోడింపు విధానంలో వృద్ధి 12.6 శాతానికి పరిమితం కావచ్చు. జీడీపీలో మెజారిటీ షేర్ ఉన్న సేవల రంగంలో 17 నుంచి 19 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. 9 నుంచి 11 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆరవ నెలలోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవల కమోడిటీ ధరలు కొంత తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత తగ్గవచ్చు. ఈ పరిస్థితిలో రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ ఉండవచ్చు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా (6.2 శాతం) ఇది ఎక్కువే కావడం గమనార్హం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
'ట్రెండ్ను బ్రేక్ చేస్తూ'..ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్లు!
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మరో అరుదైన గుర్తింపును పొందారు. ఐఎంఎఫ్ ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’పై ఆమెకు చోటు లభించింది. ఈ గొప్ప స్థానాన్ని సంపాదించిన మొదటి మహిళ గీతా గోపీనాథ్కాగా, ఈ స్థానానికి చేరిన భారత్ సంతతికి చెందిన రెండవ వ్యక్తి. ఇంతక్రితం రఘురామ్ రాజన్ ఈ గౌరవం లభించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2003 నుంచి 2006 మధ్య ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్గా బాధ్యతలు నిర్వహించారు. గీతా గోపీనాథ్, 2018 అక్టోబర్లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్టుగా నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. గోపీనాథ్ పరిశోధనలు అనేక అగ్ర ఆర్థిక శాస్త్ర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్గా నియామకానికి ముందు ఆమె హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో అంతర్జాతీయ అధ్యయనాలు, ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్గా ఉన్నారు.2005లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్యాకల్టీలో చేరడానికి ముందు, ఆమె యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. బ్రేకింగ్ ది ట్రెండ్ ‘ట్రెండ్ను బ్రేక్ చేస్తూ, నేను ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ల గోడపై చేరాను’ అని గీతా గోపీనాథ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ చీఫ్ ఎకనామిస్ట్ల గోడపై నెలకొలి్పన తన ఫొటో వద్ద ఫోజిచ్చిన్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్వీట్కు జోడించారు. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK — Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 మూడేళ్ల పాటు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యమని ప్రపంచ స్థాయి వ్యవ సాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ తొలి జన్యు మార్పిడి బీటీ పత్తి పంట దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని వారు పేర్కొంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ), జతన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో దేశంలో 18 ఏళ్ల బీటీ పత్తి సాగుపై సాక్ష్యాలతో కూడిన సమీక్ష చేపట్టారు. ఈ వెబినార్లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేశవ్ క్రాంతి, ఎఫ్ఏవో మాజీ ప్రతినిధి డాక్టర్ పీటర్ కెన్మోర్లతో పాటు 500 మంది వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1960, 70లలో కాలిఫోర్నియాలో పురుగు మందులను వాడటం వల్ల తెగుళ్లు ప్రబలాయని, దీని నుంచి భారతదేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానిం చారు. 2005లో 11.5 శాతం, 2006లో 37.8 శాతం, 2011లో దాదాపు అత్యధిక విస్తీర్ణానికి బీటీ పత్తి సాగు పెరిగినా పురుగు మందుల వాడకంలో నియంత్రణ రాలేదని, దిగుబడి పెంపులో కూడా ఎలాంటి మార్పు బీటీతో సాధ్యం కాలేదన్నారు. పురుగు మందుల వాడకం, తెగుళ్ల నియం త్రణలో భాగంగా పర్యావరణ సమ స్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని, దీని వల్ల రైతులు కూడా ఇతర విత్తనాల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. ఈ వెబినార్ నిర్వహణకు అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చ రల్ (ఆషా), ఇండియా ఫర్ సేఫ్ ఫుడ్ సంస్థలు సహకారం అందించాయి. -
దేశ ఆర్థిక మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ .. వెంచర్ క్యాపిటలిస్ట్లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ‘దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా.. టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేధోమథనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోదగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణ వితరణ పెరగాలి... రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోదగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. ‘ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది‘ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్థిక మంత్రి గైర్హాజరు... దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
గుల్లగా మారిన ‘డొల్ల’ ఆర్థికం!
‘‘ఆర్థ్ధిక మందగమన పరిస్థితులు దేశ ఆర్థిక రంగంలో వివిధ రంగాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఉద్యోగాలకు, సంపదకు విఘాతం కలుగుతున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కుంగిపోతుండడం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది’’ – భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.(15.08.19) ‘‘ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దేశాధినేత ఎంత గొప్పవాడైనా అతని పాదాక్రాంతం చేయకూడదు. అలాగే త్యాగాలతో నిర్మించుకున్న ప్రజాస్వామ్య సంస్థల్ని కూల్చేయగల అధికారాన్ని అలాంటి నేత చేతిలోనూ పెట్టరాదు. ఎందుకంటే ఇండియాలో మితిమీరిన భక్తి భావన లేదా వీరారాధన తత్వమనేది రాజకీయాల్లో చొరబడే లక్షణాలు ఎక్కువ. రాజకీయాల్ని ప్రభావితం చేసే ఈ చెడు లక్షణం ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ లేదు. రాజకీయాల్లో ‘భక్తి’ అనే ఆరాధనాతత్వం పతన దశకు తద్వారా నియంతృత్వానికి నిస్సందేహంగా రాచమార్గం’’ – రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరి ప్రసంగంలో హెచ్చరిక(25.11.1949) కునారిల్లుతున్న దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు మొదటి అయిదేళ్ల పాలనలో దేశ ప్రజలకు వాస్తవాలు కనబడకుండా దాచిపెట్టినా, రెండోసారి(2019) పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి మాసాల్లోనే కఠోర సత్యాలను గుర్తించక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు ఏలినాటి శనిగా మారిన ‘కశ్మీర్ కొరివి’తో తలగోక్కోటానికి మన పాలకులు అలవాటు పడ్డారు. పాత, కొత్త పాలకులకు ‘అభివృద్ధి’ అనేది ఒక మంత్రంగా మారినంత మాత్రాన దేశ ప్రజాబాహుళ్యం ఆర్థిక పరిస్థితులలో, జీవనవిధానంలో, విద్య, వైద్యం,ఆరోగ్య విషయాలలో పెనుమార్పులు రావు. కనుకనే వారు ‘పూత మెరుగులతో’ కాలక్షేపం చేస్తూ రావటం జరుగుతోంది. అధ్వానమవుతున్న దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రస్తుత పాలకులు గత పాలకుల్ని ఆడిపోసుకోవడం ద్వారానో, లేక సంక్షోభానికి బయటి శక్తుల్ని కారణంగా చూపడం ద్వారానో కాలక్షేపం చేస్తున్నారు. 2014 నుంచి కడిచిన అయిదేళ్ల పాలన మత విద్వేషాలు రెచ్చగొట్టడం, వేధింపులు, హత్యలు వగైరాలతో గడిచిపోయింది. ‘‘అభివృద్ధి’’ మంత్రం నోట్ల రద్దుతో ప్రారంభమై చిన్న, మధ్య తరగతి వ్యాపార వర్గాల, రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసి, కొన్ని ఆత్మహత్యలకు దారితీసింది. బ్యాంకులు, ఏటీఎంలు డబ్బు కొరత వల్ల పలుసార్లు మూతపడటంతో చిన్న వ్యాపారులు, సన్నకారు రైతాంగం అల్లల్లాడారు. బాగుపడిందెవరయ్యా అంటే బడా వ్యాపారులు, ప్రయివేట్ రంగంలో కోటికి పడగలెత్తినవారూ! ఇంతకీ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం పొందింది ఎవరన్న ప్రశ్నకు రెండురకాల వదంతులు బలంగా వ్యాప్తిలోకి వచ్చాయి. (1) పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 80–84 సీట్లతో ఏ పార్టీకి ఆధిక్యం వస్తే ఆ పార్టీకి పార్లమెంటులోనూ మెజారిటీ లభిస్తుంది. అలాగైతేనే దక్షిణాది రాష్ట్రాలపైనా పెత్తనం చెలాయించడం సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కాలంటే ఆ రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉండటం అవసరం. కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన డబ్బు ప్రవహింపజేయడం కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, (2) కశ్మీర్ సరిహద్దుల్లో ‘‘ఆకస్మిక దాడుల’’ నిర్వహణకు భారీ మొత్తంలో నిధులు మళ్లాయనీ–వదంతులు వ్యాపించాయి. ఆకస్మికంగా నోట్ల రద్దును ప్రకటించి, కొత్త నోట్లకు తెరలేపడానికే బీజేపీ పాలకులు రూ. 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సివచ్చిందని పత్రికల వార్తలు వెల్లడించాయి! ఇలాంటి పెక్కు వివాదాస్పద నిర్ణయాలతో బీజేపీ తొలి అయిదేళ్ల పాలన ముగియనున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ప్రజల్లో ఏర్ప డిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి సరిహద్దుల రక్షణలో ‘‘ఆకస్మిక దాడుల’’ను (సర్జికల్ స్ట్రయిక్స్) చూపించి దేశ రక్షణకు బీజేపీయే శ్రీరామరక్ష అన్న వాదనను పాలకులు సమర్థవంతంగా ప్రజల్లోకి నెట్టగలిగారు. తొలిసారి పాలనలో అభివృద్ధి నామమాత్రం కావడంతో 2019 ఎన్నికల కోసం బీజేపీ పన్నిన వ్యూహం, ఎత్తుగడలు ఓ పెద్ద కలగూర గంప రాజకీయ వ్యూహాన్ని తలపించాయి. దేశ ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి మాట వచ్చేసరికి కాంగ్రెస్ పాలకులు జంకిన కొన్ని విషయాల్లో బీజేపీ పాలకులు ‘ముందంజ’ వేశారు! ఎలాగంటే, ఒకప్పుడు తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశ స్వాతంత్య్రానికి కొలది మాసాల ముందుగా ఒక ప్రకటన చేస్తూ ‘స్వాతంత్య్రానంతరం కూడా దేశాన్ని కొల్లగొట్టిన విదేశీ గుత్త పెట్టుబడి సంస్థల్ని కొనసాగించడం దేశాభివృద్ధికి ఆటంకమ’ని చెప్పగా ఇప్పుడు బీజేపీ పాలకులు దానికి విరుద్ధమైన బాణీ అందుకున్నారు. అది ‘విదేశీ వాణి’గానే ఉందిగానీ, దేశీయవాణిగా లేదు! మరీ విడ్డూరమూ, అసత్యమూ, అభ్యంతరకరమూ అయిన అంశం–రెండోసారి పాలనకు వచ్చిన ప్రధాని మోదీ కొన్ని రోజులనాడు విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో పారిస్లో చేసిన ఒక ప్రసంగంలో చెప్పిన మాటలు: ‘అవినీతికి, బంధుప్రీతికి తావులేకుండా, ప్రజాధనం లూటీ కాకుండా చూడ్డంలో బీజేపీ పాలన విజయం సాధించింది. ఈ విజయం మేము నవభారత నిర్మాణంలో భాగంగా చేశాం’అని. ఇది హాస్యాస్పద ప్రకటన. ఎందుకంటే, విదేశీ బ్యాంకుల్లో భారతీయ పెట్టుబడిదారులు దాచుకున్న దొంగ డబ్బు విలువ రు. 25 లక్షల కోట్లనీ, ఆ అక్రమ ధనరాశుల్ని ఇండియాకు రప్పించి దేశంలోని పేద కుటుంబాలకు రూ. 15లక్షల చొప్పున పంచేస్తానని 2014 ఎన్నికలకు ముందు బాహాటంగా ప్రకటించిన వ్యక్తి మోదీ! కానీ జరిగిందేమీ లేదు. బహుశా అందుకే ఈ చిత్రవిచిత్ర భారతదేశ పరిస్థితుల్ని పిన్న వయస్సులోనే పసిగట్టకల్గిన వీర భగత్సింగ్ 1920 నాటికే ముందస్తుగా ఒక హెచ్చరిక చేసి ఉరికంబమెక్కాడు. ‘‘దేశ స్వాతంత్య్రానంతరం ఒక్క విదేశీ గుత్త పెట్టుబడి వర్గాలే గాక, దేశీయ గుత్తపెట్టుబడివర్గాలు కూడా జోడుకూడి, జమిలిగా భారత ప్రజల్ని దోచుకుతింటార’’ని హెచ్చరించిన క్రాంతదర్శి అతను! రెండోసారి పాలనకు వచ్చిన బీజేపీ పాలకులు దేశ ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదని అడిగితే ‘తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేత కోసం’ అన్న చందాన జవాబిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ప్రబలుతున్నందువల్లనే ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. అయినా ‘ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి నిచ్చెన వేసినట్లు’గా తొలి అయిదేళ్ల పాలన మరచిపొండి, వచ్చే అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ‘అయిదు ట్రిలియన్ డాలర్ల విలువ’(అయిదు లక్షల కోట్ల డాలర్ల)కు చేరుస్తామ’ని అంటున్నారు. ఒకవేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అమెరికా తన డాలర్తో శాసిస్తోందని అనుకున్నా దాన్నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించి నిర్ణయాలు చేయలేనంతకాలం సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాల బెడదనుంచి భారత్లాంటి దేశాలు తప్పించుకోలేవు. ఇక్కడ చైనా ఉదాహరణ చెప్పుకోవాలి. అమెరికా పాలకుడు ట్రంప్ చైనా నుంచి వచ్చే సరుకులపై సుంకాలు బాగా పెంచేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ అసలు రహస్యం–చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులన్నీ చైనాకు ఎగబాకిన అమెరికన్ కంపెనీలవే! చైనా వనరులపై ఆధారపడి అక్కడే ఉత్పత్తి చేసి ఆ సంస్థలు అమెరికాకు పంపుతున్నాయి. ఈ వాస్తవాన్ని ట్రంప్ ‘ఉల్టా’ చేసి ప్రపంచానికి చూపుతున్నాడు. ఇదే నిజం కాకపోతే చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచికూడా, వాణిజ్యయుద్ధం చేస్తున్నామని చెబుతూ కూడా అమెరికా ఆ దేశంతో ఎందుకు రాజీ పడుతున్నట్టు? చైనా అనుసరించిన ఈ వ్యూహాన్నే మన పాలకులు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మొన్నటి దాకా అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై మనం విధిస్తున్న సుంకాలను మనపై ఒత్తిళ్లు తెచ్చి ఆ దేశం తగ్గించుకుంది. ఇంకా మరిన్ని వస్తువులపై తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. కాగా మనం ఏం చేస్తున్నాం? నోరు మూసుకుని ‘చిత్తం, అలాగే’ అంటున్నాం! మన పాలకులు ఏమాత్రం విదేశీ గుత్త కంపెనీలపైన సుంకాలు పెంచినా, ఆ కంపెనీలు స్టాక్ మార్కెట్లనుంచి అర్ధంతరంగా పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉడాయించి మార్కెట్లను దెబ్బతీస్తున్నారు. ఇలా ఆకస్మికంగా తరలించుకుపోయిన పెట్టుబడులు (ఒక్క రోజులోనే)విలువ రూ. 25,000 కోట్లు. దీంతో జరిగిన పనేమిటి, బీజేపీ పాలకులు చూపిన విరుగుడేమిటి? విదేశీ గుత్త పెట్టుబడి కంపెనీలపైన పెంచిన సర్చార్జి ఆదాయపు పన్నును రద్దు చేస్తూ లొంగిపోవడం! బహుశా అందుకే సుప్రసిద్ధ రాజ్యాంగ వ్యాఖ్యాత, అమెరికన్ అటార్నీ, మానవ హక్కుల పరిరక్షణా సంస్థ ప్రతినిధి జాన్ వైట్హెడ్ ‘‘మూడే మూడు మాటలతో’’ ప్రారంభమయ్యే అన్ని దేశాల రాజ్యాంగాల గురించి ఇలా అన్నాడు: ‘‘ఆ మూడు అందమైన మాటలు– ‘‘మేము అంటే ప్రజలం’’అని. మనం లేకుండా, మన శ్రమ లేకుండా సంపదైశ్వర్యాలు... మనం సృష్టించే ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వాలు, పాలకులు ఉండరు. అయినా విచారకరమైన ‘పచ్చి’ వాస్తవం–మన మనస్సులను కుదిపి కదపలేకపోవటం! ఎందుకని? దేశ పాలనా రథానికి రథికులు(డ్రైవర్లు)అయినవారు నిద్రపోవటం వల్ల వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. మనం ప్రశ్నించడం మానుకున్నాం, మనం శాసనవేదికలకు పంపిన ప్రతినిధులు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండేలా కట్టడి చేయడంలో విఫలమవుతున్నాం, ఫలితంగా పాలకులు మన నెత్తిపైన ఎక్కి అసాధారణ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ప్రజలను అణిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నిద్రమత్తు వదలకపోతే మన మీద విరుచుకుపడ్డానికి కాచుక్కూర్చున్న మృగాన్ని అదుపు చేయటం కష్టమని గ్రహించాలి’’(ఏ గవర్నమెంట్ ఆఫ్ వోల్వ్స్–తోడేళ్ల ప్రభుత్వాలు)!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అమెరికా ద్వయానికి ఆర్థిక నోబెల్
స్టాక్హోం: 2018 ఏడాదికి నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతి అమెరికా ఆర్థిక వేత్తలు విలియం నోర్ధాస్, పాల్ రోమర్లకు దక్కింది. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దీర్ఘకాలిక సుస్థిర వృద్ధి వంటి ప్రస్తుత కాలపు పలు ప్రాథమిక సవాళ్లకు వీరిద్దరూ పరిష్కారం చూపారు. ప్రకృతి కారణంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమవుతుందో నిర్మాణాత్మక నమూనాల ద్వారా వివరించి ఆర్థిక విశ్లేషణల విస్తృతిని బాగా పెంచారు’ అని అకాడమీ ప్రకటనలో వివరించింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు. నోర్ధాస్ (77) యేల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉండగా, రోమర్ (62) న్యూయార్క్ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పనిచేస్తున్నారు. రోమర్ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలకు వాతావరణ మార్పులను జోడించినందుకు నోర్ధాస్కు, సాంకేతిక సృజనాత్మకతను జోడించినందుకు రోమర్కు ఈ బహుమతులు ప్రదానం చేశామని అకాడమీ తెలిపింది. వాతావరణ కల్లోల పరిస్థితులను ప్రపంచం ఎదుర్కొనేందుకు సమాజంలో గొప్ప పరివర్తనం రావాల్సి ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో పేర్కొన్న అనంతరం నోర్ధాస్, రోమర్లకు అవార్డు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం రోమర్ అకాడమీతో ఫోన్లో మాట్లాడుతూ ప్రపంచం కర్బన ఉద్గారాలను తగ్గించుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రపంచ దేశాలపై కర్బన పన్నులను విధించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని నోర్ధాస్ తన పరిశోధనలతో రుజువు చేశారు. ముగిసిన నోబెల్ బహుమతుల ప్రకటన ఆర్థిక శాస్త్ర బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అన్ని నోబెల్ పురస్కారాల విజేతల పేర్లు ప్రకటించడం పూర్తయినట్లయింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య, శాంతి బహుమతులను ప్రకటించగా, సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం తెలిసిందే. అకా డమీ మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచారం ఆరోపణలు రుజువుకావడంతో ఈ ఏడాది సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్, డెనిస్ ముక్వెగె, భౌతిక శాస్త్ర బహుమతికి ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరూ, డొనా స్ట్రిక్లాండ్, వైద్య శాస్త్ర బహుమతికి జేమ్స్ అలిసన్, తసుకు హొంజో, రసాయన శాస్త్ర బహుమతికి ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగ్ వింటర్లను విజేతలుగా ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 10న స్టాక్హోంలో స్వీడన్ రాజు నోబెల్ బహుమతులను అందజేస్తారు. -
‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రధ్దు చేసి ప్రజలను నూరు పాట్లకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధ్వజమెత్తారు. ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై దుమ్మెత్తిపోశారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచలోని ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదుకదా సమర్థించడం కూడా జరగలేదని, అందరూ అది అనాలోచిత నిర్ణయమని అన్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. అసలు నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్కే తెలియదన్నారు. నోట్ల రద్దు గురించి ఢిల్లీలో మోదీ వివరించిన రోజు సీఈఏ కేరళలో ఉన్నారని, సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అన్నది అవినీతి, తీవ్రవాదం, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి విజయం సాధించిందా అంటూ చురకలు అంటించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు ఎలా అమలుచేస్తున్నారో అడిగి తెలుసుకునేవారని తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్పై కూడా చిదంబరం విమర్శల వర్షం కురిపించారు. అదొక భీమా పథకం లాంటిదని.. 130 కోట్లకుపైగా జనాభా గల భారత్లో భీమా పథకాలతో ప్రజలకు లాభం జరగుతుందనే నమ్మకంలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కీమ్లు ఏ దేశంలోనూ విజయవంతం కాలేదని వివరించారు. అంతేకాకుండా ఈ పథకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
ఆర్థిక వేత్తలతో ప్రీ బడ్జెట్ మీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పలు ఆర్థిక వేత్తలు, నిపుణులతో ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే 2018 కేంద్ర బడ్జెట్ కరసరత్తులో భాగంగా ఆర్థికవేత్తల బృందంతో సమావేశమైంది. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా కూడా ఉన్నారు. గతంలో వ్యవసాయ రంగం, పరిశ్రమ, వ్యాపార విభాగాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు తదితర కీలక అంశాలపై ఈ సమావేశం చర్చించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వ చివరి ఆర్థిక బడ్జెట్ కావడంతో భారీ పెట్టుబడులు, తక్కువ పన్నులు, మరిన్ని ప్రోత్సాహకాలతోఆకర్షణీయంగా బడ్జెట్ను వడ్డించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. -
‘కాంట్రాక్ట్ థియరీ’కి ఆర్థిక నోబెల్
ఓలివర్, హోమ్స్ట్రామ్ కృషికి పురస్కారం స్టాక్హోమ్: ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్స్ట్రామ్(ఫిన్లాండ్)లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. ‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ వీరిని సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ సోమవారం ప్రకటించింది. బీమా పాలసీల రూపకల్పన, అధికారుల వేతనంతో పాటు జైళ్ల నిర్వహణ వంటి వాటికి ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుందని నోబెల్ జ్యూరీ చెప్పింది. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత వేతనం, ఇన్సెంటివ్లు, బీమాలో మినహాయింపులు, పాలసీదారుల క్లెయిమ్లు, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల ప్రైవేటీకరణ, ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలెన్నింటినో సమగ్రంగా విశ్లేషించడం ద్వారా కాంట్రాక్ట్ థియరీని ఓలివర్, హోమ్ స్ట్రామ్లు అభివృద్ధి చేసినట్టు తెలిపింది. అద్భుత సాధనం... వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఈ సరికొత్త సైద్ధాంతిక ఉపకరణాలు సహాయపడతాయని నోబెల్ కమిటీ సభ్యుడు పర్ స్ట్రాంబర్గ్ చెప్పారు. దివాలా చట్టం నుంచి రాజకీయ రాజ్యాంగం వరకు సంస్థలు, విధానాల రూపకల్పనకు ఇది మేథో పునాది వేసినట్టు పేర్కొన్నారు. సమస్యేమిటో తెలుసుకోవడానికే కాకుండా, వాస్తవ పరిస్థితులను విశ్లేషించే అవకాశం కాంట్రాక్ట్ థియరీ వల్ల కలుగుతుందని, తద్వారా షేర్హోల్డర్లు, కార్పొరేట్ బోర్డులు మరింత మెరుగైన ఒప్పందాలు రూపొందిం చుకోవడానికి అద్భుత సాధనంగా సహాయపడుతుందని తెలిపారు. హార్ట్... హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. ఈయన 1948లో జన్మించారు. హోమ్స్ట్రామ్ (67) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం, మేనేజ్మెంట్ ప్రొఫెసర్. విడివిడిగానూ, కలిసి పనిచేసిన వీరు నోబెల్ అవార్డు కింద ఇచ్చే సుమారు రూ.6.14 కోట్ల (924 వేల డాలర్లు) నగదు బహుమతిని పంచుకోనున్నారు. గత ఏడాది అర్థశాస్త్ర నోబెల్ అమెరికా-బ్రిటన్ పరిశోధకుడు అంగస్ డేటన్కు దక్కింది. ఏటా ఇచ్చే ఆరు నోబెల్ పురస్కారాల్లో ఐదింటిని ఇప్పటికే జ్యూరీ ప్రకటించింది. చివరిదైన సాహిత్య పురస్కార గ్రహీతెవరన్నది గురువారం తెలుస్తుంది. డిసెంబర్ 10న స్టాక్హోమ్లో జరిగే వేడుకలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. హార్ట్, హోమ్స్ట్రామ్లు ఈ గౌరవానికి అర్హులంటూ 2008 ఆర్థిక నోబెల్ పురస్కార గ్రహీత పాల్ క్రుగ్మన్ అభినందించారు. ఆనందం కుటుంబంతో... ‘నోబెల్ బహుమతి వచ్చిందని తెలియగానే మొట్టమొదట నా భార్యను ఆలింగనం చేసుకున్నా. చిన్నబ్బాయిని నిద్రలేపి ఆనందం పంచుకున్నా. సహచరుడికి ఫోన్ చేసి మాట్లాడా..’ అంటూ హార్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రతిష్టాత్మక అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని హోమ్స్ట్రామ్ చెప్పారు. -
ఏకాభిప్రాయమే.. కానీ ఉత్కంఠ!
♦ రెపో రేటు యథాతథమేనని అంచనాలు ♦ రేపు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష న్యూఢిల్లీ: ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతల దృష్టి మంగళవారం నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక, ద్రవ్య పరపతి విధానం వైపునకు మళ్లింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపోను మరింత తగ్గించే అవకాశాలు ఈ సమీక్ష సందర్భంగా లేవన్నది ఏకాభిప్రాయంగా ఉన్నా... అనూహ్య నిర్ణయమేమైనా ఉంటుందా? అన్న సందేహాలూ కొందరు ఆర్థికవేత్తల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు శాతం ఎగువనే (ఏప్రిల్లో 5.39 శాతం) ఉండడం, ఇప్పటికే తగ్గించిన రెపో ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా కస్టమర్లకు బదలాయించని పరిస్థితులు, వర్షపాతంపై ఇంకా స్పష్టత రాకపోవడం వంటి అంశాలు రేటు యథాతథంగా కొనసాగిస్తారన్న అంచనాలకు వేదికగా ఉన్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యం సైతం ఆర్బీఐ వేచిచూసే నిర్ణయానికి కారణమవుతుందని సంబంధిత వర్గాల వాదన. అయితే మే నెలకు సంబంధించి తయారీ, సేవల రంగాల ప్రతికూలతల వార్తలు, రుణ వృద్ధి రేటు తక్కువగా ఉండడం వంటి అంశాలను కొద్దిమంది ‘రేటు కోత ఆశావహులు’ కారణంగా చూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ తొలి ద్వైమాసిక ద్రవ్య సమీక్ష ఇది. కొందరి అంచనాలు చూస్తే... ♦ స్టాన్చార్ ఇండియా సీఈఓ జరీన్ దారూవాలా అభిప్రాయాల ప్రకారం- ఏప్రిల్లో ఆహార ధరలు అధికంగా ఉన్నాయి. క్రూడ్ ధరలు మరోవైపు బ్యారల్కు 50 డాలర్లను తాకాయి. వర్షపాతం విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో రెపో రేటును ఆర్బీఐ గవర్నర్ రాజన్ తగ్గిస్తారని తాను భావించడంలేదని దారూవాలా అన్నారు. ♦ ఇక డాయిష్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేస్తూ.. వారం రోజుల్లో అమెరికా ఫెడ్ రేటుపై కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో- ఇప్పుడు ఆర్బీఐ రేటు కోత నిర్ణయం అసాధ్యమని విశ్లేషించింది. ♦ మంగళవారం రెపో రేటును తగ్గించకపోవచ్చన్నది ఇండియా రేటింగ్స్, హెచ్ఎస్బీసీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇప్పటికే జరిగిన రేటు కోత ప్రయోజనం కస్టమర్కు బ్యాంకింగ్ అందించకపోవడం, అలాగే ద్రవ్యోల్బణం గరిష్టస్థాయిలోనే కొనసాగడం, అమెరికా ఫెడ్ రేటు కోత, యూరోజోన్లో (కొనసాగడంపై) బ్రిటన్ భవితవ్యం వంటి అంశాలు సమీక్షలో ప్రధానాంశాలు అవుతాయన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ వ్యక్తం చేసింది. కాగా రేటు కోత అవకాశాలను తోసిపుచ్చిన హెచ్ఎస్బీసీ,ఆగస్టులో పావుశాతం కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని అంచనావేస్తున్న రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్స్టాన్లీ, జూన్ 7 ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా మాత్రం రేటు కోతకు అవకాశం ఉండదని తను అభిప్రాయపడుతోంది. యస్బ్యాంక్ భిన్న వైఖరి కాగా యస్బ్యాంక్ వైఖరి భిన్నంగా ఉంది. యస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ రాణా కపూర్ మాట్లాడుతూ, జూన్ 7న పావుశాతం రేటు కోత ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, వర్షపాతంపై తగిన సానుకూల అంచనాలు వంటివి ఇందుకు రాణా కారణంగా చూపారు. రుణాలకు సంబంధించి ముఖ్యమైన సీజన్ నేపథ్యంలో ఆగస్టులో కూడా పావుశాతం కోత ఉండవచ్చనీ ఆయన పేర్కొంటున్నారు. -
రేటు కోతకే ఆర్బీఐ మొగ్గు!
- నేటి ఆర్బీఐ పాలసీ సమీక్షపై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 29వ తేదీ మంగళవారం కీలక నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా ఆర్బీఐ కీలక రెపో రేటును తగ్గిస్తుందని, తద్వారా వృద్ధికి చేయూతను అందిస్తుందని నిపుణులు, ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సైతం రేటుకోతనే కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వైపునకు మళ్లాయి. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే... రెపో. ప్రస్తుతం ఈ రేటు 7.25 శాతం. మంగళవారం కనీసం పావుశాతం రేటు కోత ఉంటుందని బ్యాంకర్లుసహా పలు వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇదే జరిగితే రెపో నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లవుతుంది. ఈ ఏడాది ఆర్బీఐ మూడుసార్లు రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనంలో 33 శాతాన్నే కస్టమర్లకు బదలాయించాయి. రెపో ద్వారా వచ్చిన ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా కస్టమర్లకు బదలాయించాలని రాజన్ పేర్కొంటున్నారు. దీనికితోడు ద్రవ్యోల్బణం భవిష్యత్తులో సైతం తక్కువగా ఉంటుందని భావిస్తేనే రేటు కోత ఉంటుందనీ సూచిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో రాజన్ రేటుకోతకు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న వారి అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... ► టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో ఉండడం. ఆగస్టులో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 10 నెలల కనిష్ట స్థాయిలో క్షీణతను నమోదుచేసుకుంది. -4.95 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 3.66 శాతంగా నమోదయ్యింది. క్రూడ్సహా అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై ఈ ప్రతికూల ప్రభావం ఉండదు. దేశంలో టోకు ధరలకు సంబంధించి ప్రతి ద్రవ్యోల్బణమే ఇప్పుడు సవాలని ఆర్థికశాఖ ఉన్నత స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ► అంతర్జాతీయంగా ప్రత్యేకించి చైనా మందగమన పరిస్థితు లను పరిగణనలోకి తీసుకుని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ► ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి 7%కి పడిపోతుంది. కనీసం 7.5% స్థాయి లో 2015-16లో వృద్ధిని నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది. ► చైనా మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సైతం తక్షణం రేటు కోత అవసరం. తగిన అవకాశాలు... రేటు కోతకు ప్రస్తుతం తగిన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆహార ధరల రేట్లు పెరిగినా... వాటి ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. అయితే ఎంత రేటు కోత ఉంటుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేను. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ పావుశాతం కోత ఉండొచ్చు రెపో రేటు పావుశాతం తగ్గుతుందని భావిస్తున్నా. అయితే వ్యవస్థలో తగిన ద్రవ్య లభ్యత అందుబాటులో ఉన్నందున, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియోల్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చు. - అరుణ్ తివారీ, యూబీఐ చీఫ్ 1% వరకూ తగ్గొచ్చు... రెపో రేటును అరశాతం నుంచి ఒక శాతం శ్రేణిలో తగ్గించడానికి అనువైన సమయం ఇది. పారిశ్రామిక వృద్ధికి రేటు కోత అవసరం. ఆయా అంశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. - అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ వైస్చైర్మన్ -
అర్ధిక వృద్ధి..నిరాశ!
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతమే.. - అంచనాలను అందుకోని గణాంకాలు.. - సేవలు, వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు - ఆర్బీఐ వడ్డీరేట్ల కోత డిమాండ్లకు ఊతం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2015-16;ఏప్రిల్-జూన్; క్యూ1) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలైన.. సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2014-15 జనవరి-మార్చి) వృద్ధి రేటు 7.5 శాతం. చైనా వృద్ధి రేటును మించి ఇది నమోదుకావడం విశేషం. అదే ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం. ఆర్థిక క్రియాశీలతను లెక్కించడానికి కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) తాజాగా ప్రవేశపెట్టిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) రేటు గత ఏడాది ఇదే కాలంలో 7.4 శాతం కాగా ఇప్పుడు 7.1 శాతానికి పడింది. సీఎస్ఓ సోమవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది. నిరాశాజనకం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదవుతుందని కేంద్రం అంచనావేస్తోంది. ఆర్బీఐకి సంబంధించి ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. అయితే ప్రస్తుత గణాంకాలు, తాజా ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే- భవిష్యత్తులో భారీ స్థాయిలో వృద్ధి అసాధ్యంగానే కనిపిస్తోంది. పలువురు ఆర్థిక వేత్తల అంచనా 7.2 శాతం నుంచి 7.5 శాతం కాగా ఈ అంచనాలను సైతం తాజా గణాంకాలు అందుకోలేకపోయాయి. ప్రధాన రంగాలు పేలవం... - 2011-12 స్థిర ధరల ప్రకారం, క్యూ1 జీవీఏను చూస్తే- తయారీ రంగంలో వృద్ధి రేటు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. - అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 3.2 శాతానికి చేరింది. - వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6% నుంచి 1.9%కి దిగింది. - గనులు, తవ్వకాల రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. - ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల రంగాలకు సంబంధించి వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి జారింది. - అయితే నిర్మాణ రంగం క్రియాశీలత మాత్రం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. విలువ 27.13 లక్షల కోట్లు... తొలి త్రైమాసికంలో వివిధ రంగాల ఉత్పత్తి విలువ రూ.27.13 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఈ రేటు రూ.25.35 లక్షల కోట్లు. అంటే వృద్ధి 7 శాతం అన్నమాట. జీవీఏ ప్రాతిపదికన చూస్తే విలువ రూ.24.10 లక్షల కోట్ల నుంచి రూ.25.80 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఈ రేటు 7.1 శాతం. ప్రాథమిక ధరల వద్ద జీవీఏకు నికర సబ్సిడీలు, పన్నులు కలిపి, జీడీపీ గణాంకాలను లెక్కించడం జరుగుతుంది. కాగా పెట్టుబడులకు సంబంధించిన గ్రోస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్సీఎఫ్) విలువ 2011-12 స్థిర ధరల వద్ద రూ.7.70 లక్షల కోట్ల నుంచి రూ.8.07 లక్షల కోట్లకు చేరింది. జూలైలో మౌలిక రంగం డీలా...వృద్ధి రేటు కేవలం 1.1 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల కీలక గ్రూప్ జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2014 జూలై వృద్ధి విలువతో పోల్చితే 2015 జూలైలో కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. 2014 జూలైలో ఈ గ్రూప్ వృద్ధి 4.1 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ దాదాపు 38 శాతం. గ్రూప్లో భాగమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణించడం మొత్తం గ్రూప్పై ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఎనిమిది రంగాల ధోరణి వేర్వేరుగా... వృద్ధిలో 5: బొగ్గు ఉత్పాదకత వృద్ధి రేటు జూలైలో 0.3%. అయితే 2014 ఇదే నెలలో ఈ రేటు 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ప్రొడక్టుల రంగం మంచి పనితనం ప్రదర్శించింది. క్షీణతలోంచి (-5.2 శాతం) బయట పడి 2.9% వృద్ధిని నమోదుచేసుకుంది. ఎరువుల రంగం కూడా -4.2 శాతం క్షీణత నుంచి 8.6 శాతం వృద్ధికి మళ్లింది. సిమెంట్ రంగం వృద్ధి భారీగా 16.5% నుంచి 1.3 శాతానికి పడింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కూడా 11.8 శాతం నుంచి 3.5 శాతానికి పడింది. క్షీణతలో 3: క్రూడ్ ఆయిల్ ఉత్పాదకత -1.0 శాతం క్షీణత నుంచి మరింతగా -0.4 శాతం క్షీణతకు పడింది. సహజ వాయువు రంగం కూడా క్షీణతలోనే ఉంది. అయితే ఈ మైనస్ 8.9 శాతం నుంచి 4.4 శాతానికి మారింది.స్టీల్ ఉత్పాదకత 2.1 శాతం వృద్ధి రేటు నుంచి 2.6 శాతం క్షీణతలోకి జారింది. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు అటు జీడీపీ క్యూ1 గణాంకాలు, ఇటు పారిశ్రామిక రంగం మందగమన ధోరణికి ‘తక్కువ వడ్డీ రేటు’ రుణాలే మందని పరిశ్రమలు పేర్కొన్నాయి. తక్షణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా(ఆర్బీఐ) పాలసీ రేట్లను మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. తద్వారా అటు పెట్టుబడులు-ఇటు వినిమయం రెండింటికీ ఊపునివ్వాలని సూచించింది. ఇక ప్రభుత్వం సైతం సంస్కరణల అమలు దిశలో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేసింది. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందని భావిస్తున్నాం. ధరలు తక్కువగా ఉన్న పరిస్థితులు సైతం దీనికి అనుకూలిస్తాయి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరి పేర్కొన్నారు. సంస్కరణలు మందగమన ధోరణి ఆందోళన కలిగించే అంశం. క్షేత్ర స్థాయిలో సంస్కరణలు వాటి అమలుపై కేంద్రం దృష్టి సారించాలి. ఆయా అంశాలే ఆర్థిక మెరుగుదలకు దోహదపడతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. -
ఎప్పటికప్పుడు మాట మార్చేస్తుంటారు..
ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నిత్యం పరస్పరం భిన్నమైన కామెంట్లతో హడావిడి చేసే ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు మాటలు మార్చేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. సంక్షోభాన్ని గుర్తించడంలో ఎకానమిస్టుల వైఫల్యంపై ప్రముఖ ఆర్థికవేత్త లార్డ్ మేఘనాద్ దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జైట్లీ వ్యాఖ్యలకు వేదికైంది. పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత రాత్రి టీవీలో గ్రీస్ రిఫరెండం ఫలితాలు చూశాను. మన దేశంలో పేరొందిన ఒక కామెంటేటర్ .. సోమవారం మన మార్కెట్లపై ఆ ఫలితాల ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. సోమవారం మార్కెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుందని, పెద్ద షాక్ షాక్ తప్పదని.. ఏవేవో విశేషణాలన్నీ జోడించి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం దాకా అదే పాట కొనసాగించారు. కానీ, ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు క్రమంగా అర్థమయినట్లున్నాయి. వెంటనే ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. విశ్లేషణ కూడా మారిపోయింది’ అని తెలిపారు. ఏడాది కాలంగా క్రూడ్ ధరల విషయంలోనూ ఇలాగే జరుగుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే సంక్షోభాలను, పరిణామాలను చాలా మంది ఎకానమిస్టులు ముందుగా ఎందుకు గుర్తించలేరన్నది తనకు అంతుబట్టని విషయమని జైట్లీ చెప్పారు. ఇక సరైన హెచ్చరికలు చేయకుండా అంతా జరిగిపోయాకా.. ‘మేం అప్పుడే చెప్పాం కదా’ అని చెప్పుకునే ఎకానమిస్టులు కొందరు ఉంటారని జైట్లీ చెప్పారు. ఏదైతేనేం.. ఇథమిత్థంగా ఇలాంటి వాటిని గురించి ముందస్తుగా అంచనా వేయగలిగే సామర్థ్యం ఏ కొద్ది మందికో పరిమితమన్నారు. -
మరోవిడత రేట్ల కోతకు చాన్స్!
⇒ పావు శాతం తగ్గే అవకాశం... ⇒ ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల అంచనా... ⇒ రేపు ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష న్యూఢిల్లీ/ముంబై: రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరింత ఊరటనివ్వనున్నారా? వడ్డీరేట్లు ఇంకా దిగిరానున్నాయా? అవుననే అంటున్నారు బ్యాంకింగ్ వర్గాలు, ఆర్థికవేత్తలు.రేపు(మంగళవారం) చేపట్టబోయే పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక పాలసీ వడ్డీరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందనేది వారి అంచనా. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం.. కోల్ ఇండియాలో వాటా విక్రయం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో వృద్దికి చేయూతనిచ్చేందుకు ఆర్బీఐ మరోవిడత రేట్ల కోతకు ఓకే చెప్పొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం తగ్గించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన 20 నెలలుగా కొనసాగుతున్న కఠిన పాలసీకి బ్రేక్ పడినట్లయింది. రెపో రేటు ప్రస్తుతం 7.75%, రివర్స్ రెపో 6.75%, సీఆర్ఆర్ 4% వద్ద ఉన్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5%కి తగ్గగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం సున్నా స్థాయిలోనే(0.1%) ఉంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ.22,557 కోట్లు లభించాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.43,425 కోట్లలో ఇప్పటికే సగానికిపైగా ఖజానాకు చేరాయి. ఇంకా ఓఎన్జీసీ, ఐఓఎల్, భెల్, ఎన్ఎండీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి పీఎస్యూలు వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మార్చిలోగా ఈ లక్ష్యం సులువుగానే సాకారమయ్యే అవకాశాలు సుస్పష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అటు పారిశ్రామిక వర్గాలు ఆర్బీఐ మరింత రేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. గతనెలలో పావు శాతం తగ్గింపు చాలా తక్కువేనని కార్పొరేట్లు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ విజయం సాధించిందని.. రానున్నరోజుల్లో వడ్డీరేట్లు ఇంకాస్త దిగొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరేమన్నారంటే... * రానున్న నెలల్లో వడ్డీరేట్లు ఒక శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. మెరుగైన దేశీ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా రేపు ఆర్బీఐ చేపట్టే సమీక్షలో పావు శాతం రెపో రేటు కోతకు ఆస్కారం ఉంది. - అనిమేష్ చౌహాన్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చీఫ్ * తాజా ద్రవ్యోల్బణం, ఇతరత్రా గణాంకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్బీఐ కచ్చితంగా మళ్లీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. - మలయ్ ముఖర్జీ, ఐఎఫ్సీఐ ఎండీ * బడ్జెట్ తర్వాత ఎప్పుడైనా రేట్ల కోత ఉంటుందనే అంచనాలు గతంలోనే వున్నాయి. అయితే, ఈ నెల 3న తగ్గింపునకు అవకాశాలు పెరిగాయి. మొత్తంమీద ఈ ఏడాది(2015)లో ముప్పావు శాతం వడ్డీరేట్లు తగ్గే చాన్స్ ఉంది. - సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ * ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణల ప్రభావంతో త్వరలోనే డిపాజిట్, రుణ రేట్లు మరింత దిగొస్తాయి. అయితే, రేపు సమీక్షపై అంచనా వేయలేను. తాము, ప్రభుత్వం చేపడుతున్న విధాన, సంస్కరణ చర్యలను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. కొంత వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు. రానున్న రోజుల్లో కచ్చితంగా రేట్లు దిగొస్తాయి. - రాజన్ ధావన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ * 3న రేట్ల కోతకు ఆస్కారం ఉంది. అయితే, గత నెలలో ఆనూహ్య తగ్గింపు నేపథ్యంలో మళ్లీ మార్చిలోనే ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందనేది మా ప్రాథమిక అంచనా - ప్రాంజుల్ భండారి, హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ -
ఆర్థిక సలహాలిచ్చే.. ఎకానమిస్ట్
ప్రపంచంలో మనిషి మనుగడకు ఆక్సిజన్ తర్వాత అవసరమైన ప్రాణ వాయువు.. డబ్బు. భూగోళం సూర్యుడితోపాటు ధనం చుట్టూ తిరుగుతోందనే నానుడి ఉంది. అలాంటి ధనాన్ని, దాని కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే.. అర్థ శాస్త్రం (ఎకనామిక్స్). భూమిపై డబ్బు చెలామణిలో ఉన్నంతకాలం ఆర్థికవేత్తలు కూడా ఉండాల్సిందే. అందుకే ఎప్పటికీ వన్నె తగ్గని కెరీర్గా ఎకనామిక్స్ ఆదరణ పొందుతోంది. ఆర్థిక రంగంపై ఆసక్తి ఉన్న యువతను ఆకర్షిస్తున్న సబ్జెక్ట్.. అర్థ శాస్త్రం. డబ్బు, స్థిర చరాస్తులు వంటి విలువైన వనరులను ప్రజలు సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేదే ఎకనామిక్స్. కార్పొరేట్ రంగం, విద్యా సంస్థల్లో అవకాశాలు ఎకానమిస్ట్లకు దేశ విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవే లేదు. సబ్జెక్టుపై పట్టు, తగిన అనుభవం ఉన్నవారికి కార్పొరేట్ సంస్థలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు ఊపందుకుంటున్నాయి. ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలకు డిమాండ్ పెరుగుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లు, బ్యాంకులు ఎకనామిస్ట్లను సలహాదారులుగా నియమించుకుం టున్నాయి. ప్రభుత్వ రంగంలోనూ ఎన్నో అవకాశాలున్నాయి. బడ్జెట్ల రూపకల్పనలో ఆర్థికవేత్తలదే ప్రధాన పాత్ర. ఆసక్తి ఉంటే బోధనా రంగంలోనూ స్థిరపడొచ్చు. విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్లకు లక్షల్లో వేతనాలు అందుతున్నాయి. కావాల్సిన స్కిల్స్: ఎకానమిస్ట్లుగా వృత్తిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే.. దూరదృష్టి ఉండాలి. అంటే.. భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే నేర్పు అవసరం. ఆర్థిక లావాదేవీలు, సంబంధిత చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. తార్కిక ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. పరిస్థితులను విశ్లేషించేందుకు క్వాంటిటేటివ్, రీజనింగ్ స్కిల్స్ అలవర్చుకోవాలి. వృత్తిలో సవాళ్లను తట్టుకొని నిలిచేందుకు కష్టపడే తత్వం, ఓర్పు అవసరం. అర్హతలు: ఎకనామిక్స్పై మనదేశంలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాతఎకనామిక్స్లో బీఏ, ఎంఏ చదవొచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ కూడా చేస్తే అవకాశాలు మెరుగవు తాయి. జాబ్ మార్కెట్లో విలువ పెరుగుతుంది. ఇంటర్మీడియెట్లో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కామర్సపై మంచి పట్టు సాధించి బీఏలో చేరడం ఉత్తమం. వేతనాలు: ఎకనామిక్స్లో ప్రావీణ్యం సంపాదించినవారికి భారీ వేతనాలుంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఏడాదికి దాదాపు రూ.6 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.10 లక్షలు, ప్రొఫెసర్కు రూ.15 లక్షల వేతనం లభిస్తుంది. ఇక కార్పొరేట్ సంస్థల్లో ఎకనామిస్ట్కు ప్రారంభంలో ఏడాదికి దాదాపు రూ.7 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.12 లక్షలు అందుకోవచ్చు. సీనియర్ లెవల్లో ఉన్నవారి వేతనాలకు ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు. ఎకనామిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న విద్యా సంస్థలు: ఏ ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఏ యూనివర్సిటీ ఆఫ్ హెదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఏ ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఏ ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in ఏ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in ఏ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సీఈఎస్ఎస్) వెబ్సైట్: www.cess.ac.in ఏ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెబ్సైట్: www.econdse.org అన్నింటా అర్థ శాస్త్రమే సామాజిక శాస్త్రాల్లో ఎవర్గ్రీన్ సబ్జెక్టు అర్థ శాస్త్రం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆర్థిక నిపుణులు లేనిదే అభివృద్ధి సాధ్యం కాదనేది వాస్తవం. బిజినెస్ స్కూళ్లలో బోధించే ప్రధాన సబ్జెక్టుల్లో ఎకనామిక్స్దే అగ్రభాగం. ఇంత క్రేజ్ ఉన్న సబ్జెక్టులో పరిశోధన చేసినవారికి దేశ, విదేశాల్లో మంచి అవకాశాలున్నాయి. బీఏ, బీకాం, బీబీఏ వంటి కోర్సుల్లో స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్, స్టాటిస్టికల్ ఉద్యోగాల ఎంపికలో ఎకానమిస్ట్లకు ప్రాధాన్యతనిస్తు న్నారు. బోధన రంగంలోనూ పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఎకనామిక్స్లో పీహెచ్డీ చేసి, నైపుణ్యాలను పెంచుకోగలిగితే ఎవరికీ తీసిపోని విధంగా కెరీర్లో ఉన్నతంగా స్థిరపడతారు. -డాక్టర్ సునంద, హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రమహిళాసభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల -
ద్రవ్యలోటు... కాదు చేటు
అధిక ద్రవ్యలోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదనే అభిప్రాయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక శాస్త్రవేత్తలలో బలపడుతోంది. ఈ మార్పునకు మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా రానున్న బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్ద పీట వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వాటి స్వభావం స్పష్టం కావాల్సి ఉంది. 1990లలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ద్రవ్యలో టును తగ్గించడమనేదే అన్ని ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు కేంద్ర బిందువు. ప్రభుత్వ వార్షిక రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉండటమే ద్రవ్యలోటు. ఉదాహరణకు, పన్నుల వసూళ్లు, తదితర ఆదాయ వనరుల ద్వారా కేంద్రానికి లభించే వార్షిక రాబడి రూ.100, వ్యయం రూ.105 అనుకుంటే... ద్రవ్య లోటు 5 శాతమవుతుంది. ద్రవ్యలోటు తగ్గింపు పేరిట యూపీఏ సర్కారు విధించిన ప్రభుత్వ వ్యయాలలోని కోతలన్నీ ప్రధానంగా సామాన్య ప్రజల సంక్షేమ పథకాలపైనే పడ్డాయి. పైగా వినియోగదారుల సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలలో కూడా కోత లు పడ్డాయి. ఫలితంగా ఎరువులు, పెట్రో, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. యూపీఏ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాల ప్రధా న లక్ష్యం ఆహార సబ్సిడీలు సహా వినియోగదారుల సబ్సిడీలన్నిటికీ తూట్లు పొడవడమే. ఈ చర్యలతో ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించగలిగారు. కానీ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఏమిటీ ద్రవ్యలోటు? ఇంతకూ ద్రవ్యలోటు అధికంగా ఉంటే వచ్చి పడే విపత్కర సమస్యలేమిటి? నియంత్రించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి? అని సందేహం రావ డం సహజం. ద్రవ్యలోటు పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి, నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని, కరెన్సీ విలువ పడిపోతుందని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తల సమాధానం. అయితే మన దేశంలో వ్యవసాయ, వినియోగ మార్కెట్లలోని గుత్తాధిపత్య ధోరణులు, దొంగ నిల్వల వంటి అక్ర మ వ్యాపార పద్ధతులే ధరలను ప్రత్యేకించి ఆహార, వినియోగ వస్తువుల ధరలను ఎక్కువగా నియంత్రిస్తాయని వారు విస్మరిస్తున్నారు. ద్రవ్యలోటు గురిం చి ఎక్కువగా ఆందోళన చెందుతున్నది బడా వ్యాపార, పారిశ్రామిక వర్గాలే. 2008 నుంచి అధిక స్థాయిలో ఉన్న (సగటున ఏటా 10 శాతం) ద్రవ్యోల్బణం ఫలితంగా నేడు షేర్ మార్కెట్ సూచి 25,000 స్థాయికి చేరింది. అయినా షే ర్ల నిజ విలువ మాత్రం 2008లో సెన్సెక్స్ 13,000 స్థాయిలో ఉన్నప్పటి స్థా యిలోనే ఉంది. ఇలా పడిపోతున్న షేర్ మార్కెట్ మదుపుల విలువను భర్తీ చేసుకోవాలని వ్యాపార వర్గాల తాపత్రయం. ద్రవ్యలోటును తగ్గించడం పేరిట సంక్షేమ వ్యయాలలో కోతలను విధించి, ప్రభుత్వ రాయితీల లబ్ధిని పొందాలని ఆశిస్తున్నాయి. ఉత్పత్తి వృద్ధి, ఉద్యోగిత మెరుగుపడకపోయినా కృత్రిమంగా షేర్ మార్కెట్లు విజృంభించేలా చేసి లబ్ధిని పొందాలని భావిస్తున్నాయి. ద్రవ్యలోటును తగ్గించడమే పరమ కర్తవ్యంగా బోధిస్తున్నాయి. మాంద్యానికి విరుగుడు ‘లోటు’ ద్రవ్యలోటు తక్కువగా ఉంటేనే వృద్ధి, ఉపాధి కల్పన సాధ్యమనడానికి ఆధారాలు లేవు. నిజానికి 1930లలో ఏర్పడ్డ ఆర్థిక మహా మాంద్యానికి పరిష్కారంగా అమెరికా సహా ప్రపంచంలోని సంపన్న దేశాలన్నీ ద్రవ్యలోటు విధానాలనే అనుసరించాయి. లోటు బడ్జెట్ విధానాలతో ప్రభుత్వ వ్యయాలను, ఉ పాధి అవకాశాలను పెంచి కొనుగోలు శక్తిని, డిమాండును పెంచడం ద్వారా వృద్ధి, వికాసం సాధ్యమని జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక సిద్ధాంతాల సారం. ఆ సిద్ధాంతాలే నాడు ప్రపంచానికి శిరోధార్యమయ్యాయి. రెండవ ప్రపంచ యు ద్ధానంతరం దశాబ్దాల తరబడి సాగిన అమెరికా, యూరప్ల ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయి. 1970లలో ఉత్పత్తి రంగ వృద్ధి మందగించి, పెట్టుబడులపై లాభాలు సన్నగిల్లడం ప్రారంభమైంది. పైగా ఉద్యోగాలు లేని వృద్ధి దశగా చెప్పే ఫైనాన్స్ (ద్రవ్య) పెట్టుబడి ఆధిపత్యపు దశ మొదలైంది. ప్రత్యేకించి 1980ల నుంచి ఈ ఉద్యోగాలు లేని వృద్ధి ధోరణే బలపడింది. అదే నేడు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాల ఊబి లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలను, కొనుగోలుశక్తిని పెంచడానికి దోహదపడే రీతిలో ప్రభుత్వ వ్యయాలను పెంచకుండా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఆహ్వానించదగిన మార్పు గత రెండేళ్లుగా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించి 4.7 శాతం పరిధిలోనే ఉండిపోయింది. దీంతో నిరుద్యోగం పెరిగిపోయింది, కొనుగోలు శక్తి పతనమైంది. సహజంగానే ఇది డిమాండు తగ్గుదలకు దారితీసింది. దీంతో ప్రైవేటు పెట్టుబడిదారులు, ప్రత్యేకించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆదాయాలను, కొనుగోలు శక్తిని పెంచితే తప్ప డిమాండు పుంజుకోదు, ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగడం తప్ప గత్యంతరం లేదు. కానీ యూపీఏ విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని, డిమాండును మరింతగా దిగజార్చే దిశగా సాగాయి. ఈ స్థితిలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆశలను రేకెత్తించింది. వాటిని నెరవేర్చాలంటే గత రెండు దశాబ్దాలుగా అమలయిన ‘షేర్ మార్కెట్ వృద్ధి’ పంథాను వీడక తప్పదు. అది నిరాశామయమైన ఆర్థిక పరిస్థితుల నడుమ కొందరు శత కోటీశ్వరులను సృష్టించడానికి మాత్రమే తోడ్పడింది. ఈ పరిస్థితుల్లో నూతన ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహాదారుగా అరవింద్ పనగారియ నియమితులవుతారని వినవస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆసియా అభివృద్ది బ్యాంకు మాజీ ప్రధాన సలహాదారు, కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు అయిన పనగారియ... గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కొత్త ప్రభుత్వం ఒక మేరకు అధిక ద్రవ్యలోటును ఆమోదించయినా ప్రభుత్వ పెట్టుబడుల వ్యయాన్ని పెంచాలని అభిప్రాయపడటం విశే షం. ప్రముఖ అంతర్జాతీయ కన్సెల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ సైతం అధిక ద్రవ్య లోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం నేర్పిన గుణపాఠాలతో అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయాలలో మార్పు వస్తోంది. ఆహ్వానించదగిన ఈ మార్పునకు మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మోడీ బడ్జెట్ దిశ ఎటు? ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం అంతర్జాతీయ అనుభవాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. గ్రీస్, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలు సైతం ఆర్థిక మాంద్యానికి గురై, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాలు, అల్ప కొనుగోలు శక్తి, అల్ప డిమాండు, తిరిగి అల్ప వృద్ధి, భారీ నిరుద్యోగిత అనే విషవలయంలో చిక్కుకుపోయాయి. యూపీఏలాగా ఆ దేశాల ప్రభుత్వాలు ‘పొదుపు చర్యల’ పేరిట అమలు చేసిన ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు వాటిని మరింత సంక్షోభంలోకి, ప్రభుత్వ రుణాల ఊబిలోకి దించాయి. విపరీత రుణ భారానికి గ్రీస్ పతనావస్థకు చేరింది. ఆ దేశ యువతలో దాదాపు 50 శాతం నిరుద్యోగులే. స్పెయిన్లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ వ్యయాలకు బడ్జెట్ కేటాయింపులలో భారీ కోతలు, ప్రభుత్వోద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు, పార్ట్ టైమర్ల వంటి అసంఘటిత, అల్ప వేతన ఉద్యోగుల నియామకాలు తదితర పొదుపు చర్యలు చేపట్టారు. ఈ ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు పరిస్థితి మరింతగా దిగజారడానికే దారితీశాయని ఇప్పటికే రుజువయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే తొలి ‘మోడీ బడ్జెట్’కు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్దపీట వేస్తుందా? లేక యూపీఏలాగా కొద్ది మంది కుబేరులకు, షేర్, ద్రవ్య మార్కెట్ స్పెక్యులేటర్ల ప్రయోజనాలే పరమార్థంగా భావిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. ఈ అంశమే కొత్త ప్రభుత్వం దిశ ఎటో తేల్చి చెప్పే గీటురాయి అవుతుంది. ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిందేనంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలు అందుకే ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. - (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు