
ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని.. మన దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
సాక్షి, ఢిల్లీ: ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోందని.. మన దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహౌన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని మిల్లెట్లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.
2024-25 కేంద్ర బడ్జెట్లో సుస్థిర వ్యవసాయంపై పెద్దఎత్తున దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వం కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను అందించిందని చెప్పారు. భారతదేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని ప్రధాని వివరించారు.