-
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
చౌటుప్పల్ : సేంద్రియ సాగు ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని, ఈ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని భారత సహకార సేవా ఫోరం (బీఎస్ఎస్ఎఫ్) వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తంశర్మ సూచించారు. చౌటుప్పల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో రైతులను చైతన్యం చేయడంతో పాటు సేంద్రి సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తమ సంస్థ సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్, వలిగొండ, మునుగోడు, సంస్థాన్నారాయణపురం, గుర్రంపోడు మండలాలను తమ సంస్థ దత్తత తీసుకుంటుందన్నారు. ఆయా మండలాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన బీజీ–ఐఐ పత్తి విత్తనాలతో పాటు సేంద్రియ ఎరువులను 10శాతం రాయితీపై అందజేస్తామని తెలిపారు. ఈనెల 19న చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగారెడ్డిగూడెంలోని జీఎన్రెడ్డి ఫంక్షన్హాల్లో రైతులకు అవగాన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట సంస్థ ప్రతినిధులు బొబ్బిళ్ల మురళి, అన్నంబొట్ల పవన్, దడిగం రాంసుధాకర్, తదితరులు ఉన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తం శర్మ -
సకాలంలో యూనిఫాం అందేనా..
ధర్నాలు, రాస్తారోకోలుధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పార్టీలు శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. అదే విధంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మకూర్(ఎం) సబ్ మార్కె ట్ యార్డుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఆత్మకూర్(ఎం)లో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.రేపు సూర్యాపేటలో చెస్ పోటీలుసూర్యాపేట టౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు ఈనెల 19న సూర్యాపేట పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి సహకారంతో నిర్వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కిరాణ మర్చంట్ అసోసియేషన్ భవనంలో పోటీలు ఉంటాయని, ఆదివారం ఉదయం 10 గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. విజేతలను రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు సెల్ నంబర్లు 8555008996, 9394753343ను సంప్రదించాలని కోరారు.భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే యూనిఫామ్ అందజేస్తోంది.ఇందుకోసం విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వస్త్రాన్ని తెప్పించి కుట్టే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ సారి వేసవి సెలవులు ప్రారంభమై 20 రోజులు గడస్తున్నా ఇప్పటి వరకు యూనిఫామ్ వస్త్రం జిల్లాకు చేరలేదు. నూతన విద్యా సంవత్సరం జూన్ 12నుంచి ప్రారంభం కానుంది. తొలుత ఒక జతే..జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 47,245 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంటుంది. యూనిఫామ్కు అవసరమైన ముడి సరుకు ఏటా టెస్కో నుంచి వస్తుంది. ఇప్పటి వరకు వస్త్రం రాకపోవడంతో ముందుగా తొలుత ఒక జత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా సమయానికి అందజేస్తారా, లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలకు బాధ్యతలుగత ఏడాది ఏజెన్సీలు, స్థానిక దర్జీలు యూనిఫామ్ కుట్టేవారు. ఈ సారి మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించారు. నేడో, రేపో యూనిఫాం వస్త్రం వస్తుంది –డీఈఓ, నారాయణరెడ్డివిద్యార్థుల యూనిఫాం వస్త్రం నేడో, రేపో వచ్చే అవకాశం ఉంది. రాగానే కుట్టడం కోసం మహిళా సంఘాలకు అప్పగిస్తాం. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఒక జత అందజేస్తాం. టెస్కో నుంచి జిల్లాకు రాని వస్త్రం జూన్ 12నుంచి పాఠశాలల ప్రారంభం అదే రోజు పంపిణీ చేస్తారో, లేదోనన్న సందేహాలు -
రైతులను ముంచిన వాన
సాక్షి నెట్వర్క్ : అన్నదాతను అకాల వర్షాలు వీడడం లేదు. వారం, పది రోజులుగా కురుస్తున్న వానలతో తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దవుతోంది. గురువారం రాత్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్య రాశులు, కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిపోయాయి. అక్కడక్కడ మామిడి కాయలు నేలరాలాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలోని రైతులు బండపై ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మాసాన్పల్లి సెంటర్లో కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిముద్దయ్యయి. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. సకాలంలో ధాన్యాన్ని ఎగుమతి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. ● ఆలేరు మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసాయి. పలు చోట్ల వాన నీటిలో వడ్లు కొట్టుకుపోగా ఎత్తడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా శారాజీపేటలో నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రానికి రెండు వారాల క్రితం 170 బస్తాల ధాన్యం తీసుకువచ్చానని, ఇప్పటి వరకు కాంటా వేయలేదని రైతు శేఖర్ తెలిపాడు. అలాగే బత్తుల కొండల్రెడ్డి అనే రైతు ధాన్యాన్ని తేమ సాకుతో 20 రోజులుగా తూకం వేస్తలేరని తెలిపారు. వర్షాలకు వడ్లు తడుస్తున్నాయని, కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ● ఆత్మకూర్ (ఎం) మండలంలో గంట సేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి మండల కేంద్రం, రహీంఖాన్పేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసాయి. ఈదురు గాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగాయి. పోసానికుంటలో మామిడి కాయలు నేలరాలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల మధ్య వాన నీరు చేరింది. నీటిని తొలగించేందుకు రైతులు శ్రమించాల్సి వచ్చింది. అలాగే పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిశాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. ● రాజాపేట మండలంలోని రేణికుంట, రాజాపేట, నెమిల, బేగంపేట, నర్సాపురం గ్రామాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. ● యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మబ్బులు కమ్ముకోవడంతో రైతులు అప్రమత్తం అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడకుండా టార్పాలిన్లు కప్పి జాగ్రతలు తీసుకున్నారు. అదే విధంగా యాదాద్రి కొండపైన భక్తులు టెంటు, మండపాల కిందికి చేరారు.గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం కాపాడుకోవడానికి రైతుల తంటాలు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు, రాజకీయ పార్టీల ఆందోళన -
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
చౌటుప్పల్ : అవసరం లేకున్నా సిజరేయన్ ద్వారా ప్రసవాలు చేస్తున్నారని, తీరు మారకపోతే ఆస్పత్రులను సీజ్ చేస్తామని వైద్యాధికారుల బృందం హెచ్చరించింది. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎల్.యశోధ, డాక్టర్ శిల్పిని, రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రామకృష్ణతో కూడిన వైద్యబృందం శుక్రవారం చౌటుప్పల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. కాన్పులకు సంబంధించిన రికార్డులు, ఆస్పత్రి అనుమతులు, సిబ్బంది అర్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. సిజేరియన్ ద్వారా అధిక ప్రసవాలు చేసిన వాసవి మెటర్నెటీ, ప్రశాంతి ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాన్పులు చేయడానికి అర్హత కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులు 52, అనుమతి కలిగిన స్కానింగ్ సెంటర్లు 52 ఉన్నాయన్నారు. మెజార్టీ ఆస్పత్రుల్లో సిజేరియన్ కాన్పులు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సిజేరియన్లు రాష్ట్రంలో ఆపరేషన్ల సగటు 76 శాతం ఉండగా, యాదాద్రి జిల్లా 83 శాతంతో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, అందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ డబ్బుల కోసం ఆపరేషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్లో ఏడు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని, తీరు మార్చుకోకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సాధారణంగా 2, 3వ కాన్పులకు ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని, వారు కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తారని పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో ప్రోగాం ఆఫీసర్ సుమన్ కళ్యాణ్, డెమో మదుసూధన్రెడ్డి, మండల వైద్యాధికారి చింతకింది కాటంరాజు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్రెడ్డి, సీహెచ్ఓలు చంద్రశేఖర్, నగేష్, అశోక్, సబ్సివిల్ ఆఫీసర్ ఇస్తారి ఉన్నారు. హెచ్చరించిన వైద్యారోగ్య శాఖ అధికారుల బృందం చౌటుప్పల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ -
జూన్ 10లోపు పనులన్నీ పూర్తి కావాలి
భువనగిరి టౌన్ : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, ఏపీఎంలు, మెప్మా అధికారులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమావేశమై పాఠశాలల్లో చేపట్టిన పనులపై సమీక్షించారు. పనుల్లో విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. పనులు చేపట్టకముందు నాటి పరిస్థితి ప్రారంభించిన తర్వాత ఫొటోలు తీయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రతి నెలా 1,11, 21వ తేదీల్లో గ్రామాల్లోని నీళ్ల ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే విద్యార్థుల యూనిఫాం కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని డీఈఓకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఆర్డీఓ కృష్ణణ్, డీఈఓ, జెడ్పీ సీఈఓ, డీపీఓ సునంద పాల్గొన్నారు. గ్రూప్–1కు ఏర్పాట్లు చేయండి భువనగిరి : జూన్ 9వ జరిగే గ్రూప్–1 పరీక్షకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. శుక్రవారం ఆయన డీసీపీ రాజేశ్చంద్రతో కలిసి గ్రూప్–1 ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు భువనగిరి పట్టణంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మదర్ థెరిస్సా, మాంటిస్సోరి హైస్కూ ల్, దివ్యబాల విద్యాలయం, వెన్నెల కళాశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, శ్రీ నవభారత్ డిగ్రీ, ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల, ఆజాద్ రోడ్డులోని కళాశాలలో సెంటర్లు ఉంటాయన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, 3,349 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈఓ నారాయణరెడ్డి, గ్రూప్–1 పరీక్ష నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్లు హలావత్ బాలాజీ, ఏసీపీ కరుణాకర్, డీఎంహెచ్ఓ పాపారావు, తహసీల్దార్ అంజిరెడ్డి, డీఐఈఓ రమణి, పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతు కే. జెండగే -
హైవే –65పై ప్రమాదాలకు చెక్
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద దిద్దుబాటు పనులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా.. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ (52.840–55.300), పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, ఎస్వీ కాలేజ్ జనగాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ క్రాస్ రోడ్, కట్టకొమ్ముగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్రోడ్డు, నవాబ్పేట్ జంక్షన్ను బ్లాక్ స్పాట్స్గా గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వెహికిల్ అండర్ పాస్ నిర్మాణం వంటి పనులను చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆ పనులను యుద్ధ ప్రాతిదికన చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యంగా సైన్ బోర్డుల ఏర్పాటు, హెవీ స్పీడ్ నిర్మూలన, అవసరమైన చోట్ల ఆరు లేన్లుగా రోడ్డు విస్తరణ వంటి పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు.ఆదేశించారు.● సర్వీస్ రోడ్లు, వీయూపీలు, జంక్షన్ల అభివృద్ధిపైనా దృష్టి ● పూర్తయిన టెండర్ల ప్రక్రియ ● ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్షసాక్షి ప్రతినిధి, నల్లగొండ, చౌటుప్పల్ : దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా ప్రత్యేక గుర్తింపు పొందిన 65వ నెంబర్ జాతీయ రహదారికి ప్రమాదాల్లోనూ అంతే ప్రత్యేకత ఉంది. ఇందుకు ప్రదాన కారణం బ్లాక్స్పాట్లుగా అధికారులు గుర్తించారు. ప్రమాదాలను నివారించి ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించాలంటే ముందుగా బ్లాక్స్పాట్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజన్ పెట్టింది. ఈ రహదారిపై గతంలోనే గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆంథోల్ మైసమ్మ గుడి సమీపం నుంచి కృష్ణా జిల్లా ప్రారంభం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాల నివారణకు సర్వీసు రోడ్లు తదితల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఇదివరకే రూ.326 కోట్లు కేటాయించింది. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఆయా పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఎన్హెచ్ఏఐ చేపట్టే పనులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సెక్రటేరియట్లో మంత్రి సమీక్ష ఎన్హెచ్–65వ జాతీయ రహదారిపై ప్రస్తుత రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని చెప్పాలి. భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ఈ రహదారి విస్తరణ, బ్లాక్స్పాట్లను తొలగించి ప్రమాద రహితంగా రహదారిని మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. భువనగిరి ఎంపీగా సమయంలో ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిసి ఎన్హెచ్–65 ఆరు లేన్లుగా విస్తరణ, అభివృద్ధి, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పట్టుబట్టి నిధులు మంజూరు చేయించారు. హైవే వెంటనే బ్లాక్ స్పాట్స్లో పనులను ప్రారంభించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రి వెంకట్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రహదారులు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్హెచ్ఏఐ ఈఎన్సీ గణపతిరెడ్డితోపాటు జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్లు హాజరయ్యారు. మరమ్మతులు చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ రోడ్లు జాతీయ రహదారిపై ఉన్న ఆయా బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సూచించారు. పనులను చేపట్టేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు సదుపాయం కల్పించి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో పనుల విషయంలో లోటుపాట్లు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు ఉన్నా స్పెషల్ సెక్రటరీ అనుమతి తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. మనుషుల ప్రాణాలు పోతుంటే.. అనుమతుల పేరిట ఆలస్యం చేయొద్దని స్పష్టం చేశారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
గుండాల : మండల కేంద్రం గుండాలతో పాటు వెల్మజాల, సుద్దాల గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో శుక్రవారం ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున రైతుల అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదు పొందాలని, విత్తన బ్యాగులపై గడువు తేదీ చూసుకోవాలన్నారు. భూసారం పెంచేందుకు పచ్చి రొట్ట ఎరువు వాడాలని సూచించారు. ఆయన వెంట ఏఓ లావణ్య, ఏఈఓ క్రాంతి ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి టౌన్ : బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలకు 1వ తరగతి (డే స్కాలర్), 5వ తరగతి (రెసిడెన్షియల్) విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.జయపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000, పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 లోపు ఉండాలన్నారు. దరఖాస్తు ఫారానికి కుల, ఆదాయ, రేషన్, ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫొటోలు జత చేసి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూన్ 7వ తేదీ సాయంత్రం 5లోపు అందజేయాలని కోరారు. శనివారం(నేడు) నుంచి దరఖాస్తు ఫారాలు పొందాలన్నారు. జూన్ 11న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అనర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. యాదాద్రిలో ఊంజలి సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయ ముఖ మండపం, ప్రాకార మండపాల్లో శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, సువర్ణ పుష్పార్చన, జోడు సేవోత్స వం తదితర కై ంకర్యాలు గావించారు. పాఠశాలల్లో పనులు, ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష భువనగిరిటౌన్ : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. వానాకాలం సమీపిస్తున్నందున ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆయా అంశాలపై కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, అధికారులు పాల్గొన్నారు. -
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
డెంగీ నిర్మూలనలో భాగస్వాములు కావాలి
భువనగిరి : డెంగీ నివారణకు చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ పాపారావు పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రతి ఫ్రైడే డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇళ్ల కిటికీలు, గుమ్మాలు, తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలని, దోమ తెరలను వాడాలని పేర్కొన్నారు. పందులు, బాతులు నివాసాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి డెంగీ బాధితులను గుర్తించి చికిత్స అందించాలని కోరారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, సుమన్ కళ్యాణ్, డాక్టర్ వంశీకృష్ణ, డెమో మధుసూదన్రెడ్డి, ఏఎంఓ మధుసూదన్రావు, హెల్త్ ఎడ్యుకేటర్ సాయిరెడ్డి, సీహెచ్ఓ నగేష్, ఎల్టీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.ఫ డీఎంహెచ్ఓ పాపారావు -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
సాక్షి, యాదాద్రి : కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు అన్లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. మిల్లులకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా మిల్లుల్లో స్థలాభావం లేకుండా చూసుకొని ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.524 కోట్లు విలువ చేసే 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ -
సేవ చేసే అవకాశం కల్పించాలి
ఫ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డి యాదగిరిగుట్ట : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి కోరారు. గురువారం ఆయన భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా యాదాద్రీశుడి ఆశీస్సులు తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, దేవుడి కృప, కటాక్షంతో సేవ చేస్తానన్నారు. యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, మళ్లీ పచ్చని పంటలతో కళకళలాడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, నాయకులు మిట్ట వెంకటయ్య, ముక్కెర్ల సతీష్యాదవ్, గునగంటి బాబురావుగౌడ్, మారెడ్డి కొండల్రెడ్డి ఉన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
ఫ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూన్ 22 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఫీజు : రూ.3 వేలు వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఏకలవ్య స్కూల్ రోడ్, శివాజీ నగర్, నల్లగొండ సెల్ : 96660 13544, 80747 42864 -
అందుబాటులో జీలుగ, జనుము విత్తనాలు
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా అన్ని పీఏసీఎస్లలో సబ్సిడీపై ఇచ్చేందుకు జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగ విత్తనాలు వేసే రైతులు పూత దశలో పొలంలో కలియదున్నాలని, ఇది ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువుతో సమానం అన్నారు. జీలుగ ద్వారా అనే ప్రయోజనాలు ఉంటాయని, వరి సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలాలకు పాఠ్య పుస్తకాల తరలింపు భువనగిరి : పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం భువనగిరిలోని గోదాం నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు తరలించే వాహనాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాకు 1,53,655 పుస్తకాలు, 70 టైటిల్స్ వచ్చాయన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి 100 శాతం పుస్తకాలు వస్తాయని చెప్పారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ రంగరాజన్, ఉపాధ్యాయులు బుస్సా రమేష్, ఆనందరావు, అంజన్కుమార్,అంబిదాస్, రామకృష్ణ పాల్గొన్నారు. యాదాద్రిలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. అలాగే ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వేళ స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు. ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ, శివసాయి ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కట్టా మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మొదటి విడత అడ్మిషన్ల కోసం జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ 9848571409ను సంప్రదించాలని కోరారు. పచ్చడి మామిడి పిరం భువనగిరి : మామిడి కాయల పచ్చడికి సీజన్ వచ్చింది. దీంతో భువనగిరి పట్టణంలో రెండుమూడు రోజుల నుంచి పచ్చడి కాయలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. పచ్చడి కోసం జనం మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈసారి మామిడి ధర వింటేనే హడలెత్తిపోతున్నారు. సైజును బట్టి ఒక్కో కాయ రూ.10నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల వల్ల 50, 100 కాయలకు బదులు 15 నుంచి 20 కాయలు మాత్రమే కొనుగోలు చేసి పచ్చళ్లు పెడుతున్నారు. ఈసారి మామిడి తోటలు పూత బాగానే వచ్చినప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల నిలబడలేదు. దీంతో దిగుబడిపై తక్కువగా రావడంతో పచ్చడి కాయల ధరలు పెరిగాయి. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
భువనగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ 2,4,6 రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ పరిధిలో 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఉదయం జరిగే సెమిస్టర్ పరీక్షలకు 36,392 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2వ సెమిస్టర్లో 12,525, 4వ సెమిస్టర్లో 12,313, 6వ సెమిస్టర్లో 11,554 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం జరిగే బ్యాక్లాగ్ పరీక్షలకు 18,052 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్ సెమిస్టర్లో 6,923, 3వ సెమిస్టర్లో 6,050, 5వ సెమిస్టర్లో 5,079 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు ఇలా.. యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 75 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 11, ఎయిడెడ్ 2. ప్రైవేట్ కాలేజీలు 62 ఉన్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 2,4,6 సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు 1,3,5 బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికి హాజరు కావాలి డిగ్రీ 2,4,6 సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం నుంచి జూన్ 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే విద్యార్థులు కళాశాలల నుంచి హాల్ టికెట్లు పొందారు. పరీక్షలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలి. –ఉపేందర్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి, ఎంజీయూఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఫ సెమిస్టర్ 36,392, బ్యాక్లాగ్ 18,052 మంది విద్యార్థులు ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
ఇల్లు.. ఎప్పుడిస్తరు!
సాక్షి,యాదాద్రి : పేదలకు సొంతిల్లు కలగానే మిగిలింది. జిల్లాలో పలు చోట్ల నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను.. లబ్ధిదారులకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. మరో వైపు పంపిణీ చేసిన ఇళ్లలో వసతులు లేకపోవడంతో చాలా కుటుంబాలు గృహప్రవేశం చేయడం లేదు. ● పేదల సొంతింటి కల నెరవేర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భువనగిరి పట్టణానికి 850 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో సింగన్నగూడెం వద్ద 444 ఇళ్లు నిర్మించారు. ఇవన్నీ నిర్మాణం పూర్తి కావడంతో గత ఏడాది అక్టోబర్లో డ్రా ద్వారా 419 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ, ఇప్పటి వరకు కేటాయించలేదు. దీంతో లబ్ధిదారులు ఇటీవల ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. మిగతా ఇళ్లలో హుస్నేబాద్ వద్ద 116 ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే వడపర్తి, పగిడిపల్లి, అనంతా రంతో పాటు మరికొన్ని గ్రామాల్లో 310 ఇళ్లు మంజూరు కాగా నేటికీ పనులు మొదలుకాలేదు. ● వలిగొండ మండలంలోని వెల్వర్తి, నాగారం, అరూర్ గ్రామాలకు 80 ఇళ్లు మంజూరయ్యాయి. టెండర్లు వేసినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ● బీబీనగర్ మండలం కొండమడుగులో 30 ఇళ్లకు 30, బీబీనగర్లో 30 ఇళ్లకు 11 పూర్తయ్యాయి. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ● భూదాన్పోచంపల్లికి 120, జిబ్లక్పల్లికి 36, దేశముఖ్ గ్రామానికి 30 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో భూదాన్పోచంపల్లిలో 60, జిబ్లక్పల్లిలో 36 పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా కేటాయించలేదు. ఇక దేశిముఖ్లో పనులే మొదలుకాలేదు. ● చౌటుప్పల్ పట్టణానికి 150, దండుమార్కాపురం గ్రామానికి 70 ఇళ్లు మంజూరయ్యాయి. దండుమల్కాపురంలో పూర్తి కావడంతో 69 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వారంతా గృహ ప్రవేశం చేశారు. ● సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి 60, సర్వేల్కు 64 ఇళ్లు మంజూరయ్యాయి. సర్వేల్ లో నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వారంతా ఇళ్లలో నివాసం ఉంటున్నారు. సంస్థాన్నారాయణపురంలో బేస్మెంట్ దశలో పనులను వదిలేశారు. ● ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో 50, ఉప్పలపహాడ్లో 45 ఇళ్లు నిర్మించారు. రెండు చోట్ల లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. అయితే అక్కడ మౌలిక వసతులు కల్పించపోవడంతో చాలా మంది ఇళ్లలోకి రాలేదు. ● మోటకొండూర్ మండలం ఆరెగూడెం శివారులో 40 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కానీ, ప్రస్తుతం 18 నుంచి 20 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. ఇళ్లు ఊరికి దూరంగా ఉండడం, రవాణా సౌకర్యం లేకపోవడం తదితర కారణాలతో మిగతా వారు ఇళ్లలోకి రావడం లేదు. ● ఆలేరు పట్టణంలో 64, కొలనుపాకలో 64 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. కానీ, డ్రెయినేజీ సమస్య ఉండడంతో కొన్ని కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. ● యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో కాలయాపన ఫ ఎనిమిది నెలల క్రితమే డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఫ పొజిషన్ చూపని అధికారులు ఫ పంపిణీ చేసిన గృహాల్లో వసతుల లేమి ఫ ఉండలేకపోతున్న కుటుంబాలు -
యాదాద్రి భువనగిరి
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.7శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024గరిష్టం / కనిష్టంఅసంపూర్తిగా ‘మన బడి’ మన బస్తీ– మనబడిలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. - 9లోపూర్వ వైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు.- 8లో -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
రామన్నపేట : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం రామన్నపేటలో చిట్యాల– భువనగిరి రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని, అకాల వర్షాలకు వడ్లు తడిసి నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఓట్లు కొనుగోలు చేసిన నాయకులకు ధాన్యం విషయాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబటి రవీందర్రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, కన్నెబోయిన విజయభాస్కర్, కల్లూరి నాగేష్, గాదె నరేందర్, వనం ఉపేందర్, కందుల హన్మంత్, బావండ్లపల్లి బాలరాజు, బల్గూరి అంజయ్య, మేడబోయిన శ్రీనివాస్, వేముల సైదులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘రావి’ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
భువనగిరి రూరల్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రావి నారాయణరెడ్డి సేవా సంస్థ సభ్యులు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి గురువారం సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 18న జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే రాయగిరిలో నిర్మిస్తున్న క్రీడాప్రాంగణానికి, భువనగిరి మండలానికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మహనీయుని పేరున విశ్వవిద్యాలయాల్లో అవార్డు ప్రదానం చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు. రావి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా జాన్ 4వ తేదీన హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై, భువనగిరిలో, బొల్లేపల్లిలో రావి నారాయణరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు చెరుపల్లి శ్రీనివాసులు, రావి సుఖేష్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించొద్దు నల్లగొండ క్రైం: వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని నల్లగొండ జిల్లా ఎీస్పీ చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని కోరారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం వంటివి చేయకూడదని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని, సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్లు పెట్టవద్దని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేయాల్సి వస్తే సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. -
నారసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామునే సుప్రభాత సేవ, అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అర్చన, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అష్టోత్తరం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి భువనగిరి : పట్టణంలోని సింగన్నగూడంలో ని ర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. 565 ఇళ్లు నిర్మించి అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మా రుతున్నాయని తెలిపారు. వెంటనే కేటాయించనిపక్షంలో లబ్ధిదారులచే తామే గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులుగా తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 42 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శిల్పిని, డాక్టర్ యశోధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్ర త్యేక బృందం వారం రోజులుగా తనిఖీలు నిర్వహి స్తోంది. ఇందులో భాగంగా బుధవారం భువనగిరి పట్టణంలోని జయలక్ష్మి, నిర్మల, కేకే నర్సింగ్ హోంలలో వైద్యాధికారులు తనిఖీలు చేశారు. కాన్పులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వార్డుల్లోకి వెళ్లి బాలింతలతో మాట్లాడారు. అధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేయడంతో వాటికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా సిజేరియన్లు పెంచినా, అర్హతలేని వారితో ఆపరేషన్ చేయించినా ఆస్పత్రి రిజి స్ట్రేషన్ రద్దు చేస్తామని వైద్యాధికారులు హెచ్చరించారు. మొత్తం కాన్పుల్లో 50శాతానికి మంచి సిజేరియన్లు ఉండకూడదన్నారు. అదే విధంగా వారం చౌటుప్పల్ పట్టణంలోని వాసవి, ప్రశాంతి ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా చేసినట్లు తనిఖీల్లో తేలడంతో వాటికి నోటీసులు జారీ చేశారు. -
నేను మీ బిడ్డను.. గెలిపించే బాధ్యత మీదే
యాదగిరిగుట్ట : నేను మీ బిడ్డను.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీరే నన్ను గెలిపించాలని నల్లగొండ– వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్టలో బుధవారం జరిగిన ఆలేరు నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు ప్రాంతం చైతన్యవంతమైనదని, తనను ఎమ్మెల్సీగా గెలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి బహుమానంగా ఇవ్వాలని కోరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తాను సీఎం రేవంత్రెడ్డిని కలిసి కోరానని, అందుకు ఆయన స్పందిస్తూ త్వరలోనే ప్రకటించనున్నట్లు స్వయంగా చెప్పారని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణ మాఫీ రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఎంపీపీలు చీర శ్రీశైలం, అశోక్, మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల, పట్టణ అధ్యక్షులు కానుగు బాలరాజుగౌడ్, బందారపు భిక్షపతి గౌడ్, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేశం, నాయకులు మధుసూధన్రెడ్డి, గుండ్లపల్లి భరత్గౌడ్, గుండ్ల నరేష్, సంజీవరెడ్డి, ఇరసరపు యాదగిరి, నమిలే మహేందర్ పాల్గొన్నారుఫ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న -
అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకుడు రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు, సందేహాలు ఉంటే 9866377107 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను భయపెట్టొద్దని, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్, పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించుకోవచ్చని.. అందుకు ఆయా జిల్లాల్లోని ఏఆర్ఓల ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గం మొత్తం ప్రచారానికి అనుమతి నల్లగొండ కలెక్టర్ నుంచి తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే 1950, 1800425144 నంబర్ల ద్వారా తెలియజేయవని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, నల్లగొండ ఆర్డీఓ రవి పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశాం పట్టభద్రుల ఎమ్మల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. బ్యాలెట్ బాక్స్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణ కార్యక్రమాలపై సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని, అభ్యర్థులకు మాన్యువల్గా అనుమతి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఏఆర్ఓ శ్రీనివాసరావు, చండూరు ఏఆర్ఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
వృద్ధ దంపతులకు దాతల సాయం
మునగాల(కోదాడ): మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన నూకమళ్ల రాములు, అక్కమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. వారికి పెళ్లిళ్లు చేశారు. గతంలోనే అక్కమ్మ కాలు తొలగించడంతో రాములు ఆమెకు సపర్యలు చేస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్తోనే జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి దీనగాథ గురించి ‘వృద్ధ దంపతులను ఆదుకోరూ..’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. గ్రామానికి చెందిన యశోద ఫౌండేషన్ సంస్థ వారు రూ.2వేల విలువైన కిరాణ సరుకులు, చల్లా గుర్వయ్య రూ.1000, పోలిశెట్టి నవీన్కుమార్ 25కేజీల బియ్యాన్ని బుధవారం వృద్ధ దంపతులకు అందజేశారు. మున్ముందు కూడా వృద్ధ దంపతులను ఆదుకుంటానని యశోద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నరాల రుక్కారావు తెలిపారు. కార్యక్రమంలో యశోద ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు, రిటైర్డ్ హెచ్ఎం ఓరుగంటి రవి, సభ్యులు చల్లా గుర్వయ్య, ఆర్ఎంపీ వైద్యుడు గోలి పూర్ణశంకర్, బాలెబోయిన ఉపేందర్, బోనాల శ్రీనివాస్, కుమ్మరి వెంకన్న, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
భువనగిరి రూరల్ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ భువనగిరి మండలంలోని సూరేపల్లి, రెడ్డినాయక్తండా రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాత్రింబవళ్లు ధాన్యం దగ్గర కాపలా ఉండాల్సి వస్తుందన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకా లంలో కొనుగోలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, వర్షాలు అవచ్చే అవకాశం ఉన్నందున వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ధర్నాలో మాజీ సర్పంచ్ కూనూరు అంజనేయులు, రైతులు మాధవరెడ్డి, అనంతరెడ్డి, బొడ్డు మైసయ్య, లక్ష్మారెడ్డి, కునుసోత్ వెంకట్, ధరావత్ రాజు, మేగావత్ నర్సింహ, కునుసోతు సుధాకర్, దరావత్ ఇస్మాయిల్నాయక్, బానోతు రాంచందర్, బానోతు ఇస్మాయిల్, ధరావత్ లక్ష్మణ్, ధరావత్ రవీందర్ పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచుతాం భువనగిరి : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచుతామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. సూరేపల్లి, రెడ్డినాయక్తండా, గూడూరులో ధాన్యం తడిసిన విషయం వాస్తవం కాదన్నారు. స్థలాభావం, వరస సెలవులు రావడంతో కోనుగోళ్లు మందగించాయన్నారు. రైతులు ఇబ్బందుల దృష్ట్యా కొనుగోళ్లలో వేగం పెంచాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో మిల్ పాయింట్ల వద్ద స్థలాభావం ఉందని, సమస్యను అధిగమించడానికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జనగాం, హన్మకొండ జిల్లాకు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ట్యాగింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా కేంద్రాలు, మిల్లుల వద్ద తగినంత మంది హమాలీలు లేరని, లారీల రాకలో జాప్యం చోటు చేసుకుందని చెప్పారు. -
85 శాతం సిజేరియన్లే!
కాన్పుల వివరాలు ఇలా 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు ఆస్పత్రి నార్మల్ సిజేరియన్ ప్రభుత్వ 2180 3,402 ప్రైవేట్ 540 5,145 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి ప్రభుత్వ 2,706 3,458 ప్రైవేట్ 618 4,272 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి ప్రభుత్వ 3,715 3,971 ప్రైవేట్ 617 3,153 భువనగిరి : అమ్మకు కడుపు కోత తప్పడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 85 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నార్మల్ డెలివరీలకు పెంచి సిజేరియన్లు తగ్గించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నా, సమీక్షలు నిర్వహిస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల తీరు మారడం లేదు. ప్రతి పది మందిలో ఏడుగురికి సిజేరియన్ ప్రైవేట్ ఆస్పత్రులకు కాన్పుకు వెళ్లిన ప్రతి పది మందిలో ఏడుగురికి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4,890 ప్రసవాలు జరగగా ఇందులో 87 శాతానికి పైగా సిజేరియన్లే ఉన్నాయి. 2023 నుంచి మార్చి 2024 మార్చి వరకు 3,770 కాన్పులు జరగగా ఇందులో 3,153 (83.63శాతం) సిజేరియన్ ఆపరేషన్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజురోజుకూ సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతుండడంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలకు పూనుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కాన్పుకెళ్తే కోతలే ఫ నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా ఆపరేషన్కే మొగ్గు ఫ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు ఫ పలు ఆస్పత్రులకు నోటీసులు జారీ సిజేరియన్లు అఽధికంగా ఉంటే ఆస్పత్రులు సీజ్ ప్రభుత్వ ఆస్పత్రులో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరగాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయి. నార్మల్ డెలివరీలు పెంచాలని ఆదేశాలు జారీ చేసినా మార్పు రావడం లేదు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. సిజేరియన్ల శాతం అధికంగా ఉన్న ఆస్పత్రులను సీజ్ చేస్తాం. –డాక్టర్ పాపారావు, డీఎంహెచ్ఓ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement