
నువ్వు సాగు వైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్:
యాసంగి సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న వంటి సాధారణ పంటలు సాగు చేస్తారు. వానాకాలం సీజన్లో పసుపు పంట సాగు చేసిన రైతులు.. అదే భూమిలో యాసంగి సీజన్లో నువ్వులు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇటీవల నువ్వులకు ఓపెన్ మార్కెట్లో మంచి ధర ఉండటం, స్వల్పకాలంలో చేతికొచ్చే పంట కావడంతో రైతులు నువ్వు పంట వైపు ఆసక్తి పెంచుకున్నారు.
జగిత్యాలలో 25వేల ఎకరాల్లో సాగు..
జగిత్యాల జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో నువ్వుల పంట సాగవుతుంది. ముఖ్యంగా పసుపును సాగు చేసే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, రాయికల్, మేడిపల్లి వంటి మండలాల్లో నువ్వుల పంట విస్తీర్ణం అధికంగా ఉంది. ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఒక్కో రైతు కనీసం 2 నుంచి మూడెకరాల్లో నువ్వులు సాగుచేస్తుంటారు. అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాలను పొలాస శాస్త్రవేత్తలు రూపోందించినప్పటికీ చాలామంది రైతులు గతేడాది నువ్వుల పంటల్లోని నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తనాలుగా వాడుతున్నారు. పసుపును తవ్విన తర్వాత, ట్రాక్టర్తో దున్ని.. ఇసుకలో విత్తనాలను కలిపి చల్లుతారు. 20 రోజల తర్వాత ఒకసారి కలుపు మొక్కలు లేకుండా చూస్తారు. పంట కాలంలో కేవలం నాలుగైదు నీటి తడులు ఇస్తే సరిపోతుంది.
నూనెకు డిమాండ్ పెరగడంతో
ఇటీవల ప్రజల్లో ప్యాకెట్ నూనెను వాడటం తగ్గిస్తూ.. నువ్వులు, వేరుశెనగ నూనెను వాడుతున్నారు. దీంతో నువ్వులకు డిమాండ్ పెరుగుతోంది. నువ్వులు పండించిన రైతులు ఆ నువ్వులను బాగా ఆరబెట్టి, పురుగులు పట్టకుండా చూసుకుని, ఇంట్లో నిల్వ చేసుకుంటారు. సంక్రాంతికి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో నిల్వ చేసుకుంటారు. ప్రస్తుతం క్వింటాల్కు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది.
పంట పండించడంలోనూ వినూత్నమే..
వానాకాలం పంటగా పసుపు వేసిన పంట భూమిలోనే వేసవి పంటగా నువ్వు పంట వేస్తారు. పసుపు పంటకు కోళ్ల ఎరువు, గొర్రెల మంద, పశువుల ఎరువు వేస్తారు కాబట్టి నువ్వుల పంటకు పెద్దగా ఎలాంటి ఎరువులు వేయరు. పసుపు పంట పూర్తి కాగానే ఒక్కటి, రెండు సార్లు దున్ని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు ఇసుకతో కలిపి చల్లుతారు. తర్వాత డ్రిప్ ద్వారా నీరు ఇస్తారు, 20 రోజులకు ఒక్కసారి, 55 రోజులకు ఒక్కసారి డ్రిప్ ద్వారా తక్కువ మోతాదులో యూరియా ఇస్తారు. పంట కాలం 90 రోజులు కాబట్టి చివరి దశలో గింజ గట్టి పడేందుకు పొటాష్ ఇస్తారు. పూత దశలో ఓ సారి పురుగులు ఆశించకుండా వేపనూనె పిచికారీ చేస్తారు. అన్ని రకాల యాజమాన్య పద్దతులు పాటిస్తుండటంతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి తీస్తున్నారు.
యాసంగిలో పసుపు తర్వాత నువ్వు పంట
స్వల్పకాలంలో చేతికందే అవకాశం
మార్కెట్లో అందనున్న మంచి ధర
ఏటా పంట సాగు
ఏటా నువ్వు పంటను కనీ సం రెండు ఎకరాల్లో సాగు చేస్తాను. పసుపు పంటకు వే సిన సేంద్రియ ఎరువులే ను వ్వు పంటకు ఉపయోగపడుతుండటంతో కొత్తగా ఎలాంటి ఎరువులు వేయం. నువ్వుల పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మా విత్తనాలను మే మే తయారు చేసుకుంటాం. – లక్ష్మారెడ్డి,
నువ్వుల రైతు, జోగిన్పల్లి, కోరుట్ల(మం)
నువ్వులపై పరిశోధనలు
నువ్వుల పంటపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పటికే పరిశోధన స్థానం నుంచి శ్వేత, థిల్, హిమ, జీసీఎస్–1020, జేసీయస్–3287 వంటి రకాలను విడుదల చేశాం. జిల్లాలో ఎక్కువ మొత్తంలో యాసంగి సీజన్లో నువ్వుల పంట సాగు చేస్తుండటం రైతులకు కలిసి వస్తోంది.
– పద్మజ, శాస్త్రవేత్త, పొలాస

నువ్వు సాగు వైపు రైతుల చూపు

నువ్వు సాగు వైపు రైతుల చూపు

నువ్వు సాగు వైపు రైతుల చూపు