మహేశ్‌బాబుకు ఈడీ సమన్లు | ED summons Mahesh Babu in Saisurya Developers case | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుకు ఈడీ సమన్లు

Published Wed, Apr 23 2025 3:02 AM | Last Updated on Wed, Apr 23 2025 9:22 AM

ED summons Mahesh Babu in Saisurya Developers case

సాయిసూర్య డెవలపర్స్‌ కేసులో నోటీసులు

28న విచారణకు రావాలని ఆదేశం 

ఈ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసిన మహేశ్‌బాబు

ఆయనకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: సాయిసూర్య డెవలపర్స్, సురా­నా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసిన ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సాయిసూర్య డెవలపర్స్‌ కంపెనీ నుంచి మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించా­రు. దీంతో ఈ నెల 28న బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని సోమవారం సమన్లు జారీచేశారు. 

సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లా­వా­దేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్‌ చేసింది. 

మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఈ సోదాల్లో ఆధారాలు లభించాయి. దీంతో ఆయనకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించారు. 

ఇదీ కేసు నేపథ్యం 
సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముఖ నివాస్‌లో ప్లాట్లు రిజి­స్ట్రేషన్‌ చేయకపోవడంతో బాధితులు నవంబర్‌లో ఈ సంస్థలపై సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 11 కేసులు నమోదు చే­శా­రు. ఈ కేసుల్లో సాయిసూర్య డెవలపర్స్‌ ప్రొప్రై­టర్‌ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ ప్రమోటర్‌ నరేంద్ర సురానాను నవంబర్‌లోనే అరె­స్ట్‌ చేశారు. గ్రీన్‌ మెడోస్‌ ప్రాజెక్ట్‌ పేరుతో మోసాలకు పాల్పడినట్లు సతీష్‌చంద్ర గుప్తాపై సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లోనూ గతేడాది కేసు నమోదైంది. 

ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కోణంలో ఈసీఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయిసూర్య డెవలపర్స్, భాగ్య­నగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థలు రంగారెడ్డి జిల్లా వట్టి­నాగు­లపల్లిలో సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముఖ నివాస్‌ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్‌ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలు­దారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. 

అయితే, ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్‌ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్‌ నుంచి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఆయనకు సమన్లు జారీచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement