
రాయితీపైనే రాబట్టేలా..!
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను పసూలుకు యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం మినహయింపు ఇవ్వనున్నారు. ఈ ఐదు శాతం రాయితీ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల భవన యజమానులకు వర్తించనుంది. దీంతో ఎక్కువ మంది ముందస్తుగానే పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీని ద్వారా ఆస్తి పన్ను బకాయిలు తగ్గించుకోవడానికి ఉపకరిస్తుందని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు.
బకాయిలతో సహ చెల్లిస్తేనే రాయితీ వర్తిపు...
మున్సిపాలిటీల్లో నివాస భవనాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2025 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్నును ఈనెల 30వ తేదీలోగా పూర్తి చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహ చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఏడాదికి లక్ష రూపాయల ఆస్తి పన్ను చెల్లించే వారు ముందస్తుగా చెల్లించడం ద్వారా రూ.5 వేలు లబ్దిపొందనున్నారు. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉండడంతో.. ప్రజలు ఈ ఐదు శాతం రాయితీ వినియోగించుకుని లబ్ధి పొందవచ్చు.
నీలగిరి టార్గెట్ రూ.10 కోట్లు
నీలగిరి మున్సిపాలిటీలో 40 వేల భవనాలు ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ రూ.17.25 కోట్లు ఉంది. ఈ ముందస్తు పన్ను రాయితీలో భాగంగా ఈ ఒక్క నెలలో రూ.10 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక, మిర్యాలగూడలో రూ.3 కోట్లు, దేవరకొండలో రూ.2.26 కోట్లు, చండూరులో రూ.7 లక్షలు, నకిరేకల్లో రూ.50 లక్షలు టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. కాగా హాలియా, చిట్యాలలో టార్గెట్ పెట్టుకోకుండానే సాధ్యమైనంత వరకు ఎక్కువగా పన్ను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుకు ప్రణాళిక
ఫ ఏడాది పన్ను ఒకేసారి చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ
ఫ నెలాఖరు వరకు గడువు..
ఫ ఈ నెలలోనే అధిక మొత్తంలో పన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్న మున్సిపాలిటీలు
సద్వినియోగం చేసుకోవాలి
సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఒకేసారి చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలి. బకాయిలతో సహ ఈ ఏడాది పన్ను చెల్లిస్తే రాయితీ వర్తిస్తుంది. ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ
జిల్లాలోని మున్సిపాలిటీల్లో భవనాలు,
ఆస్తి పన్ను వివరాలు ఇలా..
మున్సిపాలిటీ ఆస్తి పన్ను భవనాలు ఈ నెలలో
(రూ.కోట్లలో) టార్గెట్ (రూ.కోట్లలో)
నల్లగొండ 17.25 40,000 10
మిర్యాలగూడ 09.50 12,306 03
హాలియా 02.05 5,640 టార్గెట్ లేదు
దేవరకొండ 03.29 7224 02.26
చండూరు 67.50 (లక్షలు) 3,682 07(లక్షలు)
చిట్యాల 1.40 3,207 టార్గెట్ లేదు
నకిరేకల్ 4.00 8,000 50 (లక్షలు)
జూన్ దాటితే అపరాధ రుసుం..
మున్సిపాలిటీల్లో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్ను మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధ రుసుం పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్ను డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారు అపరాధ రుసుంతో సహ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. భవన యజమానులంతా అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు.

రాయితీపైనే రాబట్టేలా..!