
ఇరానీ ట్రోఫీ 2022-23లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వన్సైడెడ్గా సాగుతోంది. 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. అర్హమ్ అఖిల్ డకౌట్ కాగా.. శుభమ్ శర్మ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ హిమాన్షు మంత్రి (51) అజేయ అర్ధశతకంతో మధ్యప్రదేశ్ను ఓటమి బారి నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. హిమాన్షుతో పాటు హర్ష్ గవ్లీ (15) క్రీజ్లో ఉన్నాడు. ముకేశ్ కుమార్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, యశస్వి జైస్వాల్ (144) మెరుపు అర్ధసెంచరీతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌట్ కాగా.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు.
దీనికి ముందు తొలి ఇన్నింగ్స్లో యశస్వి (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, అభిమన్యు ఈశ్వరన్ (154) భారీ సెంచరీతో చెలరేగడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 484 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో లభించిన 190 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్లో 246 పరుగుల స్కోర్తో కలుపుకుని మధ్యప్రదేశ్కు 437 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాచ్తో ఇరానీ కప్ అరంగేట్రం చేసిన యశస్వి.. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment